
‘నా సినిమాకు మోదీ ఆశీర్వాదం తీసుకున్న’
న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. భార్య అంజలితో కలిసి ప్రధాని కార్యాలయంలో కలుసుకున్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం వచ్చే శుక్రవారం (మే 26) విడుదల కానున్న నేపథ్యంలో ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా తాను చిత్రం విశేషాలకు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి క్లుప్తంగా వివరించానని పేర్కొంటూ మోదీతో కరాచలనం చేస్తున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మోదీ ఆశీర్వాదం కూడా తీసుకున్నట్లు సచిన్ చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాని తనకు శుభాకాంక్షలు చెప్పారని అన్నారు. హాలివుడ్ దర్శకుడు జెమ్స్ ఎర్సకైన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సచిన్ జీవితంలో ఎవ్వరికీ తెలియని అంశాలు చాలా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సచిన్ వ్యక్తిగత జీవితం నుంచి యువకుడిగా క్రికెట్కు ఒక కలికితురాయిగా మారిన తీరు వరకు ఈ చిత్రంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాలు పన్ను మినహయింపునిచ్చాయి.