‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’ | BJP Winning Meeting In Hyderabad | Sakshi
Sakshi News home page

‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’

Published Fri, May 24 2019 4:05 PM | Last Updated on Fri, May 24 2019 4:08 PM

BJP Winning Meeting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రతి జిల్లాలో బీజేపీ జెండా ఎగిరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలకు గెలుచుకున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల విజయోత్సవ సభను శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుపర్చిన ప్రపంచ నాయకుల్లో గెలిచింది కేవలం మోదీనే అని గుర్తుచేశారు. రాజకీయ విశ్లేషకులందరూ బీజేపీపై మానసిక ఒత్తిడి పెట్టారని, మోదీ ముందు కేసీఆర్ పనికిరారని తెలంగాణ ప్రజలు తేల్చారని పేర్కొన్నారు. మోదీని, బీజేపీని విమర్శిస్తే బాగుండదని ఆయన హెచ్చరించారు. మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని మురళీధర రావు హితవు పలికారు.

కేటీఆర్‌కు మాటలు రావడంలేదు..
నరేంద్రమోదీ హఠావో అన్న విపక్షాలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. సమావేశంలో లక్షణ్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీనే తమకు అంబేద్కర్‌ అని అన్నారు. తెలంగాణ దాటితే టీఆర్‌ఎస్‌ చెల్లని రూపాయని ఆయన ఎద్దేవా చేశారు. ఫలితాలు చూసిన తరువాత కేటీఆర్‌కు మాటలు రావడంలేదని, రైతులు కవితను సాగనంపారని పేర్కొన్నారు. తెలంగాణలో చరిత్ర సృష్టించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తమను అభినందించినట్లు లక్ష్మణ్‌ తెలిపారు.

నియంత పాలన సాగదు: సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డి
రాష్ట్రంలోని ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచింది. టీఆర్‌ఎస్‌ అహంకార వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు. అక్రమ కేసుల ద్వారా ప్రజాసంఘాల నాయకులను కేసీఆర్ బయపెట్టాలని చూస్తున్నారు.  కేసీఆర్ మజ్లీస్ పార్టీని నమ్ముకున్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నియంత పాలన సాగదు. నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

బొందుగాళ్లకు స్థానం లేదు: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్
తెలంగాణ బీజేపీ కార్యకర్తలందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా. ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్‌ఎస్‌ అహంకారం గురించే మాట్లాడుతున్నారు. ప్రజలకి కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర పథకాలు ఒక్కటీ కూడా అందడం లేదు.  టిఆర్ఎస్‌కి సెంటిమెంట్ అయిన కరీంనగర్‌లో ప్రజలు బీజేపీకే పట్టాం కట్టారు. తెలంగాణలో హిందువులకు తప్ప, బొందుగాళ్లకు స్థానం లేదని ప్రజలు తేల్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement