
సదస్సులో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య. చిత్రంలో సంఘం ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న బీసీ కులాలు ఇప్పటికీ పలు రంగాల్లో ప్రాతినిథ్యం లేకుండా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. శుక్రవారం బీసీ భవన్లో వెనుకబడిన తరగతుల కుల సంఘాల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 18 సంఘాలు పాల్గొన్నాయి.
కృష్ణయ్య మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే తమ డిమాండ్పై ప్రభుత్వం స్పందించాలన్నారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీల ఎంపికలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. కులాంతర వివాహాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.10వేల నుంచి రూ.2లక్షలకు పెంచాలన్నారు. కుల సంఘాల భవనాల నిర్మాణానికి రూ.10 ఎకరాల భూమి, రూ.10 కోట్లు కేటాయించాలన్నారు. బీసీ సంక్షేమ కమిషనర్గా బీసీ వ్యక్తిని, గురుకులాల కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిని నియమించాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన అన్నారు. బీసీలకు అమలు చేస్తున్న క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, ఐఐటీ, ఐఐఎంలలో చదివే విద్యార్థులకు ఫీజులివ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment