
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో మరో ముగ్గురు కరోనా (కోవిడ్-19) వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వీరిలో ఇద్దరు లడాఖ్కు చెందిన వారు కాగా.. ఇటీవలే ఇరాన్కు వెళ్లారని, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒమన్ను సందర్శించారని ఆ ప్రకటనలో వివరించారు. దీంతో భారత్లో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 34కు చేరుకున్నట్లు అయింది. తాజాగా కోవిడ్ బారిన పడ్డ ఈ ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉంది. భూటాన్లో కరోనా వైరస్ సోకిన ఇద్దరు అమెరికన్లతో దగ్గరి సంబంధాలు నెరపిన 150 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపింది. (కరోనా అలర్ట్: ‘ఆ ఫ్లోర్కు ఇతరులు వెళ్లొద్దు’)
కాగా కరోనా వైరస్ పరీక్షలు జరిపేందుకు దేశవ్యాప్తంగా 52 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రక్త నమూనాల సేకరణ విషయంలో సహకరించేందుకు మరో 57 పరిశోధనశాలలను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దేశంలో శుక్రవారం నాటికి మొత్తం 3404 మంది నుంచి సేకరించిన 4058 రక్త నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు. వూహాన్ నుంచి వచ్చిన భారతీయులు 654 మందికి సంబంధించిన 1308 నమూనాలు ఇందులో ఉన్నాయని అధికారులు వివరించారు. భారత్ ఇప్పటివరకూ 34 మంది కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారణ కాగా, వీరిలో 16 మంది ఇటలీ పర్యాటకులు ఉన్న విషయం తెలిసిందే. మరో 29 వేల మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. (వామ్మో కరోనా: ఆస్పత్రి నుంచి పరారైన పేషెంట్)
Comments
Please login to add a commentAdd a comment