ముందుమాటకు ప్రామాణిక పత్రం | Primary document for first word | Sakshi
Sakshi News home page

ముందుమాటకు ప్రామాణిక పత్రం

Jul 12 2015 4:27 AM | Updated on Sep 3 2017 5:19 AM

అడిగింది శ్రీశ్రీ అయినా రాసింది చెలం అయినా పనిగట్టుకుని రాయించినవాడు మాత్రం తన అనధికార పబ్లిసిటీ ఆఫీసర్ అని శ్రీశ్రీ చెప్పుకున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి.

అడిగింది శ్రీశ్రీ అయినా రాసింది చెలం అయినా పనిగట్టుకుని రాయించినవాడు మాత్రం తన అనధికార పబ్లిసిటీ ఆఫీసర్ అని శ్రీశ్రీ చెప్పుకున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి.
 -  ‘యోగ్యతాపత్రం’కు 75 ఏళ్లు
 
యోగ్యతాపత్రానికి ఈనెల 17వ తేదీతో 75 ఏళ్ళు పూర్తవుతాయి. 20వ శతాబ్దపు 30వ దశకంలో శ్రీశ్రీ విరచితమైన 41 గేయాల మహాప్రస్థానం కావ్యాన్ని అనుభవించి పలవరించిన చెలం గొడవ ఇది. 1940 జూలై 17వ తేదీన మూడు ఖండికలుగా దానిని రాసాడు. తన గేయాల సంకలనం మహాప్రస్థానంకు  ముందుమాట రాయమని చెలంను శ్రీశ్రీ అడగగా కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గరలేవని పీఠిక, ముందుమాట, ఉపోద్ఘాతం, ప్రశంస, పరిచయం లాంటి సాంప్రదాయక మర్యాదలను కాదని మహాప్రస్థానం ఝంఝానిల షడ్జ్యధ్వానాన్ని యోగ్యతాపత్రంగా ప్రకటించాడు. అడిగింది శ్రీశ్రీ అయినా రాసింది చెలం అయినా పనిగట్టుకుని రాయించినవాడు మాత్రం తన అనధికార పబ్లిసిటీ ఆఫీసర్ అని శ్రీశ్రీ చెప్పుకున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి.
 
 యోగ్యతాపత్రం ద్వారా తెలుగు సాహిత్యంలో ముందుమాట, పీఠికల స్వరూప స్వభావాలను, లక్షణాలను పూర్తిగా మార్చివేసినవాడు చెలం. సాహితీ విమర్శకు ప్రామాణికాలు ఉన్నట్లే ముందుమాటకు కూడా యోగ్యతాపత్రం ద్వారా ప్రమాణాలు రూపొందాయంటే అతిశయోకి ్త కాదు. యోగ్యతాపత్రం చదివితే చాలు మహాప్రస్థానం చదవక్కరలేదని భావించిన వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని లండన్ నగరంలోని విదేశాంధ్ర ప్రచురణల వారు 1980 డిసెంబర్‌లో మహాప్రస్థానం గీతాలను శ్రీశ్రీ స్వయంగా గానం చేయగా రూపొందించిన క్యాసెట్స్‌తో పాటు శ్రీశ్రీ స్వంత దస్తూరీలో ఆ గీతాలను ఫాసిమైల్ రూపంలో విడుదల చేసే సందర్భంలో మహాప్రస్థానంపై తాను వినిపించిన అభిప్రాయంలో శ్రీశ్రీ వెల్లడించారు. ‘ప్రగతి’ వారపత్రికలో తాను నిర్వహించిన ‘ప్ర-జ’ (ప్రశ్నలు-జవాబులు) శీర్షికలో పిచ్చిరెడ్డి అనే ఎం.ఎ. విద్యార్థి ‘యోగ్యతాపత్రం చదివితే మహాప్రస్థానం గీతాలను  మరి చదవనక్కరలేదని నేన ంటాను, దీనికి మీరేమంటారు’ అనే ప్రశ్న పంపాడని, అందుకు ‘మీరు సార్థక నామధేయులని’ తాను జవాబిచ్చినట్లు శ్రీశ్రీ తెలిపారు.
 
 ఆయనకు ఆ ప్రశ్న అతిగా అనిపించినా యోగ్యతాపత్రం చదివిన వారికి అది ఎంత టి ప్రభావాన్ని చూపిందో ఆ సందర్భం వెల్లడించింది. తెలుగు సాహిత్యంలో నేటివరకు ఏ పుస్తకానికి, కావ్యానికి కూడా యోగ్యతాపత్రం లాంటి ప్రశంస, ముందుమాట, పీఠిక రాలేదు. సాధారణంగా ఏ పుస్తకంలోనైనా, కావ్యంలోనైనా కవి అనుసరించిన శైలి, శిల్పం, తీసుకున్న వస్తువులాంటి వాటిపైనో ముద్రారాక్షసాలపైనో ముందుమాటల్లో రాస్తారు. కానీ యోగ్యాతాపత్రం మాత్రం మహాప్రస్థానంను శ్రీశ్రీ ఎందుకు, ఎవరికోసం, ఎలా రాసారో అనే విషయంతో పాటు దాన్ని ఎందుకు, ఎలా చదవాలో కూడా వివరిస్తుంది. మహాప్రస్థానం గేయాలు దిక్కుల్ని, దేవతల్ని, అధికారులను ఊగించి ప్రశ్నించేవని ఈ వృద్ధ ప్రపంచానికి నెత్తురూ కన్నీళ్ళూ కలిపి తయారుచేసిన కొత్త టానిక్ అని ప్రకటిస్తుంది. రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రపంచ ఘోష విని తట్టుకోగల చావ ఉంటేనే మహాప్రస్థానాన్ని తెరవమని యోగ్యతాపత్రం హెచ్చరిస్తుంది.
 
యోగ్యతాపత్రం ద్వారా తెలుగు వచనం ఎలా ఉండాలో ఏ ఉద్వేగాన్ని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఛీత్కారాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలుసుకోవచ్చు. ఇది దానికున్న అదనపు విలువ.
 యోగ్యతాపత్రం తరువాత గొప్పగా చెప్పుకోదగింది చింతా దీక్షితులు ‘ప్రజా వాఙ్ఞయం’కు రాసిన ‘ప్రస్తావన’. దానిని కూడా చెలమే 1955 డిసెంబర్‌లో రాసాడు. దానికి ఈ ఏడాది చివరితో 60 ఏళ్ళు నిండుతాయి. అలా ఈ ఏడాది యోగ్యతాపత్రంకు వజ్రోత్సవ సంవత్సరం, ప్రస్తావనకు షష్ట్యబ్ది సంవత్సరం.
 - కె. ఎస్ ఎన్ ప్రసాద్
 ఫోన్: 8500392089
 
 సభాచారం
     - ‘వేదిక’ కార్యక్రమంలో జూలై 12న సాయంత్రం 5:30కి ఆలంబన(కూకట్‌పల్లి విలేజ్, హైదరాబాద్)లో జయకాంతన్ నవల ‘కళ్యాణి వెడ్స్ దివాకర్’(అనువాదం: జిల్లేళ్ల బాలాజీ)ను ఉష; ఆంగ్లకథ ‘మై గ్రాండ్‌మదర్ టెల్స్ మి దిస్ స్టోరీ(మాలీ ఆంటపాల్)ని నిర్వాహకుడు అనిల్ అట్లూరి(ఫోన్: 8142642638) పరిచయం చేస్తారు. కె.ఎన్.మల్లీశ్వరి కథ ‘శతపత్ర సుందరి’పై చర్చ కూడా ఉంటుంది.
 
      - జూలై 17న ఉదయం 10 నుంచీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలు, చీరాల, ప్రకాశం జిల్లాలో ‘కారంచేడు దళిత నరమేధానికి 30 ఏళ్లు-అనంతర బహుజన సాహిత్యం’పై సదస్సు, కవి సమ్మేళనం జరగనుంది. నూకతోటి రవికుమార్(ఫోన్: 9848187416) కన్వీనర్‌గా జరిగే ఈ కార్యక్రమంలో ఎ.సుబ్రహ్మణ్యం, ఎండ్లూరి సుధాకర్, సతీష్ చందర్, ఉ.సాంబశివరావు, బొనిగల రామారావు, పులిగుజ్జు సురేష్, సూరేపల్లి సుజాత, చల్లపల్లి స్వరూపరాణి, సి.కాశీం, పడవల చిట్టిబాబు, దుర్గం సుబ్బారావు, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొంటారు.
 
     - అంబేడ్కర్ ఫిలాసఫీ ఆఫ్ కాస్ట్ డెమోక్రసీ గ్రంథం ప్రచారోద్యమంలో భాగంగా ‘జాతిపిత అంబేడ్కర్ వర్ణ నిర్మూలన సిద్ధాంతం’ నాటకం 53వ ప్రదర్శన ఈ జూలై 18న 3 గంటలకు చీమకుర్తి నాగేశ్వరరావు కళామండపం(ప్రకాశం జిల్లా చీమకుర్తి)లో జరగనుంది. 54వ ప్రదర్శన, ఆగస్టు 8న 3 గంటలకు పొన్నూరు అంబేడ్కర్ కళాక్షేత్రం(గుంటూరు జిల్లా పొన్నూరు)లో! వివరాలకు సౌదా అరుణ ఫోన్: 9247150243
 
 
 
 కథాంజలి-3 (ఎస్సారె కథలు)
 పేజీలు: 240; వెల: 130
 ప్రతులకు: సాహితీ ప్రచురణలు విజయవాడ-2;
 ఫోన్: 0866-2436643
 
 1.సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక
 రచన: డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి; పేజీలు: 268; వెల: 200
 2.శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు-వ్యాసాలు (1929-1936); సంపాదకుడు: డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి
 పేజీలు: 160; వెల: 150; ప్రతులకు: వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం, తాళ్లకాల్వ గ్రామం, గాండ్లపెంట మండలం, అనంతపురం-515521; ఫోన్: 9441317766

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement