
వాజ్పేయి కుమార్తె, మనుమరాలిని ఓదారుస్తున్న మోదీ
పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అంత్యక్రియలు జరిగిన స్మృతి స్థల్ వరకు ఏడు కిలోమీటర్ల పాటు అంతిమయాత్ర కొనసాగింది. రోడ్డుపొడవునా కార్యకర్తలు, అభిమానులు తమ అభిమాన నేతకు పుష్పాంజలి ఘటించారు. పార్టీ కార్యాలయం నుంచి జరిగే చివరి యాత్రలో తాను నడుస్తానని మోదీ ముందే తెలిపారు. ఉగ్రవాదుల ముప్పు ఉన్నప్పటికీ.. ప్రొటోకాల్ను పక్కనపెట్టి అమిత్ షాతోపాటుగా నడిచారు. దీంతో పార్ధివదేహం వెనక ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులతో ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటుచేశారు.
మోదీ, షాలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు శివ్రాజ్ సింగ్, యోగి, ఫడ్నవిస్లు కూడా నడిచే వచ్చారు. రోడ్డుపై భారీ సంఖ్యలో జనం వాజ్పేయి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పార్థివదేహాన్ని తీసుకెళ్తున్న వాహనంపై పూలు చల్లుతూ భారతరత్నంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువకులు, చిన్నా పెద్దా, ఆడామగా తేడా లేకుండా అశేష అభిమానులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. వాజ్పేయిని చివరిసారి చూసేందుకు అవకాశం దొరకని కొందరైతే.. రోడ్డుపక్కనున్న చెట్లు కూడా ఎక్కేశారు. చాలా మంది ఉబికివస్తున్న కన్నీరును ఆపుకుంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో రోడ్లు మార్మోగాయి.
Comments
Please login to add a commentAdd a comment