
నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్యూరేటివ్ పిటిషన్తో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసులో మరణ శిక్ష ఖరారైన నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ శిక్ష అమలును నిలిపివేసే ఆశలతో చిట్టచివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 22న నలుగురు దోషులను ఉరితీయాలని ఢిల్లీ కోర్టు ప్రకటించిన రెండు రోజుల అనంతరం వినయ్ శర్మ సుప్రీం తలుపు తట్టారు. ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లను కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 22న ఉరితీసేందుకు తిహార్ జైలులో అన్ని ఏర్పాట్లూ సాగుతున్నాయి.
డెత్ వారెంట్ జారీ కాగానే నలుగురు దోషులూ కోర్టు రూమ్లోనే కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు వీరిని ఉరితీసేందుకు తిహార్ జైలులో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని ఉరితీసే క్రమంలో డమ్మీ ఎగ్జిక్యూషన్ను జైలు అధికారులు చేపట్టనున్నారు. మరణ శిక్ష అమలయ్యే వరకూ నలుగురు దోషులనూ ఒకే గదిలో ఉంచుతారు. కుటుంబ సభ్యులతో చివరిసారిగా కలిసేందుకు ఏర్పాట్లు చేస్తారు.