
ఆరెస్సెస్ చీఫ్ సురేష్ భయ్యాజీ జోషీ (ఫైల్ఫోటో)
మెరుపుదాడుల వెనుక కోట్ల మంది కసి, ఆగ్రహం కనిపించాయ్ : ఆరెస్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన చేపట్టిన వైమానిక దాడులపై ఆరెస్సెస్ స్పందించింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల వీరమరణం భారత్లో తీవ్ర ఆగ్రహం, ఆందోళన పెల్లుబికిందని కోట్లాది భారతీయుల ఆగ్రహాన్ని నేటి వైమానిక దాడులు ప్రతిబింబించాయని భారత వాయుసేనను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో ప్రశంసించింది.
పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రదాడులతో యావత్ దేశం తీవ్ర ఆగ్రహం, ఆందోళనలో మునిగిపోయిందని, వైమానిక దాడులతో పాక్లోని జైషే ఉగ్రశిబిరాలను మట్టుబెట్టడం ద్వారా కోట్లాది భారతీయుల ఆగ్రహం, ఆందోళనలను సైన్యం శత్రువుపై విరుచుకుపడుతూ నేరుగా ప్రతిబింబించిందని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, పుల్వామా ఉగ్ర దాడి అనంతరం ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆరెస్సెస్ చీఫ్ సురేష్ భయ్యాజీ జోషీ డిమాండ్ చేశారు.