భవిష్యత్ ఎన్నికలను నిర్ధేశించేవి ఇవే...
న్యూఢిల్లీః భవిష్యత్తులో జరిగే ఎన్నికలను నిర్ణయించేది నీరేనని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సమర్థ నీటి నిర్వహణ కీలక అంశంగా ముందుకొస్తుందని నొక్కిచెప్పారు.ప్రజలకు నీటి అవసరాలు ప్రాధాన్య అంశం కావడంతో జల వనరులను సమర్థంగా నిర్వహించిన ప్రభుత్వాలనే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు.పరిశ్రమ సంస్థ సీఐఐ మంగళవారం నిర్వహించిన జల సదస్సులో అమితాబ్ కాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమర్థ నీటి నిర్వహణ చేపట్టని ప్రభుత్వాలు కనుమరుగవక తప్పదని హెచ్చరించారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సహా ఉత్తరాదిలో సరైన నియంత్రణలు లేకపోవడంతో గత దశాబ్ధంలో విపరీతంగా భూగర్భ జలాలను తోడేశారని అన్నారు.పంజాబ్, ఢిల్లీలు క్రమంగా ఎడారిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ నీటి కొరత కలిగిన దేశంగా మారుతున్న క్రమంలో సమర్ధ జలవనరుల నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మనం మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించాలన్నా, మన ప్రజల ఆర్థిఖ ప్రమాణాలు మెరుగుపరచాలన్నా నీటి వనరులే కీలకమని అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు.