
సాక్షి, న్యూఢిల్లీ : తమ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాల్సిందేనని ఢిల్లీలోని ఐఏఎస్ అధికారుల ఫోరం డిమాండ్ చేసింది. నల్ల బ్యాడ్జీలు కట్టుకొని వారంతా నిరసన వ్యక్తం చేస్తూ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. 'ముఖ్యమంత్రి మాకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జరిగిన సంఘటనపై క్షమాపణలు చెప్పాల్సిందిపోయి వారు తోసిపుచ్చుతున్నారు. దీని ప్రకారం, సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం కూడా ఈ దాడి కుట్రలో భాగస్వామ్యం అయినట్లు అనిపిస్తోంది' అని ఐఏఎస్ల ఫోరం సెక్రెటరీ పూజ జోషి అన్నారు.
ప్రచార ప్రకటనలకు సంబంధించి మాట్లాడాలని అర్థరాత్రి పిలిపించి తనపై దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, అన్షు చేసిన ఆరోపణలను కేజ్రీవాల్, ఆయన మంత్రి వర్గం ఖండించింది. అయితే, అన్షుపై దాడి నిజంగానే జరిగినట్లు నిర్ధారణ అయింది. దాడి కారణంగా ఆయన కింది పెదవి కమిలిపోయిందని, చెవుల లోపలి భాగంలో చీము కూడా వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయనకు చికిత్స చేసిన వివరాలతో కూడిన ఒక పేజీ నివేదికను కూడా బహిరంగ పరిచారు. ఆయనకు మెడ భాగంలో కూడా కొంచెం దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై పోలీసులు తాజాగా ప్రకటన చేస్తూ కేజ్రీవాల్ ఇంటి నుంచి తాము స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీని చెరిపేసి ప్రయత్నం చేశారని, అందులో టైమింగ్స్ వేర్వేరు చూపిస్తున్నాయని, ఫుటేజిని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు.