
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ గీతంలో సింధ్ స్ధానంలో ఈశాన్యం అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా శుక్రవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్లో ఈశాన్యం కీలక ప్రాంతమని, అయినా ఆ ప్రాంతానికి జాతీయ గీతంలో చోటుదక్కకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు ప్రత్యర్థి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సింధ్ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నారని ఎగువ సభలో ప్రైవేట్ సభ్యుడి తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ బోరా అన్నారు.
జాతీయగీతంలో సింధ్ అనే పదాన్ని తొలగించి, దాని స్ధానంలో ఈశాన్య భారతం అని చేర్చాలని ఈ సభ ప్రభుత్వాన్ని కోరుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. గతంలో 2016లో జాతీయ గీతం జనగణమనలో సింధ్ అనే పదాన్ని తొలగించాలని, ఆ పేరుతో దేశంలో ఏ రాష్ట్రం లేదని సరైన పదంతో దాన్ని సవరించాలని శివసేన సభ్యుడు అరవింద్ సావంత్ లోక్సభలో ప్రస్తావించారు. జాతీయ గీతాన్ని నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో రచించగా 1950లో పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment