
బైక్ సైలన్సర్ తీసి శబ్ధం చేస్తేనే తప్పంటున్నారు.. మరి తుపాకీతో కాల్చిన వారిని మాత్రం..
సాక్షి, భీమవరం: టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై పరోక్షంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలసిందే. అయితే మంగళవారం కాలు బెణకడంతో భీమవరంలో పవన్ విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానులతో ఆయన ముచ్చటించారు. తమను పోలీసులు ఇబ్బంది పెడ్తున్నారని, బైక్ సైలెన్సర్ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని ఈ సందర్భంగా అభిమానులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్ సైలెన్సర్ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని, మరి ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్నవారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు.
2004లో బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు.