
సాక్షి, ముంబై: జనవరి 8న దేశవ్యాప్తంగా చేపట్టనున్న అఖిల భారత సమ్మెకు పలు బ్యాంకింగ్ సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబిఎ) ప్రకారం ఆరు బ్యాంకు సంఘాలు కూడా సమ్మెలో చేరనున్నాయి. ఆరు ఉద్యోగ సంఘాలు (ఏఐబీఈఏ, ఏఐబీఓఏ,బీఎఫ్ఎప్ఐ, ఐఎన్ బీఈఎఫ్, ఐఎన్ బీఓసీ, బీకేఎస్ఎంఈ) సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయ. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇచ్చింది. అలాగే సెంట్రల్, కోఆపరేటివ్, రీజినల్ గ్రామీణ , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు కూడా ఈ సమ్మెలో చేరాలని నిర్ణయించాయి. దీంతో అధికారికంగా ఆ రోజు (జనవరి 8, బుధవారం) సాధారణ సెలవు దినం కానప్పటికీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. బ్యాంకింగ్ సేవలు, ముఖ్యంగా బ్యాంకు ఏటీఎం సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే, ఆన్లైన్ లావాదేవీలు ప్రభావితం కావు. మరోవైపు ఈ యూనియన్లలో ఉద్యోగుల సభ్యత్వం చాలా తక్కువ కాబట్టి బ్యాంకు కార్యకలాపాలపై సమ్మె ప్రభావం తక్కువగా ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది.