Public distribution system
-
మే నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఆయా పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023ను మిల్లెట్ ఇయర్గా ప్రకటించిన నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాల (జొన్నలు, రాగులు) పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా.. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేయనుంది. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా.. పేదలకు పీడీఎస్ కింద పౌష్టికాహార ఉత్పత్తులను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మిల్లెట్లు పండించేలా అవగాహన కల్పించనున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులను స్థానికంగానే రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్లో పంపిణీ చేయనున్నారు. ఫలితంగా రైతులకు మార్కెట్లో పక్కా ధర భరోసా దక్కనుంది. వచ్చే ఖరీఫ్లో కందుల కొనుగోలు రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 4లక్షల టన్నుల వరకు కందుల దిగుబడి నమోదవుతోంది. ఈ క్రమంలోనే పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఖరీఫ్లో నేరుగా రైతుల నుంచి కందులు సేకరించేలా పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల రైస్ కార్డులు ఉండగా.. ఇందులో ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసరం అవుతున్నది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు సాధారణ రకం రూ.120–రూ.125, ఫైన్ వెరైటీ రూ.130 వరకు పలుకుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఫలితంగా ఏప్రిల్లో ఏకంగా 7,100 టన్నుల కందిపప్పును వినియోగదారులకు సరఫరా చేసింది. బియ్యం బదులు గోధుమ పిండి కేంద్ర ప్రభుత్వం పీడీఎస్ కింద నెలకు 1,800 టన్నులు మాత్రమే గోధుమ ఉత్పత్తులను రాష్ట్రానికి కేటాయిస్తుండగా.. వాటిని తొలి ప్రాధాన్యత కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. స్థానిక అవసరాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో ప్రజా పంపిణీకి అవసరమైన నిత్యావసరాల ఉత్పత్తులను స్థానికంగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఫలితంగా రైతులకు మద్దతు ధర భరోసా దక్కడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం సరుకు ఇచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
గిరిజన ప్రాంతాల్లో బైక్ల ద్వారా రేషన్ సరఫరా
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్కుమార్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరుకు రవాణాకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, ఎండీయూ వాహనం వెళ్లలేని గిరిజన గ్రామాలకు బైక్ల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జనవరి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీతో పాటు అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల వద్దకే నిత్యావసరాలు డెలివరీ చేసేలా చూడాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్ కొత్త రేషన్ షాపులు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 45 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు కమిషనర్ తెలిపారు. జనవరి చివరి నాటికి ఖరీఫ్ సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల సొమ్ముతో పాటు మిల్లర్ల బకాయిలనూ వేగంగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. 16 రోజులు దాటిన ఎఫ్టీవోలకు చెల్లింపులు పూర్తి చేసినట్టు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బకాయిల్లో కొంత మొత్తం వెచ్చించి ఆరబోత యంత్రాలు (డ్రయర్లు) ఏర్పాటు చేయాలని, లేకుంటే.. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి ఆయా మిల్లులకు సీఎంఆర్ నిలిపివేస్తామని కమిషనర్ అరుణ్కుమార్ హెచ్చరించారు. -
Ration Rice: వేలి ముద్ర వెయ్యి.. పైసలు తీసుకో.. కిలో రూ.8 నుంచి 10
రేషన్ డీలర్ నుంచి మిల్లర్ వరకు అక్రమ దందా ప్రతి నెలా వందల కోట్లలో వ్యాపారం వరకు ఇచ్చి కొనుగోలు డీలర్ల వద్ద, గ్రామాల్లో మహిళల నుంచి రూ.10 వరకు ఇచ్చి కొంటున్న దళారులు దళారుల వద్ద కొని పొరుగు రాష్ట్రాల్లో రూ.20 వరకు విక్రయిస్తున్న పెద్ద వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేసి.. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్న కొందరు మిల్లర్లు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామం రేషన్ దుకాణానికి ఓ మహిళ వచ్చి డీలర్కు ఆహార భద్రతా కార్డు ఇచ్చింది. డీలర్: అమ్మా బియ్యం ఇయ్యాల్నా.. పైసలా.. మహిళ: ఒక్కలకు ఎన్ని కిలోల బియ్యం ఇత్తండ్రు డీలర్:10 కిలోలు మహిళ: మా కార్డుల ఐదుగురం ఉన్నం గద. పైసలే ఇయ్యి డీలర్: యేలి ముద్ర ఎయ్యమ్మా... కిలకు ఎనిమిది (రూ.8) లెక్కన నాలుగు వందలిస్త మహిళ: సరేనయ్య.. పైసలియ్యి వచ్చిన మహిళ వేలిముద్ర వేయగానే... సదరు డీలర్ 50 కిలోల బియ్యం తూకం వేసి, ఆ బియ్యాన్ని పక్కకు పెట్టి ఆమెకు రూ.400 ఇచ్చాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం 80 శాతం వరకు పక్కదారి పడుతోంది. రూపాయికి కిలో చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.15 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ముఠాలు ప్రతి నెలా వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం మొదలుకొని పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రేషన్ దుకాణం నుంచి మొదలయ్యే ఈ దందా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్లలో ముగుస్తోంది. అక్రమ దందాలో చిన్న చిన్న దళారులు మొదలుకొని పెద్ద వ్యాపారులు, రైస్ మిల్లర్లు కూడా ఉండటం గమనార్హం. పీడీఎస్ బియ్యం జాతీయ రహదారులు, రైలు మార్గాల ద్వారా గమ్య స్థానాలకు నిరాటంకంగా చేరుతున్నా.. పట్టించుకునేవారే లేరు. బియ్యంతో పాటే పోలీస్, రైల్వే పోలీస్, పౌర సరఫరాల సంస్థ అధికారులను ‘కొనుగోలు’చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదలకు పంచుతున్న బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలోని రూపాయి బియ్యం (కరోనా నాటి నుంచి దాదాపుగా ఉచితంగానే సరఫరా) ఇతర రాష్ట్రాల్లో రూ.20కు పైగా పలుకుతుండడం గమనార్హం. కరోనా నాటి నుంచి ఉచితంగానే.. ► సాధారణంగా ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాల్లోని ఒక్కొక్కరికి 6 కిలోలు.. కిలో రూపాయి చొప్పున ఇస్తారు. అయితే కరోనా మొదలైన 2020 నుంచి ఒకటి రెండు నెలలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో గత జనవరి నుంచి మే, జూన్ నెలలు మినహా ఒక్కొక్కరికి ప్రతినెల 10 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఆగస్టు నెలలో ఏకంగా 15 కిలోల చొప్పున పౌరసరఫరాల సంస్థ బియ్యం పంపిణీ చేసింది. రేషన్ బియ్యంపై చులకన భావం! ► ఆహార భద్రతాకార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్ర వేసి తమ కోటా బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో పెరిగిన వరిసాగు, రైతు కుటుంబాలు సొంతంగా పండించిన బియ్యం తినే అలవాటు, రేషన్ బియ్యంపై ఉన్న చులకన భావం లాంటి కారణాల వల్ల చాలామంది ఈ బియ్యాన్ని ఆహారంగా వినియోగించడం లేదు. పట్టణాల్లోనూ చాలామంది రేషన్ బియ్యాన్ని ఇడ్లీ, దోశల పిండి, అటుకుల తయారీకి వాడుతున్నారు మినహా రోజువారీ భోజనానికి వినియోగించడం లేదు. అయితే రెండు నెలలకు పైబడి పీడీఎస్ బియ్యం తీసుకోకపోతే రేషన్కార్డు రద్దు అవుతుందన్న భయంతో అందరూ తప్పనిసరిగా బియ్యాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు తమ దుకాణాల్లోనే తిరిగి కొంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో కిలో బియ్యానికి రూ. 6 నుంచి రూ. 8 వరకు చెల్లిస్తుండగా... గ్రామాలు, ఇతర పట్టణాల్లో కిలోకు రూ. 8 నుంచి రూ.10 వరకు చెల్లిస్తున్నారు. రేషన్ దుకాణాల్లోకి వచ్చే బియ్యంలో 60 శాతం అక్కడే డబ్బులకు రీసేల్ అవుతుండగా, 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే పేదలు తీసుకుంటున్నారు. వీరిలో కొందరు దళారులకు విక్రయిస్తున్నారు. మిగతా 10 శాతం వరకు క్లోజింగ్ బ్యాలెన్స్ కింద డీలర్ల వద్ద నిల్వ ఉంటుంది. కాగా కొంటున్న బియ్యాన్ని డీలర్లు రూ.2 లాభం చూసుకొని ట్రాలీల్లో వచ్చే దళారులకు అమ్మేస్తున్నారు. ఇలా డీలర్ల నుంచి, గ్రామాల్లో మహిళల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సదరు ట్రాలీ దళారులు లారీల్లో వ్యాపారం చేసే వారికి రూపాయి, ఆపైన లాభం చూసుకొని విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసే పెద్ద వ్యాపారులు పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. రెండు మూడు చేతులు మారిన తర్వాత రాష్ట్రాలు దాటే బియ్యం ధర రూ.20 వరకు పలుకుతోంది. తద్వారా కిలో బియ్యానికి కనిష్టంగా రూ.5 చొప్పున లాభం వేసుకొన్నా.. ఇలా టన్నుల్లో విక్రయించే బియ్యానికి కోట్లల్లో లాభం సమకూరుతుందని స్పష్టమవుతోంది. ఈ లాభంతోనే పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులను వ్యాపారులు కొనేస్తున్నారని మంచిర్యాలకు చెందిన ఓ దళారి చెప్పాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రవాణా ► ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పీడీఎస్ బియ్యం అధికంగా మహారాష్ట్రకు వెళుతోంది. రామగిరి ప్యాసింజర్ రైలు ద్వారా వరంగల్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా వీరూర్కు వెళ్తుంది. లారీల్లో కూడా కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆసిఫాబాద్ గుండా వీరూర్కే చేరుతుంది. కాగజ్నగర్ నుంచి, దహేగాం, బెజ్జూరుల నుంచి చింతలమానెపల్లి మీదుగా గడ్చిరోలి జిల్లా అహేరీకి వెళ్లే లారీలు కూడా ఉన్నాయి. భూపాలపల్లి, చెన్నూరు, కాటారం, ములుగు ప్రాంతాల నుంచి సిరోంచకు, ఖమ్మం, కొత్తగూడెం నుంచి ఛత్తీస్గఢ్, హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కర్ణాటకకు పీడీఎస్ బియ్యంతో కూడిన లారీలు వెళ్తున్నాయి. మిల్లర్లకూ వరం ► పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి లారీలు బియ్యం మిల్లులకు వెళుతూపలుచోట్ల పట్టు పడడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అలాగే ఆయా మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు అక్కడ లేకపోవడాన్ని బట్టి కూడా.. మిల్లర్లు అసలు బియ్యాన్ని (మిల్లింగ్ చేసిన రైతుల ధాన్యం) అమ్ముకుంటూ, వాటి స్థానంలో పీడీఎస్ బియ్యాన్ని ఇస్తున్నట్టుగా స్పష్టమవుతోందని అంటున్నారు. -
మరింత సమర్ధంగా ఇంటింటికీ బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఇంటింటికీ రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (ఎండీయూ వాహనాలు) క్రమం తప్పకుండా లబ్ధిదారుల ప్రాంతాలకు వెళ్లేలా పక్కాగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా రూట్ మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక సేవలను వినియోగించనుంది. ఎండీయూ పరిధిలోని లబ్ధిదారులు తమ ఇళ్ల నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా సమీపంలోకే వాహనం వచ్చేలా అధికారులు ప్రత్యేక పాయింట్లను గుర్తిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఐదారు ఇళ్లకు ఒకచోట ప్రతి నెలా ఎండీయూలో రేషన్ అందించేలా సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. వాహనాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బియ్యం లబ్ధిదారులకు అందుతుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చె నెలలో మండలానికి ఒక ఎండీయూ పరిధిలో దీనిని అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో పెరిగిన రేషన్ పంపిణీ శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారి శాతం గణనీయంగా పెరిగింది. లబ్ధిదారులకు నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం ఇవ్వడంతో పాటు 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి నెలా 1.45 కోట్ల కార్డుదారులకు 2.30 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతుంది. గతంలో నెలకు 80 నుంచి 85 శాతం మాత్రమే రేషన్ పంపిణీ జరిగితే.. ఇప్పుడు 90 శాతానికి చేరుకొంది. మరోవైపు అనివార్య కారణాలతో ఎండీయూ వాహనదారులు ఎవరైనా తప్పుకుంటే వారి స్థానాన్ని భర్తీ చేసేంత వరకు గరిష్టంగా మూడు నెలల పాటు ఇన్చార్జి ఎండీయూకు (వేరే ఎండీయూ వాహనదారుడు పని చేస్తే) బాధ్యతలు అప్పగిస్తోంది. వీరికి నెలకు రూ.18,000 చొప్పున అదనంగా అందిస్తూ ఎక్కడా రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతోంది. 2 నుంచి 3 నెలలు నిల్వ చేసిన తర్వాతే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన వెంటనే పీడీఎస్లోకి తీసుకురావడంతో సమస్యలు వస్తున్నాయి. కొత్త బియ్యం వండితే అన్నం బాగోలేదని, ముద్దగా అవుతుందనే ఫిర్యాదులున్నాయి. దీనిని అధిగమించేందుకు కస్టమ్ మిల్లింగ్ అనంతరం 2 నుంచి 3 నెలలు బఫర్ గోడౌన్లలో నిల్వ ఉంచిన తర్వాతే పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
ఇంటింటికీ గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ దుకాణాలు, రేషన్ పంపిణీ వాహనాల (ఎండీయూ) ద్వారా గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ప్రారంభించనుంది. తొలి దశలో 290 రేషన్ వాహనాలు, 570 రేషన్ దుకాణాల్లో అమలు చేయనున్నారు. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే వినియోగదారులకు అందించనున్నారు. ఎండీయూలకు ఆర్థిక బలం చేకూర్చేలా.. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో 9,260 ఎండీయూ వాహనాలు సేవలందిస్తున్నాయి. రేషన్ డోర్ డెలివరీ నిమిత్తం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.18 వేల రెమ్యునరేషన్ ఇస్తోంది. వారికి మరింత ఆర్థిక బలం చేకూర్చేందుకు ప్రభుత్వరంగ సంస్థలైన గిరిజన, ఆయిల్ ఫెడ్, మార్క్ఫెడ్ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ఆయా సంస్థల నుంచి సబ్సిడీపై సరుకులను తీసుకునే ఆపరేటర్లు వాటిని ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాల్సి ఉంటుంది. ప్రతినెలా పీడీఎస్ బియ్యం పంపిణీలో జాప్యం లేకుండా విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు తెలిసేలా వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించనున్నారు. విక్రయించే ఉత్పత్తులు.. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా తేనె, అరకు కాఫీ పొడి, వైశాఖి కాఫీ పొడి, త్రిఫల చూర్ణం, నన్నారి షర్బత్, ఆయుర్వేద సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ పొడి, షికాకాయ పొడి, కారంపొడి, పసుపు, కుంకుమతోపాటు ఆయిల్ఫెడ్ నుంచి పామాయిల్, సన్ఫ్లవర్, రైస్బ్రాన్, వేరుశనగ నూనెలను అందుబాటులో ఉంచనున్నారు. గిరిజనులకు మేలు చేసేలా.. గిరిజనులకు మేలు చేసేలా ఎండీయూ వాహనాల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. తొలుత విశాఖ, తిరుపతి జిల్లాల్లో స్పందనను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. రేషన్ లబ్ధిదారులే కాకుండా ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. బియ్యం ఇచ్చే సమయంలో వినియోగదారులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా విక్రయాలు చేసుకోవాలని ఎండీయూలకు సూచించాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
పాఠశాలలకు నేరుగా బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేస్తుండగా.. ఈ నెల నుంచి ఐసీడీఎస్ (అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా రవాణా చేయనుంది. తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చనుంది. ఇప్పటివరకు అంగన్వాడీలు రేషన్ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్ల యాజమాన్యాలు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వ్యయప్రయాసలతో బియ్యం తెచ్చుకునేవారు. ఒకరోజు ప్రత్యేకంగా బియ్యం కోసం కేటాయించాల్సి వచ్చేది. పైగా రవాణా, ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇబ్బందులు పడేవారు. వీటన్నింటికి పరిష్కారంగా ప్రభుత్వమే రేషన్ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఫైన్ క్వాలిటీ ధాన్యం సేకరణ రాష్ట్రంలో అంగన్వాడీలు, స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భోజనానికి ఏడాదికి 2.54 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఇప్పటివరకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు సార్టెక్స్ బియ్యాన్ని (సాధారణ రకాలు) ఫోర్టిఫై చేసి ఆహారంగా అందిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఫైన్ క్వాలిటీ (స్థానిక రకాలు, సన్న రకాలు) బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2022–23 ధాన్యం సేకరణలో మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన ఫైన్ క్వాలిటీ ధాన్యాన్ని ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల మేర రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. తద్వారా విద్యార్థులకు, రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు అప్పుడే పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ద్వారా వచ్చే బియ్యంతో వండే అన్నం ముద్దగా ఉంటుందనే ఫిర్యాదులను పరిష్కరించేలా.. సేకరణకు, మిల్లింగ్కు మధ్య రెండు నుంచి మూడునెలల వ్యవధి ఉండేలా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాలతో పాటు ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు మాత్రమే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకున్న వారిలో రక్తహీనత శాతం తగ్గినట్టు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మొత్తం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్వాడీలు, స్కూల్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే.. మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి12 వంటి కీలక సూక్ష్మపోషకాలను బియ్యంలో అదనంగా చేరుస్తారు. విటమిన్ టాబ్లెట్ కంటే పవర్ఫుల్ ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ టాబ్లెట్ కంటే ఎంతో పవర్ఫుల్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరిస్తున్నాం. – అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
అబద్ధాలే.. రామోజీకి నిత్యావసరం!
నిత్యం అబద్ధాలాడటం... రామోజీరావుకు నిత్యావసరం!!. చంద్రబాబు నాయుడు ఐదేళ్లూ ఏమీ చేయకపోయినా... అదో గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా రోజూ కీర్తిస్తే జనాన్ని కొంతయినా నమ్మించగలమనేది ఆయన దింపుడు కళ్లం ఆశ. నిత్యావసరాల్లో కోత... అంటూ ఆదివారంనాడు ఆయన చేసిన ఆక్రందనలూ అందులో భాగమే. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దిగిపోయేనాటికి ఉన్న రేషన్ కార్డులు 1.39 కోట్లు. ఇప్పుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఉన్నవి 1.45 కోట్లు. అంటే... ఏకంగా 6 లక్షల కుటుంబాలు పెరిగినట్లు. ఈ నిజాన్ని రామోజీరావు చెప్పరుగాక చెప్పరు. ఇక చంద్రబాబు ఏలిన ఐదేళ్లలోనూ కందిపప్పు, పంచదారపై నాటి ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు రూ.568 కోట్లు. కానీ వై.ఎస్.జగన్ హయాంలో ఈ మూడేళ్లలోనే కందిపప్పు, పంచదార రేషన్ డిపోల్లో ఇవ్వటానికి ప్రభుత్వం చేసిన వ్యయం ఏకంగా రూ.1,891 కోట్లు. ఈ రెండు లెక్కలూ చాలవూ... ఎవరి హయాంలో ఏం జరిగిందో కళ్లకు కట్టడానికి? కాకపోతే ఈ వాస్తవాలను ‘ఈనాడు’ కావాలనే చెప్పదు. పైపెచ్చు కందిపప్పు, పంచదారలో ప్రభుత్వం కోతపెడుతోందని రాస్తూ... చంద్రబాబు హయాంలో ప్రతినెలా ప్రతి కార్డుకూ కిలోలకు కిలోలు పంపిణీ చేశారనే గ్రాఫిక్స్ చూపించడానికి పడరాని పాట్లు పడుతోంది. ఈ ముసుగులు తొలగిస్తూ... నిజానిజాలేంటో చెప్పే కథనమిది!. రాష్ట్రంలో 2014 నుంచీ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పామాయిల్ కేటాయింపులే లేవన్నది నిజం. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సబ్సిడీ కందిపప్పు ధర రూ.67కే స్థిరంగా అందిస్తున్నారని, ఎక్కడా పెంచలేదన్నది నిజం. కానీ వీటిని ‘ఈనాడు’ చెప్పదు. అయినా చంద్రబాబు హయాంలో పండగ కానుకలు ఎందుకిచ్చారో మీకు తెలియదా రామోజీరావు గారూ? పీడీఎస్ డబ్బుల్ని హెరిటేజ్ లాంటి కంపెనీలకు దోచిపెట్టడానికి కాదా? ఎలాంటి నిబంధనలూ లేకుండా... టెండర్ల ఊసే లేకుండా ఇష్టం వచ్చిన ధరలకు ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు మింగింది మీరందరూ కాదా? అసలు పేదలకు నాణ్యమైన సరుకులు ఇచ్చేందుకు ఏనాడైనా ప్రయత్నించారా? అప్పట్లో బియ్యాన్ని తీసుకున్నా తినగలిగే పరిస్థితి ఉండేదా? ఇప్పుడు మధ్యస్త సన్నరకం బియ్యాన్ని తీసుకుని ఖర్చుకు వెరవకుండా మరింత నాణ్యంగా సార్టెక్స్ చేసి అందిస్తుండటం నిజం కాదా? అప్పట్లో ఇన్ని అక్రమాలు జరిగినా ప్రశ్నించలేదెందుకు? పైపెచ్చు ఇప్పుడు ఇళ్లవద్దకే రేషన్ సరఫరా చేస్తున్న అద్భుతమైన వ్యవస్థపై కూడా... ఇంటి ముంగిటకు రాకుండా వీధి మలుపుల్లో ఉంటున్నారనే విమర్శలా? మరీ ఇంతలా దిగజారిపోతున్నారెందుకు రామోజీరావు గారూ? సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా నెలకొన్న పండగ వాతావరణం బాబుకు ఎదురవబోయే ఓటమిని ముందే చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారా? ఇవీ... చంద్రబాబు లెక్కలు టీడీపీ ప్రభుత్వం హయాంలో రాగులు, జొన్నలు, గోదుమ పిండి, ఉప్పు పంపిణీ చేయటం మొదలెట్టిందే చివర్లో. ‘ఈనాడు’ దృష్టిలో అది సూపర్. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచ్చినా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో పంపిణీ చేశారీ చిరు ధాన్యాల్ని. గతంలో నెలకు 14 వేల టన్నుల గోధుమ పిండి అవసరం ఉంటే 900 టన్నులు తెచ్చి కొద్ది మందికే పంపిణీ చేశారు. ఇక్కడి ప్రజలకు బియ్యమే ఇష్టం. కార్మికులు, కూలి కుటుంబాలకు గోధుమ పిండితో రొట్టెలు చేసుకునే తీరిక ఉండదు. దీంతో గోధుమ పిండి తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిల్వలు పాడైపోతున్న కారణంగా పంపిణీ నిలిచిపోయింది. రాగులు, జొన్నల విషయంలోనూ ఇదే జరిగింది. 2018–19 మధ్య 25,034 టన్నుల రాగులు, 15,635 టన్నుల జొన్నలను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేశారు. వీటిని బయటి మార్కెట్ నుంచి కొనటంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నిలిపివేసింది. వీటి పరిమాణానికి సమానవైన బియ్యంపై సైతం సబ్సిడీ ఇవ్వలేదు. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. వీటిని తీసుకునేందుకెవరూ ఆసక్తి చూపించకపోవడంతో మధ్యలోనే ఆగిపోతే.. దీనిక్కూడా ‘ఈనాడు’ మసి పూస్తూనే ఉంది. 2020లో కేంద్రం 1838 టన్నుల గోధుమలు మాత్రమే సరఫరా చేసేది. వాటిని పిండిగా చేసి రేషన్ దుకాణాలకు చేర్చేందుకు ఖర్చు అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటా’ సరఫరాలను నిలిపివేసింది. అన్నీ... ఎన్నికల ముందే ఇక గత ప్రభుత్వం ఐదేళ్లలో 93 వేల టన్నుల కందిపప్పు, 3.16 లక్షల పంచదారను మాత్రమే పంపిణీ చేస్తే... వై.ఎస్.జగన్ ప్రభుత్వం మూడేళ్లలో 2.76 లక్షల టన్నుల కందిపప్పును, 2.14 లక్షల టన్నుల పంచదారను అందించింది. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూన్ వరకు కందిపప్పు గురించి పట్టించుకోనే లేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు వస్తున్నాయనగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పంచదార పరిస్థితీ అంతే. నెలకు సగటున 7724 టన్నులు అవసరం కాగా, కేంద్రం కేవలం 908 టన్నులకే రాయితీ ఇస్తోంది. మిగిలినదంతా రాష్ట్రం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి... సబ్సిడీని భరిస్తోంది. పైపెచ్చు బాబు హయాంలో ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులుండేవి. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున కందిపప్పు ఇచ్చి... ధర రూ.50 నుంచి రూ.120 మధ్యన విక్రయించారు. 2015 డిసెంబర్లో రూ.90కి విక్రయిస్తే... 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120కి పెంచేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.63 ఉన్నప్పుడు కేవలం రూ.23 రాయితీ ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో రూ.115 ఉంటే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.48 సబ్సిడీ ఇస్తూ రూ.67కే అందిస్తోంది. మార్కెట్ ఒడిదుడుకులు, కోవిడ్ సంక్షోభం, ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. ఇదే నేరమైనట్లు... ధరలు పెంచేశారంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకోవటం చూస్తే చిత్రంగానే అనిపిస్తుంది. ఇంటింటికీ రేషన్పైనా నిందలా? ‘తోచీ తోచనమ్మ’ తరహాలో రామోజీరావుకు దేనిపై విమర్శలు చేయాలో తెలియటం లేదన్నది ఆయన కథనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటింటికీ రేషన్ అందించటంలో ఏపీని యావద్దేశం ఆదర్శంగా తీసుకుంటోంది. ‘ఈనాడు’ మాత్రం పసలేని విమర్శలు చేస్తూనే ఉంది. బాబు హయాంలో రేషన్ సరుకుల కోసం యుద్ధాలే చేయాల్సి వచ్చేది. డిపోల్లో సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయో తెలీక రోజంతా కూలి మానేసి క్యూలో పడిగాపులు పడేవారు. ఒక్కోసారి రేషన్ తీసుకోకుండానే ఇళ్లకెళ్లేవారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరం. కానీ ఈ నిజాలను ఇప్పటికీ ‘ఈనాడు’ చెప్పదు. పైపెచ్చు అప్పట్లో ఒకరోజు సెలవు పెట్టుకుని డిపోలకు వెళ్లేవారని, ఇపుడు ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తాయో తెలియక తంటాలు పడుతున్నారని రాయటంలోనే ఆ పత్రిక ఎంత నీచానికి దిగజారుతున్నదో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో... ఇపుడు 9,260 వాహనాల్లో లబ్ధిదారులకు ఇళ్లవద్దే రేషన్ అందుతోంది. ఈ మొబైల్ వాహనాలతో ఉపాధి పొందుతున్న ఆపరేటర్లకు నెలకు సుమారు రూ.25 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదుల్లేవు. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణా లేదు. ఇప్పుడు రేషన్ తీసుకునేవారు 87 శాతం నుంచి 92 శాతానికి పెరిగారు. వాహనం వచ్చినప్పుడు ఇంట్లో సభ్యులు లేకపోతే సాయంత్రం సచివాలయం వద్ద రేషన్ వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎండీయూ వాహనం నుంచి బియ్యం పొందే సౌలభ్యాన్ని కల్పించారు. ఇవన్నీ ‘ఈనాడు’ చెప్పని నిజాలే మరి! తగ్గిన బియ్యం అక్రమ రవాణా.. బాబు హయాంలో రేషన్ బియ్యం తినేవారు చాలా తక్కువ. ముక్కిపోవటం... పురుగులు పట్టడం... రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజలు రంగు మారటం వంటివి అప్పట్లో అత్యంత సహజం. దీనిని కూడా బాబు బినామీలు తమ దళారులతో ప్రజల దగ్గర నుంచి పదీపరకా పెట్టి కొనేసేవారు. అక్రమంగా తరలించి ప్రజాధనాన్ని దోచేసేవారు. కానీ ఇప్పుడిస్తున్న సార్టెక్స్ బియ్యం నిరుపేదల కడుపు నింపుతోంది. అందుకే గతంలో కంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. టీడీపీ ఐదేళ్ల పాలనలో 117.45 లక్షల టన్నులు బియ్యం సరఫరా చేస్తే ఈ మూడేళ్లలోనే జగన్ ప్రభుత్వం 85.27లక్షల టన్నులు పేదలకు ఇచ్చింది. బియ్యం సార్టెక్స్కే కిలోకు రూపాయి చొప్పున నెలకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. బాబు ఐదేళ్ల కాలంలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే జగన్ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,379 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. పాతాళంలోకి పడిపోయిన బాబును ఎలాగైనా పైకి లాగాలని చూస్తున్న రామోజీకి ఇవేమీ కనిపించట్లేదు! 19 నెలల ఉచిత బియ్యం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏప్రిల్ 2020లో పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పప్పు ధాన్యాల పంపిణీని ప్రారంభించింది. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల నాన్సార్టెక్స్ బియ్యాన్ని అందించింది. అయితే కేంద్రం కేవలం జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డులకు మాత్రమే దీనిని వర్తింప జేసింది. రాష్ట్రంలో 1.45 కోట్ల కార్డులు ఉంటే.. 88 లక్షల ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు దశల్లో అంటే 25 నెలల పాటు ఈ పథకం కొనసాగగా కేంద్రంతో సమానంగా ఐదు దశల వరకు 19 నెలల పాటు రాష్ట్ర కార్డులకు కూడా ప్రభుత్వం సొంత ఖర్చులతో బియ్యాన్ని అందించింది. ఇందు కోసం అదనంగా దాదాపు రూ.5700 కోట్ల వరకు ఖర్చు చేసింది. దీనికి తోడు పీఎంజీకేఏవై కింద శనగలు, కందిపప్పు పంపిణీకి రూ.1729 కోట్లు ఖర్చు చేసింది. ఆరవ విడతలో ప్రభుత్వం వద్ద సరిపడినన్ని నాన్ సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేకపోవడంతో పంపిణీ ఆలస్యమై కేవలం చివరి రెండు నెలలు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే.. ఎంపిక చేసిన జిల్లాల్లో పంపిణీ చేశారు. ఇకనైనా ఈ వాస్తవాలు రాయండి రామోజీరావు గారూ!! -
కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్!
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఇంధనంతో పాటు కూరగాయల ధరలు మండుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగించే యోచనలో ఉంది. ఇందులో చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రద్దు దిశగా రేషన్ కార్డులు రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది వీటతో పాటు ప్రభుత్వం మరో విజ్ఞప్తి కూడా చేస్తోంది. అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని లేదంటే ప్రభుత్వం గుర్తించి రేషన్ రద్దుతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది. రూల్స్ ఏంటో చూద్దాం.. మీ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం రెండు లక్షల కంటే ఎక్కువ (గ్రామంలో), అదే నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో సరెండర్ చేయాలి. మరిన్ని నెలలు ఉచిత రేషన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మరో 3 నుంచి 6 నెలల వరకు పెంచనున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. -
1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతినెల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 4.23 కోట్ల మందికి రేషన్ ఇస్తుంటే.. ఇందులో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే సరుకులు అందిస్తోందన్నారు. మిగిలిన లబ్ధిదారులకు సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ పంపిణీ చేస్తోందన్నారు. కరోనా సమయంలో పీఎంజీకేవై కింద కేంద్రం ఉచిత రేషన్ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2022 వరకు రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీ చేపట్టామన్నారు. ఇక్కడ కేంద్రం ఇచ్చే వాటాపోనూ నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులకు మానవతా దృక్పథంతో తమ ప్రభుత్వం సొంతంగా ఉచిత బియ్యాన్ని అందించిందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఉచిత రేషన్ను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారని బొత్స తెలిపారు. రేషన్ దుకాణాల వద్దే.. తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మందితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డుదారులకు ఉచిత రేషన్ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. వీరితో పాటు కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడ కూడా ఈ విధానాన్ని అమలుచేస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలోని 2.68 కోట్ల మందికి పైగా ఉచిత బియ్యం అందుతుందని బొత్స చెప్పారు. వీటిని రేషన్ దుకాణాల వద్ద మ.3.30 గంటల నుంచి సాయంత్రం వరకూ పంపిణీ చేస్తామని.. ఈ నెలాఖరు నాటికి వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు కూపన్లు అందజేస్తామన్నారు. ఇక ప్రతినెలా ఇచ్చే బియ్యాన్ని యథావిధిగా వాహనాల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందన్నారు. పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక అనంతరం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులు అందరికీ పీఎంజీకేవైను వర్తింపజేయాలని సీఎం జగన్ లేఖల ద్వారా ప్రధానమంత్రిని కోరారన్నారు. నీతి ఆయోగ్, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులు, ఉన్నతాధికారలు అధ్యయనాల తర్వాత పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కంటే పీడీఎస్ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని.. ఇటీవల కొత్తగా 7,051 కార్డులను కూడా జారీచేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో పేదలకిచ్చే బియ్యం కోసం రూ.12వేల కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం మూడేళ్లలోనూ రూ.14వేల కోట్ల వరకు ఖర్చుచేసిందన్నారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు.. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది నిరుపేదలు రేషన్ తీసుకుంటుండగా కేంద్రం ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందిని మాత్రమే గుర్తించింది. వారికే ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. మిగిలిన 1.55 కోట్ల మంది ప్రజలను నిరుపేదలుగా పరిగణించట్లేదు. ఈ క్రమంలో కొంతమందికే కాకుండా నిరుపేదలందరికీ పీఎంజీకేవై కింద ఉచిత రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నీతి ఆయోగ్ సైతం చేసిన సిఫారసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కేంద్రం స్పందించలేదు. కరోనా సమయంలో కేంద్రం ఇస్తున్న 2.68 కోట్ల మందితో పాటు మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ ఇచ్చింది. ఆర్థికభారం మోయలేనిస్థాయికి చేరడంతో.. అందరకీ ఉచిత రేషన్ ఇవ్వమని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి, కేంద్రం స్పందన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో.. ఉచిత రేషన్ పంపిణీ చేయకపోతే ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తామని, బిల్లులను కూడా ఆపేస్తామని బెదిరించింది. రైతులు ఇబ్బందులు పడకుండా వారి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి వారి సిఫారసుల అనుగుణంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజికవర్గాల వారీగా ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లుచేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో మోయలేని ఆర్థిక భారం పడినా.. నిరుపేదల కడుపు నింపేందుకు కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారం భరించి రెండేళ్లూ ఉచిత రేషన్ అందించింది. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవడంతో కేంద్రాన్ని సాయం కోరినా ఫలితం దక్కకపోగా బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. -
పంజాబ్లోనూ ఇంటి వద్దకే రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రవేశపెట్టిన ‘ఇంటి వద్దకే రేషన్’ విధానం, నాణ్యమైన బియ్యం పంపిణీని పలు రాష్ట్రాలు ప్రశంసించడంతో పాటు వాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు రేషన్ కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదని ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ‘తరచుగా రేషన్ పొందడానికి ఒక రోజు వెచ్చించాల్సి వస్తోంది. రేషన్ కోసం వృద్ధులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నారు. ప్రజలకు చేరే రేషన్లోనూ నాణ్యత కొరవడింది. ఇకపై పంజాబ్లో ఇది కొనసాగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది’ అని చెప్పారు. నాణ్యమైన రేషన్ను శుభ్రమైన సంచులలో ప్యాక్ చేసి ఇంటికే పంపిణీ చేసేందుకు త్వరలోనే విధానాలను రూపొందించనున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం పంజాబ్ కంటే ముందుగానే ఢిల్లీలో ఇంటింటికీ రేషన్ను పంపిణీ చేయాలనుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ అడ్డంకుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా పర్యటనలో కేంద్ర బృందం, విజయవాడ పర్యటనలో కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్.. రాష్ట్రంలో రేషన్ పంపిణీ విధానంపై ప్రశంసలు కురిపించారు. దేశంలో దాదాపు 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరుస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజల కోసం అదనపు భారం భరిస్తున్న ఏపీ వాస్తవానికి ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది కిందటే రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు çపడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తంగా 1.45 కోట్ల కార్డుదారులు ఉండగా, నెలలో 18 రోజుల పాటు వీరందరికీ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా, ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌర సరఫరాల శాఖ నెలకు సుమారు రూ.16.67 కోట్లకు పైగా చెల్లిస్తోంది. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితో పాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఇలా ఏటా నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.830 కోట్లకు పైగా ప్రజల కోసం అదనపు భారం భరిస్తోంది. -
ఆహార భద్రతలో ఏపీ భేష్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆహార భద్రతకు రాష్ట్రంలో ఢోకా లేదు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) అమలులో మన రాష్ట్రం మొదటి ర్యాంకు సాధించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైనట్లు తేలింది. తాజాగా నీతి ఆయోగ్, సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) భారత్ ఇండెక్స్ నివేదికల ప్రకారం పలు అంశాల్లో ఏపీ అద్భుత ప్రతిభ కనబరిచినట్టు తేలింది. అందరికీ ఆహార భద్రత కల్పించడంలో వంద శాతం విజయవంతమైంది. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడంలో దేశంలోని ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీ చేస్తున్నట్టు నీతి ఆయోగ్, ఎస్డీజీ ఇండెక్స్లో తేలింది. 2020–21కి గాను ఎస్డీజీ భారత్ ఇండెక్స్లో హెల్త్ ఇన్స్రూ?న్స్ కల్పించడంలో వందకు 91.27 మార్కులతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. వివిధ అంశాల్లో సాధించిన ప్రగతి.. ర్యాంకులు ఇలా.. ► గతంలో మాతా మరణాల నియంత్రణలో రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు మంచి ఫలితాలు సాధించింది. 59.63 శాతం మార్కులతో 5వ ర్యాంకు కైవసం చేసుకుంది. ప్రసవ సమయంలో తల్లుల మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ విషయంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ► 9 నెలల నుంచి 11 నెలల వయసున్న చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో ఏపీ ముందంజ వేసింది. గతంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ► వరి పండించే రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానం దక్కించుకుంది. ఈ అంశంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ► రాష్ట్రంలో నర్సులు, ఫిజీషియన్లు, మిడ్ వైఫరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో పదో స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 95.14 మార్కులతో రెండో స్థానానికి చేరింది. 115 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. ► నర్సులు, డాక్టర్ల రేషియో విషయంలో 95.14 మార్కులతో రెండో స్థానంలోను, సురక్షిత తాగునీటి సరఫరా అంశంలో 86.58 మార్కులతో మూడో స్థానంలోను మన రాష్ట్రం నిలిచింది. ► మరుగుదొడ్ల ఏర్పాటులోనూ ఏపీ ప్రగతి సాధించింది. నూటికి నూరు మార్కులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ కూడా చోటు దక్కించుకుంది. ► అందరికీ విద్యుత్ విషయంలోనూ ఏపీ గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించటంలో వందకు వంద మార్కులు సాధించిన అతి కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కావడం గమనార్హం. ► వ్యర్థాల నిర్వహణ, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే విషయంలో ఏపీ మంచి ఫలితాలు సాధించింది. వంద శాతం మార్కులు సాధించిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ► సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది. 52.40 శాతం మార్కులతో ఈ ఘనత సాధించింది. ► ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ఖాతాల విషయంలో రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది. 89.13 మార్కులతో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఇందులో మహిళల ఖాతాల విషయంలో దేశంలోనే రెండో ర్యాంకు సాధించింది. -
ప్రజా పంపిణీలోనూ యువతకు ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన మొబైల్ మినీ వ్యాన్తో తనకు చక్కటి ఉపాధి లభించిందని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జంపాన కృష్ణచైతన్య గర్వంగా చెబుతున్నాడు. రూ.5,81,190 విలువైన మినీ వ్యాన్, వేయింగ్ మెషిన్కు తన వాటాగా కేవలం 10 శాతం మాత్రమే తాను చెల్లించానని తెలిపాడు. మిగిలిన 90 శాతాన్ని ప్రభుత్వమే సబ్సిడీ కింద బ్యాంకుకు వాయిదాల్లో చెల్లిస్తోందన్నాడు. వ్యాన్తో తనకు నెలకు రూ.18 వేలు వేతనం కూడా వస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు. పేద ప్రజలకు ఇళ్ల వద్దే రేషన్ బియ్యం అందించే కార్యక్రమంలో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందంటున్నాడు.. శ్రీకాకుళం జిల్లా ఆత్మకూరుకు చెందిన పులిచర్ల ఈళ్లయ్య. ప్రభుత్వం మొబైల్ మినీ ట్రక్కులను సబ్సిడీపై అందిస్తుండటంతో గతేడాది దరఖాస్తు చేసుకున్నానని వివరించాడు. ప్రతి నెలా 1న రూ.18 వేలు వేతనం పొందుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో మొబైల్ మినీ ట్రక్కుల ద్వారా ఉపాధి పొందుతున్న ఏ ఒక్క యువకుడిని పలకరించినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రక్రియ సత్ఫలితాలనిస్తోందని అర్థమవుతోంది. దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే రేషన్ అందించే పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఫిబ్రవరి 1తో ఏడాది పూర్తయ్యింది. ఇతర రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరుస్తున్న ఈ కొత్త ఒరవడిలోనూ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడం మరో విశేషం. రాష్ట్రంలోని ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దే రేషన్ సరుకులు అందించేలా ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 1న 9,260 మొబైల్ వాహనాలను అందించింది. వాటి ద్వారా రోజుకు కనీసం 90 కార్డుదారులకు తగ్గకుండా వారి ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు అందించేలా చర్యలు చేపట్టింది. 90 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా వేతనం ప్రభుత్వం పౌరసరఫరాల పంపిణీ సంస్థ ద్వారా అందించిన ఈ వాహనాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ మొత్తాన్ని సమకూర్చింది. రేషన్ సరఫరా కోసం అందించిన నాలుగు చక్రాల మొబైల్ మినీ ట్రక్కు (ఒక్కొక్క వాహనం) రూ.5,72,539, బరువు తూచే యంత్రం రూ.8,651 మొత్తం ధర రూ.5,81,190. ఈ మొత్తంలో పది శాతాన్ని లబ్ధిదారుడు చెల్లించాడు. మిగిలిన 90 శాతంలో 60 శాతం ప్రభుత్వ సబ్సిడీ, మరో 30 శాతం లబ్ధిదారులకు వాయిదాల పద్ధతిలో రుణం ఇచ్చిన బ్యాంకులకు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే లబ్ధిదారుడు తొలుత చెల్లించిన 10 శాతం మినహా మొత్తం 90 శాతాన్ని ప్రభుత్వమే చెల్లించేలా గతేడాది జూలైలో నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా 72 వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చే సింది. దీంతో ట్రక్కులు నిర్వహిస్తున్న యువతకు మరింత భరోసా లభించింది. అంతేకాకుండా ప్రతి నెలా వారికి వేతనం కూడా అందుతోంది. -
ఆ బియ్యం.. ఆరోగ్యానికి అభయం
సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో నివేదిక ప్రకారం రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య విజయనగరం జిల్లాలో తాజాగా 78.7 నుంచి 66.7 శాతానికి తగ్గింది, మహిళల్లో రక్తహీనత 75.7 నుంచి 64.6 శాతానికి తగ్గడం గమనార్హం. సరైన పోషకాలు అందక సాధారణం కంటే తక్కువ బరువు ఉన్న మహిళల శాతం 25.8 నుంచి 16.9 శాతానికి తగ్గింది. ఆర్థిక భారం పడినా.. ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫికేషన్ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులకు(ఎన్ఎఫ్ఎస్ఏ) మాత్రమే ఈ రకమైన బియ్యాన్ని సరఫరా చేస్తుండగా మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో అందచేస్తోంది. ఎన్ఎఫ్ఎన్ఏలో కూడా కేంద్రం 75 శాతం కార్డులకు మాత్రమే అందిస్తోంది. మూడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్రంపై నెలకు సుమారు రూ.1.70 కోట్లకుపైగా అదనపు భారం పడనుండగా ఏడాదికి రూ. 20.40 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. విశాఖపట్నం, కడప జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్నందున మొదటి దశలో అక్కడ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. ఈ సీజన్లో 27 లక్షల టన్నుల లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా గతేడాది జూన్ నుంచి మధ్యాహ్నం భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు రక్తహీనత సమస్యలు తగ్గాయి. గత సీజన్లో (ఖరీఫ్, రబీ) 2.4 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సేకరించారు. ప్రస్తుత సీజన్లో 27 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మిల్లుల్లో ఫోర్టిఫైడ్ రైస్ను తయారు చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటే? బియ్యపు నూకలను పిండిగా చేసి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి 12 లాంటి కీలక సూక్ష్మ పోషకాలను జోడించి నీళ్లు పోసి ముద్దగా చేస్తారు. ఈ ముద్దను యంత్రంలో వేసి ఎక్స్ట్రాషన్ పద్ధతి ద్వారా బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఈ కృత్రిమ బియ్యాన్ని ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తారు. వీటినే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటారు. ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ సేకరణకు ప్రభుత్వం రూ.75 చొప్పున ఖర్చు చేస్తోంది. వంద కిలోల సాధారణ బియ్యంలో ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ను కలిపి పంపిణీ చేస్తారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే చిన్నారుల్లో మెదడు, వెన్నెముక పెరుగుదలతో పాటు మహిళలకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సంస్థ టెండర్లు నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను కొనుగోలు చేస్తోంది. దశలవారీగా అన్ని జిల్లాల్లో.. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు ఫోర్టిఫైడ్ బియ్యం మంచి పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ బి –12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. విజయనగరంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చింది. దశలవారీగా అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. – గిరిజా శంకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పోషకాలతో కూడిన ఆహారం పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కడప, విశాఖపట్నం జిల్లాల్లో వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. చౌక బియ్యం ద్వారా సమకూరే పోషకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో త్వరలో విజయనగరం జిల్లాలో సర్వే నిర్వహిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ -
‘ఏక్రూపాయ్వాలా కోడ్’.. రూ.కోట్ల దందా!
సాక్షి, కరీంనగర్: వాస్తవానికి ‘ఏక్రూపాయ్వాలా’ అనేది ఓ కోడ్. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న బియ్యాన్ని తరలించే వ్యక్తులు చెక్పోస్టుల వద్ద వాడే పేరు ఏక్రూపాయ్వాలా.! అంటే రూపాయి కిలో బియ్యాన్ని అక్రమంగా సేకరించి, కొంచెం ప్రాసెస్ చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే దందాకు అక్రమార్కులు పెట్టుకున్న ముద్దుపేరు. ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ‘ఏక్రూపాయ్వాలా’ నెట్వర్క్ రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గోండియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకునేదాకా వెళ్లింది. అక్రమార్గంలో మహారాష్ట్రకు చేరిన తెలంగాణ సర్కారు బియ్యం అటు తిరిగి.. ఇటు తిరిగి.. మన రాష్ట్రంలోని కొన్ని రైస్మిల్లులకు చేరుకుంటున్న వైనం ఇది. దళారుల ద్వారా స్మగ్లర్ల ద్వారా చేతులు మారుతూ రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గొండియా మిల్లులకు చేరుకున్న పీడీఎస్ బియ్యం అక్కడ రాష్ట్ర సర్కారుకు లెవీ కింద కొంత బియ్యం పెట్టి మిగతా బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారు. ఎందుకిలా? రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సింగిల్ విండో, మార్కెట్ కమిటీ ద్వారా సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లులుకు అప్పగి స్తుంది. వారు ఆ ధాన్యాన్ని మర ఆడించి ప్రతీ క్వింటాకు రా రైస్ అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున ఎఫ్సీఐకి పంపుతారు. ఇక్కడే కొందరు రైస్మిల్లర్లు తమ చేతివాటం చూపుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యంలో కొంతభాగం ఇతర రాష్ట్రాలకు అంటే కనీస మద్దతు ధర అధికంగా ఉన్న రాష్ట్రాలకు తరలించి అక్కడ విక్రయిస్తారు. ఈలోపు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యంలో అక్రమమార్గంలో సేకరించిన పీడీఎస్ బి య్యాన్ని కలుపుతున్నారు. ఇదంతా తెలిసిన విషయమే. కానీ.. ఈ బియ్యాన్ని తొలుత మహారాష్ట్రకు తరలించి అక్కడ సీజ్ చేసిన బియ్యంగా రశీదులు సృష్టించి తిరిగి తెలంగాణకే తరలిస్తున్నారు. ఇది ఈ దందాలో పూర్తిగా కొత్తకోణం. ఈ మొత్తం వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. నిబంధనల ప్రకారం చేయాల్సిన మిల్లులో ధాన్యాన్ని ఆడించాలి. కానీ.. రెడీమేడ్గా అక్రమ మార్గంలో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని అందులో కలుపుతున్నారు. తద్వారా మిల్లులపై ఒత్తిడి లేకుండా కరెంటు, మ్యాన్ పవర్, రవాణా చార్జీలను ఆదా చేసుకుంటున్నారు. ఇందుకోసం దళారులను పెట్టి రూపాయి కిలో బియ్యం సేకరిస్తున్నారు. వీరు కొందరు యాచకులను చేరదీ స్తారు. వారితో ఇంటింటికీ తిరిగి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.7 నుంచి రూ.9 చొప్పున సేకరిస్తారు. వాటిని మధ్యవర్తులు, దళారుల నుంచి రూ.15లకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని సిరోంచా, గోండియా రైస్మిల్లర్లకు రూ.25 విక్రయిస్తారు. మహారాష్ట్రలో దొడ్డుబియ్యానికి డిమాండ్ ఉండడంతో.. అక్కడి మిల్లర్లు ఈ బియ్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి కిలో రూ.32 లేదా కొత్తగా ప్యాకింగ్ చేసి బహిరంగ మార్కెట్లో కిలో రూ.40కిపైగా విక్రయిస్తారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో ఏక్రూపాయ్వాలా దందాను నడిపించేది ఒకే వ్యక్తి కావడం గమనార్హం. ఉమ్మడి ఆదిలా బాద్లోని అర్జునగుట్ట, ప్రాణహిత నదుల మీదుగా మహారాష్ట్రకు, లేదా మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీదుగా మహారాష్ట్రకు మరోరూటులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న చెక్పోస్టులు, రెవెన్యూ, పోలీస్, ఫుడ్ఇన్స్పెక్టర్లు, పౌరసరఫరా ల శాఖలకు లక్షలాది చేతులు మారుతున్నాయి. కరోనా విజృంభించడం, చెక్పోస్టుల వద్ద నిఘా తీవ్రం కావడంతో స్థానిక రైస్ స్మగ్లర్లు రూటుమార్చారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిపోయిన పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్ర నుంచి తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలో సీజ్ చేసిన బియ్యంగా చూపించేందుకు నకిలీ రశీదులు సృష్టిస్తున్నారు. సోమవారం రాత్రి మంథని మండలంలో పోలీసులు పట్టుకున్న పీడీఎస్ రైస్ వాహనాలే ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలోని సిరోంచా, సరిహద్దు నుంచి వచ్చిన వీరి వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు 70 కి.మీ. దూరం ప్రయాణించాయి. ఈ మధ్యలో వారిని ఎవరూ అడ్డుకోకపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో యాచకుల నుంచి ఉన్నతా ధికారుల వరకు విస్తరించిన ఈ నెట్వర్క్కు కేంద్రం కరీంనగర్ కావడం గమనార్హం. కోట్లాది రూపాయల అక్రమ దందా చేస్తున్న ‘ఏక్రూపాయ్వాలా’ ఆటకట్టించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మా దృష్టికి రాలేదు ‘ఏక్రూపాయ్వాలా’కు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి దాడులు చేస్తున్నాం. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సురేశ్రెడ్డి, డీఎస్వో, కరీంనగర్ ఎవరినీ వదలం.. రేషన్ బియ్యం సమాచారం వస్తే ఎవరినైనా ఎక్కడైనా పట్టుకుంటాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్టుకొని అదనపు కలెక్టర్ పేసిలో కేసులు నడుస్తున్నాయి. పట్టుకున్న బియ్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వేలం వేస్తాం. – వెంకటేశ్, డీఎస్వో, పెద్దపల్లి చదవండి: Ranga Reddy: బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్నాడు -
2021–22లో ఆర్థిక వ్యవస్థ ‘వి’ షేప్ జోరు..
‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు.. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భరిస్తున్న ఆహార సబ్సిడీ బిల్లును తగ్గించుకోక తప్పని పరిస్థితి. పీడీఎస్ రేట్లను పెంచాల్సిందే. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించడం ద్వారా.. ఆరోగ్యం, వైద్యం కోసం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలంగా పురోగతి సాధిస్తుంది. 2021–22లో 11 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి’’ అంటూ 2020–21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటు ముందుంచారు. ఏటా బడ్జెట్కు ముందు విడుదల చేసే ఆర్థిక సర్వే ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంటుంది. న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని పేర్కొంది. కరోనా నివారణ వ్యాక్సిన్ల కార్యక్రమం ఇందుకు చేదోడుగా నిలుస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. వ్యవసాయ రంగం ఒక్కటీ ఆశాకిరణంగా కనిపిస్తోందంటూ.. సేవలు, తయారీ, నిర్మాణరంగాలు లాక్డౌన్లతో ఎక్కువగా ప్రభావితమైనట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. సంస్కరణలు, నియంత్రణల సరళీకరణ, మౌలిక రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగానికి ఊతమివ్వడం, వ్యాక్సిన్లతో విచక్షణారహిత వినియోగం పుంజుకోవడం, తక్కువ వడ్డీ రేట్లతో రుణాల లభ్యత పెరగడం వంటివి వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. 17 ఏళ్ల తర్వాత కరెంటు ఖాతా మిగులును చూపించబోతున్నట్టు తెలిపింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ద్రవ్యపరమైన చర్యలు చిన్నగానే ఉన్నాయి. కానీ, ఆర్థిక రికవరీకి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ద్రవ్యపరమైన ప్రోత్సాహక చర్యలను ప్రకటించేందుకు వెసులుబాటు ఉంది’’ అని సర్వే పేర్కొంది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. సాగు.. సంస్కరణల బాట వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉందని.. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ‘‘వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగాన్ని చూడాల్సిన అవసరం ఉంది’’ అని విశదీకరించింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ వ్యవసాయ రంగం తన బలాన్ని చాటుకుంటుందని పేర్కొంది. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనాతో నేలచూపులు చూసిన వేళ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయని తెలిపింది. రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగిందని వివరించింది. దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదంటూ.. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని పేర్కొంది. ‘‘నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. హైబ్రిడ్, ఇతర మెరుగుపరిచిన విత్తనాల వాడకం, భిన్నమైన వంగడాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విత్తన పరీక్షా కేంద్రాలను పెంచడం వంటివి తక్కువ ఉత్పాదకత ఆందోళనలను తగ్గిస్తుంది’’ అంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాగు రంగం విషయమై సర్వే తన విస్తృతాభిప్రాయాలను తెలియజేసింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామస్థాయి కొనుగోళ్ల కేంద్రాలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి, ఏపీఎమ్సీ మార్కెట్లకు బయట విక్రయించుకునే అవకాశం, గోదాముల నవీకరణ, రైల్వే రవాణా సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలియజేసింది. ఈ చర్యలు ఉత్పత్తి అనంతరం నష్టాలను తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా సాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది. మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయని సూచిస్తూ.. ఇందుకోసం గ్రామీణ వ్యవసాయ పాఠశాలల ఏర్పాటును ప్రస్తావించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు స్వేచ్ఛ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో బలంగా సమర్థించుకుంది. నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దీర్ఘకాలంలో మెరుగుపరుస్తాయని తెలిపింది. మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు వివరించింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై తన వాదనను సమర్థించుకుంది. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీల (ఏపీఎమ్సీ) విషయంలో సంస్కరణల అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది. మౌలిక రంగానికి ప్రాముఖ్యత.. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైనదిగా పేర్కొంది. అన్లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగాలు వృద్ధి దిశగా పయనిస్తున్నాయంటూ, రోడ్ల నిర్మాణం తిరిగి కరోనా ముందు నాటి వేగాన్ని సంతరించుకుంటుందని అంచనా వేసింది. సంక్షోభానంతర సంవత్సరంలో (2021–22) క్రమబద్ధమైన చర్యల ద్వారా ఆర్థిక రికవరీకి వీలు కల్పించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక వృద్ధి క్రమంలోకి కుదురుకునేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. ఇన్ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు.. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసినట్టు తెలియజేసింది. ‘రేషన్’ రేట్లను పెంచాల్సిందే ఆహార సబ్సిడీ నిర్వహించలేని స్థితికి చేరిందంటూ స బ్సిడీలను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఉందంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పెంచాలంటూ సూచించింది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించడం గమనార్హం. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ప్రజారోగ్యం కోసం జీడీపీలో కేటాయింపులను ఒక శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సర్వే ముఖ్యమైన సూచన చేసింది. దీనివల్ల ప్రజలు తమ జేబుల నుంచి చేసే ఖర్చును తగ్గించడం సాధ్యపడుతుందని తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. అది ప్రస్తుతమున్న ఖర్చులు 65 శాతం నుంచి 30 శాతానికి తగ్గేందుకు తోడ్పడుతుందని వివరించింది. లాక్డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడిందని సర్వే పేర్కొంది. సంక్షోభాలను తట్టుకునేవిధంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సర్వే సూచించింది. గ్రామీణ విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల జోరు గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగినట్టు ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చని సూచించింది. ‘‘డేటా నెట్వర్క్, కంప్యూటర్, ల్యాప్ట్యాప్, స్మార్ట్ఫోన్ల సేవలకు ప్రాధాన్యం పెరిగింది. డిస్టెన్స్ లెర్నింగ్, గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసే అవకాశం ఇందుకు కారణం’’ అని సర్వే తెలిపింది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను ఇందులో ప్రస్తావించింది. దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది వృద్ధి రుణ స్థిరత్వానికి దారితీస్తుంది. ఒకవేళ భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2023–2029 మధ్య 3.8% కనిష్ట రేటు నమోదైనా కానీ, దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది. భారత్ తప్పకుండా వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో మరింత మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యపడుతుంది. వృద్ధి 85% పేదరికాన్ని తగ్గించగలదు. జీడీపీలో ప్రజారోగ్యంపై ఖర్చును 2.5%కి పెంచితే.. అది ఒక సాధారణ కుటుంబం ఆరోగ్యం కోసం చేసే ఖర్చును 65% నుంచి 35%కి తగ్గిస్తుంది. – కేవీ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వంద సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే సంక్షోభంగా ఆర్థిక సర్వే అభివర్ణించింది. ► ప్రభుత్వ వినియోగం, ఎగుమతులు వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020–21 ద్వితీయార్ధంలో ఎగుమతులు 5.8% తగ్గొచ్చు. దిగుమతులు సైతం 11.3 శాతం తగ్గొచ్చు. ► 2020–21లో కరెంటు ఖాతాలో 2% మిగులు. ► రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు. ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ► 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా రోజువారీ 22 కిలోమీటర్లకు పడిపోయింది. అన్లాక్తో తిరిగి ఇది పుంజుకోనుంది. ► కరోనా మహమ్మారి సవాళ్లలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదని నిరూపించింది. ► 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ► రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ► కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంతరించుకున్న వెంటనే వీటిని ఉపసంహరించుకోవడంతోపాటు, ఆస్తుల నాణ్యత మదింపు చేపట్టాలి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఇప్పటికీ స్వర్గధామం. 2020 నవంబర్లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 9.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్పీఐలను ఆకర్షించింది భారత్ ఒక్కటే. ► భారత కంపెనీలు 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.92,000 కోట్లను సమీకరించాయి. ఇది అంతక్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం. ► 9–12 తరగతుల విద్యార్థులకు దశల వారీగా వొకేషనల్ కోర్సులు. ► సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ► కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్–జేఏవై)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి, శిశు, చిన్నారుల మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతోంది. ► పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్టం చేయాలి. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థ. ► ఐటీ–బీపీఎమ్ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ విస్తరణ ఎంతో వేగాన్ని సంతరించుకుంది. డేటా వ్యయం తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. నెలవారీ సగటున ఒక చందాదారు వైర్లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది. ► ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చూసేందుకు ఆహారోత్పత్తులకు ఉన్న వెయిటేజీలో మార్పులు చేయాలి. కోవిడ్–19 మహమ్మారిపరమైన గడ్డుకాలం గట్టెక్కామని, ఎకానమీ తిరిగి వేగంగా కోలుకుంటుందన్న ఆశాభావం సర్వేలో వ్యక్తమైంది. టీకాల లభ్యత, సేవల రంగం రికవరీ వంటి అంశాలు వృద్ధికి మరింతగా ఊతమివ్వగలవు. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఎకానమీ ప్రస్తుత అవసరాలకు తోడ్పడే పలు కీలక అంశాలను సర్వేలో పొందుపర్చారు. రాబోయే బడ్జెట్లోనూ ఇవి ప్రతిఫలించగలవని ఆశిస్తున్నాం. మరిన్ని రంగాలు పటిష్టమైన వృద్ధి బాట పట్టాలంటే 2021 ఆసాంతం ప్రభుత్వం నుంచి నిరంతరం సహాయ, సహకారాలు అవసరం. – ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్, ఫిక్కీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలతో సర్వే ఆశావహ దృక్పథంతో రూపొందింది. కోవిడ్–19 వైరస్ను కట్టడి చేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించగలిగితే 2021–22లో మరింత అధిక స్థాయిలోనూ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉంది. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
కోడ్ పేరిట పేదల పథకానికి బ్రేక్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సబ్సిడీ సరుకులను ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రమంతటా పేదల గడప వద్దకే వెళ్లి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పంచాయతీ ఎన్నికల కోడ్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అడ్డు చెప్పారు. గ్రామాల్లో ఈ పథకం కింద మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీ ఎన్నికల దృష్ట్యా నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం లేఖ రాశారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేసుకోవచ్చని లేఖలో స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం, ఇందులో భాగంగానే ఈ నెల 21న మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 9,260 వాహనాలు ముందుకు కదలడంతో ఇక రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూసే పని ఉండబోదని, ఇంటి వద్దే బియ్యం, ఇతర సబ్సిడీ సరుకులు అందుతాయని, తద్వారా ఫిబ్రవరి నుంచి తమ కష్టాలు తీరతాయని భావించిన పేదలకు ఎన్నికల కమిషనర్ ఆదేశం శరాఘాతమైంది. వాస్తవానికి ఈ పథకం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైనుంచే అమలవుతోంది. అందువల్ల ఈ పథకాన్ని ఇప్పటికే కొనసాగుతున్నదిగా భావించి పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరినా ఎస్ఈసీ పట్టించుకోకపోవడం గమనార్హం. కేవలం పట్టణాల్లో మాత్రమే ఈ పథకాన్ని కొనసాగించుకోవచ్చని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఏజీ అభిప్రాయం కోరాలని నిర్ణయం.. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు నాణ్యమైన బియ్యంతోపాటు మొబైల్ వాహనాలు వెళ్లాయి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎస్ఈసీ నిలిపివేయడం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇదే విషయమై అడ్వొకేట్ జనరల్తో చర్చించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. అంతిమంగా అడ్వొకేట్ జనరల్ సూచన మేరకు పథకం అమలుపై ముందుకెళ్లాలా.. వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
ఏపీలో సరికొత్త చరిత్ర.. ఇక ఇంటికే బియ్యం
సాక్షి, అమరావతి: పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను నాడు పాదయాత్ర సమయంలో స్వయంగా గుర్తించిన సీఎం జగన్ ఇంటివద్దే వాటిని అందచేస్తామని మాట ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను గురువారం ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను అదే రోజు మంత్రులు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. వాహనాల ఆపరేటర్లతో పాటు నోడల్ వీఆర్వోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం రంగు మారి ఉండటం, నూకల శాతం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తినేందుకు వీలుగా నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లింగ్ సమయంలోనే నూకలు శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు సమయ పాలన పాటించకపోవడం, సక్రమంగా అందకపోవడం, నల్లబజారుకు తరలించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే పేదలు సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మొబైల్ వాహనం ద్వారా ఇంటివద్దే నాణ్యమైన బియ్యం అందించే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది. బుధవారం రాత్రి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బారులు తీరిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలు 22, 23న వాహనదారులకు శిక్షణ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియాన్ని ఇంటివద్దే పంపిణీ చేస్తారు. మొబైల్ ఆపరేటర్ (వాహనదారుడు) రోజూ ఉదయం బియ్యంతో పాటు ఈ–పాస్ యంత్రాన్ని రేషన్ డీలర్ నుంచి తీసుకోవాలి. ఆఖరులో మిగిలిన స్టాకుతో పాటు ఈ–పాస్ యంత్రాన్ని తిరిగి డీలర్కు అప్పగించాలి. ఆపరేటర్ రోజూ ఈ–పాస్ మిషన్లో తన హాజరును నమోదు చేసుకోవాలి. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీపై ఈ నెల 22, 23 తేదీల్లో మొబైల్ ఆపరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వాహనం వినియోగం, తూకం యంత్రం, డోర్ డెలివరీ తదితరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నెల 24 నుంచి 29 వరకు వాహన ఆపరేటర్లు, నోడల్ వీఆర్వోలు ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. క్లస్టర్ పరిధిలోని రేషన్ డీలర్లు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి పరిచయం చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి.. బియ్యం, నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రివర్స్ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000 కాగా రూ.3,48,600 సబ్సిడీగా అందించింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది. ఏ వర్గాలకు ఎన్ని వాహనాలు? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300 బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800 మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా 660 ఈబీ కార్పొరేషన్ ద్వారా 1,800 మొబైల్ వాహనంలో వసతులు ఇలా మొబైల్ వాహనంలో తూకం వేసే యంత్రం (వేయింగ్ స్కేల్), కొలతల పరికరాలు ఉంటాయి. ఎల్ఈడీ ల్యాంప్స్, ఈ–పాస్ యంత్రాల ఛార్జింగ్ పాయింట్లు, మినీ ఫ్యాన్, చిన్న మైక్ ఉంటుంది. ప్రథమ చికిత్స బాక్సు, నగదు పెట్టె, అగ్ని మాపక యంత్రం, నోటీసు బోర్డు ఏర్పాటు చే శారు. తూకం యంత్రం 12 నుంచి 18 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. రేషన్ సరఫరాలో పాత విధానం ఇదీ – రేషన్ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి రావడంతో రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయే వారు. – సరుకుల పరిమాణం, పంపిణీలో కోతలపై పలు ఫిర్యాదులు అందేవి. రేషన్ సరుకుల్లో కొత్త విధానం ఇలా... – కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్ సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. – కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి కచ్చితమైన ఎలక్ట్రానిక్ తూకంతో పంపిణీ చేస్తారు. – వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే కార్డుదారుల వేలిముద్ర తీసుకుని నాణ్యమైన, కచ్చితమైన తూకం కలిగిన బియ్యాన్ని తిరిగి వినియోగించే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. – కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకూ సీల్ ఉంటుంది, ప్రతి సంచికీ యూనిక్ కోడ్ వల్ల ఆన్లైన్ ట్రాకింగ్ జరుగుతుంది. అన్ని మొబైల్ వాహనాలకు జీపీఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్ యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్ టైంలో తెలుసుకోవచ్చు. మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా కచ్ఛితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు. సచివాలయాల ద్వారా బియ్యం కార్డుల సేవల వివరాలు (2020 జూన్ నుంచి ఇప్పటివరకు) కొత్త బియ్యం కార్డులు 4,93, 422 కొత్త బియ్యం కార్డులలో సభ్యులను చేర్చడం 17,07,928 కొత్త బియ్యం కార్డులను విభజించడం 4,38,013 మొత్తం సేవలు 26,39,363 -
పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ సౌకర్యంతో లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉచిత సరుకులు పొందుతున్నారు. ఉపాధి నిమిత్తం పనుల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలకు పోర్టబులిటీ సౌకర్యం ఆదుకుంటోంది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు లభించింది. పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి కూడా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ, కర్ణాటకల్లోనూ అంతర్రాష్ట్ర పోర్టబులిటీని అమల్లోకి తెచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడే నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి నెలకు రెండు విడతల చొప్పున ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.51 కోట్ల కార్డుదారులుంటే ఇప్పటికి 1.13 కోట్ల కుటుంబాలు ఉచిత సరుకులు అందుకున్నాయి. ఈ నెలలో పంపిణీ ప్రారంభమైన వారంలోనే(శనివారం నాటికి) 34 లక్షలకు పైగా కుటుంబాలు పోర్టబులిటీతో లబ్ధిపొందారు. 13వ విడతలో సరుకులు తీసుకున్న, పోర్టబులిటీతో లబ్ధి పొందిన కుటుంబాల వివరాలు (జిల్లాల వారీగా): జిల్లా సరుకులు తీసుకున్న కుటుంబాలు పోర్టబులిటీతో..లబ్ధి పొందిన కుటుంబాలు అనంతపురం 10,57,690 2,56,362 చిత్తూరు 9,59,828 1,71,568 తూ.గోదావరి 13,14,140 4,22,821 గుంటూరు 11,39,290 4,68,253 కృష్ణా 9,84,295 3,74,443 కర్నూలు 9,80,230 3,49,778 ప్రకాశం 7,89,353 2,02,858 శ్రీకాకుళం 1,97,250 1,595 నెల్లూరు 6,47,311 1,76,644 విశాఖపట్నం 10,53,722 3,75,345 విజయనగరం 6,02,782 92,375 ప. గోదావరి 9,91,955 3,29,270 వైఎస్సార్ కడప 6,78,163 1,83,813 మొత్తం 1,13,96,009 34,05,125 -
తెలంగాణలో ఉన్నా రేషన్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలోనే ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని అంతర్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం మన రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వెళ్లిన పేదలకు అంతర్ రాష్ట్ర పోర్టబిలిటీ ఎంతో ప్రయోజనం కల్గిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా అమలైతే దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ కార్డులున్న 349 మంది తెలంగాణలో బియ్యంతో పాటు ఇతర సరుకులు తీసుకున్నారు. తొలి రోజు 9.76 లక్షల మందికి.. ► రాష్ట్రంలో 12వ విడత ఉచిత సరుకులు పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మొదటి రోజున 9.76 లక్షల మంది ఉచిత సరుకులు పొందారు. ► అంతర్ జిల్లాల పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మంది బియ్యంతో పాటు శనగలు ఉచితంగా తీసుకున్నారు. ► ఈ విడతలో 1,50,80,690 బియ్యం కార్డుదారులకు ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున శనగలు కేటాయించారు. -
రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆహార ఇబ్బందులు తప్పాయి. రబీలో ఆశించిన మేరకు ధాన్యం దిగుబడి రావడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ సవ్యంగా సాగింది. రబీలో రికార్డు స్థాయిలో 31.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. కరోనా కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలకు రెండు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ► రాష్ట్రంలో ప్రస్తుతం 1,49,20,706 కార్డులు ఉన్నాయి. వీటిలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోనివి 89 లక్షలకు పైగా, ఆ చట్టం పరిధిలోకి రానివి 60 లక్షల వరకు ఉన్నాయి. ► ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారులకే కేంద్రం బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. ► ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని కార్డుదారులకు పంపిణీతో రాష్ట్రంపై రూ.800 కోట్లు అదనపు భారం పడింది. ► జూలై నుంచి నవంబర్ వరకు ఉచితంగా బియ్యం ఇస్తామని కేంద్రం ప్రకటనతో రాష్ట్రంపై మరో రూ.1,663 కోట్ల అదనపు భారం పడనుంది. ► ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండాల్సిన బఫర్ స్టాకూ వాడేశారు. కనీసం 15.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించనేలేదు. రబీ ధాన్యమే ఆదుకుంది... నెలకు రెండు సార్లు పంపిణీతో ఆఖరు బఫర్ స్టాకునూ వాడుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అదనంగా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశాం. రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యమే ప్రస్తుతం ఆదుకుంటోంది. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లు
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యాన్ని పేదల ఇళ్లకే డెలివరీ చేసేందుకు రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,93,488 క్లస్టర్లున్నాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో 50 నుంచి 75 కుటుంబాలుండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసేందుకు, అవినీతికి తావులేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో క్లస్టర్లో ఒక్కో గ్రామ వలంటీర్ సేవలందిస్తారు. వలంటీర్లు బియ్యం కార్డుల మ్యాపింగ్ను దాదాపుగా పూర్తిచేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన శ్రీకాకుళం జిల్లాలో లబ్ధిదారులు గడప దాటకుండానే సరుకులు సకాలంలో వారి ఇంటికే చేరుతున్నాయి. ఈ విధానం మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ► క్లస్టర్ పరిధిలో ఉన్న కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఎదుటే నాణ్యమైన బియ్యం తూకం వేసి పంపిణీ చేస్తారు. ► ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 13,370 మొబైల్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ► ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అయ్యే అదనపు ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ► ఈ విధానం అందుబాటులోకొస్తే 1.49 కోట్ల కార్డుదారులందరికీ రెండు మూడు రోజుల్లోనే సరుకులందుతాయి. ► రవాణాలో బియ్యం కల్తీ చేయకుండా గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపైనా ప్రత్యేకంగా స్ట్రిప్ సీల్, బార్ కోడ్ ఉంటాయి. ► క్లస్టర్ల వివరాలను గ్రామ సచివాలయాల నుంచి తీసుకుని, వాటి ఆధారంగా బియ్యం కార్డులను కేటాయిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు. -
31,53,524 మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: రబీ సీజన్(2019–20)లో 2,15,150 మంది రైతుల నుంచి రూ.5,744.96 కోట్ల విలువ చేసే 31,53,524.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా వారికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,437 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా క్వింటాలు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,835, సాధారణ ధాన్యానికి 1,815 చొప్పున మద్దతు ధర నిర్ణయించింది. ► స్వయం సహాయక గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. ► ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉందని గుర్తించి ఆ మేరకు సేకరించిన ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎమ్మార్) కోసం మిల్లులకు పంపుతారు. ధాన్యం మిల్లులకు చేరిన 15 రోజుల్లోగా మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. ► బియ్యం కొరత ఉన్న జిల్లాలకు మిగులు ఉన్న జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ► సేకరించిన ధాన్యానికి మొత్తం రూ.5,744.96కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.4,514.66 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
వేలి ముద్రలు పడకపోయినా రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి ష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాధారణంగా ఈ–పాస్ మిషన్లో వేలి ముద్రలు వేస్తేనే సరుకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, లెప్రసీ (కుష్టు వ్యాధి) బాధితులు, తాపీ పని చేసే కార్మికులు, రజకులు (ఇస్త్రీ చేయడం) తదితర వృత్తులు చేసే వారికి వేలిముద్రలు అరిగిపోయి యంత్రాల్లో పడటం లేదు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సరుకులు తీసుకోవడానికి వారు ప్రతి నెలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ‘నామినీ’ (బంధువుల) ద్వారా బయోమెట్రిక్ తీసుకొని సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐరిష్ యంత్రాల్లో సమస్య వేలి ముద్రలు సరిగా పడని వారికోసం ఐరిష్ మిషన్లు అందుబాటులో ఉంచినా, పలు కారణాలతో అవి సరిగా పనిచేయడంలేదు. పేదలెవరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నామినీ ద్వారా సమీప బంధువుల బయోమెట్రిక్ తీసుకొని లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తోంది. బంధువులు అందుబాటులో లేని పక్షంలో వీఆర్వో లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దే సబ్సిడీ సరుకుల పంపిణీ వేలిముద్రలు, ఐరిష్ యంత్రాల సమస్య వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దే సబ్సిడీ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిం ది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. వేలి ముద్రలు సరిగా పడకపోవడం తదితర కారణాలతో నామినీ వేలిముద్రల సాయంతో ఈనెలలో 35,282 మంది లబ్ధిదారులు ఉచిత సరుకులు తీసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేలిముద్రల సమస్యను పరిష్కరించి నామినీ విధానంలో రేషన్ సరుకులు అందిస్తుండడంపై పేద లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కార్డు లేని వారికీ రేషన్
న్యూఢిల్లీ: రేషన్ కార్డు లేని వారికి సైతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే నిత్యావసరాలను సరఫరా చేసే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డు అయినా యావత్ దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇది విధానపరమైన విషయమనీ, భారత ప్రభుత్వం ఇటువంటి సౌకర్యాన్ని కల్పించడానికి పూనుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ‘సెంట్రల్ విస్టా’పై స్టేకు నో సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్, కేంద్రప్రభుత్వ కార్యాలయాల కొత్త భవనాల ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ‘కోవిడ్ సంక్షోభ సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు’అంటూ వ్యాఖ్యానించింది. -
పకడ్బందీగా ‘పంపిణీ’ వ్యవస్థను అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యతని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం కావాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యం ఇవ్వాలనే నిర్ణయం అభినంద నీయమని, అయితే పంపిణీలో సమస్యలు ఎదురుకావడం సరి కాదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షాపుల ఎదుట భారీ క్యూలు ఉండటం, భౌతిక దూరం పాటించకపోవడం దుష్పరిణామాలకు దారితీయకూడదని అభిప్రాయపడ్డారు. -
కోవిడ్ ఎఫెక్ట్: 6 నెలల రేషన్ ఒకేసారి
న్యూఢిల్లీ: వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద ఉన్న 75 కోట్ల లబ్ధిదారులు 6 నెలల రేషన్ సరుకులను ఒకేసారి తీసుకోవచ్చని కేంద్ర మంత్రి పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు గరిష్టంగా 2 నెలల వరకు రేషన్ సరుకులను తీసుకునేందుకు అవకాశం ఉండగా.. పంజాబ్ ఇప్పటికే ఆరు నెలల సరుకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ‘గోదాముల్లో సరిపడా సరుకులున్నాయి. పేద వారికి ఆరు నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించాం’అని పాశ్వాన్ చెప్పారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 435 లక్షల టన్నుల మిగులు ఆహార ధాన్యాలున్నాయని, అందులో 272.19 లక్షల టన్నుల బియ్యం, 162.79 లక్షల టన్నుల గోధుమలున్నాయని పేర్కొన్నారు. -
ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీకి 2.68 లక్షల క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి 2.68 లక్షల క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులను వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానాన్ని ఇప్పటికే దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 50 నుంచి 60 కుటుంబాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి పరిధిలో రేషన్ సరుకుల సరఫరా కోసం అవసరమైన వాహనాలను వలంటీర్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటింటికీ సరుకుల పంపిణీ ప్రక్రియ ఆర్థిక భారంతో కూడుకున్నప్పటికీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వలంటీర్లు తమకు కేటాయించిన రేషన్ కార్డులను మ్యాపింగ్ చేసుకోవాలి. రహదారి సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనుల ఇళ్లకు సైతం వెళ్లి సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అదనంగా అయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల లబ్ధిదారులు సబ్సిడీ సరుకులు సక్రమంగా తీసుకునేవారు కాదు. రేషన్ దుకాణాలకు రావడానికి సరైన రహదారులు లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రతి నెలా ఒకటి లేదా రెండో తారీఖుల్లో గిరిజనుల ఇళ్ల వద్దే బియ్యంతో పాటు ఇతర సరుకులు అందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కల్తీ లేని సరుకులు, కూరగాయలు - సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థను మహిళా సంఘాలతో అనుసంధానం చేసి బియ్యంతో పాటుగా ఇతర సరకులు, కూరగాయల్ని కల్తీ లేని పద్ధతుల్లో అందించే దానిపై మేథో మధనం చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. అసెంబ్లీలో బుధవారం పలు పద్దులపై చర్చ ముగింపు సందర్భంగా సీఎం మాట్లాడారు. రేషన్ డీలర్ల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని, రెండుమూడు నెలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. డీలర్ల కమిషన్ పెంచా లని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. విదేశాలలో అధ్యయనం... డీలర్ల వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మహిళా సంఘాలను కూడా క్రియాశీలకంగా మార్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకు రావాల్సి ఉందని సీఎం తెలి పారు. మంత్రులు, కొందరు శాసన సభ్యులు, ఉన్నతాధికా రులతో ఏర్పాటైన బృందం ఐదారు దేశాలు తిరిగి అధ్యయనం చేయాలన్నారు. ఏది కొందామన్నా బజారులో కల్తీయేనని, మిరప పొడిలో రంపం పొట్టు కలుపుతున్నారన్నారు. ప్రజలకు నాణ్యమైన సరుకులు అందాలంటే కొత్త విధానానికి రూపకల్పన చేయాలన్నారు. ఒక వేదిక ఏర్పాటు చేయాల్సి ఉందని ఇది కొత్తగానే ఉంటుం దన్నారు. ఉన్న డీలర్ వ్యవస్థను పటిష్టం చేసుకో వాలని, ఖాళీలను భర్తీ చేసుకోవడంతో పాటు వాళ్ల కమిషన్ కూడా పెంచాల్సి ఉందన్నా రు. మహిళా సంఘాలకు చిన్న చిన్న యూనిట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆలు పండే చోట చిప్స్ తయారీ చేయడం, పెరుగు తయారు చేసి అమ్మడం వంటి వి చేయాలన్నారు. అమూల్ చిన్న సంస్థ పెద్దగా అయిందని, విజయ డెయిరీని కొందరు దుర్మా ర్గులు చెడగొట్టారని సీఎం విమర్శించారు. బాంబే మార్కెట్లో విజయ నెయ్యికి డిమాండ్ ఇప్పటికీ ఉందన్నారు. డీలర్ల వ్యవస్థను, మహిళా సంఘాల ద్వారా చేసే తయారీ పద్ధతులను అనుసంధా నించేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. క్రియాశీలకంగా రైతు సమితి... త్వరలో వ్యవసాయ మంత్రి నేతృత్వంలో రైతు సమన్వయ సమితులను వంద శాతం క్రియాశీలకం చేస్తామన్నారు. రైతు సమితి సభ్యులు సంపూర్ణమైన పాత్ర వహించే దిశకు తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా పండేది వరి, మొక్కజొన్న, పత్తి పంటలేనని, మిగతావి చిన్న విస్తీర్ణ పంటలేనన్నారు. వరి విస్తీర్ణం పెరుగుతోందని, ధాన్యం సేకరణ చాలెంజింగ్ టాస్క్ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని, అకున్ సబర్వాల్ బాగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రధానాహారం అన్నమేనని, రొట్టె తినేవారు కూడా అన్నం తింటారన్నారు. 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇక్కడే వినియోగం అవుతుం దన్నారు. పౌరసరఫరాల మంత్రి చెప్పినట్లు ఇంకో 25 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వస్తుందన్నారు. అంత మొత్తం కొనేందుకు సిద్ధంగా ఉంటున్నామని చెప్పారని, ఈ క్రమంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. మిర్చి కొన్నిసార్లు సమస్యను సృష్టిస్తుందన్నారు. మార్కెట్కు ఒకేసారి రావడం, నియంత్రణ లేకపోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అక్టోబర్ 15 తర్వాత తనతో పాటు జిల్లాల వారీగా మంత్రులు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలో ఆలోచిస్తామన్నారు. త్వరలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకుని దీనిపై చర్చిస్తామన్నారు. కొందరు దుర్మార్గులు పాలు కూడా కల్తీ చేయడం బాధేస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పసిపిల్లలు తాగే పాలు కల్తీ చేసి సింథటిక్ మిల్క్ అమ్ముతున్నారని, ఇది చాలా దుర్మార్గమన్నారు. పీడీఎస్ వ్యవస్థ బలోపేతంతోనే ఇలాంటి వాటికి చరమగీతం పాడొచ్చన్నారు. -
పీడీఎస్కు 1.20 లక్షల టన్నులబియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అదనపు అవసరాల కోసం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యాన్ని రాష్ట్రం లోని బియ్యం మిల్లుల యజమానుల నుంచి కొనుగోలు చేయాలని పౌర సరఫరాలశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నెల నుంచి సేకరణ మొదలు పెట్టి జూలై నాటికి పూర్తిగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బియ్యం సేకరణకు సంబంధించి గురువారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ కొన్ని సూచనలతో ఉత్తర్వులు జారీ చేశారు. మిల్లర్లు తమ సంచుల్లోనే గ్రేడ్–1 ముడి బియ్యాన్ని క్వింటాలుకు రూ.2,640 చొప్పున సరఫరా చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మాత్రమే బియ్యం రూపంలో సరఫరా చేయాలి తప్పితే ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని స్టేట్పూల్ కింద చూపితే చర్య లు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించే రైసు మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు భవిష్యత్తులో స్టేట్ పూల్, సన్నబియ్యం కస్టమ్ మిల్లింగులో కేటాయింపులను నిలిపివేస్తారు. పౌర సరఫరాల శాఖకు సరఫరా చేసే బియ్యం సంచులపై ‘స్టేట్ పూల్ రైస్’అని ముద్రించడంతోపాటు రైసుమిల్లరు పేరు, చిరునామా, స్టాక్ వివరాలు నమోదు చేయాలి. బియ్యం సేకరణ త్వర గా జరిగేలా కలెక్టర్లు రైసు మిల్లర్లు, పౌర సరఫరాల సంస్థ, కార్పొరేషన్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. 2017 అక్టోబర్ తర్వాత 6ఏ కేసులు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న మిల్లర్ల నుంచి స్టేట్పూల్ బియ్యం సేకరించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీ నిర్ణయం మేరకు.. 2018–19 ఖరీఫ్ సీజన్లో స్టేట్పూల్ కింద 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయిం చింది. దీనిలో భాగంగా గ్రేడ్–1 ముడి బియ్యాన్ని క్వింటాలుకు రూ.2,841 చొప్పున సరఫరా చేసేందుకు మిల్లర్లు అంగీకరించారు. ఈ–టెండర్ల ద్వారా ఎక్కువ ధరను టెండరుదారు కోరుతుండటంతో ఎఫ్సీఐ ద్వారా 0.30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించినా, కేంద్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో పీడీఎస్ కింద ఏడు నెలలపాటు సరఫరా చేయాల్సిన 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యాన్ని రాష్ట్ర మిల్లర్ల నుంచే సేకరించా లని నిర్ణయించి డీజీఎం(పీడీఎస్), డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)తో కమిటీ ఏర్పాటు చేశారు. మే 3న కమిటీ సంప్రదింపులతో క్వింటాలు బియ్యా న్ని రూ.2,640 చొప్పున సరఫరా చేసేందుకు మిల్లర్లు అంగీకరించారు. -
మార్క్ఫెడ్కు కందుల బెడద
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), ఇతర సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన కంది పప్పును తక్కువ ధరకు అందజేస్తామన్న మార్క్ఫెడ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. పీడీఎస్ ద్వారా కంది పప్పు సరఫరా చేయడంలేదని, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు తీసుకునేది లేదని చేతెలెత్తేసింది. దీంతో గోదాముల వారీగా 25 గిడ్డంగుల్లో ఉన్న నిల్వలను విక్రయించాలని నిర్ణయించారు.రైతుల నుంచి క్వింటాకు రూ. 5,450కు కొనుగోలు చేయగా, రూ. 3,450కే అమ్మడానికి సిద్ధమయ్యారు. అంటే రూ. 2 వేల నష్టానికి విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పేరుకుపోయిన 11.29 లక్షల క్వింటాళ్లు 2017–18లో రైతుల నుంచి క్వింటాకు రూ. 5,450 కనీస మద్దతు ధరతో మార్క్ఫెడ్ కందులు కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద 11.29 లక్షల క్వింటాళ్ల నిల్వలున్నాయి. వాటిని ఇప్పుడు విక్రయించాలంటే క్వింటాలుకు రూ. 3,450కు మించి కొనడానికి వ్యాపారులు ముందుకు రావడంలేదు. త్వరలో ఈ ఖరీఫ్లో పండే కందులూ మార్కెట్లోకి రానున్నాయి. వాటిని కూడా మార్క్ఫెడ్ కొనుగోలు చేయాలి. కందులను పప్పు చేసి కిలో రూ. 50 వంతున పేదలకు, ఇతర వినియోగదారులకు అందజేస్తామని నిర్ణయించింది. ఒక కేజీ, ఐదు కేజీలు, పది కేజీలు, 25 కేజీల బ్యాగుల్లో ప్యాక్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై సర్కారు నో అనడంతో మళ్లీ నష్టానికే టెండర్లు పిలిచి అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రేషన్ సరుకుల్ని డోర్ డెలివరీ చేయండి
న్యూఢిల్లీ: దేశంలో ఆకలి చావులను అరికట్టేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు రేషన్ సరుకుల్ని లబ్ధిదారుల ఇంటికి చేరవేయాలని కేంద్రం కోరింది. అలాగే వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకుల్ని తీసుకెళ్లని వారిపై దృష్టి సారించాలని సూచించింది. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడంపై పాశ్వాన్ అధ్యక్షతన శుక్రవారం నాడిక్కడ జరిగిన సమావేశానికి 15 రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పాశ్వాన్ మీడియాతో మాట్లాడారు. ‘వైకల్యం, ముసలితనం కారణంగా రేషన్షాపుకు లబ్ధిదారులు రాలేని సందర్భాల్లో రాష్ట్రాలు వారి ఇంటికి రేషన్ సరుకుల్ని చేరవేయాలి’ అని తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టతలోభాగంగా ఆన్లైన్లో ఫిర్యాదుచేసే సదుపాయం, టోల్ఫ్రీ హెల్ప్లైన్లు వంటి సంస్కరణలను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. -
పీడీఎస్ ద్వారా తృణధాన్యాలు
సాక్షి, న్యూఢిల్లీ : పేదలందరికీ పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో త్వరలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా తృణధాన్యాలనూ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. పీడీఎస్ ద్వారా ప్రస్తుతం వరి, గోధుమలు సరఫరా చేస్తున్నారు. అయితే వీటికన్నా చౌకగా, పోషకాల పరంగా మెరుగైన తృణధాన్యాలనూ చౌకధరల దుకాణాల్లో పేదలకు సరఫరా చేయాలని కేంద్రం భావిస్తోంది. సాధారణ ఎన్నికల్లోగానే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పీడీఎస్ ద్వారా మిల్లెట్స్ను పంపిణీ చేస్తుండగా, దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పీడీఎస్ ద్వారా అందించే సరుకుల్లో మిల్లెట్స్ను చేర్చాలని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ త్వరలో కేంద్రానికి సిఫార్సు చేయనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీతిఆయోగ్ కమిటీ ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపిందని మరో రెండు వారాల్లో దీనిపై స్పష్టమైన సిఫార్సు చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు త్వరలో రాగి, జొన్న, కొర్రలు వంటి తృణధాన్యాలను పీడీఎస్ ద్వారా పంపిణీ చేస్తారు. -
ఊరట
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కొత్త రేషన్కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏడాదికాలంగా ఎదురు చూస్తున్న ఆహారభద్రతా కార్డులను పరిశీలించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 20,787 మందికి ఊరట కలుగనుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఈ–పాస్ పద్ధతి ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో అవరోధాలు రాకుండా కొత్త రేషన్కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం తీసుకునే నాటికి అంటే 2017 మే నెల వరకు 20,787 దరఖాస్తులు మీ–సేవ ద్వారా యంత్రాంగానికి చేరాయి. అప్పటి నుంచి కార్డుల కోసం వేచిచూస్తున్న అర్జీదారులకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఆశలు రేకెత్తిస్తోంది. పెండింగ్లో ఉన్న అర్జీలను పరిశీలించి పక్షం రోజుల్లో ఆమోదముద్ర వేయాలని ఆదేశించింది. దరఖాస్తుదారు వ్యక్తిగత సమాచారం, బీపీఎల్ కుటుంబమా కాదా? ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, వ్యవసాయ భూమి తదితర వివరాలతో కూడిన చెక్స్లిప్ను పంపింది. దీనికి అనుగుణంగా ధ్రువీకరిస్తే కొత్త కార్డులను జారీచేయాలని నిర్దేశించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకే తెల్ల రేషన్కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఆరోగ్యశ్రీ, రెండు పడక గదుల ఇల్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాల అమలులో ఈ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్న కారణంగా ప్రతి వ్యక్తి ఆహారభద్రతాకార్డు కోసం దరఖాస్తు చేయడం అలవాటుగా మారింది. దీంతోనే ఇబ్బడిముబ్బడిగా అర్జీలు వచ్చాయని యంత్రాంగం అంటోంది. రేషన్కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయనే అభిప్రాయం తప్పని, కేవలం రేషన్ సరుకులు మాత్రమే ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసినా పెద్దగా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయని తెలుస్తోంది. కొత్తవాటి సంగతేంటి? గత ఏడాది మే వరకు పెండింగ్లో ఉన్న వాటికే మోక్షం కలిగించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత వచ్చిన సుమారు 10వేల దరఖాస్తులపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో ప్రజల్లో గందరగోళానికి తావిస్తోంది. పాత వాటిని పరిశీలించి.. కొత్త అర్జీలను పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులకు కూడా తలనొప్పిగా మారే అవకాశంలేకపోలేదు. యంత్రాంగం మాత్రం తొలుత పాత దరఖాస్తులను పరిష్కరించి.. ఆ తర్వాత తాజాగా వచ్చేవాటిపై దృష్టిసారించే వీలుందని అంటోంది. అర్హులకు ఆహారభద్రత పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం. ఆన్లైన్లో నమోదైనవాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తాం. అర్జీదారుల సమాచారం సేకరించమని తహసీల్దార్లకు సూచనలు చేశాం. అక్కడి నుంచి రాగానే కార్డుల జారీకి చర్యలు తీసుకుంటాం. –గౌరీశంకర్, డీఎస్ఓ -
రేషన్.. పరేషాన్..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రేషన్ దుకాణాలకు అందజేసిన ఈపాస్ మిషన్లలో లబ్ధిదారులు వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. అయితే సర్వర్ సమస్యతో ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో సరుకుల పంపిణీ 40 శాతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దుకాణాల ఎదుట లబ్ధిదారులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతుండగా, అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో ఈ పాస్ యంత్రాలు అందజేసిన ఒయాసిస్ కంపెనీ సెప్టెంబర్ నుంచి నూతన విధానంలో సరుకులు పంపిణీ చేసేలా సాంకేతిక జోడించింది. ఆ సమయంలో తదనుగుణంగా సంబంధిత యంత్రాలు అందజేయగా సరుకుల పంపిణీ సాగింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ను మార్పు చేయడంతో ఈపాస్ యంత్రాలు దాదాపు స్థంబించిపోయాయని డీలర్లు వాపోతున్నారు. సరుకుల కోసం వెళ్లిన లబ్ధిదారులు పడిగాపులు గాసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 7వ తేదీ దాటినప్పటికీ సరుకుల పంపిణీ ప్రారంభించని దుకాణాలు ఉమ్మడి జిల్లాలో 600కు పైగానే ఉన్నాయని సమాచారం. సాంకేతిక సమస్యతో పరికరాలను పట్టుకుని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వస్తున్నారు. ఈ–పాస్ యంత్రాల వెనుక ఉద్దేశం.. పేదల పొట్ట నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని, ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో, అదే స్థాయిలో రేషన్ బియ్యంలో అక్రమాలకు తావు ఏర్పడింది. బియ్యం రేషన్ దుకాణాలకు పూర్తిగా చేరకుండానే, మిల్లర్లకు, వ్యాపారుల దరికి చేరుతున్నాయి. ఇలా ప్రతి నెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అక్రమాలను అడ్డుకోలేక పోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్లు నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో ఈ– రేషన్ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నెల నుంచి శ్రీకారం చుట్టింది. రేషన్ దుకాణాలలో వేలిముద్రల (ఈ–పాస్) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కసరత్తును అన్ని జిల్లాల్లో ప్రారంభించింది. ఇబ్బందికరంగా సరుకులకు పంపిణీకి గడువు... ప్రభుత్వం రేషన్సరుకులను ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకే పంపిణీ చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే 7వ తేదీ దాటినప్పటికీ ఈ పాస్ యంత్రాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో గడువులోగా పంపిణీ జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ సరుకులను పంపిణీ చేయాల్సి ఉండగా సర్వర్ సమస్యతో ఒక్కో డీలరు రోజుకు 50 మందికి మించి సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేసిన అనంతరం డిస్ప్లేలో పేరు రావడం తదుపరి తూకం వేయడం ప్రక్రియతో దాదాపు 10 నుంచి 20 నిమిషాలు పడుతున్న సంధర్డాలుంటున్నాయి. ఈ పాస్ యంత్రానికి.. తూకం యంత్రానికి అనుసంధానం కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలో 40 శాతానికి పైగా దుకాణాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సరుకులను సకాలంలో.. గడువులోగా పంపిణీ చేయడం సందిగ్ధంగా మారింది. యంత్రాల సాంకేతిక సమస్యలను కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని డీలర్లు వాదిస్తున్నారు. వేలిముద్రలు పడక తిప్పలు...15వ తేదీ వరకే పంపిణీతో ఇబ్బంది రేషన్దుకాణాల వద్దకు కార్డుదారులే స్వయంగా వచ్చినా బయోమెట్రిక్ యంత్రంపై వారి వేలిముద్రలు పడనికారణంగా డీలర్లు సరుకులను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వేలిపై ఉన్న గీతలు యంత్రంపై పడని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులంటున్నారు. అయితే చాలా కొద్దిమందికే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, అలాంటి వారికి సరుకులను ఇచ్చేందుకు (కార్డుదారుల్లో 1శాతం మించకుండా) డీలర్లకు అనుమతిచ్చామని తెలిపారు. ఈ పాస్ విధానంతో సబ్సిడీ సరుకులను తీసుకెళ్లేందుకు వద్దులు, ఒంటరిగా ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కార్డుదారులు లేకున్నా వారి బంధు, మిత్రులు వచ్చి సరుకులు తీసుకెళ్లే అవకాశముండేది. ఇపుడు ఆ అవకాశం లేకపోవడంతో డీలర్ల వద్ద సరుకులు ఎక్కువ మొత్తంలో మిగులుతున్నాయి. కాగా ప్రతి నెల 15వతేది లోగానే లబ్ధిదారులు రేషన్ దుకాణాలనుంచి సరుకులను పొందాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈపాస్ మిషన్లు అపుడపుడు పనిచేయకపోవడంతో సమయమంతా వధా అవుతోందని, తమకు వీలున్నపుడు వచ్చే అవకాశం లేకుండా పోతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే నెల చివరి వారం వరకు పంపిణీ చేసేలా చూడాలన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ అంతకంతే.. 10 రోజుల్లో 50 శాతమే ఉమ్మడి జిల్లాల్లో ని రేషన్ దుకాణాలలో ఈ పాస్ విధానంలో సాంకేతిక అంతరాయాలు అవరోధంగా మారాయి.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండల లెవెల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) నుంచి 1,880 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల 16,644 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. పంచదారను అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు అందజేస్తున్నారు.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 9,41,948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 బియ్యంకు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ 50 శాతం కూడా పంపిణీ చేయలేదని తెలుస్తోంది. అయితే సర్వర్ మార్పుతో గత కొద్ది రోజులుగా ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా... లబ్దిదారులకు తిప్పలు తప్పడం లేదు.. ఈ విషయంలో అధికారుల ముందస్తు ప్రణాళికలోపం స్పష్టమవుతోంది. కిరోసిన్ పంపిణీలోను ఇదే రకమైన సమస్య ఉత్పన్నమవడం చర్చనీయాంశంగా మారింది. సరుకుల పంపిణీకు ముందే సర్వర్ మార్పును, సాంకేతిక సమస్యలను అధిగమిస్తే డీలర్లకు.. ఇటు లబ్దిదారులకు తిప్పలుండేవి కావని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు బియ్యం తీసుకోలే.. గీ ఏలి ముద్రలు ఎప్పుడు సురువు అయినయో గప్పడి నుంచి నా చేతి వేలిముద్రలు వస్తలేవు అంటున్నారు. నా భర్త వేలిముద్రలు కూడ మిషన్ తీసుకుంట లేదు. బియ్యం పంచినప్పుడల్ల పోయినా ఎన్నిసార్లు వేలిముద్రలు పెట్టిన రాలేదు. ఇప్పటి వరకు బియ్యం తీసుకోలేదు. మరునాడు పోతే గడువు ముగిసిందని ఇస్తలేరు. బియ్యం కాడికి పోతే బాగా తిప్పలు అవుతుంది. గిట్లయితే ఎట్ల. బియ్యం వచ్చేలా చూడాలి సారు. –మసర్తి నర్సవ్వ, బుగ్గారం -
ఇక పక్కాగా.. ప్రజాపంపిణీ
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాలశాఖ సమాయత్త మవుతోంది. ఆ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని త్వరలో జిల్లాలో ప్రవేశపెట్టబోతోంది. దీనిలో భాగంగా జిల్లాలోని తహసీల్దార్లు, రేషన్డీలర్లు, సివిల్ సప్లయీస్ విజిలెన్స్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా నిర్వహించిన శిక్షణలు ఇటీవల ముగి శాయి. ఫిబ్రవరి ఒకటినుంచి డీలర్లు నిత్యావసర వస్తువులను ఈ–పాస్ మిషన్ల సాయంతోనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. తూకాల్లో మోసాలకు పాల్పడకుండా ఎలక్ట్రానిక్ కాంటాలు కూడా త్వరలో అన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేయనున్నారు. నల్లగొండ : జిల్లాలో 31 మండలాల పరిధిలో 990 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆహారభద్రత కార్డులు 4,49,912 కుటుంబాలు కలిగి ఉన్నాయి. దీంట్లో సభ్యులు 13,68,366 మంది ఉన్నారు. ఈ మొత్తం కార్డుదారులకు ప్రతినెలా సబ్సిడీ బియ్యం 87,758 క్వింటాళ్లు, కిరోసిన్ 444 కిలోలీటర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా అన్నయోజన కార్డుదారులకు 289 క్వింటాళ్ల పంచదార పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు రూపాయికి కిలోచొప్పున ఒక్కొక్కరికి నాలుగు కిలోలు చొప్పున అందజేస్తుండగా..అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చౌకధరకు బియ్యం పంపిణీ చేస్తుంటే అదే బియ్యం బహిరంగ మార్కెట్లో కిలో రూ.20– 25 ధర పలుకుతోంది. కిరోసిన్ లీటరు రూ.21 లభిస్తే మార్కెట్లో రూ.30–35 పలుకుతోంది. దీనినే అదునుగా భావించిన డీలర్లు, మిలర్ల సహకారంతో బియ్యం, కిరోసిన్ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు సివిల్ సప్లయ్ ఈ–పాస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. వేలిముద్ర తప్పనిసరి... వచ్చే నెలనుంచి కార్డుదారులు రేషన్ దుకాణాలకు వెళ్తేనే సరుకులు ఇస్తారు. గతంలో వెళ్లకపోయినా...వారి పేరిట సరుకులు తీసుకున్నట్టుగా రిజిస్టర్లో నమోదు చేసుకుని వాటిని బ్లాక్ మార్కెట్కు తరలించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవహారానికి అడ్డుకట్ట వేస్తూ ఈ–పాస్ పేరిట కొత్త విధానం అమలు చేయనున్నారు. ఈ విధానంలో ఆహారభద్రత కార్డులో నమోదైన సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లి బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేస్తేనే సరుకులు ఇస్తారు. లేదంటే ఈ సరుకులు అలాగే ఉంచి మరుసటి నెలలో తీసుకునే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల కార్డుదారులకు తెలియకుండా సరుకులు పంపిణీ చేయడం కుదరదు. ఈ–పాస్ మిషన్లోనే వివరాలు నిక్షిప్తం... ఈ–పాస్ విధానంలో వేలిముద్రలు తీసుకునేందుకు వీలుగా బయోమెట్రిక్ మిషన్ ప్రతి రేషన్ దుకాణానికి పంపిణీ చేశారు. ఈ మిషన్లో కార్డుదారుల పూర్తిసమాచారం నిక్షిప్తమై ఉంటుంది. వారి ఆధార్ సంఖ్యతో సహా ఇతర వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఈ మిషన్లో సెల్ఫోన్లో ఉండే సిమ్ను వినియోగిస్తారు. ఏ రోజున ఎంత మేర సరుకు పంపిణీ అయ్యింది..? ఎంతమంది కార్డుదారులు సరుకులు తీసుకున్నారనే సమాచారం ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు జిల్లా, రాష్ట్రస్థాయిలో తమ సెల్ఫోన్ల ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. గోదాములనుంచి సరుకు రవాణా కూడా వేగవంతమవుతుంది. సరుకు నిల్వలు నిండుకోగానే విడతలవారీగా రేషన్ దుకాణాలకు బియ్యం, చక్కెర, కిరోసిన్ వెంటనే సరఫరా చేస్తారు. అధికారుల పర్యవేక్షణ కూడా ఇప్పుడున్నంత స్థాయిలో ఉండదు. అక్రమాలకు అడ్డుకట్ట... ఈ–పాస్ మిషన్లు పనిచేయాలంటే నెట్వర్క్ ప్రధానమైంది. జిల్లాలో మారుమూల ప్రాం తాల్లో సెల్ఫోన్లకే సరిగా సిగ్నల్స్ అందని పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సాంకేతికపరమైన అంతరాయం కలగకుండా ఆయా ప్రాంతాల్లో నెట్వర్క్ సిగ్నల్స్ వచ్చే సిమ్కార్డులనే ఈ–పాస్ మిషన్లో ఉంచారు. దీంతో సిగ్నల్స్ అందడం లేదనే సమస్య తలెత్తదు. దీంతో పాటు సిగ్నల్స్లో అంతరాయం తలెత్తకుండా బూస్టర్ యాంటీనాలు కూడా డీలర్లకు అందజేశారు. ఈ–పాస్ మిషన్లకు అనుసంధానంగా ఈ–కాంటాలు (ఎలక్ట్రానిక్ కాంటాలు) కూడా ఉంటాయి. రెండు, మూడు రోజుల్లో ఈ–కాంటాలు డీలర్లకు నేరుగా పంపిస్తామని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల తూకాల్లో డీలర్లు మోసాలకు పాల్పపడకుండా ఈ–కాంటాలు నిరోధిస్తాయి. ఉదాహరణకు బియ్యం తూకం వేసేక్రమంలో వందగ్రాములు తక్కువ ఉన్నా ఈ–కాంటా అంగీకరించదు. ఈ–మిషన్లకు ఈ–కాంటాలకు లింకై ఉంటుంది కావున కార్డుదారులకు ఎంత కోటా రేషన్ ఇవ్వాలో కచ్చితంగా అంత మొత్తం తూకం వేయాల్సిందే. ఇదే పద్ధతి ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కూడా అమలు చేయనున్నారు. ఈ–కాంటాలపైన తూకం వేసిన తర్వాతే ఎంఎల్ఎస్ పాయింట్లనుంచి సరుకులను డీలర్లకు రవాణా చేస్తారు. ఈ నెల 15న క్లోజింగ్ బ్యాలెన్స్ చేశాక మిగిలిన బియ్యంతో ప్రయోగాత్మకంగా డీలర్లు ఈ–పాస్ మిషన్లు ఉపయోగించి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే అవకాశం కల్పించారు. అవకతవకలకు ఆస్కారం ఉండదు ఫిబ్రవరి ఒకటినుంచి ఈ–పాస్ మిషన్లు వినియోగించాలి. డీలర్లు, రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తికావొచ్చింది. రేషన్ వ్యవస్థలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండేం దుకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా ప్రత్యేక యాంటీనాలు కూడా ఇస్తున్నాం. ఫిబ్రవరినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ–పాస్ మిషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. – ఉదయ్ కుమార్, డీఎస్ఓ -
ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రైవేటుపరం
ఆత్మకూరు: ప్రజాపంపిణీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదరి రాంభూపాల్ విమర్శించారు. మండల కేంద్రంలో సీపీఎం 6వ మండల మహాసభల్లో భాగంగా శనివారం ఆయన ఆత్మకూరు పాత సిండికేట్ బ్యాంకు వద్ద సీపీఎం జెండాను ఆవిష్కరించి సీపీఎం నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన మహాసభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 29 వేల రేషన్ దుకాణాలుండగా వాటిలో 6,500 దుకా ణాలను రిలయన్స్ ఫ్యూచర్ కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొదటగా మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోందని, వాటిలో అనంతపురం కూడా ఉందని తెలిపారు. రేషన్ దుకాణాలను ప్రైవేటీకరించడం వల్ల బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వద్ద మాత్రం తక్కువ ధరలకే కొనుగోలు చేస్తారన్నారు. 36 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి 30 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసి ప్రైవేటు విద్యను పరిమితిలో ఉంచాలన్నారు. అంతేకాకుండా జిల్లాలో రూ.113 కోట్ల ఉపాధి హామీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రూ.41.13 కోట్లు మాత్రమే కూలీలకు వచ్చాయన్నారు. కోటికి పైగా బిల్లులు అందాల్సిన మండలాలు 17 వరకు ఉన్నాయన్నారు. ముఖ్యంగా జిల్లా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే కూలీల బిల్లులు కోట్లలో పెండింగ్లో ఉండటం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా రైతు సంఘం కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి , నియోజకవర్గ నాయకుడు రామాంజినేయులు, మండల నాయకులు శివశంకర్, శివ, సోము, రాము, వలి, జయమ్మ, రాజేశ్వరమ్మ పాల్గొన్నారు. -
కార్పొరేట్కు చౌకబేరం!
-
కార్పొరేట్కు చౌకబేరం!
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్ దుకాణాల్లో పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే సరుకులను ఇప్పటికే ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇక ఆ బాధ్యత నుంచి కూడా తప్పుకుని ప్రైవేట్ కంపెనీలకు వదిలేయాలని నిర్ణయించింది. అది కూడా తన సొంత కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు చెందిన రూ.200 షేరును రూ.900 పెట్టి కొనుగోలు చేసిన ప్యూచర్ కంపెనీకి మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థను కట్టబెడుతుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 29,000 చౌకధరల దుకాణాలను దశలవారీగా ‘అన్న విలేజ్ మాల్స్’గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన పౌరసరఫరాలశాఖ సమీక్ష సమావేశంలో తొలివిడతలో 6,500 ‘అన్న విలేజ్ మాల్స్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తక్కువ ధరతో నాణ్యమైన నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించడమే లక్ష్యం కావాలని సూచించారు. ‘ఫ్యూచర్’, ‘రిలయన్స్’ గ్రూపుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ‘అన్న విలేజ్ మాల్స్’ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రత్యేకంగా లోగో రూపొందించాలని సూచించారు. ప్యూచర్ గ్రూప్లో సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి 3 శాతం వాటాలు ఇప్పటికీ ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించటానికి కేవలం ఒక్క రోజు ముందుగా హెరిటేజ్ తన షేర్లను ఒక్కసారిగా రూ. 900కి పెంచి ప్యూచర్ గ్రూప్నకు విక్రయించింది. అప్పట్లో ఈ ఒప్పందం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఖాళీగా ఉన్న 4,599 షాపులకు డీలర్ల నియామకం రేషన్ బియ్యం’ తమకు వద్దు అనుకునే తెల్లకార్డుదారులకు అంతే విలువైన నగదును ‘అన్న విలేజ్ మాల్స్’లో అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎవరైనా తమ ఉత్పత్తులను ‘అన్న విలేజ్ మాల్’లో విక్రయించుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఖాళీగా వున్న 4,599 చౌకధరల దుకాణాలకు వెంటనే డీలర్లను నియమించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో లబ్ధిదారులకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసినా తెల్ల రేషన్ కార్డుదారులకు మార్కెట్ ధర కన్నా 50% తక్కువకు నెలకు అర కిలో పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అందించే రేషన్లో పంచదారను జత చేయాలని చెప్పారు. ప్రత్యేక అవసరాలు కలిగిన కూరాకుల, రజక, మత్స్యకార తదితర సామాజికవర్గాల వారికి తెల్ల కిరోసిన్ ఇవ్వాలని అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినప్పుడు బోగస్వి జారీ కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఒక్కొక్కటిగా సరుకుల ఎత్తివేత గతంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్తోపాటు అదనంగా కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, గోధుమలు, ఉప్పు, చక్కెర, చింతపండు, కారం పొడి, పసుపు లాంటి తొమ్మిది రకాల సరుకులను సంచుల్లో ఒక్కో లబ్దిదారుడికి సబ్సిడీపై రూ. 185కే పంపిణీ చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటికీ మంగళం పాడారు. కేవలం బియ్యం మాత్రమే సరఫరా జరుగుతోంది. ఇన్నాళ్లూ పేదలకు అండగా ఉన్న చౌక ధరల దుకాణాలను ఇప్పుడు మాల్స్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే భవిష్యత్తులో ఏ సరుకులు కొనాలన్నా జనం వాటి గుప్పెట్లో నలిగిపోయే ప్రమాదం నెలకొంది. – ‘అన్న విలేజ్ మాల్స్’ కనీసం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. – ‘అన్న విలేజ్ మాల్స్’కు అయ్యే వ్యయంలో 25% రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు మరో 25% ‘ముద్ర’ రుణాన్ని డీలర్కు ఇప్పిస్తారు. – డ్వాక్రా, మెప్మా, గిరిజన సహకార సమితి ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. – బందరు లడ్డు, కాకినాడ కాజా, పచ్చళ్లు లాంటివి కూడా లభిస్తాయని పేర్కొంది. రేషన్ షాపులను కొనసాగించాలి కార్పొరేట్ సంస్థల ద్వారా తక్కువ ధరకు సరుకులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నా రేషన్ షాపులను నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది రకాల సరుకులతోపాటు బియ్యం, చక్కెర, కిరోసిన్ కూడా సబ్సిడీపై సరఫరా చేసి పేదలను, రేషన్ డీలర్లను ఆదుకోవాలి. –దివి లీలామాధవరావు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్, కామన్లో ‘లీలామాధవరావు’ అనే ఫైల్నేంతో ఫోటో ఉంది -
గ్రామీణులకు సబ్సిడీ గోధుమల నిలిపివేత!
- నగరాల్లో కార్డుకు రెండు కిలోలు.. - పట్టణాల్లో కిలో యథాతథం సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందించే సబ్సిడీ సరుకులు దశల వారీగా నిలిపివేతకు గురవుతున్నాయి. రెండేళ్ల క్రితం పామాయిల్ సరఫరాకు మంగళం పాడిన ప్రభుత్వం ఇటీవల కేంద్రం సబ్సిడీ ఎత్తివేయడంతో చక్కెర పంపిణీ నిలిపివేసింది. మరోవైపు కిరోసిన్ కోటా కూడా తగ్గించింది. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు సబ్సిడీ గోధుమల పంపిణీ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్లలో సబ్సిడీపై రెండు కిలోల చొప్పున, మున్సిపాలిటీల్లో యథాతథంగా కిలో చొప్పున గోధుమలు పంపిణీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ నెల కోటా నుంచి ఈ ఆదేశాలు అమలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికా రులకు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం కోసం తగ్గిన గోధుమల కోటా కేంద్రం నుంచి బియ్యం అదనపు కోటా కోసం రాష్ట్ర ప్రభుత్వం గోధుమల కోటాను తగ్గించుకుంది. కేంద్రం నుంచి కేటాయిస్తున్న బియ్యం కోటా సరిపోని కారణంగా గోధుమలకు బదులు బియ్యం కేటాయించాలని మొరపెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన కారణంగా గోధుమల కోటా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ జరిగే గ్రామీణ ప్రాంతాల గోధుమల కోటాను నిలిపివేసింది. -
బియ్యంతో సరి
జంగారెడ్డిగూడెం : భవిష్యత్లో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులేవీ సబ్సిడీ ధరకు పంపిణీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ అధికారంలోకి రాకముందు రేషన్ కార్డులపై 9 రకాల సరుకుల్ని పంపిణీ చేసేవారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రేషన్ కార్డులపై ఇచ్చే సరుకులు ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తూ వస్తున్నారు. సబ్సిడీపై ఇచ్చే పంచదార, కిరోసిన్ పేదలకు అందని ద్రాక్షగానే మారాయి. ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకమంటూ ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ విధానంలో మొదట్లో బియ్యం, పంచదార, కిరోసిన్తోపాటు పామాయిల్, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గోధుమ పిండి, కారం, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర సరుకుల్ని తక్కువ ధరకు సరఫరా చేసేవారు. ఆ తరువాత ప్రభుత్వం దశలవారీగా అన్ని సరుకుల పంపిణీపై కోత విధిస్తూ వస్తోంది. చివరకు బియ్యం పంపిణీకి మాత్రమే పరిమితం అవుతోంది. ఈ నెలలో పంచదార, కిరోసిన్ రేషన్ షాపులకు అవసరమైన స్థాయిలో సరఫరా కాలేదు. ప్రస్తుత నెలలో విడుదల చేసిన పంచదార, కిరోసిన్, గత నెలలో మిగిలిన పంచదార, కిరోసిన్ కలిపి ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నారు. పంచదార మొత్తం కోటాలో 30 శాతం, కిరోసిన్ 45 శాతం మాత్రమే జిల్లాలోని రేషన్ డిపోలకు కేటాయించారు. కిరోసిన్ ఇంకా విడుదల కాలేదు. సబ్సిడీ ఉపసంహరించిన కేంద్రం పంచదార, కిరోసిన్పై ఇస్తున్న సబ్సిడీని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి పంపిణీకి మంగళం పాడి సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. నెలనెలా కిరోసిన్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై దానిని పూర్తిగా నిలిపివేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. కిరోసిన్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామంటూ ప్రజలను మాయ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని, అందువల్ల కిరోసిన్ వినియోగం ఉండదని చెబుతోంది. ఇందుకు పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరిని ఎన్నుకుంది. జిల్లాకు 90 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా, అవి సరిపోవని మరో 80 వేల కనెక్షన్లు కావాలని జిల్లా కలెక్టర్ నివేదించడంతో 1.70 లక్షలకనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ గ్యాస్ కనెక్షన్లు వినియోగదారులకు ఇంకా అందలేదు. ఈలోగానే కిరోసిన్ పంపిణీ నిలిపివేయడంతో పేదల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీ నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల నుంచి పంచదార పంపిణీ పూర్తిగా నిలిచిపోనుంది. దీంతో ఆ సరుకుల్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లబ్ధిదారులకు ఏర్పడుతోంది. ఇదిలావుంటే.. బియ్యం వద్దనుకునే వారికి నేరుగా వారి ఖాతాలో నగదు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా బియ్యం పంపిణీని కూడా దశల వారీగా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీలర్ల గతేంటి! రేషన్ డీలర్లను బిజినెస్ బ్యాంక్ కరస్పాండెంట్లుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం గతంలో జీఓ జారీ చేసింది. రేషన్ షాపులను మినీ షాపింగ్మాల్స్గా మారుస్తామని ప్రకటించింది. ఇవి అమ ల్లోకి రాలేదు. రేషన్ షాపులను మినీ షాపింగ్ మాల్స్గా మారిస్తే అన్నిరకాల నిత్యావసర సరుకుల్ని వాటిద్వారా పంపిణీ చేయవచ్చు. రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తే సామాజిక పెన్షన్లు, కరెంటు బిల్లుల వసూలు, ఉపాధి హామీ కూలీల వేతనాలను పంపిణీ చేయవచ్చు. తద్వారా వారికి ఎంతోకొంత ఆదాయం సమకూరి ఉండేది. నగదు బదిలీ పథకం అమలు చేయడం వల్ల డీలర్లు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 11,96,418 లబ్దిదారులకు పంచదార, కిరోసిన్ అందకుండా పోతుంటే, 2,163 రేషన్ షాపుల ద్వారా సేవలు అందిస్తున్న డీలర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోంది. ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. పేదలకు అన్ని నిత్యావసర సరుకుల్ని రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయాలి. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రజల్ని ప్రత్యక్ష ఆందోళనకు సమాయాత్తం చేస్తాం. – బూరుగుపల్లి సూరిబాబు, అధ్యక్షులు, గుడిసెవాసుల సంఘం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వానికి పతనం తప్పదు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకోకపోతే పతనం తప్పదు. ఇప్పటికే ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయని ప్రభుత్వం.. పేదవారికి చేరువగా ఉన్న చౌక డిపోలను నిర్వీర్యం చేస్తే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రజాకంటక నిర్ణయాలు మానుకుని, ప్రజలకు చేరువయ్యే పాలన అందించే దిశగా ప్రభుత్వం కృషిచేయాలి. – బి.సాయికిరణ్, చిరుద్యోగి, జంగారెడ్డిగూడెం -
‘వాట్సప్’లోకి పౌరసరఫరాల శాఖ
త్వరలో ప్రత్యేక నంబర్ ద్వారా రేషన్ ఫిర్యాదుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. గ్రామ స్థాయిలో జరిగే ఏ చిన్న అక్రమానికి సంబంధించిన సమాచారమైనా ప్రధాన కార్యాలయానికి చేరే లా ప్రత్యేక వాట్సప్ నంబర్ను త్వరలో ప్రకటించనుంది. మండల స్థాయి నిల్వ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, సరుకుల తరలింపు లారీలకు జీపీఎస్ పరికరాలు, బయోమెట్రిక్ విధానం, సోషల్ మీడియా ద్వారా రేషన్ ఫిర్యాదుల స్వీకరణ వంటి చర్యలు తీసుకుంటోంది. అక్రమాల అడ్డుకట్టే ఏకైక లక్ష్యం..: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 196 కోట్ల సబ్సిడీని భరించి 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తోంది. అయితే రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆనవాయితీగా మారింది. ఈ జాడ్యానికి చరమగీతం పాడేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సరుకులు మార్గమధ్యంలో దారిమళ్లకుండా వెహికిల్ ట్రాకింగ్ కోసం 1,150 ట్రక్కులకు జీపీఎస్ పరికరాలు అమర్చారు. జీపీఎస్, సీసీటీవీలు, సోషల్ మీడియాను పరిశీలించడానికి వీలుగా పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ల కార్యాలయాలకు అనుసంధానిస్తున్నారు. -
‘రేషన్’లో కిరాణం!
♦ చౌక ధరల దుకాణాల్లో పీడీఎస్ సరుకులతో పాటు ఇతర సరుకుల విక్రయం ♦ డీలర్లకు ప్రభుత్వ కమీషన్ చాలనందున ప్రత్యామ్నాయం ♦ పౌరసరఫరాల మంత్రి వద్ద దస్త్రం ♦ త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు చౌక ధరల దుకాణాలు త్వరలో కిరాణాషాపులుగా మారనున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే సరుకులతో పాటు సాధారణ సరుకులు కూడా ఇకపై అక్కడే లభించనున్నాయి. పీడీఎస్ సరుకులతో పాటు ఇతర వస్తువులు సైతం విక్రయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన దస్త్రం పౌరసరఫరాల శాఖ మంత్రి వద్ద పెండింగ్లో ఉంది. మరో పక్షం రోజుల్లో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 1,952 చౌకధరల దుకాణాలున్నాయి. ఇందులో 711 మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పీడీఎస్ సరుకుల సంఖ్యను కుదించింది. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పండగ సందర్భాల్లో అరుదుగా చక్కెర ఇస్తున్నారు. ఇక నూనెలు, పప్పు, గోధుమల స్టాకు జాడలేకుండా పోయింది. ఈ క్రమంలో డీలర్లకు ఆదాయం భారీగా తగ్గిందని పౌరసరఫరాల శాఖపై ఒత్తిడి మొదలైంది. ఇటీవల రాష్ట్రస్థాయి సమావేశంలో డీలర్లు ఈ అంశాన్ని స్పష్టం చేయడంతో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే అలోచనలో ప్రభుత్వం తలమునకలైంది. ఈ క్రమంలో ఇతర సరుకుల అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ నివేదిక సమర్పించి ప్రభుత్వానికి అందించింది. సాధారణ ధరకే సరుకులు... ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో పీడీఎస్ సరుకులను చౌక ధరకు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాయితీని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సరుకుల అమ్మకంపై డీలర్లకు నిర్ధిష్ట మొత్తంలో కమీషన్ ఇస్తుంది. అయితే సరుకుల సంఖ్య తగ్గడంతో డీలర్లకు ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ఇతర సరుకులు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని డీలర్ల సంఘం డిమాండ్ చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు యోచిస్తోంది. అయితే పీడీఎస్ సరుకులు మినహా ఇతర సరుకులు మార్కెట్ ధరకే అమ్ముకునే అవకాశం ఇవ్వనుంది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. -
కట్టుదిట్టంగా పీడీఎస్ వ్యవస్థ
* పౌరసరఫరాల సమీక్షలో ఈటల * ‘స్థిరీకరణ’ ద్వారా కందిపప్పు ధరకు కళ్లెం సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం, ఇతర సరకుల్లో అక్రమాల నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిందిగా అధికారులను పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. శాఖ పనితీరును అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. గ్రామీణ స్థాయిలో గోదాముల రూపురేఖలను మార్చడం, రవాణా వ్యవస్థలో జీపీఎస్ వ్యవస్థను అమల్లోకి తేవడం, సరుకుల అక్రమాలపై పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ షాపులు, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. కంది సరఫరా కన్నా కౌంటర్ల అమ్మకానికే సుముఖం: కందిపప్పును పీడీఎస్ ద్వారా రూ.50కే అందిస్తే బ్లాక్మార్కెటింగ్కు ఆస్కారం పెరుగుతుందని ఈటల అభిప్రాయపడ్డారు. కాబట్టి ధరల స్థిరీకరణ పథకం ద్వారా ప్రత్యేక కౌంటర్లలో నిర్ణీత ధరకు పప్పును అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
ఈ పాస్ గుట్టు విప్పుతోంది...!
♦ వేలిముద్ర వేస్తేనే సరుకులు ♦ వినియోగం లేని కార్డులు40 శాతం పెనే ♦ బయటపడుత్ను డీలర్ల చేతివాటం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజాపంపిణీ వ్యవస్ధ లో ఈ-పాస్ అమలు డీలర్ల గుట్టు విప్పుతోంది. ఆహార భద్రత కార్డుల్లో వినియోగంలో లేనివి 40 శాతం పైనే ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతి నెలా వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం పక్కదారి పడ్డాయా..? అంటే అవుననేపిస్తోంది. సాక్షాత్తు స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ (ఎస్ఓటీ) సైతం దాడుల సందర్భంగా పేర్కొంటూ వచ్చింది. తాజాగా ప్రభుత్వ చౌకధరల దుకాణాలలో ఈ-పాస్ అమలుతో డీలర్ల చేతివాటానికి చెక్ పెట్టినట్లయింది. ఈ-పాస్ అమలుకు ముందు ఫిబ్రవరి మాసం వరకు సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుండగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో వినియోగకార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. దీనిని బట్టి డీలర్ల మాయజాలంతో వినియోగం లేని కార్డుల సరుకు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. ఇదీ పరిస్థితి... గ్రేటర్ హైదరాబాద్లోని జంట పౌర సరఫరాల శాఖకు చెందిన 12 అ ర్బన్ సర్కిళ్లలో 13.57 లక్షల మ ంది కార్డుదారు లు ఉండగా ప్రతి నెలా సగటున 12 లక్షల కార్డుదారుల వరకు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజాగా ఈ-పాస్ అమలుతో సరుకులు తీసుకుంటున్న కార్డుదారుల సం ఖ్య ఒకే సారి తగ్గిపోయింది. ప్రస్తుత నెలలో సరుకుల పంపి ణీ గడువు ముగిసే బుధవారం నాటికి 8.67,208 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు ఈ-పాస్లో రికార్డు అయింది. ఏప్రిల్ లో మొత్తం కార్డుదారుల్లో 8,51,205 కార్డుదాలు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు నమోదైంది. మొత్తం మీద హైదరాబాద్లోని 859 చౌకధరల దుకాణాల పరిధిలో మొత్తం 7,95,418 కార్డులు ఉండగా ఈ నెల 4,94,996 కార్దుదారులు, గత నెలలో 4,87,623 కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అర్బన్ లోని 684 దుకాణాల పరిధిలో మొత్తం 5,61,880 కార్డు దారులు ఉండగా ఈ నెలలో 3,72,212 కార్డుదారులు, గత నెలలో 3,63,582 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సబ్సిడీ సరుకులు ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పక్కదారి పడినట్లు స్పష్టం అవుతోంది. -
తగ్గిన బియ్యం లిఫ్టింగ్!
65 శాతం రేషన్ కోటాకే డీడీలు అందులో సైతం మిగులు గ్రేటర్లో ఈ-పాస్ ప్రభావం సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజా పంపిణీ వ్యవస్ధలో ఈ-పాస్ అమలుతో పేదల బియ్యం లిఫ్టింగ్ తగ్గిపోయింది. ప్రభుత్వం ఆహార భద్రత(రేషన్) కార్డు కుటుంబాలకు సరిపడు కోటా కేటయిస్తున్నా... పూర్తి స్థాయి కోటాను ఎత్తేందుకు డీలర్లు ముందుకు రావడం లేదు. తాజాగా చౌకధరల దుకాణాల్లో ఈ -పాస్ అమలుతో డీలర్ల చేతివాటానికి కళ్లెం వేసినట్లయింది. ఈ-పాస్ ప్రభావంతో బియ్యం కోటా లిఫ్టింగ్ తగ్గుతోంది. అందులో సైతం మిగులుబాటు విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవంగా మూడేళ్ల క్రితం నుంచే నగరంలోని 45 చౌకధరల దుకాణాల్లో ఈ-పాస్ అమలవుతుండగా వాటిని విస్తరించకుండా అడుగడుగున అడ్డంకులు తప్పలేదు. తాజాగా ప్రభుత్వం ఈ-పాస్పై నిర్ణయం తీసుకోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు. ఇతర ఎన్నికలంటూ గత ఆరు నెలల పాటు కాలయాపన జరిగింది. తాజాగా ఈ-పాస్ పూర్తి స్థాయిలో అమలులోకి రావడంతో డీలర్లు ఏకంగా పీడీఎస్ బియ్యం లిఫ్టింగ్ను తగ్గించివేశారు. 95 నుంచి 65 శాతం తగ్గిన లిఫ్టింగ్ ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్లు బియ్యం కోటా లిఫ్టింగ్ను 95 నుంచి 65 శాతానికి తగ్గిం చారు. అయినప్పటికి అందులో సైతం 35 శాతం వరకు కోటా ఆదా అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో పౌరసరఫరాల శాఖకు మొత్తం 12 అర్బన్ సర్కిల్స్ ఉండగా వాటి పరి ధిలో 1543 ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. మొత్తం 13.57 లక్షల కార్డుదారులు ఉండగా అందులోని 45.49 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఆహార భద్ర త పథకం కింద కార్డులోని ప్రతి యూనిట్కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటాను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇక చౌకధరల దుకాణాల నిర్వాహకులైన డీల ర్లు ప్రతి నెల 95 శాతం వరకు బియ్యం కోటా ను లిఫ్టింగ్ చేసి చేతివాటంతో 8 నుంచి 10 శాతం వరకు మిగులుబాటు చూపించడం అనవాయితీ. సరిగా రెండు నెలల క్రితం అంటే మార్చి 15 న ఈ-పాస్ ద్వారా సరుకుల పం పిణీ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే సగం మాసం పాత పద్దతిపై పంపిణీ జరగడంతో కొంత గోల్మాల్కు వెసులుబాటు కలిగింది. ఏప్రిల్ మాసంలో మాత్రం సాధ్యమయ్యే పరి స్థితి లేకపోవడంతో కేటాయించిన కోటాలో బియ్యం లిఫ్టింగ్ పూర్తిగా తగ్గించారు. మిగులు ఇలా.... ఈ-పాస్ అమలుకు మందు అంటే జనవరి మాసంలో మొత్తం 14.049 లక్షల కార్డుదారులు ఉండగా 2 లక్షల 97 వేల 547 క్వింటాళ్ల బియ్యం కోటాకు గాను మిగులుబాటు మినహాయించి 27 లక్షల 86 వేల 36 క్వింటాళ్లు కేటాయించారు. అందులో 95 శాతం కోటాను డీలర్లు లిఫ్టింగ్ చేసి 8 శాతం వరకు మిగులుబాటు చూపిం చారు. ఇక ఈ-పాస్ అమలు ప్రారంభం అనంతరం గత నెల ఎప్రిల్లో 13.57 లక్షల కార్డులకు గాను 28631343 కిలోలు అవసరం ఉండగా మిగిలుబాటు మినహాయించి 25748349 కిలోల కోటాను కేటాయించారు. అందులో కేవలం 65 శాతం కోటా లిఫ్టింగ్ చేయగా 35 శాతం పైగా బియ్యం మిగులుబాటైంది. ఈ-పాస్ ప్రకారం ఏప్రిల్ మాసంలో 13.57 లక్షల కార్డుదారులకు గాను 8.51 లక్షల కార్డుదారులు మాత్రమే బియ్యం తీసుకున్నట్లు రికార్డయింది. తాజాగా ఈనెల ఇప్పటి వరకు కేవలం 6.17 లక్షల కార్డుదారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు ఈ-పాస్ రికార్డులు స్పష్టమవుతున్నాయి. దీంతో ఈ-పాస్ డీలర్ల చేతివాటానికి పూర్తిగా కళ్లెం వేసినట్లు కనిపిస్తోంది. -
ప్చ్..‘పప్పు’ పుట్టడం లేదు..!
2 నెలలుగా రేషన్ దారులకు అందని కందిపప్పు * ధరలు పెరగడంతో కొనుగోలుకు ముందుకు రాని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలోని రేషన్కార్డు దారులకు సరఫరా చేసే కందిపప్పునకు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడింది. రెండు మాసాలు గా దీని సరఫరాను పూర్తిగా నిలిపేసిన ప్రభుత్వం ఈ నెల సైతం సరఫరాపై చేతులెత్తేసింది. అంతర్జాతీయంగా, జాతీయంగా కంది ధరలు పెరగడం, రాష్ట్రంలో సాగు తగ్గి దిగుబడులు లేకపోవడంతో వాటికి అనుగుణంగా కొనుగోలు చేసి, సబ్సిడీపై ఇవ్వడం భారం కావడంతో దాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. కనీసం సామాన్యుడికి కందిపప్పు అందుబాటులో ఉంచేలా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ ప్రభుత్వం విస్మరించడం ఆశ్చర్య పరుస్తోంది. అవసరానికి సరిపడా దొరకని తీరు.. మొత్తంగా రాష్ట్రంలో ఏటా 1.90లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం కాగా గత ఏడాది కేవలం 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే లభించింది. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుతం 89లక్షల ఆహార భద్రతా కార్డులుండగా, ప్రతి కార్డుపై నెలకు కిలో రూ.50 వంతున 8,900 మెట్రిక్ టన్నుల కందిపప్పును పౌర సరఫరాల శాఖ పంపిణీ చేయాలి. ఏడాది కాలంగా తగ్గిన సాగు కారణంగా కందిపప్పు లభ్యత 41శాతానికి పడిపోయింది. దీంతో ధర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ.160 మధ్య ఉంటోంది. వీటికి టెండర్లు పిలిచినా దాల్మిల్లర్లు రూ.140కంటే తక్కువకు కోట్ చేసే పరిస్థితులు లేవు. తక్కువకు తక్కువ రూ.140 నుంచి 130కి కోట్ చేసినా, కిలో కందిపప్పునకు ప్రభుత్వంపై రూ.80 నుంచి రూ.90మేర భారం పడుతోంది. ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో గడిచిన రెండు నెలలుగా సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నెల సైతం సరఫరా చేయలేదు. దీంతో బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లు చేద్దామని భావించినా అక్కడ సైతం ధరలు ఉడికిస్తున్నాయి. గతంలో ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు దాల్మిల్లర్లతో చర్చలు జరిపి తక్కువ ధరకే టెండర్లు కోట్ చేసేలా ఒప్పించి సరఫరా చేసింది. బహిరంగ మార్కెట్లోనూ ధరలు అదుపులో ఉంచేం దుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించింది. ప్రస్తుతం మలేషియా, దక్షిణాఫ్రికా,సింగపూర్, కెన్యా దేశాల నుంచి రాష్ట్రానికి దిగుమతి తగ్గడం,దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లలోనూ ఈ ఏడాది సాగు తగ్గడంతో వారు సైతం విదేశీ దిగుమతులపైఆధారపడుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి. ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, ప్రభుత్వంలో కదలిక లేకపోవడం విమర్శలకు గురవుతోంది. -
రేషన్కు మంగళం!
ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇక నుంచి నగదు బదిలీ పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. గ్యాస్ వాడకందార్లకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీని బ్యాంకు ఖాతాలకు జమచేసి డీలర్ల వద్ద మొత్తం చెల్లించుకోమని తీసుకొచ్చిన వ్యవస్థనే పౌరసరఫరాకు ఇక అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల ప్రజాపంపిణీ వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి పథక రచన మొదలైంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు డీబీటీ (డెరైక్టు బెనిఫిట్ ట్రాన్సఫర్) విధానాన్ని రెండువిడతల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. గ్యాస్ వినియోగదారుల ఖాతాలకు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ రాయితీ జమ కావడం లేదు. ఇప్పుడు పౌరసరఫరా శాఖ పరిధిలోని ప్రజాపంపిణీ వ్యవస్థలో కూడా ఇదే అమలు చేస్తే పేదలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కానుందా..ప్రభుత్వ యోచన చూస్తే ఔననే అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా 1999మంది డీలర్లు ఉపాధి పొందుతున్నారు. 8.17లక్షల రేషన్ కార్డులున్నాయి. 50,971 అంత్యోదయ, 1087 అన్నపూర్ణ కార్డులన్నాయి. ఈకార్డులకు ప్రతినెలా బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, కందిపప్పుపంచధార, కిరోసిన్ రాయితీపై అందిస్తున్నారు. మిగిలిన సరకులపై రాయితీపై అందుతున్నాయి. వీటికి సంబంధించి రాయితీ మొత్తాలను ఇకపై కార్డుదారుని ఖాతాకు జమ చేస్తారు. ముందుగా గ్యాస్ తర హాలోనే నిత్యావసర సరకులకు వినియోగదారులే పూర్తి మొత్తాలు చెల్లించి కొనుగోలు చేసుకుంటే ఆమొత్తాలను ప్రభుత్వం నేరుగా వినియోగదారుని ఖాతాలకు జమ చేస్తుందని చెపుతున్నారు. గ్యాస్ వాడకంలో కేంద్ర ప్రభుత్వ రాయితీ అందుకునేందుకు ముందుగా ఆధార్, బ్యాంకు అకౌంట్లను గ్యాస్ డీలరుకు అందజేశారు. ఒక్కో వినియోగదారుడు నెలల తరబడి తిరిగినా ఇంతవరకు ఆ రాయితీ మొత్తాలు బ్యాంకు ఖాతాలకు చేరడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈవిధానం కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పటికే అనేక మంది గ్యాస్ కనెక్షన్లను అటకెక్కించేశారు. లోపభూయిష్టంగా ఉన్న ఈవిధానంలో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారుు. జనానికి చెల్లించాల్సిన రాయితీలకు మంగళం పాడేస్తున్నారు. అటువంటి విదానాన్నే ప్రజాపంపిణీ వ్యవస్థలో తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ధరలపెరుగుతున్న నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ పేదలను ఆదుకుంటోంది. ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ఈ-పాస్ విధానం అమలుతో 15శాతం కుటుంబాలు ప్రతినెలా నిత్యావసర సరకులు అందుకోలేక పోతున్నారు. దీంతో లక్ష కుటుంబాలు అధిక ధరలకు నిత్యావసర సరకును కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు నగదు బదిలీ విదానం అమలైతే నిత్యావసర సరకుల కోసం ముందే అధిక మొత్తాలు చెల్లించుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. రెండు మూడు రోజులు మాత్రమే సరకుల పంపిణీ చేసి తర్వాత డీలర్లు ఆపేస్తున్నారు. రానున్న రోజుల్లో కిరాణా తరహాలో నిత్యం ప్రజలకు అందుబాటు అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులున్న వారైనా సరే రాయితీల వల్ల తక్కువధర చెల్లించి సరకులను తీసుకుంటూ ఇంటిల్లిపాది ఆకలిదప్పులు తీర్చుకుంటున్నారు. కొందరైతే బియ్యం మార్కెట్లో అమ్మేసినా మిగిలిన సరకులను కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. సరకులు కొనాలంటే పెద్ద మొత్తాలను దాచుకుంటే తప్ప కొనుక్కోలేరు. నగదు బదిలీ అమలైతే రాయితీ లేకుండా కొనాలంటే ముందుగానే పెట్టుబడి పెటటాలి. వ్యవసాయకూలీలు,నిరుపేదలకు ఈ స్తోమతు ఉండదు. ఏమైనప్పటికీ రేషన్కు నగదు బదిలీ పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టనుంది. -
రేషన్.. ‘వేలిముద్రల’ పరేషాన్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈ-పాస్) అమలుతో రేషన్ సరుకులు మిగులు బాటు దేవుడెరుగు కానీ... లబ్ధిదారులైన నిరుపేదలకు మాత్రం వేలిముద్రల పరేషాన్ పట్టుకుంది. ఈ-పాస్ మిషన్ లోని ఆధార్ డేటా తో వేలి ముద్రలు సరిపోక నానా ఇబ్బందులు కలుగుతున్నాయి. సరుకుల కోసం చక్కర్లు తప్పడం లేదు. మరోవైపు చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ-పాస్ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ తలనొప్పిగా తయారవుతోంది. ఫలితంగా మొదటి రెండు వారాల్లో కనీసం 25 శాతానికి మించి సరుకులు పంపిణీ చేయలేక పోయామని డీలర్లు పేర్కొంటున్నారు. ప్రజా పంపిణిలో సంస్కరణల్లో భాగంగా సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్లోని 12 సర్కిల్స్ పరిధిలో గల సుమారు 1543 షాపుల్లో ఈ- పాస్ ద్వారా సరుకులు పంపిణీ కొనసాగుతోంది. ఈ విధానం సరుకులు పక్కదారి పట్టకుండా కట్టడి చేస్తున్నప్పటికీ సరుకులు కొనుగోలు కోసం రేషన్ షాపులకు వచ్చే అసలైన లబ్ధిదారులకు మాత్రం తిప్పలు తప్పడం లేద న్న ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. వేలిముద్రల ఆధారంగానే... ఈ-పాస్ విధానంలో వేలిముద్రల ఆధారంగానే సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్ యం త్రాన్నిఆధార్ డేటాతో అనుసంధానం చేయడంతో లబ్ధిదారుడి వేలిముద్రలు సరి పోల్చుతున్నారు. చౌకధరల దుకాణానికి సరుకుల కొనుగోలు కోసం లబ్ధిదారుడు ఆహార భద్రత రేషన్ కార్డు డేటా స్లిప్ తీసుకొస్తే డీలర్ ఈ-పాస్ యంత్రం పై కార్డు నెంబర్ నమోదు చేస్తున్నారు. కార్డులోని లబ్ధిదారులు వివరాలు డిస్ప్లే అనంతరం సరుకులు కొనుగోలు కోసం వచ్చిన వ్యక్తి పేరు ఉంటే దానిని టిక్ చేసి వేలి ముద్ర తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-పాస్ యంత్రానికి ఆధార్ అనుసంధానం ఉన్న కారణంగా లబ్ధిదారుడి వేలిముద్ర సరిపోతే అమోదం అని డిస్ప్లే అవుతుంది. ఒక వేళ కా కుంటే బయోమెట్రిక్ మ్యాచ్ కావడం లేదని డిస్ ప్లే అవుతోంది, సదరు లబ్ధిదారుల మిగిలిన వేళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్ధిదారుడి పది వేలిముద్రలు కూడా సరి పోకుంటే అదే కుటుంబంలోని మిగతా సభ్యులు వేలిముద్రలను సేకరించి సరి పోల్చాల్సి ఉంటుంది. సదరు కుటుంబంలో ఒకరి వేలి ముద్ర మ్యాచ్ అయినా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. సరిపోతేనే సరుకుల మెనూలో వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత సరుకులు గుర్తింపు, బిల్లింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే సరుకులు పంపిణీ జరుగుతుంది. ఒక లబ్ధిదారుడికి సరుకులు పంపిణీ చేసేందుకు కనీసం 20 నిమిషాల వరకు అవుతోంది. కష్టజీవుల వేలిముద్రల్లో.. నిరుపేదలైన కష్ట జీవులకు కష్టం వచ్చి పడింది. ఈ-పాస్ పై వేలిముద్రలు సరిపోలడం లేదు. అధిక శాతం కూలీలు, రిక్షా కార్మికులు, వృద్దులు, చిన్నారుల వేలిముద్రలు ఈ-పాస్ ఆధార్తో సరిపోవడం లేదు. గతంలో ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలుముద్రలు ప్రస్తుత వేలుముద్రల్లో కొద్ది మార్పులు జరగడం తో ఈ- పాస్లో సరిపోలడం లేదు. ముద్రలు ఎర్రర్ చూపిస్తున్న కారణంగా డీలర్లు వారికి రేషన్ సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో వారు తిరిగి ఆధార్ కేంద్రాలకు వెళ్లి తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సింగిల్ లబ్ధిదారులైన కార్డుదారులు సరుకుల కొనుగోలు కోసం రేషన్ షాపులకు రాక తప్పడం లేదు. మరోవైపు సర్వర్ డౌన్ కూడా పెద్ద సమస్యగా తయారైంది. సరుకులు వస్తాయన్న నమ్మకం లేదు రేషన్ సరుకుల కోసం దుకాణానికి వెళితే సరుకులు వస్తాయన్న నమ్మకం లేకుండా పోతుంది. మిషన్పై వేలి ముద్రలు త్వరగా పడడం లేదు. ఒక్కోసారి దుకాణం నుంచి ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. ఈ విధానాన్ని ఎత్తివేయాలి. రేషన్ దుకాణం వద్ద కూడా సరుకుల కోసం చాలా ఆలస్యమవుతోంది. -శోభ, ఉప్పుగూడ. వేలిముద్రలు సరిపోవడం లేదు సరుకులకు వేలిముద్రలకు లింక్ పెట్టారు. సరుకులు తీసుకోవడం కష్టతరమవుతోంది. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం తీసుకున్న వేలి ముద్రలకు ఇప్పుడు ఆమోదించడం లేదు. చిన్నారులను పంపించడం కుదరదు. మా లాంటి వారు వెళ్లి అవస్థలు పడుతున్నాం. వేలి ముద్రలు ఆమోదించని సమయంలో ఏఎస్వోను కలవాలని రేషన్ డీలర్...రేషన్ డీలర్ను కలవాలని అధికారులు తిప్పుతున్నారు. - కె.రాజ్లింగం, జంగమ్మెట్ -
తినేటోళ్లకు తిన్నంత!
♦ ప్రజా పంపిణీలో ఇష్టారాజ్యం ♦ తప్పుడు తూకాలతో బియ్యం ♦ నొక్కేస్తున్న పలువురు డీలర్లు ♦ ఇతర వస్తువులను బలవంతంగా అంటగడుతున్న వైనం ♦ కిరోసిన్ పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్కు తరలింపు ♦ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో బలవంతపు వసూళ్లు ♦ నేడు విజిలెన్స్ కమిటీ సమావేశం కడప సెవెన్రోడ్స్ : ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో గాడి తప్పింది. కింది స్థాయిలో డీలర్లది ఇష్టారాజ్యంగా మారింది. పేదలకు అందాల్సిన బియ్యం, చక్కెర, కిరోసిన్ వంటి నిత్యావసరాలను దారి మళ్లిస్తూ జేబులు నింపుకుంటున్నారు. డబ్బాలతో బియ్యం వేస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కడపలో కొన్ని ఎఫ్పీ షాపులు మాల్స్ను తలపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇతర సరుకులను వినియోగదారులకు బలవంతంగా అంటగడుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. డబ్బాలతో తూకాలు తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం డీలర్లకు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఇచ్చింది. కానీ జిల్లాలో పలుచోట్ల ఇప్పటికి డబ్బాలతో తూకాలు వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే డీలర్లు డబ్బాలతో తూకాలు వేస్తున్నారు. శుక్రవారం ‘సాక్షి’ నగరంలోని సాయిపేటలో ఉన్న 117వ ఎఫ్పీ షాపును సందర్శించగా అక్కడ డబ్బాలు దర్శనమిచ్చాయి. ఒక్కో డబ్బా కనీసం కిలో బరువు ఉంటుందని తెలుస్తోంది. ఎంతలేదన్నా ఒక క్వింటాలుకు 10 కిలోల బియ్యాన్ని తూకాల ద్వారా డీలర్లు కాజేస్తున్నారు. కిలో రూ.10 చొప్పున బయట విక్రయించుకున్నా రూ.100 వస్తుంది. ఒక్కొ డీలర్ కనీసం వంద క్వింటాళ్లు బియ్యం పంపిణీ చేసినా 10 వేల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులు అడపా దడపా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకోవడం వల్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు. కిరోసిన్లో.... ప్రభుత్వం బియ్యంతోపాటు కిరోసిన్ కూడా ఒకే సమయంలో సరఫరా చేయకపోవడం డీలర్లకు వరంగా మారింది. బియ్యం పంపిణీ అయిపోయిన తర్వాత కిరోసిన్ కేటాయిస్తున్నారు. దీపం, జనరల్ కనెక్షన్ ఉన్న కార్డు దారులకు ఒక లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయక గంటల తరబడి క్యూలో నిలబడి బియ్యం తీసుకెళ్లిన చాలామంది వినియోగదారులు లీటరు కిరోసిన్ కోసం పనులు వదులుకొని మళ్లీ ఎఫ్పీ షాపులకు రావడం లేదు. మరుసటి నెల బియ్యానికి వచ్చినపుడు డీలర్లు వినియోగదారుల వేలి ముద్రలు తీసుకుని కిరోసిన్ కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రీటైల్ షాపు డీలర్ల గురించి చెప్పాల్సిన పనేలేదు. అలా కాజేసిన కిరోసిన్ బ్లాకులో లీటరు రూ. 30 చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నేడు విజిలెన్స్ కమిటీ సమావేశం ఎట్టకేలకు సుమారు రెండు సంవత్సరాల తర్వాత పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహిస్తున్నారు. ఇంతకు మునుపు జిల్లా ఆహార సలహా సంఘం అన్న పేరును తొలగించి విజిలెన్స్ కమిటీ పేరుతో సభ్యులను నియమించారు. వంట గ్యాస్లో బలవంతపు వసూళ్లు గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు సిలిండర్ డోర్ డెలివరీ కింద రూ.40 చొప్పున వసూలు చేస్తున్నారు. అయిదు కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి చార్జీ వసూలు చేయకుండా ఉచితంగా డోర్ డెలివరీ చేయాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ఇటీవల నిర్వహించిన గ్యాస్ డీలర్ల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. సిలిండర్లు తీసుకెళ్లే బాయిస్ డబ్బులు వసూలు చేయకుండా కట్టడి చేయాలంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి జి.వెంకటేశ్వరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. పలువురు వంట గ్యాస్ డీలర్లు దొంగ కనెక్షన్లు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాల్స్ను తలపిస్తున్న వైనం కడప నగరంలో కొన్ని ఎఫ్పీ షాపులు మాల్స్ను తలపిస్తున్నాయి. కొబ్బెర, బెల్లం, ఉప్పు, ఆవాలు, సబ్బులు, వంట నూనెలు, కూల్ డ్రింక్స్ ఇలా అనేక రకాల వస్తువులను విక్రయిస్తున్నారు. వీటిని వినియోగదారులకు బలవంతంగా అంటగడుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వమే తక్కువ ధరకు ఇస్తోందని, నాసిరకం వస్తువులు అండగడుతున్నారు. తీసుకోకపోతే ఆ తర్వాత వస్తువులు ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటాయని పరోక్షంగా భయపెడుతున్నారు. చౌక దుకాణాలకు వెళ్లి తమకు కావాల్సిన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసే వెసలుబాటు వినియోగదారులకు ఉంది. అయితే అన్ని వస్తువులు కొనకపోతే తర్వాత నెలల్లో ఏమీ ఇవ్వరన్న భయం వినియోగదారుల్లో నెలకొంది. ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేస్తున్న సరుకులను కూడా బయటి నుంచి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కడప బెల్లం మండివీధిలోని 34వ నెంబరు ఎఫ్పీ షాపును ‘సాక్షి’ సందర్శించినపుడు అది ఓ చిన్నపాటి సూపర్బజారులా కనిపించడం గమనార్హం. ‘జీతాలు ఇస్తామని, కమీషన్ పెంచుతామని ప్రభుత్వం చెప్పిన హామిలు అమలు కాలేదు. క్వింటాలు బియ్యానికి రూ. 20 కమీషన్ ప్రభుత్వం ఇస్తోంది. గోడౌన్ వద్ద లోడు చేసినందుకు రూ. 2, స్టోరు వద్ద బియ్యం దించుకోవడానికి రూ.6 చొప్పున చెల్లిస్తున్నాం.. దీంతో క్వింటాలుకు ఖర్చులుపోను మాకు మిగులుతోంది రూ.12 మాత్రమే. వంద క్వింటాళ్ల బియ్యం మేము పంపిణీ చేసినా రూ.1200లే దక్కుతోంది. రూము అద్దె, కరెంటు చార్జి, ఇతర ఖర్చులు తీసేస్తే నష్టం తప్ప ఏమి ఉండదు. అందుకే ఇతర సరుకులు అమ్ముకుంటున్నాం’ అని డీలర్లు చెబుతున్నారు. -
కందిపప్పు సరఫరాకు టెండర్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందజేసే రాయితీ కందిపప్పు సరఫరా కోసం ప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలిచింది. వచ్చే నెల మార్చి వరకు పీడీఎస్ అవసరాలకు సరిపోయేలా 5వేల మెట్రిక్ టన్నులకు పౌర సరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు దిగివచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్న ప్రభుత్వం, వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతీ నెలా 5వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతోంది. లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుత ధరలు మార్చి తర్వాత మరింత తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో కేవలం ఒక నెల అవసరాల మేర మాత్రమే ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించింది. మార్చి తర్వాత తిరిగి పాత విధానం మేరకు మూడు నెలల అవసరాల కోసం టెండర్లను ఆహ్వానించనుంది. -
జయ సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడులో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందుకుంటున్న వారికి సీఎం జయలలిత సంక్రాంతి కానుక ఇవ్వనున్నారు. రెండుకోట్ల మందికి ‘పొంగల్ గిఫ్ట్ ప్యాక్’ ఇవ్వనున్నారు. ఇందులో ఈ నెల సరుకుల (కిలో బియ్యం, పంచదార) తోపాటు రెండు చెరకుగడ ముక్కలు (పండగ సాంప్రదాయం) రూ. 100 నోటుఉంటాయని జయ తెలిపారు. కాగా, మదురైలోని మీనాక్షి గుడి పరిసరాల్లో దుండగులు మంగళవారం అర్ధరాత్రి మూడు పెట్రోల్ బాంబులు విసిరి పారిపోయారు. ఎవరికీ హాని జరగలేదు. ఒక బాంబే పేలింది. -
లక్షన్నర మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల సేకరణ
♦ ఎఫ్సీఐ ద్వారా తెలంగాణలో 25 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలు ♦ ధరల స్థిరీకరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ♦ ‘సాక్షి’తో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కంది పప్పు ధరలను నియంత్రణలో ఉంచేందుకు వీలుగా భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) ద్వారా కందుల సేకరణ చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. దేశం మొత్తంగా ధరల నియంత్రణకు వీలుగా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణలో 25 వేల మెట్రిక్ టన్నుల కంది సేకరణ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధర కు కందులు సేకరిస్తామని, దీనికి మార్క్ఫెడ్, నాఫెడ్ సేవలను వినియోగిస్తామన్నారు. ధరల నియంత్రణ అవసరమైనప్పుడు పప్పుగా మార్చిన కందిని బహిరంగ మార్కెట్లోకి ఎఫ్సీఐవిడుదల చేస్తుందని వివరించారు. రాష్ట్రా ల అవసరాలు తీరాక మిగులుంటే, ఆయా రాష్ట్రాల అంగీకారం మేరకు ఇతర రాష్ట్రాల అవసరాలకు మార్కెట్లోకి విడుదల చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చిన పాశ్వాన్ పార్క్ హయత్ హోటల్లో ఎఫ్సీఐ అధికారులతో భేటీ అయ్యారు. వారితో వివిధ అంశాలపై సమీక్షించిన అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నిల్వలపై ఆంక్షలు: ఈ ఏడాది వర్షపాత లేమి వల్ల దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో పప్పు దినుసుల సాగు తగ్గి, దిగుబడి పడిపోయిందని.. అందువల్లే ధరలు పెరిగాయని పాశ్వాన్ తెలిపారు. కంది నిల్వలపై విధించిన నియంత్రణను ఏడాది పాటు పొడిగించామని, హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు ఈ నియంత్రణ పెట్టామన్నారు. గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు కేంద్రం సత్వరమే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. ఉల్లి దిగుమతులపై గతంలో ఉన్న ఆంక్షలు ఎత్తివేశామని, దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించిన కేంద్రం, ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకునేలా ప్రస్తుత నిబంధనలను సవరించామన్నారు. తెలంగాణలో 21 లక్షల బోగస్ కార్డుల తొలగింపు దేశంలో తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిందని పాశ్వాన్ తెలిపారు. తెలంగాణలో 1.91 కోట్ల మంది ఈ పథకం కింద ఉన్నారన్నారు. తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో 100 శాతం కార్డుల కంప్యూటరైజేషన్ పూర్తయిందన్నారు. తెలంగాణలో కార్డులను ఆధార్తో సీడింగ్ చేసి 21 లక్షల బోగస్ కార్డులను తొలగించారని, దీంతో నిజమైన అర్హులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల పంపిణీ అక్రమాలు, దారి మళ్లింపులకు అడ్డుకట్ట వేసేందుకు తెచ్చిన పంపిణీ వ్యవస్థ నిర్వహణ (సప్లై చైన్ మేనేజ్మెంట్)ను తెలంగాణలో అమలు చేస్తే మరిన్ని అక్రమాలను అడ్డుకోవచ్చని, ఇప్పటికే ఈ విధానం 8 రాష్ట్రాల్లో అమలై మెరుగైన ఫలితాలు ఇస్తోందని చెప్పారు. ఆహార ధాన్యాలకు నగదు బదిలీ.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీపై అందజేస్తున్న సరుకుల పంపిణీలో అక్రమాలు, లీకేజీల నివారణకు నేరుగా నగదు బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ప్రస్తుతం చండీగఢ్, పుదుచ్చేరిల్లో దీనిని అమలు చేస్తోందని, మరిన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. లబ్ధిదారుల వివరాల డిజిటలైజేషన్, ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే దీన్ని నిర్వహించడం సులభమవుతుందని, దీని ద్వారా రాయితీ సొమ్ము నేరుగా లబ్ధిదారుడికే చేరి ఎక్కడైనా సరుకులు కొనే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కిరోసిన్ విషయంలో నగదు బదిలీ చేయాలన్న అంశాన్ని పెట్రోలియం శాఖ పరిశీలిస్తోందని, మున్ముందు దీనిపై నిర్ణయం రావచ్చన్నారు. -
సర్కారుపై సమరం
రేషన్ డీలర్ల జీవనభృతి పట్టని ప్రభుత్వం ఈ-పోస్తో గింజగింజకూ లెక్క కమీషన్ పెంపుపై తాత్సారం భారంగా మారిన చౌక డిపోల నిర్వహణ ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన డీలర్లు 21 నుంచి నిరవధిక సమ్మెకు హెచ్చరిక తెనాలి : ప్రజా పంపిణీ వ్యవస్థలో సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం రేషన్ డీలర్ల జీవన భద్రతపై దృష్టిపెట్టటం లేదు. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ల నోటికి ‘ఈ-పోస్’ పేరిట సాంకేతిక చిక్కంతో చెక్ పెట్టి, వారి ఆదాయం పెంపుదలపై మాత్రం ప్రకటన చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా చౌకడిపోల నిర్వహణ భారంగా తయారైంది. ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన డీలర్ల సంఘం సమరశంఖం పూరించేందుకు సమాయత్తమైంది. తమ కమీషను పెంపు/ వేతనాల నిర్ణయంపై చేసిన విజ్ఞప్తులకు సానుకూల స్పందన రాకుంటే ఈ నెల 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని నోటీస్ అందజేసింది. గింజగింజకూ లెక్క.. రేషన్ డీలర్లకు చాలీచాలని కమీషన్లు, పారదర్శకత లేని విధానాలే అక్రమాలకు ఆస్కారం కల్పించాయనేది వాస్తవం. అందులో అధికారుల వాటాలు, సరకుల టెండర్లు, ప్యాకింగ్ వ్యవహారాల్లో ఉన్నతాధికారులు తమ వాటాలు పుచ్చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. సబ్సిడీ భారం తగ్గించుకునే ఎత్తుగడల్లో భాగంగా 15 లక్షల బోగస్ రేషన్ కార్డులను ఏరివేసింది. సరకుల పంపిణీకి ఈ-పోస్ యంత్రాలను ప్రవేశపెట్టి గింజగింజకూ లెక్కగడుతోంది. ఇలాగైతే కష్టమే.. పెట్టుబడులకు, వస్తున్న కమీషన్కు లెక్కచూసుకుంటే చౌక డిపోల నిర్వహణ కష్టసాధ్యమనేది తేలిపోయింది. ప్రతి నెలా రెండు లక్షల టన్నుల బియ్యం, 6,500 టన్నుల చక్కెర, 40 వేల టన్నుల గోధుమలు, 13 వేల టన్నుల కందిపప్పు, 1.5 కోట్ల లీటర్ల కిరోసిన్ చౌకడిపోల్నుంచి సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని 29 వేల రేషన్ డీలర్లు పెట్టుబడుల రూపంలో రూ.191.27 డీడీలు తీస్తుంటే, కమీషన్, మిగిలే ఖాళీ గోతాలతో ఆదాయం రూ.10.71 కోట్లు వస్తోంది. మొత్తం 2.59 లక్షల టన్నుల సరకుల అన్లోడింగ్ చార్జీలు రూ.1.55 కోట్లు, 29 వేల చౌకడిపోల అద్దె, కరెంటు చార్జీల (సగటున రూ.2000 వంతున)కు రూ.5.80 కోట్లు, సహాయకుడి జీతం (నెలకు రూ.2500 చొప్పున) రూ.7.25 కోట్లు కలిపి లెక్కిస్తే రూ.14.60 కోట్లు ఖర్చవుతోంది. కమీషను/గోతాల ఆదాయం రూ.10.71 పోగా, ఇంకా రూ.3.88 కోట్ల వరకూ నష్టం వస్తున్నట్టు రాష్ట్ర జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో డిపోల నిర్వహణ భారంగా తయారై, డీలర్లు అప్పులపాలవుతున్నారనీ, కమీషను పెంపుపై ఎంతోకాలంగా చేస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు. కమీషన్ ఇంకా ‘పైసా’లే.. రేషన్ డీలర్ల ఆదాయాన్ని ప్రభుత్వం పైసలతోనే నిర్ణయిస్తుండటం చిత్రం. కిలో రూపాయి బియ్యానికి 20 పైసలు, కిలో రూ.13.50 చక్కెరకు 16 పైసలు, కిలో రూ.7 గోధుమకు 13 పైసలు, కిలో రూ.90 కందిపప్పునకు 55 పైసలు, లీటరు రూ.15 కిరోసిన్కు 25 పైసలు ప్రభుత్వం కమీషను రూపంలో చెల్లిస్తోంది. డీలర్లకు జీవనభద్రత కల్పించేందుకు రూ.15 వేల గౌరవ వేతనం, రూ.1500 అద్దె అలవెన్సు కింద చెల్లించాలని సమాఖ్య డిమాండ్ చేస్తోంది. తమ విజ్ఞప్తులకు ఈ నెల 20వ తేదీలోగా తగిన హామీ ప్రకటన రాకుంటే 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు సమాఖ్య తీర్మానించి, దానిని పౌరసరఫరాలశాఖ కమిషనర్కు అందజేశారు. ఆ ప్రకారం డీలర్లను సమాయత్తం చేసేందుకు సమాఖ్య నేతలు జిల్లాల పర్యటనను శనివారం ఆరంభించారు. -
ఇక ఆన్లైన్లో రేషన్ వివరాలు
కాకినాడ సిటీ : జిల్లావ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ప్రక్రియ రిలీజింగ్ ఆర్డర్ (ఆర్ఓ) నుంచి లబ్ధిదారుడికి సరకు పంపిణీ చేసే వరకు వివరాలు ఆన్లైన్లో పొందుపరిచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రేషన్ షాపుల్లో బయోమెట్రిక్(ఈ-పాస్) అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డిసెంబర్ కోటాకు ఆర్ఓలను ఆన్లైన్లోనే ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు డీలర్లు డీడీ కట్టి, అధికారులు ఆర్ఓలను మాన్యువల్గా ఇచ్చేవారు. అనంతరం గోదాం నుంచి రేషన్ దుకాణానికి సరకు పంపేవారు. ఈ క్రమంలో సరకు కొంత పక్కదారి పట్టేదనే ఆరోపణలున్నాయి. కొత్త విధానంలో అందుకు చెక్ పడనుంది. ఆన్లైన్లో ఆర్ఓ విడుదల చేశాక, రేషన్ షాపులో సరకును పరిశీలించి, రూట్ అధికారి అక్కడి ఈ-పాస్లో వేలిముద్ర వేస్తారు. దాంతో ఎంత సరకు వచ్చిందో మిషన్లో కనిపిస్తుంది. ఇది జిల్లావ్యాప్తంగా అమలు కానుంది. ఈ ప్రక్రియను అధికారులు కాకినాడలోని పలు షాపుల్లో పరిశీలించారు. -
పీడీఎస్ అక్రమాలపై టాస్క్ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో భాగంగా సరఫరా అవుతున్న రేషన్ సరుకులు, సంక్షేమ వసతి గృహాలకు అందించే సన్నబియ్యం సరఫరాలో అక్రమాల నివారణకు రిటైర్డ్ పోలీసు అధికారులతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. సరుకుల పంపిణీ, సరఫరాపై నిత్య పర్యవేక్షణ ద్వారా అక్రమాలను నివారించేలా ఈ టాస్క్ఫోర్స్కు బాధ్యతలు కట్టబెడతామన్నారు. రేషన్లో అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి బాధ్యులైన వారిపై పీడీ యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరుసగా కేసులు నమోదైతే డీలర్లు, మిల్లర్లు, కాంట్రాక్టర్లపై జీవితకాల వేటు వేసేలా చట్టాలు తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందన్నారు. మంత్రి ఈటల బుధవారం హైదరాబాద్లోని పలు మండల్ లెవల్ స్టాక్ పాయింట్లలో సరుకుల నిర్వహణ, నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వల విషయంలో అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పౌర సరఫరాల శాఖలో అక్రమార్కులున్నారని అన్నారు. ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్టేజ్-1, స్టేజ్-2 గోదాముల్లో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల టెండర్లు రద్దుచేసి కొత్త టెండర్లు పిలిచే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అక్రమాలను నివారించేందుకు ప్రజలు ముందుకు రావాలని, ఒక్కగ్రాము బియ్యం, చక్కెర తక్కువిచ్చినా శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. టీడీపీది ఎప్పుడూ శిఖండి పాత్రే.. సంక్షేమ హస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో అక్రమాలు జరుగుతున్నాయని, దొడ్డుబియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి సరఫరా చేస్తున్నారని విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపై మంత్రి మండిపడ్డారు. వారివి మతిలేని మాటలన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ శిఖండి పాత్ర పోషించిందని, అభివృద్ధిలోనూ అదేపాత్ర పోషిస్తోందని ఎద్దేవా చేశారు. -
చవితి పాయసం చేదు!
రేషన్ దుకాణాలకు చేరని చక్కెర - పాయసానికి తీపి కరువు - పట్టించుకోని యంత్రాంగం ఘట్కేసర్ టౌన్ /వికారాబాద్ రూరల్: చవితి పండుగకు పేదోడికి పాయసం చేదెక్కినట్టే అనిపిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న చక్కెర నేటికి రేషన్ దుకాణాలకు చేరుకోలేదు. దీంతో జనాలకు తిప్పలు తప్పేట్టు లేదు. గత నెలలో జరిగిన రంజాన్ పండుగకు నెలకు ఇచ్చే చక్కెరతో పాటు అదనంగా అరకిలో చక్కెరను అందజేసిన సర్కార్ చవితి పండుగకు మాత్రం మొండిచేయి చూపింది. ఎప్పటిలాగే నెలవారీగా ఇచ్చే చక్కెర కూడా గత నెలలో సగానికి పైగా అందలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పౌర సరఫరా శాఖ గోదాముల్లో నిల్వలు లేకపోవడంతో రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేదని తెలుస్తోంది. మూడు రోజుల్లో చవితి పండుగ ఉండగా యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణం. ఘట్కేసర్ మండలంలో 32,000 వేలు, జిల్లా మొత్తం 11.6 లక్షల ఆహార భధ్రత కార్డులున్నాయి. పేదోడిపై భారం... చవితి పండుగ పాయసం తయారీకి చిన్న కుటుంబానికి అయినా కిలో చక్కెర తప్పనిసరి. సివిల్ సప్లై ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆహార భద్రత కార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి అరకిలో చక్కెరను సర్కారు అందజేస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ. 30లు ఉండగా రేషన్షాపుల ద్వారా అరకిలో చక్కెరను రూ. 6.75లకు అందజేస్తోంది. ప్రతినెల 25 నుంచి డీలర్ల నుంచి డీడీలు స్వీకరించి ఒకటో తేదీ నాటికే రేషన్ దుకాణాలకు సరుకులు అందేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ముందు చూపు లేని ప్రభుత్వానికి అధికారుల నిర్లక్ష్యం తోడు.. గోదాములు నిండుకోవడంతో రేషన్ దుకాణాలకు చక్కెర నేటికి చేరుకోలేదు. దీంతో ప్రజలపై భారం తప్పేలా లేదు. జిల్లా ప్రజలకు చవితి పండుగకు సుమారు రూ. 35 లక్షలకు పైగా భారం పడనుంది. కాగా, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని పండుగల విషయమై అత్యుత్సాహం చూపిస్తున్న సర్కార్ చవితి పండుగను పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగకు అందజేస్తాం... చక్కెర నిల్వలు లేని కారణంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేకపోయాం. చవితిని దృష్టిలో ఉంచుకొని టెండర్ల ప్రక్రియను తొందరగా పూర్తి చేశాం. ప్రభుత్వ ఆదేశానుసారం చవితి పండుగకుఅరకిలో చక్కెరను అందజేస్తాం. అదనంగా ఇవ్వాలని ఆదేశాలు రాలేదు. ప్యాకింగ్ చేసే సమయం లేనందున డీలర్లకు నేరుగా సంచుల్లోనే పంపిస్తాం. - సత్యం, జిల్లా సివిల్ సప్లయి అధికారి -
అక్రమాలకు చెక్ పెట్టాలి
నల్లగొండ : ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పెట్టాలని కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూ చించారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లుగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న అధికారులు, గోదాం ఇన్చార్జిలతో గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ వారికి పౌరసరఫరాల పటిష్టతకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రేషన్ బియ్యంతో వ్యాపారం చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. ఎంఎల్ఎస్ పా యింట్ ఇన్చార్జీలు, డీటీలు,ఆర్ఐలుఅం దరూ ముఖ్యులేనన్నారు. సన్నబియ్యం, మధ్యాహ్న భోజనం, కిరోసిన్ పంపిణీ వంటి ప్రాధాన్యత అంశాలన్నీ నిజమైన లబ్ధిదారులకు చేరాలన్నారు. నీలి కిరోసిన్ ఉంటే క్రిమినల్ కేసులే.. కిరోసిన్ పంపిణీలో తేడాలుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని కలెక్టర్ సూచించారు. నీలి రంగు కిరోసిన్ రేషన్కార్డు దారుల వద్ద లేదా డీలర్ల వద్ద లేదా గోదాముల వద్ద మాత్రమే ఉండాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థతోపాటు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేవలం ఉల్లిగడ్డ ఒక్కటే కాకుండా పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరగడానికి కారకులయ్యే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ... కస్టం మిల్లింగ్ లక్ష్యం రోజుకు 2,500 మెట్రిక్ టన్నులు తక్కువ కాకుండా లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై డీఎం వరకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
47 వేల కార్డుల సరెండర్
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పౌరసరఫరాల శాఖ వ్యూహం ఫలించింది. బోగస్ కార్డుల బాగోతం బయటపడింది. అక్రమార్కుల ఏరి వేతకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అనుసరించిన వినూత్న విధానానికి రేషన్ డీలర్లు తలవంచారు. స్వీయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించని 47,059 కార్డులను అనర్హులుగా తేల్చి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ కార్డులు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలోని రంగారెడ్డి జిల్లా సర్కిళ్లలోనివే కావడం గమనార్హం. ప్రజాపంపిణీ వ్యవస్థకు గుదిబండగా మారిన బోగస్ కార్డులను ఏరివేయడానికి ఏటా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం క నిపించలేదు. ఈ నేపథ్యంలోనే అనర్హుల గుర్తింపునకు సరికొత్త ఎత్తుగడ వేసింది. సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట లబ్ధిదారుకు ఒక ఫారంను అందజేసింది. కార్డుదారుల చిరునామా, పేర్లలో అక్షరదోషాల సవరణలను వీటిలో పూరించి ఇవ్వమని నిర్దేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణ బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించింది. డిక్లరేషన్ ఫారాలు నిర్ణీత వ్యవధిలో వెనక్కి రాకపోతే.. ఆ కార్డులను తొలగి స్తామనే సంకేతాలను పంపింది. తర్వాత నకిలీ కార్డులు బయటపడితే డీలర్షిప్ను రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు వెనక్కిరాని 47,059 కార్డులను అనర్హులుగా తేల్చింది. ఈ కార్డులను బుధవారం రేషన్ డీల ర్లు స్వయంగా అధికారులకు అందజేయడం విశేషం. కేవలం డిక్లరేషన్ ఫారాలు సమర్పించని కార్డులేకాకుండా.. లబ్ధిదారుల జీవనశైలి బాగుందని అంచనా వేసి పక్కనపెట్టిన కార్డులు కూడా దీంట్లో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి ‘సాక్షి’కి తెలిపారు. వెయ్యి టన్నుల ఆదా బోగస్ కార్డుల తొలగింపుతో పౌరసరఫరాల శాఖకు భారీగా ఆదా కానుంది. కనిష్టంగా వెయ్యి టన్నుల బియ్యం కోటా మిగిలిపోనుంది. కార్డుకు సగటున 3.5 మంది సభ్యుల చొప్పున (ఒక్కో వ్యక్తికి 6 కేజీలు) లెక్కగట్టిన యంత్రాంగం.. కనిష్టంగా వెయ్యి టన్నుల బియ్యం మిగిలిపోనుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీలోని సర్కిళ్లకే పరిమితం చేసిన ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమలు చేస్తే మరో 10 వేల నకిలీ కార్డులు తేలుతాయని అధికారవర్గాలు అంటున్నాయి. దీంతో సుమారు 12 వందల టన్నుల సబ్సిడీ బియ్యం అనర్హులు బోక్కేయకుండా నిరోధించవచ్చని చెబుతున్నాయి. నల్లబజారుకు పెద్దఎత్తున సబ్సిడీ బియ్యం తరులుతుండడం.. ఈ వ్యవహారంలో ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని తేలడంతో ఇద్దరు అధికారులపై జిల్లా యంత్రాంగం వేటు వేసింది. అంతేకాకుండా స్టాక్పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు తరలే రేషన్పై నిఘాను విస్తృతం చేసింది. అదేసమయంలో బినామీల అవతారమెత్తిన డీలర్లను గుర్తించడమేకాకుండా.. వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. దీంతోపాటు బోగస్ కార్డులను సరెండర్ చేయకపోతే కోటా విడుదల చేసేది లేదని స్పష్టం చేయడంతో దారికొచ్చిన డీలర్లు అట్టిపెట్టుకున్న కార్డులను ప్రభుత్వానికి అందజేశారు. -
చౌక దందా
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా లో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే కిలో రూపాయి బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు దళారీలు రేషన్ బియ్యాన్ని కిలో ఆరు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటికి పాలిష్ చేసి కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర కలిగిన బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. కొందరు వందల క్వింటాళ్లు పోగు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. పౌర సరఫరాల, విజిలెన్స్ అధికారుల నిఘా ఉన్నా బియ్యం దందా ఆగడం లేదు. ఫలితంగా అధికారులు తనిఖీలు చేసినప్పుడు స్వల్పమే దొరుకుతున్నాయి. ఇదిలా ఉండగా, తమకు రేషన్ రావడం లేదని ప్రజలు నిత్యం ప్రజలు అటూ మండల, ఇటు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పేదలకు అందాల్సిన బియ్యం పరుల పాలవుతోంది. ప్రణాళిక ప్రకారం వ్యాపారం పేదలక అందాల్సిన బియ్యం బ్లాక్మార్కెట్కు తరలించేందుకు కొందరు వ్యాపారులు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. కొందరు వ్యాపారులు రేషన్ డీలర్ల వద్ద ముందుగానే పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో జోరుగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. పక్కా రవాణా జరిగే ప్రాంతాల వివరాలు విజిలెన్స్ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. దళారుల సాయంతో డీలర్ల వద్ద పోగుచేసిన బియ్యాన్ని లారీలు, ప్యాసింజర్ రైళ్లలో ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాల సిబ్బంది కూడా మామూళుగా తీసుకుంటున్నట్లు సమాచారం. భారీగా నల్లబజారుకు.. జిల్లాలో సాధారణంగా 6.85 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు కోటా సరుకులు పంపిణీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1,716 రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా బియ్యం ఇస్తోంది. అయితే భారీగా బియ్యం బ్లాక్మార్కెట్కు తరలివెళ్తున్నాయి. పౌర సరఫరాల అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడమే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు పట్టుబడ్డ సరుకులు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు 772 క్వింటాళ్ల బి య్యాన్ని పట్టుకున్నారు. ఇందులో నుంచి 635 క్విం టాళ్ల బియ్యం డీలర్ల వద్ద పట్టుకున్నదే. ఇక 7,162 లీటర్ల కిరోసిన్ను పట్టుకున్నారు. ఇందులో 4,123 లీటర్ల కిరోసిన్ డీలర్ల దగ్గర ఉన్నదే కావడం శోచనీ యం. జిల్లా వ్యాప్తంగా అధికారులు 71 కేసులు న మోదు చేశారు. ఇందులో 23 కేసులకు పరిష్కారం ల భించింది. మిగతా 48 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక అధికారులు పది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తిర్యాణి, ఆదిలాబాద్, కాజీపేట, కాగజ్నగర్ మండలాల్లో ఒక్కొక్క రేషన్షాపు డీలర్పై, ఉట్నూర్, మంచిర్యాల, తాండూర్ మండలాల్లో ఇద్దరి చొప్పున రేషన్షాపు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. క్రిమినల్, పెండింగ్ కేసుల వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన వారి నుంచి స్పందన రాలేదు. కేసుల నమోదై వారికిచ్చిన గడువు దాటిపోయింది. అయితే ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దాడుల వివరాలివీ.. జనవరిలో రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాలో నిర్వహించిన దాడుల్లో 132 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఇందులో రేషన్ డీలర్ల వద్ద పట్టుకున్న అక్రమ బియ్యం 106 క్వింటాళ్లుగా అధికారులు గుర్తించారు. మిగతా బియ్యం అక్రమంగా తరలిస్తున్నప్పుడు పట్టుకున్నట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలలో అధికారులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 305 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. 286 క్వింటాళ్ల బియ్యం రేషన్ డీలర్ల వద్ద పట్టుకున్నట్లుగా నిర్థారించారు. 37 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలిస్తున్నప్పుడు పట్టుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు నిర్వహించిన దాడుల్లో 220 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఇందులో రేషన్ డీలర్ల వద్ద పట్టుకున్న బియ్యమే 158 క్వింటాళ్లుగా ఉంది. జూన్, జూలై నెలల్లో అధికారులు నిర్వహించిన దాడుల్లో 144 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఇందులో 82 క్వింటాళ్ల బియ్యాన్ని డీలర్ల వద్దే పట్టుకోగా, మిగతా 31 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నప్పుడు పట్టుకున్నట్లుగా అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. -
అక్రమాలపై ఉక్కుపాదం!
* ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు సర్కారు కసరత్తు * ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చర్యలకు ఉపక్రమణ *బోగస్ డీలర్లపై కేసులు, రేషన్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ * అక్రమాల నిరోధానికి అక్టోబర్ నుంచి ఈపాస్ను ప్రవేశపెట్టే యోచన సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. డూప్లికేట్ కార్డుల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం బోగస్ డీలర్లు, రీసైక్లింగ్కు పాల్పడుతున్న మిల్లర్లు, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. పౌర సరఫరాల శాఖలో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్(ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను, సరుకులు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసేలా కసరత్తు ఆరంభించింది. అక్రమాల్లో అందరూ పాత్రధారులే..! రేషన్ దుకాణాల నిర్వహణ పూర్తిగా బోగస్ డీలర్ల చేతిలోకి వెళ్లిందని, దీనివల్లే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న సరుకులు పక్కదారి పడుతున్నాయని పౌర సరఫరాల శాఖ అంతర్గతంగా ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక సమర్పించింది. జంట నగరాల్లోనే సుమారు 270 మంది బోగస్ డీలర్లు ఉన్నారని, డూప్లికేట్ రేషన్ కార్డుల ద్వారా అక్రమంగా బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారని గుర్తించింది. మొత్తంగా రాష్ట్రంలో 15 నుంచి 20 శాతం సరుకులు పక్కదారి పడుతున్నాయని, ఇందులో అధికారులు సహా, మిల్లర్లు, స్టేజ్-1 కాంట్రాక్టర్లు పాత్రధారులని తేల్చింది. ఎంఎల్ఎస్ పాయింట్కు సైతం రాకుండానే 40 శాతం బియ్యం పక్కదారి పడుతోందని నివేదికలో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం అక్రమాల కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇటీవల అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు ఆరంభించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 200 దుకాణాలను తనిఖీ చేయగా 50 మందిని బోగస్గా తేల్చి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లులపైనా దాడులు కొనసాగుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. -
ఈ-పోస్.. పెద్ద ఫార్స్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం సర్కారుకు మిగులు చూపుతుండగా, రేషన్ కార్డుదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాలో ఒక్క మే నెలలోనే రూ.10 కోట్ల రేషన్ మిగిలిందని అధికారులు లెక్కలు చూపుతుండగా, ఈ విధానమే పెద్ద ఫార్స్ అని జనం మండిపడుతున్నారు. రకరకాల గిమ్మిక్కులతో రేషన్ సరఫరాలో కోత విధించేందుకు సర్కారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని విమర్శిస్తున్నారు. - రోజుకు నాలుగు గంటలు పనిచేయని మిషన్లు - రేషన్ ముగింపు కటాఫ్ డేట్లో మాయ - సీఎంను త ప్పుదారి పట్టించే నివేదికలు - ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత విజయవాడ : ప్రజాపంపిణీ వ్యవస్థలో కృష్ణాజిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం వల్ల ఒక్క మే నెలలో జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్ల రేషన్ మిగిలింది. ఈ లెక్కన కృష్ణాజిల్లాలో ఏడాదికి రూ. 120 కోట్ల బడ్జెట్ మిగులుతుంది. ఈ విధానాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అమలు చేస్తే ఏడాదికి రూ. వెయ్యి కోట్ల రేషన్ దుబారా కాకుండా మిగల్చవచ్చని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలో ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జిల్లా కలెక్టర్లు, అధికారులతో జరిగిన సమీక్షలో రేషన్ సరఫరాపై మాట్లాడారు. ఈ-పోస్ విధానం ద్వారా రేషన్ కోత విధించే ప్రక్రియ జరుగుతోందని, ఇదంతా పెద్ద ఫార్సు అని సర్వత్వా నిరసన వ్యక్తం అవుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం విస్మయానికి గురిచేస్తోంది. ఇదంతా పచ్చి బూటకమని, రకరకాల కారణాలతో రేషన్ మిగులుతోందని కార్డుదారులు విమర్శిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం ఈ-పోస్ విధానం వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ప్రరజలు విమర్శిస్తున్నారు. రకరకాల గిమ్మిక్కులతో రేషన్ కు ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీపై కొత్త విధానం ప్రవేశపెట్టిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేషన్ పొందటానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ సర్వర్లు మొరాయించి గంటల తరబడి నిలబడి వెనక్కి వెళ్లిపోవటం, ఆధార్లేని వారికి రేషన్ కోత, వేలిముద్రలు సరిపోక బియ్యం ఎగనామం, కార్డుదారుని కుటంబంలో వారికే సరఫరా చేయడంతో, వృద్ధులు, వికలాంగులకు రేషన్కు వెళ్లలేకపోతున్నారు. రేషన్ సరఫరాకు ఆఖరు తేదీ స్పష్టంగా ఉండకపోవటం వంటి కారణాలతో కార్డుదారులకు రేషన్ అందటం లేదని వాపోతున్నారు. జిల్లాలో మే నెలలో దాదాపు రూ. 10కోట్ల మేరకు రేషన్ మిగిలిపోయిందని, ఆ మొత్తం ప్రభుత్వ బడ్జెట్కు ఆదా అయిన ట్లేనని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. జిల్లాలో 2,158 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటిలో వంద క్వింటాళ్లు పంపిణీ చేసే డిపోలో నెలకు 10 క్వింటాళ్లు మిగిలిపోతున్నాయి. కాగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలు పనిచేయాల్సి ఉండగా రోజుకు నాలుగు గంటలు మిషన్లు పని చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆధార్ నంబర్ లేని వారికి రేషన్ ఇవ్వటం లేదు. జిల్లాలో ఒక శాతం మంది ఆధార్ నమోదు కాని వారు ఉండగా 11 లక్షల కార్డుదారుల్లో సుమారు 11వేల మందికి రేషన్ కట్ అవుతుందని సమాచారం. రేషన్ కోసం ఉపాధి పోగొట్టుకుని వేల కుటుంబాల వారు సరుకులు తీసుకోవడం లేదని చెపుతున్నారు. ప్రతినెలా 1వ తేదీన రేషన్ పంపిణీ ప్రారంభించి చివరి తేదీలో కూడా అధికారులు పథకం ప్రకారం మార్పులు చేస్తున్నారు. ముందుగా 15 తేదీతో రేషన్సరఫరా ఆఖరు అని ప్రకటించి, ఆ తరువాత 18, 20వరకు గడువు పొడిగించారు. ఈ విధంగా రేషన్ గడువు ముగింపు తేదీని రకరకాలుగా మార్చి, ఆ తేదీలను ప్రకటించకుండా రేషన్ ఎగవేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
రేషన్ షాపులకు సమైక్యల సహకారం
- జిల్లాలో ప్రారంభం కానున్న కొత్తవిధానం - జిల్లా వ్యాప్తంగా 421 షాపుల్లో ఏర్పాటు - ఈపాస్లు, ఐరీష్ల నిర్వాకంతో డీలాపడ్డ డీలర్లు మదనపల్లె: ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌరసరఫరాల శాఖ నూతనంగా అవలంబిస్తున్న విధానాల్లో సమైక్య మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే ఈ కొత్త విధానాలతో ఇటు వినియోగదారులు, అటు రేషన్ డీలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలనే లక్ష్యంతో ఆ శాఖ మరో కొత్త విధానానికి నాంది పలకనుంది. సాంకేతిక సమస్యల వల్ల ఈపాస్, ఐరీష్లు పనిచేయకపోవడంతో రేషన్ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు తీసుకోవ డం వారికి ఇబ్బందిగా మారింది. అయితే ఈ కొత్త విధానం వల్ల వారికి కొంత ఊరట లభించనుంది. తొలిరోజుల్లో ఈపాస్, ఐరీష్ లతో సరుకులను పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పనిచేయని వారికి, మ్యానువల్గా ఇచ్చేవారికోసం ఒక్కోషాపులో ఇద్దరు సమైక్య లీడర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రాలను ఆదేశాలు అందాయి. సమైక్య లీడర్లు మ్యాన్యువల్గా తీసుకునే వారిని గుర్తించి సరుకులు ఇవ్వాలని డీలరుకు సిఫార్సు చేయనున్నారు. జిల్లాలో మే నెల మొదటి వారం నుంచి రేషన్ షాపులలో ‘ఈపాస్‘ విధానాన్ని అమలులోనికి తెచ్చిన విషయం తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా 2,891 రేషన్షాపులుండగా, వాటిలో ప్రయోగాత్మకంగా 421షాపుల్లో ఏర్పాటు చేశారు. ఇదే షాపులకు సమైక్యలీడర్లు కూడా సహకారం అందించనున్నారు. సమస్యలను అధిగమించేందుకే సమైక్యల సహకారం... రేషన్ షాపుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకే సమైక్యల సహకారం తీసుకోనున్నామని సీఎస్డీటీ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈపాస్లు, ఐరీష్ల కు సాంకేతిక సమస్య లు వస్తున్నాయని డీ లర్లు తమ దృష్టికి తె స్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సమై క్య లీడర్ల లిస్టుకోసం మున్సిపల్ అధికారులకు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విధా నం ఎంతమాత్రం విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే. -
‘రేషన్’లో అక్రమాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రజా పంపిణీ వ్యవస్థలో క్షేత్రస్థాయి అక్రమాలకు కళ్లెం వేసేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది. సరుకుల పంపిణీలో కీలకమైన రేషన్ డీలర్ల మాయాజాలానికి తెరవేసేందుకు ఆకస్మిక తనిఖీలకు నడుంబిగించింది. జాయింట్ కలెక్టర్ మొదలు.. జిల్లా పౌరసరఫరాల అధికారి, సహాయ పౌరససరఫరాల అధికారి, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లంతా కలిసి ఇరవై బృందాలుగా ఏర్పడి సోమవారం మూకుమ్మడిగా తనిఖీలు చేపట్టారు. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని 75 దుకాణాలను పరిశీలించారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్రమంగా కొనసాగుతున్న డీలర్లు.. ప్రజలకు పంపిణీ చేసే సరుకులు బొక్కేసిన నిర్వాహకుల బాగోతాలు వెలుగుచూశాయి. రేషన్ దుకాణాల్లో బినామీలు పాతుకుపోయినట్లు యంత్రాంగం గుర్తించింది. సోమవారం మల్కాజిగిరి డివిజన్లో 75 దుకాణాలను తనిఖీ చేయగా అందులో పది శాతం బినామీలే ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరిపై పౌరసరఫరాల చట్టం ప్రకారం సెక్షన్7, 407 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. అదేవిధంగా మరికొన్ని దుకాణాల్లో సరుకుల పంపిణీ తర్వాత మిగులు సరుకుల కోటాలోనూ భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇకనుంచి తనిఖీలే తనిఖీలు.. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల గుట్టు తేల్చేందుకు జిల్లా వ్యాప్తంగా వరుసగా వారం రోజుల పాటు తనిఖీల ప్రక్రియ కొనసాగించాలని యంత్రాంగం నిర్ణయించింది. అదేవిధంగా వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి దుకాణాల్లో సరుకుల పంపిణీపై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8వరకు తనిఖీలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తనిఖీ చేస్తారు. -
కూరలేని అన్నం..!
► రేషన్ దుకాణాల్లో కందిపప్పు, పామాయిల్ నిల్ ► కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్తోనే సరి ► ఏడాదిగా పేదల కడుపు కాల్చుతున్న సర్కారు ► పండగ సమయాల్లో మాత్రమే హడావుడి తెనాలిఅర్బన్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయమంటున్న ప్రభుత్వం వారి మనుగడకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీని సమర్థంగా అమలు చేయలేకపోతోంది. పండగల సమయంలో మాత్రం పప్పు, బెల్లాలు పంపిణీ చేసి చంకలు కొట్టుకుంటున్న ప్రభుత్వం, నిత్యావసరాల పంపిణీ కుంటుపడినా పట్టించుకోవటం లేదు. కొత్త ప్రభుత్వంలో కందిపప్పు, పామాయిల్ మచ్చుకైనా సరఫరా చేయకపోవటం ఈ పరిణామాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. సబ్సిడీ భరించలేకే సరఫరా నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ వైనా నికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రధానంగా జాతీయ ప్రజా పంపిణీ విధానం ద్వారా ప్రతినెలా పేదలకు బియ్యం, కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమలు, కిరోసిన్ తదితరాలను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తొలుత రేషన్కార్డులకు ఆధార్ను అనుసంధానం చేసింది. తాజాగా ఈ-పాస్ విధానాన్ని మున్సిపల్ కేంద్రాల్లో అమల్లోకి తెచ్చింది. పురిట్లోనే అవరోధాలు ఎదుర్కొన్న ఈ విధానాన్ని ప్రభుత్వం ఏదోలా సరిదిద్దుకునేందుకు నానా తంటాలు పడుతోంది. త్వరలో గ్రామాల్లోనూ అమలుకు చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. అసలు పంపిణీ చేయాల్సిన కందిపప్పు, పామాయిల్ సంవత్సర కాలంగా లబ్ధిదారులకు దక్కని పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి సంస్కరణలు ఏమిటని ఇప్పుడు పేదలు నిలదీస్తున్నారు. దాదాపు సంవత్సర కాలంగా పామాయిల్, కందిపప్పు, గోధుమలు పంపిణీ లేదు. కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్ మినహా మిగిలిన సరుకులన్నీ పేదలకు దూరమయ్యాయి. పండగలకు పప్పుబెల్లాలతోనే సరా... సంక్రాంతి పండగను పురస్కరించుకుని ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరిట ప్రభుత్వం హడావుడి చేసిన సంగతి తెలిసిందే. నెయ్యి, నూనె, శనగలు, బెల్లం, కందిపప్పు వంటి సరుకులను ఓ ప్యాకేజీగా అందించింది. దానిలోనూ నాణ్యత డొల్లేనన్న విమర్శలూ లేకపోలేదు. అయితే పండగలకు హడావుడి చేసిన ప్రభుత్వం పేదల రోజువారీ జీవన విధానాన్ని విస్మరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పండగలకు అందించిన పప్పుబెల్లాలు సంవత్సరమంతా కడుపునింపుతాయా అంటూ ఇప్పుడు పేదలు నిలదీస్తున్నారు. సబ్సిడీ భరించలేకే.... దాదాపు సంవత్సరకాలంగా కందిపప్పు, పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించేది, వారు చేతులెత్తేశారు. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా దానిపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. -చిట్టిబాబు, డీఎస్వో, గుంటూరు -
సకాలంలో సరుకులు
పేదలకు ప్రతి నెలా 15వ తేదీలోగా రేషన్ సరుకులు అందేలా ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా రూపొందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్రెడ్డి చెప్పారు. మూడు పద్ధతుల ద్వారా చౌకధరల దుకాణాలను పునర్వ్యవస్థీకరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నామని తెలిపారు. రేషన్ దుకాణాల రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 20 వరకు ముగుస్తుందని, దీని ద్వారా ఇప్పుడున్న 1,338 దుకాణాలకు తోడుగా మరికొన్ని పెరగవచ్చన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పకడ్బందీగా ప్రజాపంపిణీ వ్యవస్థ - మూడు పద్ధతులలో దుకాణాల పునర్వ్యవస్థీకరణ - రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 20 వరకు పూర్తి - రేషన్ సరుకులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు - ‘కస్టమ్స్ మిల్లింగ్ రైస్’ పెండింగ్పై సీరియస్ - అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగం - జిల్లాకు 45 వేల ‘దీపం’ కనెక్షన్లు మంజూరు - జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్ రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్కార్డులు, దుకాణాల రేషనలైజేషన్, కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ, రబీ ధాన్యం కొనుగోళ్లు, ‘అకాల’ పంటల నష్టం పై ప్రభుత్వానికి పంపిన తుది నివేదిక తదితర అంశాల గురించి వివరించారు. ఆయన మాటలలోనే... ‘ప్రజాపంపిణీ’లో అక్రమాలు సహించం. ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నాం. బోగస్ డీలర్లు, రేషన్ దుకాణాలు, కార్డులపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నాం. ప్రజాపంపిణీ వ్యవస్థలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు పాల్పడే రేషన్ డీలర్లపై 6ఎ చట్టం ప్రయోగిస్తాం. రేష న్ సరుకులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుం టాం. ఇప్పటికే 12 మంది డీలర్లకు నోటీసులు జారీ చేశాం. ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అ ందేలా చూస్తాం. ప్రతి నెల 22లోగా, వచ్చే నెల సరుకుల కోసం డీడీలు తీసి సంబంధిత అధికారులకు అందజేయూలి. 23 నుంచి సరుకులు పంపిణీ చేసే నెల ఒకటవ తేదీ వరకు మండల స్థాయి స్టాక్ పాయింట్ నుంచి సరుకులు అందుతారు. 1 నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేసి, 16న ముగింపు నిల్వల వివరాలు చూపాలి. -
ఈ పాస్ ఫెయిల్..అయినా రేషన్
ఈ నెలకు పాతపద్ధతిలోనే సరకుల పంపిణీ వేలిముద్రలు తీసుకుని పంపిణీకి పౌరసరఫరాల అధికారులకు ఆదేశం సాక్షి, విశాఖపట్నం : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) మిషన్లు జిల్లా ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మిషన్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ కావడం, సెల్నెట్వర్క్ పనిచేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా వినియోగ దారులు నరకంచూస్తున్నారు. ఈపాస్ మిషన్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని జిల్లాఅధికారులు తేల్చి చెప్పడంతో డీలర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆది నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీలర్లు పనిచేయని మిషన్లను మూలన పెట్టేస్తున్నారు. కొత్త విధానంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం 30 శాతం మంది కార్డుదారులు రేషన్కు నోచుకోలేదు. యలమంచిలి, అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం పట్టణాల్లో 274 షాపులపరిధిలో మిషన్లు పని చేయకపోయినా, సర్వర్లు ఇబ్బంది పెడుతున్నా అతికష్టమ్మీద ఇప్పటి వరకు 60 శాతం కార్డు దారులకు రేషన్ సరఫరా చేయగలిగారు. వీటిలో ఈపాస్ మిషన్ల ద్వారా 20 శాతం కార్డుదారులకు సరకులివ్వగా, మిగిలిన 40 శాతం కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. ఇక విశాఖలోని 412 రేషన్ షాపుల్లో కొత్త విధానాన్ని ఒకేసారి అమలు చేశారు. ఈ షాపుల పరిధిలో 3,71,625 కార్డులుండగా, ఇప్పటి వరకు అతికష్టమ్మీద 75వేల కార్డుదారులకు పంపిణీ చేయగా,మరో 1.19లక్షల కార్డుదారులకు పాత పద్ధతిలోనే సరఫరా చేశారు. ఇప్పటి వరకు జీవీఎంసీపరిధిలో 54 శాతం మంది కార్డు దారులకు సరకులు పంపిణీ చేశారు. రోజూ రేషన్దుకాణాలకు వందలాదిమంది కార్డుదారులు రావడం...గంటలతరబడి నిరీక్షించడం..చివరకు మిషన్లు పనిచేయక, సర్వర్లు డౌన్కావడం వంటిసమస్యలతో వెనుదిరిగడం పరిపాటిగా మారుతోంది. ముఖ్యంగారోజువారీ కూలీ పనులు చేసుకునే నిరుపేదల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గత పదిహేను రోజుల్లో సుమారు పదిరోజుల పాటు రేషన్షాపుల చుట్టూనే తిరగడం వలన జీవనోపాధి కోల్పోయే కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. మారుమూల ప్రాంతాల్లో తెల్లవారుజామున నెట్వర్క్ పనిచేస్తోంది. దీంతో కార్డుదారులను ఉదయమే రమ్మని చెప్పి స్లిప్లు ఇస్తుండడంతో వేకువజాము నుంచే షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. తాను వారం రోజులుగా క్రమం తప్పకుండా ఎఫ్పీషాపు చుట్టూ తిరుగు తున్నానని, ఒక రోజు సర్వర్ డౌన్ అయిందని..మరో రోజు నెట్వర్క్ లేదని.. ఇంకో రోజు మిషన్ పనిచేయడం లేదని తిప్పుతున్నారని..చివరకు వేలిముద్రలు తీసుకున్నా ఒకే కాక తర్వాత రమ్మని చెప్పి పంపిస్తున్నారని విశాఖ సీతమ్మధారకు చెందిన సీహెచ్ అప్పలనాయుడు వాపోయారు. ఇతర మున్సిపాల్టీల్లోనూ ఇదే దుస్థితి. దీంతో పాత పద్ధతిలోనే సరకులిచ్చేందుకు అనుమతులివ్వాలని డీలర్లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రభుత్వ ఈవిధానాన్ని పక్కన పెట్టేందుకు ససేమిరా అంటోంది. దీంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు గుర్తించినప్పటికీ జిల్లా అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. చివరకు వేలిముద్రలు తీసుకుంటే చాలు..మిషన్ ఫెయిల్ అయినా కార్డుదారులను తిప్పించుకోకుండా ఈ నెల వరకు సరకులు ఇవ్వా ల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్ ఆదేశాలు జారీచేశారు. నాలుగు రోజుల నుంచి ఇదే ప్రక్రియలో సరకుల పంపిణీ వేగం పుంజుకుంది.ఈ పాస్ మిషన్లను పక్కన పెట్టయినా 25వ తేదీలోగా సరకుల పంపిణీ పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. -
కొత్త కార్డులు లేనట్లే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు అరికట్టడం, బోగస్రేషన్ కార్డుల ఏరివేత లక్ష్యంగా ఆహార భద్రత కార్డులు(ఎఫ్ఎస్సీ) జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 10వ తేదీ నుంచి సుమారు 20రోజుల పాటు క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10.80లక్షల మంది ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల కోసం కుప్పలుగా దరఖాస్తులు రావడం తో కొత్త రేషన్కార్డుల(ఎఫ్ఎస్సీ) జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో ఆహార భద్రత కార్డుల జారీపై దృష్టి సారించారు. కాగా, 2015 జనవరి 1వ తేదీన నాటికి కొత్తకార్డులు జారీ చేయడంతో పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. గడువు సమీపిస్తున్నా ఆహార భద్రత కార్డులకు అర్హులను తేల్చడంలో అధి కార యంత్రాంగం విఫలమైంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయినా వివరాలు కంప్యూటరీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు 10.71 లక్షల దరఖాస్తుల పరిశీలన (99.14శాతం) పూర్తి చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వాటిలో 30 శాతం లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఆహారభద్రత కార్డులకు అర్హుల సంఖ్య స్పష్టమవుతోంది. కార్డల సంఖ్యలో కోత? ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో 9,85,557 కుటుంబాలుగా తేల్చారు. అయితే వివిధ కేటగిరీల కింద పౌరసరఫరాల శాఖ అధికారులు 11,73,988 రేషన్కార్డులు జారీచేశారు. ఈ నేపథ్యంలో బోగస్ కార్డులను తొలగిస్తూ వాటి స్థానంలో ఆహారభద్రత కార్డులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు దరఖాస్తుల పరిశీలన, కంప్యూటరీకర ప్రక్రియ పూర్తయితే కార్డుల సంఖ్యలో భారీగా కోత పడనుంది. కార్డులు, యూనిట్ల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గడంఖాయమని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ‘సాక్షి’కి సూచనప్రాయంగా వెల్లడించారు. గతంలో ఒక్కోయూనిట్కు రూపాయికి కిలో చొప్పున నాలుగు కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేవారు. ప్రస్తుతం యూనిట్ కు ఆరు కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కార్డుల జారీప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో పాత కార్డులపైనే యూనిట్కు ఆర కిలోల చొప్పున ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో గతంలో ఉన్న కార్డులు, యూనిట్ల సంఖ్య ఆధారంగానే జనవరి కోటాకు సంబంధించి డీలర్ల నుంచి డీడీలు తీసుకుంటున్నారు. జనవరి కోటాకు సంబంధించి 2310 మం డీలర్లలో 1572 మంది డీడీలు సమాచారం. నెలాఖరులోగా ఆహారభద్రత కార్డల దరఖాస్తులను కంప్యూటరీకరించి అర్హుల సంఖ్యను తేల్చుతామని జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ యాసీస్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ!
జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. కందిపప్పు కూడా పంపిణీ చేయడం లేదు. దీంతో జిల్లాలోని సుమారు 11లక్షల మంది తెల్లకార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పామాయిల్ ఇవ్వాలని పేదలు కోరుతున్నారు. విజయవాడ : ఆధార్ సీడింగ్.. పథకాల మార్పు పేరుతో పౌరసరఫరాల విభాగం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని చౌకధరల దుకాణాల్లో పేదలకు సరుకులు సక్రమంగా అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే ఇస్తున్నారు. అక్కడక్కడా గోధుములు కూడా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,148 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా షాపుల ద్వారా 11,27,903 తెల్ల కార్డుదారులకు సరుకులు సరఫరా చేయాల్సి ఉంది. ఒక్కో కార్డుకు కిలో పామాయిల్ అందించాల్సి ఉంది. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిపివేయడంతో పేదలు మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు సరుకుల పంపిణీకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సంక్రాంతికి కూడా తమకు పచ్చడిమెతుకులేనని పేదలు వాపోతున్నారు. ‘అమ్మహస్తం’కు బ్రేక్ గత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మహస్తం పథకం పేరుతో తొమ్మిది రకాల సరుకులను 199 రూపాయలకు అందజేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో ఎన్టీఆర్ పేరుతో ‘అన్నహస్తం’ అనే కొత్త పథకాన్ని జనవరి నుంచి ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. కానీ, దీనిపై నేటి వరకు అధికారులకు ఉత్తర్వులు అందలేదు. సంక్రాంతికి గిఫ్ట్ ప్యాక్ అందేనా! పేదల నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం ‘గిఫ్ట్ ప్యాక్’కు రూపకల్పన చేసినట్లు తెలిసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో చౌకధరల దుకాణాల ద్వారా ఎన్టీఆర్ పేరుతో ఈ గిఫ్ట్ ప్యాక్లను అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్యాక్లో తక్కువ ధరకు బెల్లం, కందిపప్పు, సన్ఫ్లవర్ ఆయిల్ అందిస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే రేషన్ షాపు ద్వారా పాత పద్ధతిలోనే అన్ని సరుకులు పంపిణీ చేయాలని పేదలు కోరుతున్నారు. పేదల ఇబ్బందులు వర్ణణాతీతం ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలేదు. టీడీపీ ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లేదు. పామాయిల్ ఇవ్వడంలేదు. ఇతరసరుకులు కూడా అరొకరగా ఇస్తున్నారు. మార్కెట్లో సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. కొనుగోలు చేయలేక పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - సీహెచ్ బాబూరావు, సీపీఎం నగర కార్యదర్శి -
పీడీఎస్ అక్రమాలకు అడ్డుకట్ట!
జనవరి నుంచి తెలంగాణలో అమల్లోకి కొత్త వ్యవస్థ ‘సప్లయ్ చైన్ మేనేజ్మెంట్’ విధానం అమలుకు కేంద్రం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సరుకుల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు ఇకపై అడ్డుకట్ట పడనుంది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పంపిణీ వ్యవస్థ(సప్లయ్ చైన్ మేనేజ్మెంట్) ద్వారా పీడీఎస్ను మరింత సమర్థంగా నిర్వహిం చేందుకు వీలు చిక్కనుంది. ఇప్పటికే ఈ-పీడీఎస్ విధానంతో 69 లక్షల మంది అనర్హులను తొలగించిన పౌరసరఫరాల శాఖ.. కేంద్రం ఆదేశాల మేరకు జనవరి నుంచి కొత్త పంపిణీ వ్యవస్థను అమలు చేసేం దుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో రేషన్ పంపిణీ అంతా మాన్యువల్గా జరుగుతుండటంతో అన్ని స్థాయిల్లో అక్రమాలు చోటుచేసుకున్నా యి. అధికారులు, డీలర్లు చేతివాటం చూపడంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. బోగస్ కార్డుల ద్వారానే ఏటా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అనర్హుల చేతుల్లోకి వెళ్లింది. కిరోసిన్ అక్రమ మళ్లింపుల ద్వారా ఏటా రూ.1800 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని కేంద్రం తేల్చిం ది. లోపాలపుట్టగా మారిన పీడీఎస్ విధానాన్ని మార్చాల్సిన అవసరాన్ని కాగ్ తన నివేదికలో పేర్కొంది. కొత్త విధానంతో పూర్తి పారదర్శకం.. ఈ అక్రమాలను నిరోధించే క్రమంలో కేంద్రం కొత్తగా సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో మూడు నెలల కిందటే ఈ విధానాన్ని ప్రారంభించింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో జనవరి నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఎఫ్సీఐ నుంచి చౌక ధరల దుకాణం వరకు సరుకుల సరఫరా, పంపిణీకి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలి. సరుకు రవాణా చేసే ట్రక్కుల సమాచారం ఎమ్మార్వో మొదలు కిందిస్థాయి అధికారి, డీలర్, గ్రామ ఆహార సంఘం సభ్యుడి వరకు చేరేలా సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకూ సరుకు వివరాలు చేరుతాయి. దీంతో ఎక్కడా అక్రమాలకు తావుండదు. ఈ వ్యవస్థ అమలుకు వీలుగా రాష్ట్రంలోని 172 మండలస్థాయి స్టాక్ పాయింట్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. జిల్లాల అధికారులకు సైతం దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. -
17,79,835
సంక్షేమ పథకాలకోసం వచ్చిన దరఖాస్తులు ► ఆహారభద్రత కోసం 9,93,277 ► పెన్షన్లకు 4,79,802 ► కుల ధ్రువీకరణకు 1,09,421 ► ఆదాయ సర్టిపికెట్కు 1,06,321 ► స్థానికత కోసం 91,014 దరఖాస్తుల వెల్లువతో అధికారులు ఉక్కిరిబిక్కిరి సోమవారంతో ముగిసిన గడువుకంటే అధికంగా నమోదయ్యాయి. సంక్షేమ పథకాలకు కొత్తగా దరఖాస్తులకు గడువు ముగియడంతో వచ్చిన వాటన్నింటినీ డివిజన్ల వారీగా పొందుపరిచారు. జిల్లాలో ఇప్పటివరకు ఆహారభద్రత కోసం 9,93,277, ఫించన్ల కోసం 4,79,802, కులధ్రువీకరణకు 1,09,421, ఆదాయం కోసం 1,06,321 స్థానిక త కోసం 91,014 దరఖాస్తులు వచ్చాయి. ఇంత భారీ ఎత్తున దరఖాస్తులు రావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురవతున్నారు. మళ్లీ మొదటికి... ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని భావించిన సీఎం కేసీఆర్ బోగస్ రేషన్కార్డులను ఏరివేసేందుకు ఆధార్ అనుసంధానం చేయించారు. కుటుంబాల సంఖ్య కంటే అదనంగా రేషన్కార్డులున్నాయని, యుద్ధప్రాతిపదికన తగ్గించే ప్రయత్నాలు చేశారు. గతంలో జిల్లాలో బీపీఎల్ కార్డులు 9,85,478 ఉండగా... వీటిలో దాదాపు 40వేల వరకు ఏరివేశారు. తాజాగా కొత్త కార్డులకు దరఖాస్తులకు ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 9,85,557 కుటుంబాలున్నట్లు వెల్లడైంది. కొత్త రేషన్కార్డులకు, ఫించన్లకు ప్రభుత్వం కొన్ని షరతులను విధించడంతో ఈ సారి భారీగా తగ్గవచ్చని భావించారు. మొత్తం కుటుంబాలలో దాదాపు 60 శాతం వరకు మాత్రమే ఆహారభద్రత కోసం కార్డు వస్తాయని అధికారులు భావించారు. కానీ తీరా గడువు ముగిసే సరికి కుటుంబాల కంటే కార్డుల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. జిల్లాలో గతంలో 2,45,639 వృద్దాప్య ఫించన్లు, 1,30,718 వితంతు, 46,484 వికలాంగులు, 14,416 చేనేత, 1,408 గీత కార్మికుల, 20,771 అభయహస్తం ఇలా మొత్తం 4,59,436మంది ఫించన్లు తీసుకునేవారు. అయితే కొత్త దరఖాస్తులు మాత్రం 4,79,802 వచ్చాయి. అధికారులకు కొత్త చిక్కులు.. ఆహారభద్రత, ఫించన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క మండల పరిధిలో ఎమ్మార్వో, ఎంపీడీఓ తదితరుల ఆధ్వర్యంలో మొత్తం ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ఇప్పటికే గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. వీరంతా గ్రామాల్లో ఈ నెల 26 నాటికి, పట్టణాలలో 30నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి గట్టి ఆదేశాలు అందాయి. పరిశీలనలో ఏమైనా అవకతవకలు జరిగితే దానికి సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరికలున్నాయి. అయితే ఇన్ని దరఖాస్తులను ఎప్పుడు పూర్తి చేయాలో తెలియక అధికారులు సైతం సతమతమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం కొత్త ఫించన్లకు సంబంధించి నవంబర్ 2 నుంచి 7 వరకు అర్హతగల వారికి ఉత్తర్వులు ఇచ్చి, 8వ తేదీన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా డబ్బు అందజేయాలని భావిస్తోంది. -
ఇక ఖరీఫ్ కొనుగోళ్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ధాన్యం సేకరణకు యాక్షన్ప్లాన్ విడుదలైంది. ఇందుకోసం జిల్లాలో 290 కేం ద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్ర భుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు మార్గదర్శకాలను నిర్దేశించారు. డీఆర్డీఏ ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ ఏడాది రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధా న్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. 36 మండలాలలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు. గతేడాది ఇదే సీజన్లో 280 కేంద్రాల ద్వారా 1,39,500 మెట్రి క్ టన్నులు కొనుగోలు చేయగా, ఈసా రి పెరిగిన ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అవసరాల దృష్ట్యా మరో పది కేంద్రాలను అదనంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 6 వరకు దశల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేసి, దసరా తర్వాత కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈసారీ సీఎంపీనే 2014-15 ఖరీఫ్ యాక్షన్ప్లాన్ ప్రకారం జిల్లాలో ఈ సీజన్లో 3,20,761 లక్షల హెక్టార్లకు గాను 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.33 లక్షల హెక్టార్లలో సోయా, 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 13,500 హెక్టార్లలో పత్తి, 13,500 హెక్టార్లలో పసుపు సాగవుతుందని అంచనా వేయగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 2,12,680 హెక్టార్ల లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 86,881 హెకార్లలో రైతులు వరిని సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే 19 వేల హెక్టార్లలో వరి సాగు తగ్గింది. ఈ నేపథ్యం లో రైతులు, పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఈసారి పౌరసరఫరాల శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ ద్వారా 50 కేంద్రాలు, పీఏసీఎస్ల ద్వారా 240 కేంద్రాలను నిర్వహించనున్నారు. వీటి పర్యవేక్షణకు డిప్యూటీ తహశీల్దార్లను సూపర్వైజర్లుగా నియమించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసేందుకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఉన్న సీడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ గోదాములు, కొన్ని రైసుమిల్లులను ఎంపిక చేశారు. ఆ తరువాత ధాన్యాన్ని వీలైనంత మేరకు ఈసారి కూడ కస్టమ్ మిల్లిం గ్ కోసం రైసుమిల్లర్లకు అప్పగించనున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు శిక్ష ణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న క్రమంలో తేమ లేకుండా ధాన్యం మార్కెట్కు తర లించేలా చూడాలని ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. మహిళా సంఘాలకు గతం (2010-11)లో ధాన్యం కొనుగోలుపై రూ.100లకు రూ.1.50లు కమీషన్ చెల్లించిన ప్రభుత్వం 2011-12లో రూ.2.50లకు పెంచింది. ఈసారి ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని గ్రేడ్-ఎ రకం ధాన్యం క్వింటాలుకు రూ.1,400, కామన్కు రూ. 1,365 చెల్లించి కొనుగోళ్లు జరపాల్సి ఉంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి కొనుగోళ్లు జరిగేలా చూడాలని రైతులు అంటున్నారు. ధాన్యంలో తేమ 14 శాతం దాటితే కొనుగోలు చేయకూడదన్న నిబంధనలతో పాటు గ్రేడ్-ఎ, కామన్ రకాల ధాన్యంలో రా రైసుమిల్లుకు విరుగుడు 25 శాతం, బాయిల్డ్కైతే 16 మించకుండా చూడాలన్న నిబంధన కూడ ఉంది. అయితే నిబంధనల పేరిట రైతులకు కనీస మద్దతు ధరకు ప్రతిబంధకాలు కలగకుండా చూడాలని అధికారులను రైతులు కోరుతున్నారు. -
పెద్దోళ్ల ‘చౌక’ దందా
చౌకగా దొరికే రేషన్ బియ్యాన్ని వండుకుని ఆకలి తీర్చుకుంటూంటారు నిరుపేద వర్గాల వారు. అది వారి నిత్యావసరం కూడా. అలాంటి వారి కడుపు కొట్టాలనే ఆలోచన ఎంతటి కఠిన హృదయం ఉన్న వారికి కూడా కలగదు. కానీ.. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అంతకంటే మించిపోయారు. రేషన్బియ్యం, కిరోసిన్ను బొక్కి, జేబులు నింపుకోవాలనేది వారి దురాలోచన. అంతటితో ఆగ కుండా రేషన్ డీలర్లతో ‘చీకటి ఒప్పందాలు’ కూడా చేసేసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థనే తమ దుకాణంలా మార్చుకుని, పేదల బతుకులను అపహాస్యం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో విజయవంతమైన బయోమెట్రిక్ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసి ప్రజా పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టాలని సీఎం చంద్రబాబు గొప్పగా చెబుతారు. అయితే ఆయన పార్టీకే చెందిన, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు మాత్రం చౌకధరల దుకాణాలపై పడి పైసలేరుకునే చీకటి ఒప్పందాలతో ప్రజాపంపిణీని అవినీతిమయం చేస్తున్నారు. చౌకధరల దుకాణాల ద్వారా జరిగే ప్రజాపంపిణీలో అవినీతికి ఆస్కారం ఒకింత ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు పూర్తిగా రేషన్షాపు డీలర్లనే తప్పు పట్టలేం. కార్డుదారులు కూడా బాధ్యులే. అటువంటి వ్యవస్థ ఆసరాగా చేసుకుని కొందరు ప్రజాప్రతినిధులు తమకున్న ‘అధికార బలం’తో నెలవారీ మామూళ్లకు బరి తెగిస్తున్నారు. చౌకధరల దుకాణాల నిర్వాహకులు కూడా ఎంతో కొంత సర్దుబాటు చేసుకుంటే చాలనే ముందుచూపుతో వారి ఆదేశాలకు జీ హుజూర్ అంటున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, దాంతో కలిసి ఉండే కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రహస్య ఒప్పందాలు ఖరారై, వసూళ్ల పర్వానికి తెర లేచింది. కాకినాడ నగరంలో 117, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 111 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి నిర్వాహకులు, నియోజకవర్గాల్లో ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య మూడు దఫాలు జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో వసూళ్ల పర్వం ప్రారంభమైంది. ఇందులో రెండు రకాల ఒప్పందాలు జరిగాయి. నెలకు ఒక నియోజకవర్గం నుంచి నగదు రూపంలో కొంత, మిగులు బియ్యం అమ్మకాలుగా కొంత. ఉదాహరణకు కాకినాడ నగరంలోని దుకాణాల నుంచి నెలకు రూ.1.20 లక్షలు, 23 క్వింటాళ్ల బియ్యం, కాకినాడ రూరల్లో రూ.90 వేలు, 22 క్వింటాళ్ల బియ్యం ముట్టజెప్పాలనేది వీరి మధ్య కుదిరిన ఒప్పందం. ఇది ఈ నెల నుంచి ప్రారంభం కావాలనే అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఈ ఒప్పందం ప్రతి నెలా పక్కాగా అమలు జరిపేందుకు ఒక్కో దుకాణం నిర్వాహకుడు రూ.1000 నుంచి రూ.1300 వంతున భరించేలా నిర్ణయించారని తెలియవచ్చింది. ఈ రెండు ఒప్పందాలు కాకుండా మరో కీలకమైన ఒప్పందం మరింత విస్మయాన్ని కలిగిస్తోంది. కొందరు డీలర్లు కార్డుదారుల నుంచి కిలో బియ్యం రూ.13, కిరోసిన్ రూ.24కు కొనుగోలు చేయడం పరిపాటి. బహిరంగ మార్కెట్లో బియ్యం రూ.16, కిరోసిన్ రూ.30 వంతున అమ్ముకుంటూ ‘నాలుగు పైసలు’ వెనకేసుకుంటున్నారు. ఆ సొమ్ము నుంచే అన్ని స్థాయిల వారికి ముట్టజెప్పుకొనే పరిస్థితి. నెలాఖరున ఒకటి, రెండు క్వింటాళ్ల బియ్యం, 10 లీటర్ల కిరోసిన్ మిగులుతున్నట్టు చూపుతూ, సంచుల అమ్మకాలు సహా మిగిలిన సర్దుబాట్లతో డీలర్లు గట్టెక్కుతున్నారు. ఇక ముందు వాటిని కూడా అధికారులకు చూపించాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు ఎదురైతే తాము చూసుకుంటామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారని తెలిసింది. ఇక్కడ మరో తిరకాసు కూడా ఉంది. మిగులు బియ్యం, కిరోసిన్ కూడా తాము సూచించే తమ వారికి మాత్రమే, అది కూడా వారు చెప్పే ధరకే విక్రయించాలనే షరతు అమలుచేస్తున్నారు. ఇందుకు సమ్మతించకుంటే మిగులు బియ్యం మార్కెట్లో విక్రయించే చర్యలపై ఉక్కుపాదం మోపుతామనే హెచ్చరికలతో నిర్వాహకులు దిగివచ్చి ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లో పీడీఎస్ బియ్యం కిలో రూ.16, కిరోసిన్ లీటరు రూ.30 వరకు అమ్ముకుంటున్నట్టుగానే అనుమతించాలన్న నిర్వాహకుల ప్రతిపాదనను ప్రజాప్రతినిధులు తిరస్కరించారని సమాచారం. నిర్వహణ నుంచి తప్పుకోమంటే తప్పుకుంటాం, ఆ ప్రతిపాదన కష్టసాధ్యమని చేతులెత్తేయగా కాకినాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త రంగంలోకి దిగి ఉభయుల మధ్య సమన్వయం సాధించారని సమాచారం. చివరకు కిలో బియ్యం రూ.14, కిరోసిన్ లీటరు రూ.25 వంతున ప్రజాప్రతినిధులు నిర్ణయించిన వారికే విక్రయించాలనే ఒప్పందానికి వచ్చారు. ఈ రకంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు బరితెగింపు ఆనోటా, ఈనోటా బయటకు పొక్కడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
అస్తవ్యస్తం !
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయా.. లేదా.. అని చూసేందుకు సరిపడా అధికారులు లేరు. ఫలితంగా ప్రజా పంపిణీ సజావుగా సాగడం లేదు. జిల్లాలో ఒక్కో డివిజన్కు ఒక ఏఎస్వో స్థాయి అధికారి విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వీరు జిల్లాలో అవసరమైనంత మంది లేకపోవడంతో పర్యవేక్షణ పడకేసింది. జిల్లాలో ఉన్న రేషన్ షాపులు, కిరోసిన్, వంటగ్యాస్ సంస్థలపై తరచుగా ప్రత్యేక బృందాలు దాడులు చేస్తేనే పౌరసరఫరాలో లోటుపాట్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి దాడులు లేకపోవడంతో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కిరాణం షాపుల్లో, మిల్లర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. వంట గ్యాస్ సిలెండర్లను కమర్షియల్ సిలెండర్లుగా, వివిధ కార్లకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఏఎస్వో స్థాయి అధికారులు సరిపడా లేకపోవడంతో మండల కేంద్రాల్లో ఉన్న సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదుగురికి ఒక్కరే... ప్రజా పంపిణీ వ్యవస్థపై పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ఒక అధికారి ఉంటారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు, డీఎస్వో కార్యాలయంలో పాలన పరమైన అంశాలు చూసేందుకు మరొకరు జిల్లా కేంద్రంలో ఉంటారు. అయితే జిల్లాలో ఐదుగురు ఏఎస్వోలకు గాను ప్రస్తుతం ఒక్కరే డీఎస్వో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నా రు. మిగిలిన నాలుగింటిలో భద్రాచలం డివి జన్లో పోస్టు ఖాళీగా ఉంది. ఇక ఖమ్మం ,కొత్తగూడెం, పాల్వంచలలో పని చేస్తున్న వారు డిప్యూటేషన్పై హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. అలాగే భద్రాచలం డివిజన్లో ఒక్క డీటీ మాత్రమే పనిచేస్తున్నారు. బూర్గం పాడు మండలంలో సైతం సివిల్ సప్లై డీటీ పోస్టు ఖాళీగానే ఉంది. పర్యవేక్షణ కరువు.... డివిజన్ పరిధిలో ఏఎస్వో స్ధాయి అధికారి విధుల్లో కొనసాగితే ఆ పరిధిలోని డిప్యూటి తహశీల్దార్లను అప్రమత్తం చేస్తూ అక్రమ మార్గంలో తరలే నిత్యావసర వస్తువులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అయితే పై స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండలస్ధాయిలో సివిల్ సప్లై డీటీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ దందా ..... సరైన పర్యవేక్షణ లేని కారణంగా రేషన్ బియ్యం అక్రమ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ప్ర జా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కిరోసిన్ అక్రమదందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడో ఒకసారి జరిగే దాడుల్లో దొరుకుతున్నప్పటికీ అంత గా చర్యలు లేకపోవడంతో అక్రమ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా కొనసాగుతోంది. పెద్దల ముసుగులో అక్రమ వ్యాపారం... జిల్లాలో బియ్యం, కిరోసిన్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువులు అక్రమ మార్గంలో తరలివెళ్లడంలో పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దల ముసుగులో కొందరు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం జిల్లా అధికారులకు తెలుసో.. తెలియదో కానీ కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం అక్రమార్కుల జోలికి వెళ్లడంలేదు. ఒకవేళ ఎవరినైనా పట్టుకుంటే ‘పెద్దాయన.. అదే మీబాస్ మా దగ్గరి చుట్టం.. ఆయనతో మాట్లాడించాలా’ అని అనడంతో మాకెందుకులే అని సిబ్బంది నోరు మెదపకుండా వస్తున్నారు. ఈ తరహా వ్యవహారం ఖమ్మంలో అధికంగా సాగుతోందని పౌరసరఫరాల అధికారులే పేర్కొనడం కొసమెరుపు. -
పేదల రేషన్లో పప్పు,ఉప్పు కట్!
కంది పప్పు, ఉప్పు కొరతతో రేషన్కార్డుదారులకు ఇక్కట్లు ధర పెరగడంతో కాంట్రాక్టుకు వెనుకాడుతున్న ప్రభుత్వం చింతపండు, పసుపు,కారం సరఫరాకు మంగళం? విజయనగరం కంటోన్మెంట్: ఏదైనా పథకానికి పేరు మారుస్తున్నారంటే ఏమనుకోవాలి? అందులో లోపాలను సరిదిద్ది సరి కొత్తగా ప్రజానీకానికి నాణ్యమైన సేవలందిస్తారనేగా.... కానీ తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో పేర్లు మాత్రమే మారుతాయి... పథకాలు నిర్వీర్యమవుతాయడానికి ఉదాహరణే ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇంత వరకూ పడుతూలేస్తూ ఏదోరకంగా అమ్మహస్తం పేరుతో తొమ్మిదిరకాల సరుకులను అందిస్తుండగా.... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథ కం పేరును ఎన్టీఆర్ ప్రజా పంపిణీగా మార్చారు. పసుపు రంగు కూపన్లు కూడా ప్రింట్ చేసి గ్రామాల్లో పంపిణీ చేశారు. అయితే ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకం జాబితాలో ఒక్కొక్క వస్తువూ కనుమరుగవుతోంది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపి ణీ అవుతున్న మంచినూనె(పామాయిల్) సరఫరా గత ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోగా, దానిని పునరుద్ధరించడం మానేసి, ఇప్పుడు కందిపప్పు పంపిణీని కూడా నిలిపివేస్తున్నారు. ఇలా తొమ్మిది రకాల సరుకులను జాబితాలోం చి తొలగించి, పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. అసలే పెరిగిపోతున్న ధరాభారంతో ఇబ్బందులు పడుతున్న జనం ఇలా రేషన్ సరుకులను ఒక్కొక్కటిగా తగ్గిస్తుండడంతో మరిన్ని ఇబ్బందులకు గురయ్యేపరిస్థితులు దాపురించనున్నాయి. కొద్ది మందికే పప్పు తినే భాగ్యం బహిరంగ మార్కెట్లో కందిపప్పునకు గిరాకీ ఉంది. దీంతో ధర కూడా బాగా ఎక్కువగా ఉంది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పును కిలో రూ. 50 కే అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర రూ.80. ఇంత ధర పెట్టి కొనుగోలు చేయలేని బీపీఎల్ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కిలో వద్ద ఇంత వ్యత్యాసమున్నప్పుడు పెద్దఎత్తున కాంట్రాక్టు చేసే విషయంలో బడ్జెట్ భారంగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కందిపప్పును ఎంఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేసే కాంట్రాక్టును కొనసాగించకుండా నిలిపివేసింది. దీంతో కందిపప్పు తక్కువ స్థాయిలో జిల్లాకు చేరింది. ప్రతినెలా జిల్లాకు 350 మెట్రిక్ టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా ఈ నెల 119 మెట్రిక్ టన్నులను మాత్రమే విడుదల చేశారు. ఇప్పటికి ఇంతేనని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల చాలా మందికి కందిపప్పు అందే అవకాశం లేదు. దీనిని సరిదిద్దుకునేందుకు పౌరసరఫరాల శాఖాధికారులు కందిపప్పును డివిజన్ కేంద్రాల్లోనూ బొబ్బిలిలోని కొన్ని షాపులకు సరఫరా చేశారు. దీంతో ఈ నెల పార్వతీపురం, విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో మాత్రమే కందిపప్పు లభ్యమవుతుంది. మిగతా ప్రాంతాల్లో పప్పు సరఫరా మరి లే నట్టే. ఉప్పుతిప్పలు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే ఉప్పు నాణ్యంగా ఉండేది. ఇది ఎంఎల్ఎస్ పాయింట్లకు గుజరాత్ నుంచి సరఫరా అయ్యేది. ఇది కూడా ప్రస్తుతం రావడం లేదు. దీంతో వినియోగదారులు ఇష్టపడే ఉప్పు, కందిపప్పు కూడా రావడం లేదు. ఇక పంచదార కేవలం అరకిలో మాత్రమే ఇస్తున్నారు. ఇది కొన్ని సార్లు సరఫరా కావడం లేదు. ఒక్కోనెల పంచదార ఎప్పుడొస్తుందో తెలియదు. చింతపండు, పసుపు, కారం పంపిణీకి మంగళం ? రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్న చింత పం డు, కారం, పసుపుల సరఫరాకు మంగళం పాడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో చింతపండు బయట మార్కెట్లోనే తక్కువగా ఉండడంతో పాటు నాణ్యత కూడా బాగా ఉండడంతో వినియోగదారులు చింతపండు ను రేషన్ షాపుల ద్వారా కొనుగోలు చేయడం మానేశారు. రేషన్ షాపుల ద్వారా చింతపండు అర కిలో రూ.30కు సరఫరా చేస్తున్నారు. ఇదే బయట మార్కె ట్లో మాత్రం ఇది రూ.20కే దొరుకుతోంది. దీనివల్ల చింతపండు కదలడం లేదు. అదేవిధంగా కారం, పసుపు నాణ్యత బాగాలేకపోవడంతో వాటిని కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాకు వచ్చిన సరుకులు అలానే ఉండిపోతున్నాయి. అయితే పరిస్థితి చక్కదిద్దవలసింది పోయి ఏకంగా రెండునెలలుగా సరుకుల ఇండెంట్ పెట్టడం మానేశారు. ఇప్పుడు గోధుమపిండి, గోధుమలు, పంచదార మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఎన్ని సరుకులు నిలిపివేస్తారో తెలియాల్సి ఉంది. -
రేషన్ కట్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్షాపుల్లో ఇచ్చే బియ్యం, కిరోసిన్ కోటాకు కోత పడనుంది. వచ్చే నెల ఇచ్చే రేషన్లో కొందరు తెల్ల రేషన్కార్డుదారులకు బియ్యం, కిరోసిన్ కట్ చేయనున్నారు. ఆధార్ వివరాలతో సరిపోల్చడం ద్వారా గుర్తించిన బోగస్ యూనిట్లకు, గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులకు ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. బోగస్ యూనిట్లుగా తేలిన వారికి నాలుగు కిలోల బియ్యం, గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఒక లీటర్ కిరోసిన్ కట్ చేయనున్నారు. గురువారం రాష్ట్రస్థాయి అధికారుల సమక్షంలో జరిగిన ఎలక్ట్రానిక్ ప్రజా పంపిణీ వ్యవస్థ (ఈపీడీఎస్) సమావేశంలో ఈ నిబంధన ద్వారా వచ్చే నెల జిల్లా రేషన్కోటాలో తగ్గే బియ్యం, కిరోసిన్లపై అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 14 వేలకుపైగా బోగస్ కార్డులు, 2.5 లక్షల యూనిట్ల (వ్యక్తుల)కు గాను వచ్చే నెల రేషన్లో దాదాపు 4.8 లక్షల కిలోల బియ్యం, 75 వేల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలను జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్ సమన్వయపరుస్తున్నారు. ఆధార్ సరిపోల్చిన వివరాలను, ఎల్పీజీ కనెక్షన్ ఉన్న కార్డుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉన్నతాధికారులు చెపుతున్నారు. జిల్లాలో 2.5 లక్షల యూనిట్లు ఎక్కువ.. జిల్లాలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్కార్డులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోనికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెల్లకార్డుల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి బోగస్కార్డులుంటే తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుల ద్వారా కార్డుదారుల వివరాలను జిల్లా యంత్రాంగం సరిపోల్చింది. జిల్లాలో 97 శాతం మందికి ఆధార్ నంబర్లు వచ్చినా ఇందులో 74 శాతం మంది వివరాలను మాత్రమే రేషన్కార్డులతో పోల్చి చూశారు. అలా చూస్తే దాదాపు జిల్లాలో 2.5 లక్షల బోగస్ యూనిట్లు (రేషన్కార్డులో పేరున్న వ్యక్తులు) ఉన్నట్టు తేలింది. అంటే... ఇకే వ్యక్తి పేర్లు రెండు, మూడు కార్డుల్లో ఉండడం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం, కుటుంబ యజమానుల పేర్లు కుటుంబ సభ్యుల పేరిట జారీ అయిన కార్డుల్లో ఉండడం వంటి అవకతవకలు ఉన్నాయని తేలింది. ఈ విధంగా తెలంగాణలోనే అత్యధికంగా జిల్లాలో 2.5 లక్షల యూనిట్లు వెలుగులోనికి వచ్చాయి. అంటే ఒక్కో యూనిట్కు నాలుగు కిలోల బియ్యం ఇప్పటివరకు అదనంగా ఇస్తున్నారు. వీరందరికీ ఆ నాలుగు కిలోల బియ్యాన్ని నిలిపివేయనున్నారు. కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నా నెలకు 20 కిలోల బియ్యం మాత్రమే ఇస్తారు. ఇలాంటి కార్డుల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉన్న కార్డుల్లో నుంచి కొందరిని తీసివేసినా ఆ కార్డుపై కోటా మాత్రం తగ్గదు. అంటే కొన్ని యూనిట్లు తగ్గినా కోటా తగ్గదు. ఈ నేపథ్యంలో జిల్లాలో వచ్చే నెల బియ్యం కోటాలో 4.8 లక్షల కిలోల బియ్యం (408 టన్నులు) తగ్గనుంది. తద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.65 లక్షలకు పైగా ఆదా కానుంది. వాస్తవానికి రేషన్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇందులో రూ.8 కేంద్రం భరిస్తుండగా, మరో రూపాయి కార్డుదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే కిలో బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.16 చెల్లించాల్సి వస్తోంది. వచ్చే నెల నుంచి 4.8 లక్షల కిలోల బియ్యం తగ్గితే ప్రభుత్వానికి కిలోకు రూ.16 చొప్పున రూ.65 లక్షల మేరకు ఆదా కానుంది. గ్యాస్ ఉంటే కిరోసిన్ లేదు.. తెల్లకార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి నె లకు రెండు లీటర్ల కిరోసిన్ ఇస్తున్నారు. అయితే, నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి కేవలం ఒక లీటర్ కిరోసిన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఈ కారణంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి మండలాల వారీగా క నెక్షన్ల వివరాలను జేసీ తెప్పించుకున్నారు. ఈ వివరాలను మండల స్థాయిలో తహశీల్దార్లకు పంపి పరిశీలన జరిపిన అనంతరం ఏ కార్డుదారునికి లీటర్ కిరోసిన్ ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు క్షేత్రస్థాయి నుంచి అందిన వివరాల విషయంలో ఎక్కడా తప్పులు జరగకుండా ఉండేందుకు గాను తహశీల్దార్ల నుంచి వ్యక్తిగత పూచీకత్తు కూడా తీసుకున్నారు. ఈ విధంగా గ్యాస్కు, కిరోసిన్కు లింకు పెట్టడం ద్వారా వచ్చే నెల 75 వేల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. లీటర్కు ప్రభుత్వంపై పడే భారం రూ.15 చొప్పున మరో రూ.11.25 లక్షలు కిరోసిన్ కోత ద్వారా ప్రభుత్వానికి ఆదా కానుంది. -
ఇక ఈ-రేషన్
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. పారదర్శకంగా సరుకులు పంపిణీ చేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు నుంచి ఈ-రేషన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ భావిస్తోంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈపీడీఎస్) డాటా బేస్లో ఆధార్ నంబర్లతో అనుసంధానం చేస్తున్నారు. ఈపీడీఎస్లో ఉన్న కార్డుదారులకు మాత్రమే సరుకులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అనుసంధానం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ విధానం అమలైతే బోగస్కార్డులకు అడ్డుకట్ట వేయడంతోపాటు రూ.కోట్ల నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా ఉంటాయి. అయితే సరుకులు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) విధానం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇందుకు ఎలక్ట్రానిక్ యంత్రాలు వాడనున్నారు. ప్రతీ రేషన్ దుకాణాల్లో యంత్రాలు అమర్చి నెట్ సౌకర్యం కల్పిస్తారు. నెట్వర్క్ సహాయంతో ఈ యంత్రాలు పనిచేస్తాయి. ఈ విధానం అమలైతే ఈపీడీఎస్తో నేరుగా కమిషనరేట్ నుంచి సరుకుల కేటాయింపు జరుగుతుంది. 5.10 లక్షల కార్డులు అనుసంధానం జిల్లాలో 6,72,011 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 23,81,015 మంది (యూనిట్లు) ఉన్నారు. ఇప్పటి వరకు ఈపీడీఎస్ డాటాబేస్ 5,10,728 రేషన్ కార్డులు ఆధార్తో అనుసంధానం చేశారు. ఇంకా 1,61,283 రేషన్ కార్డులను అనుసంధానించాల్సి ఉంది. రేషన్కార్డులోని కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటిదాక 16,92,657 మంది తమ ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 6,88,358 మంది ఆధార్ నంబర్లతో అనుసందానం చేయాలి. 5,57,211 మంది వివరాలు అనుసంధానం చేయుటకు అధికారుల వద్ద పెండింగ్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,617 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,72,011 తెల్లరేషన్ కార్డులకు, 42,251 రచ్చబండ కూపన్లకు, 1695 అన్నపూర్ణ కార్డులకు, 66,483 అంత్యోదయ కార్డులకు సరుకులు సరఫరా అవుతున్నాయి. రేషన్కు ఆధార్ అనుసంధానంతో ఇప్పటి వరకు 24 వేల రేషన్కార్డులు బోగస్గా తేల్చారు. ప్రస్తుతమున్న కార్డులకు ప్రతి నెల కోటా కింద 10 వేల మెట్రిక్ టన్నుల బి య్యం, 350 క్వింటాళ్ల చక్కెర పంపిణీ అవుతోంది. ఆధార్ అనుసంధానం పూర్తయితే ఈ-రేషన్ అమలుకానుంది. నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు - వసంత్రావు దేశ్పాండే, జిల్లా పౌర సరఫరాల అధికారి రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈపీడీఎస్లో అనుసంధానం 76 శాతం పూర్తి చేశాం. నిత్యావసరాలు నూతన పీవోఎస్ విధానంతో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఒకేసారి ఈ విధానాన్ని ప్రారంభించవచ్చు. కమిషనరేట్ నుంచి ఆదేశాలు వస్తే ఆగస్టులో ప్రారంభిస్తాం. -
నో స్టాక్
- సివిల్ సప్లై గోదాములు ఖాళీ - పత్తాలేని పామాయిల్ - నిలిచిన చక్కెర సరఫరా - డీడీలు కట్టవద్దని మౌఖిక ఆదేశాలు సాక్షి, సిటీబ్యూరో: గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అట్టహాసంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ సరుకుల స్టాక్కు కొరత ఏర్పడింది. పథకం ప్రారంభం నుంచి అరకొరగా సరఫరా అవుతున్న తొమ్మిది సరుకులకు పూర్తి స్థాయిలో ఫుల్స్టాప్ పడింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పౌరసరఫరా గోదాముల్లో తొమ్మిది సరుకుల స్టాక్ లేకుండా పోయింది. జూన్ నెలకు సంబంధించి తొమ్మిది సరుకుల కోసం డీడీలు కట్టవద్దని సంబంధిత అధికారుల నుంచి రేషన్ డీలర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. గత కొద్ది నెలలుగా పామాయిల్ సరఫరా లేకుండా పోగా, తాజాగా చక్కెర, కందిపప్పు, చింతపండు, కారంపొడి, పసుపు, ఉప్పు తదితర సరుకులపై సైతం అధికారులు చేతులు ఎత్తేశారు. ఫలితంగా జూన్ నెల సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. చౌకధర దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్న నిరుపేదల ఆశలు అడియాశలయ్యాయి. రెండు సరుకులే.. ప్రభుత్వ చౌక ధర దుకాణాల ద్వారా నిరుపేదలకు ఈ నెలలో సబ్సిడీపై రెండే రెండు సరుకుల పంపిణీ జరుగనుంది. ప్రస్తుతం పౌరసరఫరా గోదాముల్లో కేవలం బియ్యం, గోధుమ పిండి మాత్రమే స్టాక్ ఉండటంతో డీలర్లు సైతం ఆ రెండింటికే డీడీలు చెల్లించినట్లు సమాచారం. జూన్ నెలకు సంబంధించి చౌకధర దుకాణాలకు రెండు సరుకుల కోటా సరఫరా ఇప్పటికే ప్రారంభమైంది. మిగితా సరుకుల ఊసే లేకుండా పోయింది. తొమ్మిది సరుకుల సరఫరా సంబంధించిన టెండర్ల కాలపరిమితి ముగిసినప్పటికీ పునరుద్ధరణకు నోచుకొలేదు. వాస్తవంగా తొమ్మిది సరుకుల్లో ఏడింటికి లబ్ధిదారుల ఆదరణ లేకుండా పోవడంతో అధికారులు... డిమాండ్ లేక, గిట్టుబాటు కాకపోవడంతో సదరు కాంట్రాక్టర్లు సైతం పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. దీంతో సరుకులు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నాణ్యత లోపమే.. తొమ్మిది సరుకుల నాణ్యత లోపమే సరఫరా ఆగిపోవడానికి ప్రధాన కారణమైనట్లు కనిపిస్తోంది. ముక్కిపోయిన కందిపప్పు, గింజల చింతపండు, పురుగుల మయమైన గోధుమలు, గోధుమ పిండి, ఘాటివ్వని కారం పొడి, రుచిలేని ఉప్పు లబ్ధిదారులను మెప్పించలేకపోయాయి. దీంతో వారు అమ్మహస్తం తొమ్మిది సరుకుల్లో మూడు సరుకులపైనే అసక్తి కనబర్చుతూ వచ్చారు. గోధుమలు, చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగతా ఆరు సరుకుల జోలికి వెళ్లలేదు. తాజాగా ఆ మూడింటికి సైతం కొరత ఏర్పడింది. దీంతో ఈ మాసం సరుకుల పంపిణీ ప్రశ్నార్ధకంగా మారింది. -
పామా‘యిల్లే’!
- అస్తవ్యస్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థ - నిలిచిపోయిన పామాయిల్ సరఫరా - ఏ వస్తువు ఎప్పుడు వస్తుందో ఏమో - అయోమయంలో లబ్ధిదారులు తిరుపతిక్రైం, న్యూస్లైన్: ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏ వస్తువు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అమ్మహస్తం సరుకుల్లో ఇప్పటికే కోత పడగా తాజాగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏప్రిల్ నెలలో పూర్తిగా పామాయిల్ అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మే నెలకు రేషన్ డీలర్లు పామాయిల్కు డబ్బు కట్టాల్సిన అవసరం లేదని సివిల్ సప్లయ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లక్షల 86 వేల 450 మంది కార్డుదారులకు పామాయిల్ అందే పరిస్థితి కనిపించడంలేదు. తిరుపతి అర్బన్ మండలానికి గత నెలకు 62 వేల లీటర్ల పామాయిల్ సరఫరా చేయాల్సి ఉండగా 59 వేల 556 లీటర్లను మాత్రమే సరఫరా చేశారు. మే నెలకు సంబంధించి రేషన్ డీలర్లకు పామాయిల్కు డీడీలు కట్టరాదని ముందస్తుగానే సివిల్ సప్లయ్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్నికల హడావిడిలో పడి అధికారులు పామాయిల్ సరఫరాను పూర్తిగా విస్మరించారు. పామాయిల్ లీటర్ ధ ర 63.50 పైసలు ఉండగా కేంద్ర ప్రభుత్వం 23.50 పైసలు సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు రూ.40 చొప్పున లీటర్ పామాయిల్ ప్యాకెట్ను పంపిణీ చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకుండా మొండి చేయి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫలితంగా ఏప్రిల్ నెలలో పామాయిల్ సరఫరా ఆగిపోయింది. ఇక మేనెలకు డీడీలు కట్టరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాకే.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పామాయిల్ సరఫరా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పామాయిల్ సబ్సిడీ విషయం గవర్నర్ దృష్టికి వెళ్లినా స్పందనలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక దీన్ని పునరుద్ధరిస్తారో.. లేదో వేచిచూడాల్సిందే. -
త్వరలో ఈ-రేషన్
కలెక్టరేట్, న్యూస్లైన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో మార్పులు తీసుకొచ్చేందుకు ఆధార్ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు జిల్లాలోని రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేసే ప్రక్రియ నాలుగు నెలల నుంచి జరుగుతోంది. జిల్లాలో 80 శాతం అనుసంధానం పూర్తయితే ఈ-రేషన్ విధానాన్ని అమలు చేయాలని ఇటీవల వీడియో కాన్ఫరెన్స్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సునీల్శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డుల అనుసంధానం 75 శాతం పూర్తయింది. ఈ విధానం అమలైతే బోగస్ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేయడంతోపాటు రూ.కోట్ల నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. సరుకుల సరఫరాకు ఈ-పాస్ యంత్రాలు తప్పని సరి. ప్రతి రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు అమరుస్తారు. నెట్ సౌకర్యం కల్పిస్తారు. నెట్వర్క్ సహాయంతో ఈ యంత్రం పని చేస్తోంది. కీ రిజిష్టర్ను తాజా సమాచారంతో క్రోడీకరించి సరుకులు సరఫరా చేస్తారు. ఈ-పాస్ యంత్రంపై కార్డుదారు చేతివేళ్లను పెడితే అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయి. కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా సరుకులు తీసుకో చ్చు. ఈ విధానం అమలైతే నేరుగా నిత్యావసరాల కేటాయింపులు ఆ శాఖ కమిషనరేట్ నుంచి జారీ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 4,75,572 కార్డులు అనుసంధానం జిల్లాలో 1,617 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,12,673 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,34,096 తెలుపు రేషన్ కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 38,892, మూడో విడత రచ్చబండలో పంపిణీ చేసిన 39,685 కార్డులు ఉన్నాయి. తెలుపు రేషన్కార్డులలో ఇప్పటివరకు 4,75,572 కార్డులను ఆధార్తో అనుసంధానం చేశారు. ఇంకా 1,58,524 తెలుపు కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ, మూడో విడత రచ్చబండ కార్డులను అనుసంధానం చేయాల్సి ఉంది. ఇప్పటికీ అనుసంధానం చేసినవాటిలో 40,510 రేషన్ కార్డులు బోగస్గా ఉన్నాయని గుర్తించారు. వీటికి ప్ర స్తుతం రేషన్ పంపిణీ కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కార్డులకు ప్రతి నెలా కోటా కింద 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 350 క్వింటాళ్ల చక్కెర పంపిణీ అవుతోంది. దీంతోపాటు అమ్మహస్తం కింద తొమ్మిది సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డులు ఆధార్తో అనుసంధానం అయితే ఈ-రేషన్ అమలుకానుంది. అక్రమాలకు అడ్డుకట్ట జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం భావిస్తోంది. ఇంతక ముందు గోదాముల నుంచి నేరుగా రేషన్ సరుకులు ఎంఎల్ఎస్ కేంద్రాలకు చేరేవి. అక్కడి నుంచి డీలర్లుకు వచ్చేవి. ఈ విధానంలో బియ్యం, చక్కెర, నూనె, తదితర సరుకులు బ్లాక్ మార్కెట్కు తరలేవి. అధికారులు కూడా చాలాసార్లు బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ విధానంతో ప్రభుత్వానికి రూ.కోట్ల నష్టం వాటిల్లేది. దీనికితోడు ప్రజలకు కూడా సరుకులు చేరేవి కావు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాస్తవ కార్డుదారుడికి నిత్యావసరాలు ఇక నుంచి పూర్తిస్థాయిలో అందే విధంగా ఈ విధానం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇక ఈ-రేషన్
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఈ-రేషన్ విధానం అమలు కాబోతోంది. బోగస్ కార్డులకు అడ్డుకట్ట పడనుంది. ప్రజా పంపిణీ విధానం(పీడీఎస్)లో సమూల మార్పులు రానున్నాయి. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఆధార్ అనుసంధానిత ప్రజాపంపిణీ వ్యవస్థ(ఏఈపీడీఎస్) ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పథకాన్ని జిల్లాలోని కొన్ని రేషన్ దుకాణాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలంటూ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆ శాఖ కమిషనర్ సునీల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు ఆదా కావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో తొలిసారిగా ఈ పెలైట్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయంచారు. జిల్లాలో మొదటి దశలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని రేషన్ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఏఈపీడీఎస్ అమలు చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. పథకంలో భాగంగా కార్డుదారులకు బయోమెట్రిక్ పద్ధతిలో సరుకులను పంపిణీ చేస్తారు. ఇక్కడ ఫలితాల ఆధారంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆమోదంతో జిల్లా అంతటా వర్తింపజేస్తారు. జిల్లాలో 11 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో సుమారు 39 లక్షల మంది సభ్యులకు గాను 10 లక్షల యూనిట్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఏఈపీడీఎస్ విధానం అమలైతే కీ రిజిస్టర్ను తాజా సమాచారంతో క్రోడీకరించి సరుకులు సరఫరా చేస్తారు. ఏఈపీడీఎస్ను అమలుచేస్తే జిల్లాలో 30 శాతం యూనిట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను జిల్లాలో సమూలంగా ప్రక్షాళన చేయడానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేయనున్న నేపథ్యంలో కొత్త విధానంపై త్వరలో డీలర్లందరికీ అవగాహన కల్పించి ఈ-పోస్ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న వనరులేంటి? అక్కడ ఏ నెట్వర్క్ పనిచేస్తుంది? తదితర అంశాలను పరిశీలించనున్నారు. -
‘ఉపాధి, పీడీఎస్ సమాచారం అందుబాటులో..’
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే, బ్లాక్, పంచాయతీల్లోని విభాగాల స్థాయిల్లో జరిగిన పనుల వివరాలను సమాచార హక్కు చట్టానికి(ఆర్టీఐ) అనుగుణంగా తమంత తాముగానే(సుమోటో) వెల్లడించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎవరూ అడగకుండానే సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వల్ల అధికారుల్లో పారదర్శకత పెరుగుతుందని, వ్యక్తిగత ఆర్టీఐ దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్టీఐ చట్టం అమలును పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి ఎస్కే సర్కార్ గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపించారు. -
ప్రజాపంపిణీపై ఎఫ్సీఐ పోటు
లెవీ బియ్యం సేకరణ 75% నుంచి 25 శాతానికి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: లెవీ బియ్యం సేకరణను 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థపై పెను భారం పడనుంది. రాష్ట్రంలో ఏటా ప్రజా పంపిణీకి అవసరమైన 22 లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొననుంది. లెవీ తగ్గింపువల్ల చిన్న మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు వెనుకంజ వేస్తారని, అదేజరిగితే రైతులు పండించిన పంట అమ్ముడుపోవడం కష్టమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. వివరాలిలా ఉన్నాయి... ‘ప్రస్తుతం మిల్లర్లు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చగా వచ్చినదాంట్లో 75 శాతాన్ని లెవీ కింద ఎఫ్సీఐ/ పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలి. మిగిలిన 25 శాతాన్ని లెవీ ఫ్రీ కింద బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. అయితే మిల్లర్లు ఇవ్వాల్సిన లెవీ బియ్యాన్ని 75 నుంచి 25 శాతానికి తగ్గించినట్లుగా పేర్కొంటూ ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. లెవీ ఫ్రీ బియ్యాన్ని 25 శాతం నుంచి 75 శాతానికి పెంచినట్లు అందులో స్పష్టం చేసింది. ఇది వచ్చే ఖరీఫ్ ధాన్య సేకరణ సీజన్ (అక్టోబర్ ఒకటో తేదీ) నుంచి అమల్లోకి రానుంది. లెవీని తగ్గించవద్దని, 75 శాతాన్ని కొనసాగించేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ఎఫ్సీఐ స్పందించలేదు. ‘ఖరీఫ్ ధాన్య సేకరణ సీజన్ దగ్గర పడుతోంది. లెవీ ఆదేశాలను సవరించేందుకు ఎఫ్సీఐ విముఖతతో ఉంది. ఇక 25 శాతం లెవీతో సరిపెట్టుకోక తప్పదు. ఇది రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు భారమే..’ అని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. లెవీ కుదింపు ప్రభావం ఈ శాఖపైనే ఎక్కువగా పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూపాయి కిలో బియ్యం అమలుకు ఏడాదికి 42 లక్షల టన్నుల బియ్యం అవసరం. (ఆహార భద్రత చట్టం అమలు చేస్తే మరో పది లక్షల టన్నులు అదనంగా అవసరమవుతాయి) ప్రస్తుతం 75 శాతం లెవీ కింద 42 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సబ్సిడీ ధరతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ఇస్తోంది. ఈ బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సబ్సిడీతో తెల్లకార్డుదారులకు అందిస్తోంది. ‘లెవీ 25 శాతానికి కుదించడంవల్ల రాష్ట్రంలో మిల్లర్ల నుంచి ప్రజాపంపిణీకి వచ్చే బియ్యం 20 లక్షల టన్నులకే పరిమితమవుతుంది. లెవీ కింద ఎఫ్సీఐ టన్ను బియ్యాన్ని ప్రస్తుతం రూ.2082 - 2130 ధరతో (వెరైటీని బట్టి) కొనుగోలు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ ధర రూ.2500 - 2700 ఉంటుందని అంచనా. లెవీ కోత వల్ల రాష్ట్రంలో ఏటా ప్రజా పంపిణీకి అవసరమైన మిగిలిన 22 లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వంపై పెనుభారం పడుతుందన్నమాట. అందువల్ల పౌరసరఫరాల శాఖ నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేయించి బియ్యాన్ని (కస్టమ్డ్ మిల్లింగ్ రైస్ - సీఎంఆర్) ప్రజా పంపిణీకి వినియోగించాలని యోచిస్తోంది. అయితే కొద్ది పరిమాణంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సరిపడ ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేసేందుకు గిడ్డంగుల సామర్థ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందువల్ల బహిరంగ మార్కెట్లో బియ్యం కొనుగోలు చేయక తప్పదు..’ అని అధికారులు అంటున్నారు. సబ్సిడీ తగ్గించేందుకు కేంద్రం ఎత్తుగడ! ‘ప్రస్తుతం సబ్సిడీతో బియ్యాన్ని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించి పరిమిత సబ్సిడీతో సరిపెట్టాలనే యోచనలో ఉంది. ఆహార భద్రత బిల్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు అయ్యే వ్యయంలో కొంత మాత్రమే సబ్సిడీగా ఇస్తుంది. మిగిలినది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి వస్తుంది. లెవీ బియ్యం ఇస్తే ఎక్కువ సబ్సిడీ భారం కేంద్ర ప్రభుత్వంపై పడుతుంది. లేవీ లేకుండా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేలా చేస్తే కొంత సబ్సిడీ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి సబ్సిడీ ఇచ్చినా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారం నుంచి తప్పుకునే అవకాశం ఉంది. బియ్యం లెవీ కుదింపు నిర్ణయం ఇందులో భాగమే. ఇప్పటికే చక్కెర లెవీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు బియ్యం వంతు వచ్చింది. అయితే చక్కెర విషయం వేరు. అది చాలా తక్కువ పరిమాణంలో సేకరించేది. దీనివల్ల పౌరసరఫరాల శాఖకు సంబంధించి సమస్య స్వల్పమే. బియ్యం విషయంలో అలా కాదు. లెవీ తగ్గింపువల్ల మిల్లర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసి ధరలను పెంచే ప్రమాదం ఉంది. ఇది ప్రజలకు తీవ్ర భారమవుతుంది’ అని ఆర్థిక, ప్రజాపంపిణీ నిపుణులు చెబుతున్నారు.