
శివపాల్.. మా నాన్నను అవమానిస్తున్నారు!
ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో మొదలైన చిచ్చు ఇప్పట్లో తగ్గేలా లేదు.
ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో మొదలైన చిచ్చు ఇప్పట్లో తగ్గేలా లేదు. పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన శివపాల్ యాదవ్ తమ కుటుంబంలో ఉన్న వ్యతిరేకులను టార్గెట్ చేస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ కుమారుడు, అక్షయ్ యాదవ్ దీనిపై నోరు విప్పారు. శివపాల్ప తన తండ్రిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాంగోపాల్ యాదవ్ తమ్ముడి కొడుకైన అరవింద్ ప్రతాప్ యాదవ్ను, మరోవ్యక్తిని భూ ఆక్రమణల కేసులో ఆరోపణలున్నాయంటూ పార్టీ నుంచి తీసేశారు. దాంతో అక్షయ్ యాదవ్కు ఎక్కడలేని కోపం వచ్చింది. అరవింద్ యాదవ్ తమ కుటుంబ సభ్యుడని, అలాంటి వ్యక్తి నేతాజీ (ములాయం)కు వ్యతిరేకంగా మాట్లాడతాడని కలలో కూడా అనుకోలేమని అన్నారు. శివపాల్ ఇంటి వద్ద తన తండ్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు మద్దతుగా ఎవరున్నా వాళ్లందరినీ శివపాల్ యాదవ్ పార్టీ నుంచి తీసేస్తున్నారని ఆరోపించారు. దాంతో ములాయం కుటుంబంలో చిచ్చు మరోసారి బయటపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అఖిలేష్ యాదవ్కు సన్నిహితులైన ఏడుగురిపై కూడా శివపాల్ వేటు వేసిన విషయం తెలిసిందే.