
న్యూఢిల్లీ: వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద ఉన్న 75 కోట్ల లబ్ధిదారులు 6 నెలల రేషన్ సరుకులను ఒకేసారి తీసుకోవచ్చని కేంద్ర మంత్రి పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు గరిష్టంగా 2 నెలల వరకు రేషన్ సరుకులను తీసుకునేందుకు అవకాశం ఉండగా.. పంజాబ్ ఇప్పటికే ఆరు నెలల సరుకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ‘గోదాముల్లో సరిపడా సరుకులున్నాయి. పేద వారికి ఆరు నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించాం’అని పాశ్వాన్ చెప్పారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 435 లక్షల టన్నుల మిగులు ఆహార ధాన్యాలున్నాయని, అందులో 272.19 లక్షల టన్నుల బియ్యం, 162.79 లక్షల టన్నుల గోధుమలున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment