రాహుల్గాంధీలాగే ఆయన కూడా....
Published Sun, Aug 27 2017 9:37 AM | Last Updated on Tue, Sep 12 2017 1:07 AM
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మాదిరే హూడా కూడా అజ్నానంతో మాట్లాడుతున్నాడంటూ స్వామి విరుచుకుపడ్డారు.
‘అధికారం, పరిజ్నానం రెండూ లేకపోవటం మూలంగానే హూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన విధించటం అంటే ఆషామాషీ కాదు. రాహుల్ గాంధీలాగానే హూడా కూడా అజ్నానంతో మాట్లాడుతున్నారు. బాంబే తీర్పును ఓసారి పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది’ అంటూ స్వామి మాజీ సీఎంకు చురకలంటించారు.
హరియాణాలో గుర్మీత్ దోషిగా తీర్పు, ఆపై డేరా అనుచరుల హింస దృష్ట్యా ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ శనివారం భూపిందర్ సింగ్ కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఇలా స్పందించారు. మరోవైపు రాష్ట్రం రావణ కాష్టంలా తగలబడుతుంటే సహకరించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారంటూ హూడాపై హరియాణా బీజేపీ నేత ఎస్ ప్రకాశ్ మండిపడ్డారు. డేరా సచ్చా సౌదా భూపిందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఒకరకంగా ఈ హింసాకాండకు మీరు(హూడా) కూడా బాధ్యులేనని ప్రకాశ్ ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement