
'బాబాయ్- అబ్బాయ్' వివాదం ముదిరింది!
సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు రాష్ట్ర కేబినెట్ మంత్రి అయిన శివపాల్ యాదవ్ తన పదవులకు రాజీనామా చేశారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు రాష్ట్ర కేబినెట్ మంత్రి అయిన శివపాల్ యాదవ్ తన పదవులకు రాజీనామా చేశారు. సోదరుడు ములాయంతో గురువారం రాత్రి భేటీ అయిన తర్వాత తన రాజీనామా లేఖను సీఎం అఖిలేష్ యాదవ్ కు పంపినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఎస్పీలో 'బాబాయ్- అబ్బాయ్' వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కుర్చీలాటలో అఖిలేశ్కే ములాయం మద్దతిస్తుండటం యాదవ్ కుటుంబంలో విభేదాలకు కారణమయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్ను తప్పించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఆ వెంటనే శివపాల్ మంత్రిత్వ శాఖలను తగ్గిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం మరింత ముదరడంతో ములాయం జోక్యం తప్పనిసరి అయింది.
తమ మధ్య వ్యక్తిగత వివాదాలు లేవని కేవలం పార్టీ పరంగా మాత్రమే కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలున్నట్లు శివపాల్ తెలిపారు. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు గానీ, తన పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి ఎలాంటి నష్టం జరగదని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన శివపాల్ రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సమాజ్వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా శివపాల్ రాజీనామా చేశారని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. రెండు రోజుల కిందట సమాజ్వాదీ పార్టీ యూపీ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ కు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.