సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ సభ్యత్వానికి తాము చేసిన రాజీనామాల్ని ఆమోదించాలని స్పీకర్ మీరాకుమార్ను కోరినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. రాజీనామాల్ని ఆమోదించుకోవడానికి శనివారం స్పీకర్ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను గత నెల 5న, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అదే నెల 10న రాజీనామాలను ఫ్యాక్స ద్వారా పంపించాం. 24న స్పీకర్ను కలవాలనుకున్నా కుదరలేదు. ఇవాళ కలిశాం. మా ఇద్దరి రాజీనామాల్ని ఆమోదించాలని స్పీకర్ను కోరా. జగన్ హైదరాబాద్ నుంచి రావడం కష్టం కనుక, ఆయన ఫోన్ నంబర్ ఇచ్చా. ఫోన్ద్వారా వ్యక్తిగతంగా మాట్లాడి రాజీనామా విషయాన్ని ధ్రువీ కరించుకోమని చెప్పా. నేను చెప్పిన విషయాలను వాళ్లు రికార్డు చేసుకున్నారు. తప్పనిసరిగా మా రాజీనామాలను ఆమోదిస్తారని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు.
దుర్మార్గంగా మాట్లాడుతున్న టీడీపీ నేతలు: ‘‘సోనియాకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపినట్టు, నేను, విజయమ్మ వెళ్లి రాహుల్ను కలిసినట్టు కొందరు టీడీపీ నేతలు దుర్మార్గమైన, అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు’’ అని మేకపాటి మండిపడ్డారు. ‘‘నేను గురువారంరాత్రి ఢిల్లీకి వచ్చా. విజయమ్మ శుక్రవారం ఉదయం వచ్చా రు. ఇక్కడినుంచి నేరుగా జంతర్మంతర్లోని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్నాం. మధ్యాహ్నం 3 గంటల తరువాత విజయమ్మ హైదరాబాద్ వెళ్లిపోయారు. రాహుల్ను కలిసిందేమిటి? సోనియాకు కృతజ్ఞతలు చెప్పిందేమిటి? అన్నీ తప్పుడు ఆరోపణలే’’ అని మేకపాటి.. టీడీపీ నేతల తీరును దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీకి ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు.
నేను ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశా: ఎస్పీవై రెడ్డి
రాష్ట్ర విభజన నిర్ణయంతో ప్రజలు తమపై కోపంతో ఉన్నారని, తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్కు విన్నవించినట్టు కాంగ్రెస్కు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి చెప్పారు. స్పీకర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం ఆగస్టు 2న రాజీనామా చేశానని, మళ్లీ స్పీకర్ను కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరానని చెప్పారు. ‘‘ప్రజలు మాపై కోపంతో ఉన్నారు. చేతులు జోడించి రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరాం. ఆమె ఏం మాట్లాడలేదు. విన్నారు. ఇద్దరు అధికారులు విషయాలను రికార్డు చేసుకున్నారు. మా రాజీనామాను ఆమోదిస్తారని విశ్వసిస్తున్నా. ఆమోదించినా, ఆమోదించకపోయినా నా వరకు నేను ఇప్పటికే కాంగ్రెస్కు రాజీనామా చేశాను. వైఎస్సార్ సీపీలో చేరాను’’అని చెప్పారు.