
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ గూడేల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలోలాగా విష జ్వరాలతో ఆదివాసీలు మరణించే పరిస్థితిని ప్రభుత్వం నివారించిందన్నారు. ఆదివాసీలను స్వయం పాలనలో భాగస్వాములను చేసే దిశగా ఆదివాసీ గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని తెలిపారు. ఎస్టీ సబ్ ప్లాన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని, పోడుభూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కుమ్రంభీం భవనాన్ని నిర్మిస్తున్నామని, అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైందని కేసీఆర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment