
గద్వాల అర్బన్: కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు కాపలాగా ఉంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నారని విద్యా పరిరక్షణ కమిటీ జాతీయ కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతిస్తున్నారని విమర్శించారు.
కళాశాలల విద్యను నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ మాఫియాకు అప్పజెప్పారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఉన్నత విద్య అందకుండా చేయాలని ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారని ఆరోపించారు. విద్య పరిరక్షణ కమిటీతో చర్చించకుండా ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్ రాఘవాచారితో పాటు ప్రభాకర్, టీవీవీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment