'మూడేళ్ల వరకు ఆదాయ పన్ను ఉండదు' | Start-ups to get 3-year income tax holiday: Modi | Sakshi
Sakshi News home page

'మూడేళ్ల వరకు ఆదాయ పన్ను ఉండదు'

Published Sat, Jan 16 2016 7:46 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

'మూడేళ్ల వరకు ఆదాయ పన్ను ఉండదు' - Sakshi

'మూడేళ్ల వరకు ఆదాయ పన్ను ఉండదు'

స్టార్టప్ కంపెనీలకు ప్రధాని వరాలు
 మూడేళ్ల పాటు ‘ట్యాక్స్ హాలిడే’

* లాభాలపై పన్ను మినహాయింపు కూడా
* ఫండింగ్ కోసం రూ.10 వేల కోట్లతో నిధి
* కార్మిక, పర్యావరణ చట్టాలు వర్తించవు
* సర్టిఫికెట్ల బదులు సొంత డిక్లరేషన్ చాలు
* పేటెంట్ దాఖలు ఫీజు 80 శాతం తగ్గింపు
* పేటెంట్ మంజూరు వేగవంతానికీ చర్యలు
* కొనుగోలు కాంట్రాక్టులకూ బిడ్లు వేయొచ్చు
* అనుభవం, ఇతర అర్హతల్లో పూర్తి సడలింపు
* ఆస్తుల విక్రయాల్లో లాభంపై పన్నుండదు
* కంపెనీల నుంచి ఎగ్జిట్ నిబంధనలు సరళతరం
* ప్రభుత్వంతో సంప్రదింపులకు మొబైల్ యాప్
* బయోటెక్ స్టార్టప్‌లకు 7 ఇన్నోవేషన్ పార్కులు
* ఇక తరచూ స్టార్టప్ ఫెస్ట్‌లు, వినూత్న అవార్డులు

 
 న్యూఢిల్లీ:
 అవసరం నుంచి పుట్టే ఒకానొక ఆలోచన... కాస్త పెట్టుబడి!! ఈ రెండే దన్నుగా ఆరంభమవుతున్న చిన్న కంపెనీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో దన్ను కల్పించారు. శనివారమిక్కడ ‘స్టార్టప్ ఇండియా’ను ప్రకటిస్తూ... ఈ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి పలు రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. మూడేళ్ల పాటు స్టార్టప్‌లకు ఎలాంటి పన్నులూ ఉండవంటూ ‘ట్యాక్స్ హాలిడే’ను.. లాభాలపై చెల్లించాల్సిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపును... నిధుల కోసం రూ.10వేల కోట్ల కార్పస్‌ను కానుకగా ఇచ్చారు.

ఇంకా తొమ్మిది కార్మిక, పర్యావరణ చట్టాలకు సంబంధించి ఎవరికి వారు సొంతగా అఫిడవిట్ మాత్రం ఇస్తే చాలన్నారు. అంతేకాక... కంపెనీని ఆరంభించిన తొలి మూడేళ్లలో ఎలాంటి తనిఖీలూ ఉండబోవని స్పష్టం చేశారు. అంతేకాక స్టార్టప్ కంపెనీలకు సాయం చేయటానికి సులువైన పేటెంట్ల విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. పేటెంట్ ఫీజులో 80 శాతాన్ని తగ్గిస్తున్నట్లు కూడా చెప్పారాయన. తొలిసారిగా స్టార్టప్ కంపెనీల పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ పలు అంశాలు వెల్లడించారు. దేశంలో మున్ముందు ఉపాధి కల్పనకు, సంపద సృష్టికి కీలకమని భావిస్తున్న స్టార్టప్ కంపెనీల కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రధాని కళ్లకు కట్టారు. కొత్త కంపెనీలకు ముందటేడాది టర్నోవర్ రూ.25 కోట్లు దాటని పక్షంలో ఆ సంవత్సరం సదరు కంపెనీని స్టార్టప్‌గా పరిగణిస్తారు.
 కాంట్రాక్టుల్లోనూ నిబంధనల సడలింపు
 ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలను సంఖ్యాపరంగా చూసినట్లయితే ఇండియాది 3వ స్థానం. ప్రభుత్వ కొనుగోలు కాంట్రాక్టుల్ని దక్కించుకోవటానికి స్టార్టప్ కంపెనీలు పోటీ పడితే వాటికి అనుభవం, ఇతర అర్హతలను సడలిస్తామని కూడా ప్రధాని చెప్పారు. ‘‘స్టార్టప్‌లు తొలి మూడేళ్లూ తమకు వచ్చే లాభాలపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అలాగే స్టార్టప్ పారిశ్రామికవేత్తలు తమ సొంత ఆస్తుల్ని విక్రయిస్తే వచ్చే లాభాలపై 20 శాతం క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వ గుర్తింపున్న వెంచర్ క్యాపిటలిస్టులకూ ఈ మినహాయింపును వర్తింపజేస్తున్నాం’’ అని మోదీ ప్రకటించారు. అలాగే దివాలా చట్టం మేరకు ఎలాంటి భారమూ లేకుండా స్టార్టప్‌లు 90 రోజుల్లోగా వ్యాపారం నుంచి వైదొలగటానికి ఈజీ ఎగ్టిట్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలియజేశారు. దీనికి సంబంధించిన దివాలా బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉందంటూ... ‘‘ఎందుకు పెండింగ్‌లో ఉందో మీకందరికీ తెలుసు’’ అని పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. ఈ బిల్లు పెండింగ్‌లో ఎందుకు ఉందో యువత ట్విటర్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రపంచానికి చెప్పాలన్నారు. భారతదేశ భవిష్యత్తంతా ఆవిష్కరణల్లోనే ఉందంటూ... అందుకోసం అటల్ ఇన్నొవేషన్ మిషన్‌ను ఆరంభిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. భారతదేశానికి లక్షల సమస్యలున్నాయంటూనే... వాటి పరిష్కారానికి కోట్ల బుర్రలు కూడా ఉన్నాయంటూ చమత్కరించారు.

 ఆరోగ్య రంగంలో ఖర్చు తగ్గాలి
 ఆరోగ్య రంగాన్ని టెక్నాలజీ ఎలా మారుస్తోందో మోదీ వివరించారు. అయితే అది అందరికీ అంది రావాల్సి ఉందన్నారు. ‘‘విద్యలో నాణ్యత ముఖ్యమే కానీ, ఆ నాణ్యమైన విద్యను నిరుపేదల వద్దకు తీసుకెళ్లటమే అసలైన సవాలు’’ అన్నారాయన. ‘‘స్టార్టప్ అంటే వేల మంది పనిచేసే బిలియన్ డాలర్ల కంపెనీ కాదు. కనీసం ఐదుగురికి ఉపాధి కల్పించి దేశ వృద్ధికి తోడ్పడినా చాలు’’ అని ఉద్ఘాటించారు. యువత ఉద్యోగాలిచ్చే వారిగా మారాలి తప్ప ఉద్యోగాల కోసం తిరగకూడదన్నారు. భారతదేశం అతిపెద్ద మార్కెట్టన్నారు. ‘‘సమస్యలన్నిటికీ ఒక యాప్‌తో సమాధానం చెప్పొచ్చు. నేను కూడా ఇలా యాప్‌తో లబ్ధి పొందినవాడినే. ఇపుడు నరేంద్రమోదీ యాప్ కూడా ఉంది’’ అన్నారాయన.

 శీతల పానీయాల్లో ఫ్రూట్ జ్యూస్ కలపండి
 శీతల పానీయాల్లో కనీసం 2 శాతం ఫ్రూట్ జ్యూస్ కలిపితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మోదీ చెప్పారు. దీనివల్ల రైతులకు కొత్త మార్కెట్ దొరుకుతుందన్నారు. ఇటీవల తనను కలిసిన అగ్రశ్రేణి శీతల పానీయాల కంపెనీలతో ఈ విషయాన్ని చెప్పానన్నారు.
 మోదీ ప్రకటించిన 19 సూత్రాల స్టార్టప్ కార్యాచరణ ప్రణాళిక ముఖ్యాంశాలివీ...

 - క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు వల్ల స్టార్టప్‌లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో సమానంగా నిలుస్తాయి.
 - పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఇచ్చేటపుడు పెట్టుబడి ధరను సిసలైన మార్కెట్ ధరకు ఎగువనే లెక్కిస్తారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం స్టార్టప్‌లకు గనక నిధులు వస్తే... ఆ నిధులు సంస్థ తాలూకు సిసలైన మార్కెట్ విలువకన్నా ఎక్కువ ఉంటే... ఆ ఎక్కువగా ఉన్న మొత్తంపై నిధులు తీసుకున్న వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 - సొంత డిక్లరేషన్‌ను అమలు చేయటం వల్ల వివిధ చట్టాలను పాటించాల్సిన భారం తగ్గుతుంది. గ్రాట్యుటీ చెల్లింపు, కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్), జల-వాయు కాలుష్య చట్టాలు... వీటన్నిటి కీ ఆయా శాఖల సర్టిఫికెట్లు అవసరం లేకుండా సొంత డిక్లరేషన్ ఇస్తే చాలు.
 - సమాచార మార్పిడి, నిధుల సమీకరణ వంటి అంశాలతో పాటు స్టార్టప్‌లకు సంబంధించి ఏ అంశాన్నయినా డీల్ చేయటం కోసం స్టార్టప్ ఇండియా హబ్‌ను ఏర్పాటు చేస్తారు.
 - ఈ స్టార్టప్ ఇండియా ప్రధానోద్దేశం వినూత్న ఆవిష్కరణల్ని ప్రోత్సహించడం, వాటిని కంపెనీలుగా మార్చడానికి వీలైన వాతావరణం కల్పించడం. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటం, నిరాటంక ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది.
 - ప్రభుత్వంతోను, ప్రభుత్వ సంస్థలతోను స్టార్టప్‌లు ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరపటానికి వీలుగా త్వరలో మొబైల్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి పనిచేస్తాయి.
 - తక్కువ ఖర్చుకే పేటెంట్లు దరఖాస్తు చేయటానికి వీలు కల్పించటంతో పాటు పేటెంట్ల పరిశీలన వేగిరపరచడానికి చట్టపరమైన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని సాయంతో స్టార్టప్‌లు మేధో హక్కులపై అవగాహన పెంచుకోవటంతో పాటు తమ హక్కుల్ని కాపాడుకుని, వాటిని వాణి/ీ్యకరించటం కూడా చేస్తాయి.
 - కొనుగోలు కాంట్రాక్టులకు బిడ్లు వేయటంలో మినహాయింపుల వల్ల స్టార్టప్‌లు సైతం అనుభవం ఉన్న కంపెనీలతో సమానంగా పోటీ పడతాయి.
 - స్టార్టప్‌లకు నిధులందించడానికి మొదట రూ.2,500 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తారు. దీన్ని వచ్చే నాలుగేళ్లలో రూ.10వేల కోట్లకు పెంచుతారు.
 - ఈ ఫండ్ నిర్వహణను ప్రైవేటు ప్రొఫెషనల్స్ చేతిలో పెడతారు. దీన్లో సహ ఇన్వెస్టరుగా ఎల్‌ఐసీ వ్యవహరిస్తుంది.
 - క్రెడిట్ గ్యారంటీ ఫండ్ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి కంపెనీలకు రుణం అందటం సులువవుతుంది.
 - ఏడాదికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీని ఏర్పాటు చేస్తారు. నాలుగేళ్ల పాటు రూ.2,000 కోట్లు కేటాయిస్తారు.
 - ఆవిష్కరణల్ని ప్రదర్శించడానికి తరచు స్టార్టప్ ఫెస్ట్‌లు నిర్వహిస్తారు. జాతీయ విద్యా సంస్థల్లో ఇన్నొవేషన్ సెంటర్లను ఏర్పాటు చేయటంతో పాటు ఇంక్యుబేటర్ల ఏర్పాటులో ప్రైవేటు రంగ నైపుణ్యాన్ని తీసుకుంటారు.
 - బయో టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఏడు రీసెర్చ్ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఇవి సీడ్, ఈక్విటీ ఫండింగ్‌కు కూడా సహకరిస్తాయి. ఏటా ఇంక్యుబేటర్ అవార్డును ఇవ్వడంతో పాటు విద్యార్థుల కోసం ఇన్నొవేషన్ ఆధారిత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి.
 
 స్టార్టప్‌లకు అనుకూలంగా బడ్జెట్లో పన్ను రాయితీలు: జైట్లీ
 న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా పన్ను రాయితీలను ప్రభుత్వం ప్రకటిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ‘‘పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే పన్ను వ్యవస్థపై ఇప్పటికే కసరత్తు చేశాం. కొన్ని నోటిఫికేషన్ల ద్వారా ఇంకొన్ని అడుగులు వేయాల్సి ఉంది. అది చేస్తున్నాం. కొన్నిటికి చట్టబద్ధమైన కేటాయింపులు కావాలి. అవన్నీ బడ్జెట్లో ఆర్థిక బిల్లు ద్వారానే వస్తాయి’’ అని వివరించారు. శనివారమిక్కడ స్టార్టప్ ఇండియా సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది బడ్జెట్లో స్టార్టప్‌లకు నిధిని ప్రతిపాదించామని, స్టార్టప్‌లకు ఇటు ప్రభుత్వం ద్వారా, అటు బ్యాంకుల ద్వారా నిధులు అందేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. మహిళలు, ఎస్సీ-ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు బ్యాంకు బ్రాంచిల ద్వారా ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ఇటీవలే ఆరంభించిన సంగతిని జైట్లీ గుర్తు చేశారు.
 
 సులువుగా స్టార్టప్, ఎగ్జిట్: మంత్రి నిర్మల
 స్టార్టప్‌లలో నిధులు పెట్టడం, ఆరంభించటం, ఎగ్జిట్ కావటం వంటివన్నీ సులువుగా అయ్యేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఒక కంపెనీని ప్రారంభించటం ఎంత ముఖ్యమో, దాన్నుంచి కావాలనుకున్న వారు ఎగ్జిట్ కాగలగటమూ అంతే ముఖ్యమని నాకు తెలుసు. అందుకే ప్రభుత్వం ఎగ్జిట్ పాలసీని సరళతరం చేస్తోంది’’ అన్నారామె.
 
 డిస్కౌంట్లతో కాలం గడపలేరు: నికేశ్
 భారత ఈ-కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో ఎన్నాళ్లు మనుగడ సాగించగలవని సాఫ్ట్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నికేశ్ ఆరోరా ప్రశ్నించారు. దీనిపై సదరు కంపెనీలు పునరాలోచించుకోవాలన్నారు. ‘‘గతేడాది కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇచ్చాయి. ఈ సంవత్సరమైనా ఈ వాటిని కొనసాగించాలా, లేక సేవల నాణ్యతపై దృష్టి పెట్టాలా అన్నది ఆలోచించుకోవాలి. భారత ఈ-కామర్స్ మార్కెట్లో దేన్లోనైనా ఒకటి కాకుండా ఎక్కువ కంపెనీలు కొనసాగటానికి చాలా అవకాశముంది’’ అన్నారాయన. దేశంలో ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్, ట్యాక్సీ యాప్ ఓలాల్లో సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు పెట్టింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement