
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా ఫోటోపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ క్లీన్షేవ్తో యువకుడిలా ఉండే ఒమర్ అబ్దుల్లా బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఓ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత చూడగానే తాను గుర్తుపట్టలేదని, ఒక్కసారిగా షాక్కి గురయ్యానని మమత అన్నారు. ఒమర్ తాజా ఫోటోపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు (గృహ నిర్బంధం) జరగడం దురుదృష్టకరమని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎప్పుడు ముగింపు పలకాలని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం రాత్రి మమత ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగూ ఒమర్ తాజా ఫోటోపై మెహాబూబా ముఫ్తితో పాటు పలువురు విపక్ష నేతలూ స్పదించారు. ఆయన్ని ఇలా చూసి నివ్వెరపోయారని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
కాగా జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ కూడా ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్ ఇలా కొత్త వేషంలో కనిపించారు. అయితే ఆరునెలల నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో ఇన్ని రోజులు ఈ ఫోటో బయటకు రాలేదు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.