-
అటవీ అధికారులపై గిరిజనుల దాడి
-
జ్యోతి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు
-
పాడేరు మెడికల్ కాలేజీ.. సిద్ధం
గిరిజనుల జీవన ప్రమాణాలు పూర్తిస్థాయిలో పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. పాడేరులో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ఓ వైపు వేగంగా పూర్తి చేస్తుండడంతో పాటు, ఆ స్థాయి వైద్య సేవలను ముందుగానే అందుబాటులోకి తెస్తోంది. సాక్షి,పాడేరు: గిరిజనులకు ఉన్నత వైద్యసేవలు కల్పించడం లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన పాడేరులో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రూ.500కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం 35ఎకరాల విస్తీర్ణంలో తలారిసింగి పాలి టెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ కళాశాల,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఈఏడాదిలో మొత్తం అన్ని భవనాలను పూర్తి చేసే లక్ష్యంతో ఎన్సీసీ నిర్మాణ సంస్థ చురుగ్గా పనులు నిర్వహిస్తోంది. జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరుమార్పు వైద్య విధాన పరిషత్లో ఇంతవరకు పనిచేసిన పాడేరు జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఇటీవల విలీనం చేసి జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరు మార్చారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ఇంకా గడువు ఉండడంతో ముందస్తుగానే పాడేరు జిల్లా జనరల్ ఆస్ప త్రిలో 420 బెడ్లలో రోగులకు 24గంటల పాటు ఉన్నత వైద్యసేవలకుచర్యలు చేపట్టింది. పాడేరు జిల్లా ఆస్పత్రిలో అదనపు అంతస్తును యుద్ధప్రాతిపదికన ఇటీవల పూర్తి చేసి, అన్ని సదుపాయాలతో పడకలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 50 ప్రత్యేకంగా గర్భిణులకు, మరో 50 మాతా శిశువుల ఆరోగ్యసేవలకు, 50 పడకలు రక్తహీనత సమస్య ఉన్న మహిళా రోగులకు కేటాయించనున్నారు. జాతీయ వైద్యమండలి పరిశీలనకు ఏర్పాట్లు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన 420 బెడ్లు,ఇతర సౌకర్యాలు,వైద్య నిపుణులు,అందించే సేవలను సమగ్రంగా పరిశీలించేందుకు జాతీయ వైద్య మండలి పర్యటించనుంది. ఈ మండలి పరిశీలన తరువాత మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా జనరల్ ఆస్పత్రి సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. 256 పోస్టుల భర్తీకి చర్యలు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రులకు సంబంధించి వివిధ విభాగాల్లో 706 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముందుగా 256 పోస్టుల భర్తీని కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేగవంతం చేసింది. మిగిలిన వైద్యులు,నర్సింగ్,ఇతర విభాగాల పోస్టులకు వైద్య ఆరోగ్యశాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. విధుల్లో వైద్య నిపుణులు పాడేరు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా జిల్లా ప్రజలకు నిరంతర ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో ముందస్తుగానే ప్రభుత్వం వైద్యులను నియమించింది. పాడేరు మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్తో పాటు నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫె సర్లు, 17మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రోగులకు ఉన్నత వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. భవనాల నిర్మాణాలతో సంబంధం లేకుండా 420 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాం. అన్ని విభాగాల వైద్యపోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. – డాక్టర్ డి.హేమలతాదేవి, ప్రిన్సిపాల్,పాడేరు మెడికల్ కళాశాల -
కాంగ్రెస్ దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ
సిద్ధి/సూరజ్పూర్: విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. నూతన ముఖ్య సమాచార కమిషనర్(సీఐసీ)గా హీరాలాల్ సమారియా ఎంపిక కోసం నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదని ఆక్షేపించారు. ఆయన దళితుడు కావడమే ఇందుకు కారణమని అన్నారు. సీఐసీగా నియమితుడైన తొలి దళితుడు హీరాలాల్ను కాంగ్రెస్ నేతలు నిత్యం దూషిస్తున్నారని మోదీ విమర్శించారు. దేశంలో మొట్టమొదట గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము అభ్యర్థీత్వాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఆ పార్టీ మైండ్సెట్ను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో, ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. తనను రోజంతా తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కానీ, వారు ఓబీసీ వర్గాలను తిడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడన్న సంగతి తెలిసిందే. దళితులు, గిరిజనులు, ఓబీసీల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఆయా వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తోందని తెలిపారు. 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని రకాల కుంభకోణాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అలా పొదుపు అయిన డబ్బుతో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో నేరాలు, లూటీలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడల్లా దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదులు బలం పుంజుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే, దేశమంతటా బాంబు పేలుళ్లు, హత్యల వార్తలు నిత్యం వస్తుంటాయని చెప్పారు. నేరాలు, లూటీలు విచ్చలవిడిగా జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలిజాన్ని అరికట్టడంలో దారుణంగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే మహాదేవ్ బెట్టింగ్ యాప్ బాగోతంపై విచారణ జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. ఈ కుంభకోణంలో ఎంతటి బడా బాబులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. భద్రత అనేది ప్రతి పౌరుడికి అవసరమని మోదీ చెప్పారు. ఛత్తీస్గఢ్లో ప్రజలు క్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని ప్రధానమంత్రి తెలిపారు. -
నాగకేసరి చెట్ల నుంచి జీవ ఇంధనం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆసక్తి, విషయ పరిజ్ఞానం, సాధించాలనే తపన ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిపుత్రిక. తల్లిదండ్రులు తనని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా, మొక్కవోని దృఢ సంకల్పంతో ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపారు రాజేంద్రపాలేనికి చెందిన దిబ్బ చంద్రవతి. ఆమె తల్లిదండ్రులు దిబ్బ సుందర్రావు, సింగారమ్మ కూలీలు. చంద్రవతి పదో తరగతి మండలంలోని పెదమాకవరం పాఠశాలలోను, ఇంటర్ పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ విశాఖలో చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రెండేళ్లు ఎంఫిల్ చేశారు. పీహెచ్డీలో భాగంగా ‘నాగ కేసరి చెట్ల నుంచి జీవ ఇంధన తయారీ’పై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ఆచార్యులు ఎస్బీ పడాల్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురణలు జరగడంతో ఆమెను డాక్టరేట్ వరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో విలువైన ఔషధాలు ఉన్నాయని తెలిపారు. ఆదిమజాతి గిరిజనులు వృక్షాలతో అన్యోన్యంగా ఉంటారని, వివిధ రకాల రోగాలకు వారి పరిసరాల్లో పెరిగే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. అడవిలో పెరిగే నాగ కేసరి చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను నూనెగా మార్చి జీవ ఇంధనంగా తయారు చేశామని ఆమె వివరించారు. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారు చేయవచ్చునని తెలిపారు. పరిశోధన పూర్తి కావడంతో ఏయూ ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నుంచి ఈనెల తొమ్మిదిన డాక్టరేట్ అందుకున్నట్టు ఆమె తెలియజేశారు. -
గిరిజనులపై ప్రధానిది కపట ప్రేమ మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులపై ప్రధాని మోదీ కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గిరిజన వర్సిటీని తొక్కిపెట్టింది మోదీ ప్రభుత్వమే అని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్నందునే మోదీకి గిరిజన వర్సిటీ గుర్తొచ్చిందన్నారు. ఈ వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో 335 ఎకరాలను ఇప్పటికే కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కేంద్రం స్పందించలేదన్నారు. -
సంక్షోభాన్ని పెంచిన ఆ అంతర్యుద్ధం
జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంపై భారత్లో వెల్లువెత్తిన ఉత్సాహం... సంఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్ను వ్యూహాత్మకంగా విస్మరించడానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిష్క్రియాత్మకత వల్లే ఈశాన్య ప్రాంతంలో ఇంత పతనం సంభవించింది. మయన్మార్లో 28 నెలల నాటి అంతర్యుద్ధం పాక్షికంగా మణిపుర్ మంటలను పెంచి పోషించింది. ఫలితంగా 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4,000 ఆయుధాల చోరీ జరిగింది. మయన్మార్ నుండి వచ్చిన శరణార్థుల వెల్లువతో పాటు, కుకీలు లేని ఇంఫాల్ లోయ, మైతేయిలు లేని కుకీ–నివాస కొండ ప్రాంతాలు అనే జాతి ప్రక్షాళన మణిపుర్ను నిలువునా విభజించింది. కుకీలు, మైతేయిల జాతి ప్రక్షాళన ధోరణి మణిపుర్ను నిట్టనిలువున చీల్చింది. తీవ్రమైన ఈ విభజనే, విద్రోహం(ఇన్సర్జెన్సీ) మళ్లీ చెలరేగుతుందన్న భయా లను రేకెత్తించింది. రాష్ట్ర ఆయుధాగారాల నుండి కొల్లగొట్టిన ఆయు ధాలు అందుబాటులో ఉండటమే ఈ భయాలకు కారణం. గత నెలలో అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పిసి నాయర్ ఇలా చెప్పారు: ‘‘పరిస్థితి అసాధారణంగా ఉంది. మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.’’ ఇంఫాల్లోని నాలుగు జిల్లాల్లో గల 39 పోలీస్ స్టేషన్లలోని 16 స్టేషన్లలో సాధారణ స్థితి ఏర్పడినట్లు చూపడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మార్చి 25న ఉపసంహరించుకున్న తర్వాత పరి స్థితి ఇలా ఉంది. ఈ చర్యను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. ‘‘విద్రోహాన్ని గణనీయంగా తగ్గించేశాం. దాదాపుగా లేదు’’ అని మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే చెప్పారు. ఈ పరిస్థితి ఉత్తరం వైపు సైన్యాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి, అలాగే ఈశాన్య ప్రాంతంలో సైనిక చర్యల బాధ్యతను అస్సాం రైఫిల్స్కు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ ఆచర ణకు భిన్నం. ఒక్క 1965, 1971 యుద్ధాల సమయంలో మాత్రమే ఇలా చేశారు. మయన్మార్లో మిలిటరీ జుంటాకూ, దానిని వ్యతిరేకిస్తున్న శక్తుల (నేషనల్ యూనిటీ గవర్నమెంట్–ఎన్యూజీ, ఇంకా ప్రతిఘటన)కూ మధ్య అంతర్యుద్ధం దాని మూడవ సంవత్సరంలోకి ప్రవేశించింది. నాగాలాండ్, మిజోరాం, మణిపుర్లకు సమీపంలోని సగాయింగ్ ప్రాంతం, చిన్ రాష్ట్రం ప్రధాన పోరాట వేదికలుగా ఉంటున్నాయి. సైనిక జుంటా ఈ ప్రాంతంలో అధికారం కోల్పోయినందున, అది నాపాం బాంబులను ప్రయోగించడం, గ్రామాలను దోచుకోవడం, తగలబెట్టడంతోపాటు వైమానిక బాంబులను ఆశ్రయిస్తోంది. పర్య వసానంగా, దాదాపు 60,000 మంది చిన్, కుకి, జోమి శరణార్థులు మిజోరం, మణిçపుర్లకు పారిపోయారు. వీరిలో కొందరు ఎన్యూ జీకి చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. మయన్మార్తో 1,600 కి.మీ. పొడవైన అంతగా గస్తీ ఉండని సరిహద్దుతోపాటు, ఇరువైపులా 16 కి.మీ. మేర స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తున్న పాలన కారణంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, బంగారం, విలువైన రాళ్లు మణిపూర్ లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ‘గోల్డెన్ ట్రయాంగిల్’ గుర్తుందిగా? మాదకద్రవ్యాల అక్రమ రవాణా మణిపుర్కు కొత్తేమీ కాదు. భద్రతా సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 ఫిబ్ర వరిలో రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్తో దొరికిన సైనిక కల్నల్ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 15న ‘గోవా క్రానికల్’లో ప్రచురితమైన కథనంలో, మణిపుర్లోని జఠిలమైన మాదకద్రవ్యాల వ్యాపార నెట్వర్క్ వివరా లను ఇచ్చారు. 2021 నుంచి మణిపుర్లో గసగసాల సాగు 33 శాతం పెరిగిందని ఐరాస నివేదిక పేర్కొంది. ఇది కుకీలకు నగదు పండించే పంట అని మైతేయిలు ఆరోపిస్తున్నారు. కానీ గోవా క్రానికల్ కథనం ప్రకారం, ముస్లిం పంగల్లతో సహా ప్రతి సమాజానికీ ఈ పంటలో వాటా ఉంది. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని మయన్మార్ వివాదం తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం)తో వాణిజ్యం, పరస్పర చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన విధానం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘భారతదేశ అత్యంత ప్రతిష్ఠాత్మక మైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగ్నేయాసియాతో ఉన్నాయి. మయన్మార్ అంతర్గత భద్రతా వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన కారణంగా అవి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి,’’ అని చెప్పారు. మిజోరం మార్గంలో తిరుగుబాటు సోకిన రాఖైన్ రాష్ట్రం గుండా వెళుతున్న దాదాపు రెండు దశాబ్దాల నాటి మల్టీమోడల్ కలాదాన్ ప్రాజెక్టును అరాకాన్ సైన్యం (మయన్మార్) కాలానుగుణంగా నిరోధిస్తూ వచ్చింది. మణిపుర్లోని మోరేతో థాయ్లాండ్లోని మయీ సాట్తో కలిపే భారతదేశం, మయన్మార్, థాయ్లాండ్ త్రైపాక్షిక హైవే ప్రాజెక్టును సగాయింగ్(మయన్మార్) ప్రాంతంలో జరిగిన పోరాటాల కారణంగా నిలిపివేశారు. ఈ నెలలోనే జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ మయన్మార్ విదేశాంగ మంత్రి థాన్ స్వేతో సమావేశమయ్యారు. భారతదేశం, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో జరిగిన పోరాటాలు, వైమానిక దాడులు కలిగిస్తున్న ప్రమాదకరమైన ప్రభావాల గురించి థాన్ స్వేకి వివరించారు. ‘ఎన్యూజీ’కి చెందిన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (పీడీఎఫ్) సగాయింగ్ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తోంది. అంతర్యుద్ధ ప్రతి ష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ‘అన్ని ఫలాలను జుంటా బుట్టలో’ ఉంచే విధానాన్ని ఢిల్లీ సమీక్షించుకోవాలి. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి చిన్ నేషనల్ ఫ్రంట్, అరకాన్ సైన్యాన్ని భారత ఏజెన్సీలు సిద్ధం చేయాలి. ప్రజాస్వామ్య శక్తులతో సంబంధాలను పునరుద్ధరించడం, ఆయుధాల సరఫరాతో సహా ఎన్యూజీ/పీడీఎఫ్తో సమాచార మార్గాలను ఏర్పాటు చేయడం ఆచరణీయమైన ఎంపికలు. ఇది సమస్యను నిరోధించవలసిన చర్యను ఆలస్యంగా చేపట్టడం లాంటిదే అయినప్పటికీ, భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలకంగా ఉన్న మణిపుర్ సమస్యకు తక్షణ చికిత్స అవసరం. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపుర్ను రక్తసిక్తం చేయడానికి అనుమతించాయి, కొత్త తిరుగుబాట్లకు బీజాలు నాటడానికి అనుమతించాయి. అంతకుమించి సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాల నిష్పా క్షికతకు సవాలు విసిరే అవాంఛనీయమైన దుఃస్థితిలో ఉంచాయి. ఒక సీఆర్పీఎఫ్ భద్రతా సలహాదారు మణిపుర్ సీఎం బీరెన్సింగ్కు మార్గనిర్దేశం చేస్తుండగా, భద్రతా దళాల ప్రత్యేక రక్షణ చట్టం పరిధిలోకి రాని ప్రాంతాల్లో పౌర అధికారులకు సైన్యం, కేంద్ర పారామిలటరీ బలగాలు సాయం చేస్తున్నాయి. కుకీల పట్ల పక్షపాతం చూపుతున్నాయని ఆరోపిస్తూ అస్సాం రైఫిల్స్పై మణిపుర్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం, అస్సాం రైఫిల్స్ను తొలగించాలని మైతేయిలు డిమాండ్ చేయడం, మరోవైపున నిషేధిత ఉగ్ర వాద గ్రూపులను సైన్యం, అస్సాం రైఫిల్స్ విడుదల చేయడంపై లేవ నెత్తుతున్న ప్రశ్నలు మణిపుర్ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రధాన పని లూటీకి గురైన ఆయుధాలను తిరిగి పొందడమే. వివిధ ప్రదేశాలలో ఆయుధ డిపా జిట్ పెట్టెలను ఉంచినప్పటికీ, మెజారిటీ ప్రజలు వాటి పక్కన సెల్ఫీలు తీసుకుంటున్నారు. మణిçపుర్, ఈశాన్య ప్రాంతాలపై జరుగు తున్న సెమినార్లలో పరిస్థితిని వివరించడానికి వాడుతున్న మాటలు: ‘అరాచకం’, ‘మరో కంబోడియా’, ‘సమాజాల మధ్య పూర్తి అప నమ్మకం’. ఆశ్చర్యకరంగా, ప్రధానమంత్రి లాగే, ఆర్మీ చీఫ్ గానీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గానీ మణిపుర్ను ఇంతవరకూ సందర్శించలేదు. జరుగుతున్న తిరుగుబాటును మొగ్గలోనే తుంచివేసే విషయంలో ప్రభుత్వం తన రాజకీయ సంకల్ప లేమిని ప్రస్ఫుటంగా చూపిందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈశాన్యం నుండి 25 మంది లోక్సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందినవారే. మణిపుర్కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజకీయ పరిష్కారం సాధించాలంటే, ముందుగా చేయాల్సిన విధులు: హింసను అరికట్టడం, రాష్ట్రపతి పాలన విధించడం. -వ్యాసకర్త సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ‘గిరిజన్’ బ్రాండ్ పేరుతో అందిస్తున్న సహజసిద్ధమైన ఉత్పత్తులకు గిరాకీ ఉంది. ప్రధానంగా అరకు వ్యాలీ కాఫీతోపాటు గిరిజన తేనె, షర్బత్, జీడిపప్పు, చిరుధాన్యాలు, త్రిఫల పౌడర్, హెర్బల్ ఆయిల్, సబ్బులు వంటి 80 ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రత్యక్షంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన జీసీసీ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీతోపాటు అనేక నగరాల్లోను జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్వేస్టేషన్లో జీసీసీ అవుట్లెట్ ఏర్పాటు చేశారు. దేశంలో 13 విమానాశ్రయాల్లోను గిరిజన ఉత్పత్తులను అమ్ముతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయంలో పూర్తిగా జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయంలో జీసీసీ ఏర్పాటు చేసిన స్టాల్ విక్రయాలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ట్రైబల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) భాగస్వామ్యంతో అనేక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. జైపూర్, గోవా, త్రివేండ్రం, మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్టు (ఉదయ్పూర్), కోయంబత్తూరు, పుణె, కేబీఆర్ (లద్దఖ్), మాతా దంతేశ్వరి (జగదల్పూర్), కొచ్చిన్, లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ (గౌహతి), ప్రయాగ్రాజ్ విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో రూ.85.56 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జీసీసీ విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన అటవీ ఫలసాయాలకు మంచి ధర దక్కేలా జీసీసీ దోహదం చేస్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన వాటిని అనేక రకాల ఉత్పత్తులుగా విక్రయిస్తోంది. ఈ క్రమంలో గిరిజనులకు మరింత మేలు చేసేలా జీసీసీ సేవలు విస్తృతం చేస్తోంది. దీన్లో భాగంగానే దేశంలోని అనేక ప్రాంతాల్లో జీసీసీ అవుట్లెట్స్ ప్రారంభించాం. ఇతర రాష్ట్రాల్లో గతేడాది (2022–23లో) రూ.85.56 లక్షల విలువైన జీసీసీ గిరిజన్ ఉత్పత్తులు విక్రయించాం. దేశంలో ఎక్కడైనా జీసీసీ ఫ్రాంచైజీ అవుట్లెట్లు పెట్టుకునే ఆసక్తి ఉన్నవారికి ప్రోత్సాహం అందిస్తాం. – శోభ స్వాతిరాణి, జీసీసీ చైర్పర్సన్ -
ఆ గూడేనికే వెలుతురు నువ్వమ్మా!
‘ఇరవై ఏళ్ల వరకూ మా ఇంట్లో బల్బు చూళ్లేదు’ అంటుంది భాగ్యశ్రీ. మహరాష్ట్రలో నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని తమ గూడేనికి చాలా కాలం పాటు సర్పంచ్గా ఎవరూ నిల్చునే ధైర్యం చేయలేదు. సమస్యలు తీర్చేవారూ లేరు. ‘చివరకు నేనే సర్పంచ్ అవుదామని నిశ్చయించుకున్నా’ అంది భాగ్యశ్రీ. 24 ఏళ్ల ఈ గిరిజన నాయకురాలు తన వారి కోసం పని చేస్తున్న తీరు ప్రతి అణగారిన సమూహానికి చూపుతున్న మార్గం చాలానే ఉంది. మహరాష్ట్రలో ముంబై, పూణె వంటి నగరాలది ఒక ప్రపంచమైతే గడ్చిరోలి వంటి నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాలది మరో ప్రపంచం. ‘మహారాష్ట్రకు ఊపిరితిత్తి’ అని పిలిచే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి, గిరిజన ఆవాసాలతో ఉంటుంది. అయితే నక్సలైట్ల ప్రభావం వల్ల, గిరిజనులనే నిర్లక్ష్యం వల్ల దారుణమైన వెనుకబాటుతనం ఇక్కడ ఉంటుంది. ‘మా గూడెంలో నాకు ఇరవై ఏళ్లు వచ్చే వరకూ కరెంటు లేదు. మా ఇంట్లో బల్బు వెలగడం చూళ్లేదు’ అంటుంది 24 ఏళ్ల భాగ్యశ్రీ లక్ష్మి. గడ్చిరోలి అడవుల్లో అత్యధిక సంఖ్యలో ఉండే మడియా తెగకు చెందిన ఈ చదువుకున్న అమ్మాయి తన సొంతగూడెం ‘కొటి’ పంచాయితీ కింద ఉన్న 9 గ్రామాలకు సర్పంచ్. ఈ ప్రాంత గిరిజనుల జీవితాలకు ఒక ఆశాదీపం. సర్పంచ్ లేని ఊరు భాగ్యశ్రీ లక్ష్మి పుట్టి పెరిగిన ‘కొటి’ గూడేనికి 2003 నుంచి సర్పంచ్ లేడు. ఎందుకంటే నక్సల్ ప్రభావం వల్ల ఏ సమస్యో అని ఎవరూ నిలబడలేదు. దాంతో ఆ ప్రాంతమంతా అనేక సమస్యలు పేరుకుపోయాయి. బాల్య వివాహాలు, చదువు మానేయడం, నక్సల్ అనే అనుమానంతో అమాయక గిరిజన యువకులను ఏళ్ల తరబడి జైళ్లల్లో పడేయడం.. ఇదీ అక్కడ జరుగుతున్నది. డాక్టర్లు పొరపాటున కూడా రారు. అదేమంటే రోడ్లు లేవంటారు. రోడ్లు వేయమని అధికారుల దగ్గరకు వెళితే వారు మరేవో సమస్యలు చెప్తారు. ‘ఇవన్నీ చూసి చూసి విని విని నేనే సర్పంచ్గా మారి ఏదో ఒకటి చేద్దామని బయలుదేరాను’ అంటుంది భాగ్యశ్రీ లక్ష్మి. నేనొచ్చాను భాగ్యశ్రీ లక్ష్మి తల్లి అంగన్వాడి టీచర్. తండ్రి ప్రభుత్వ టీచర్. అందుకే భాగ్యశ్రీని చదివించారు. ‘చంద్రాపూర్లో బి.ఏ. ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. మంచి వాలీబాల్ ప్లేయర్ని నేను. టీచింగ్ రంగంలోకి వెళదామనుకున్నాను. కాని నా చదువు నాకు మాత్రమే ఉపయోగపడితే ఎలా? నా వారికి ఏదైనా చేయాలని సర్పంచ్ అయ్యాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు’ అంది భాగ్యశ్రీ. అయితే ఆమెకు పదవి రావడాన్ని ఊహించని కొంతమంది మగవారు భాగ్యశ్రీ పదవీ స్వీకారం రోజు ఆమెతో దురుసుగా వ్యవహరించారు. మైక్ తీసుకొని మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు. అసభ్యంగా ప్రవర్తించారు. ‘నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మ– నువ్వు ఇక మీదట మామూలు భాగ్యశ్రీగా ఉండకు. ఒక నాయకురాలు ఎలా ఉంటుందో అలా ఉండు’ అని ధైర్యం చెప్పింది. ఆ క్షణమే నేను గట్టిగా నిలబడాలనుకున్నాను’ అంటుంది భాగ్యశ్రీ. బైక్ మీద తిరుగుతూ... ప్రతి ఉదయం టీ తాగి బైక్ మీద తిరుగుతూ తన అజమాయిషీలో ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తోంది భాగ్యశ్రీ. ఆమె సర్పంచ్ అయ్యాక గూడేల్లోని తల్లిదండ్రులతో పోట్లాడి మొదటగా చేసిన పని బాల్యవివాహాలు మాన్పించడం... బాలికలను హాస్టళ్లకు పంపి చదివించడం... స్కూళ్లలో తిరిగి చేరేలా చేయడం, టాయిలెట్లు నిర్మించడం... ‘నా కింద తొమ్మిది గ్రామాల్లో ఆరింటికి కరెంటు తెప్పించాను’ అని తెలిపిందామె. ‘అధికారులు ఏది అడిగినా నక్సల్స్ సమస్యను సాకుగా చూపుతారు. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరిస్తే నక్సల్స్ అడ్డుపడరు’ అంది. ‘గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలూ వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి’ అంటుంది భాగ్యశ్రీ. గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలు వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి. -
గిరిజన భూ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఎల్టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ ఆర్డర్ అమలు ఇలా ♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు. ♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. ♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు. ♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్లో ఉన్నాయి. -
కేంద్ర గిరిజన వర్సిటీకి నేడు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
గిరిజన విద్యార్థి.. కష్టాలను అధిగమించి,ఐఐటీలో సీటు సాధించింది
జె.ఇ.ఇ. ఎంట్రన్స్లో ర్యాంకు కొట్టడం సామాన్యం కాదు.అందుకై కొందరు రాజస్తాన్ వెళ్తారు. కొందరు హైదరాబాద్, విజయవాడ చేరుకుంటారు.తల్లిదండ్రులు గైడ్ చేస్తారు. కాని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు పుట్టిన కోయ విద్యార్థిని కొర్సా లక్ష్మి గురుకుల పాఠశాలలో చదువుకునే మంచి ర్యాంకు సాధించింది.పాట్నా ఐఐటీలో సీటు సాధించింది. కోయలలో ఒక అమ్మాయి సాధించిన స్ఫూర్తినిచ్చే విజయం ఇది. కొర్సా లక్ష్మి పరిచయం. కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్ సెంటర్ కోసం అవసరమైతే రాజస్థాన్లోని కోటాకు వెళతారు లేదా హైదరాబాద్, విజయవాడలలో ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో వేస్తారు. ఇక పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటుంటే టీవీలు బంద్ చేస్తారు. మాటా పలుకూ లేకుండా పిల్లలు ఇరవై నాలుగ్గంటలూ చదువుకునేలా చేస్తారు. మెటీరియల్ తెచ్చిస్తారు. చాలా హైరానా పడతారు. అదేం తప్పు కాదు. కాని ఇలాంటివన్నీ లేకుండా కూడా కొంతమంది విజయం సాధిస్తుంటారు. కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుకున్న కోయ విద్యార్థిని కుర్సా లక్ష్మి అలాంటి విజేతే. పట్టుదలతో చదువుకుని ర్యాంకు సాధించిన విజేత. ఐసులమ్మే తండ్రి కూతురు కొత్తగూడెం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండా కాటాయగూడెం. 300 గడపలున్న గ్రామం ఇది. అందరూ కోయలే. వ్యవసాయ కూలీలే. ఏ కొద్దిమందికో కాసింత భూమి ఉంటుంది. కొర్సా లక్ష్మి తండ్రి కన్నయ్యకు ఎకరం భూమి ఉంది. కాని వాన పడితేనే పండుతుంది. కన్నయ్య వ్యవసాయ కూలీగా వెళతాడు. తల్లి శాంతమ్మ కూడా. వ్యవసాయ పనులు లేనప్పుడు తన టీవీఎస్ ఎక్సెల్ మీద ఐస్ బాక్స్ పెట్టుకుని ఐసులమ్ముతాడు. ముగ్గురు పిల్లలు. కాని పెద్ద కొడుకు చదువు ఇష్టం లేక 7వ తరగతిలో ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండో కొడుకు మామూలు చదువే. చివరి అమ్మాయి లక్ష్మి బాగా చదువుకోవాలని నిశ్చయించుకుంది. పిన్ని స్ఫూర్తి కన్న తల్లిదండ్రులు చదువు లేని వారు కావడంతో లక్ష్మికి చదువులో ఏ సాయమూ చేయలేకపోయేవారు. ఆరవ తరగతి నుంచి కొత్తగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న లక్ష్మికి పిన్ని సుమలత స్ఫూర్తిగా నిలిచింది. డిగ్రీ చదువుకున్న సుమలత హాస్టల్లో ఉన్న లక్ష్మిని తరచూ కలుస్తూ చదువు విలువ చెబుతూ వచ్చింది. డబ్బుకు విలువ ఇవ్వని వారు కూడా చదువుకు విలువ ఇస్తారని తెలిపింది. సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చి లక్ష్మి మంచి చెడ్డలు చూసేది. ఆమె మాటలు లక్ష్మి మనసులో నాటుకుపోయాయి. ‘ఏ రోజూ కూడా రాత్రి ఒంటి గంట లోపు లక్ష్మి పుస్తకం మూయగా చూడలేదు’ అని లక్ష్మి బాబాయ్ రవి తెలిపాడు. గురుకుల పాఠశాలలో కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో దాదాపు వేయి మంది అమ్మాయిలు 6 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్నారు. ప్రిన్సిపాల్ దేవదాసు, ఉపాధ్యాయులు వీరి చదువు మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. చురుకైన విద్యార్థినులను ఎంపిక చేసి జె.ఇ.ఇలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్లో ఎం.పి.సి తీసుకున్న లక్ష్మి 992 మార్కులు సాధించింది. దాంతో ఇంకా ఉత్సాహంతో జె.ఇ.ఇకి ప్రిపేర్ అయ్యింది. జె.ఇ.ఇ అడ్వాన్స్డ్లో 1371వ ర్యాంకు సాధించింది. పాట్నా ఐ.ఐ.టిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మొన్నటి ఆగస్టు మొదటివారంలో సీటు పొందింది. గురుకుల పాఠశాల నుంచి ఈ ఘనత సాధించిన అమ్మాయి లక్ష్మీ. ఐ.ఏ.ఎస్ చేయాలని... బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్ చేయాలనేది తన లక్ష్యమని కొర్సా లక్ష్మి చెప్పింది. జె.ఇ.ఇలో మంచి ర్యాంకు సాధించి ఐ.ఐ.టిలో సీటు పొందడంతో ఐ.టి.డి.ఏ అధికారులు లక్ష్మిని ప్రశంసించారు. ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. లక్ష్మి ఇంత బాగా చదవడంతో ఇంకా కొంతమంది ఆమె చదువును ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఆ ప్రోత్సాహం వల్ల లక్ష్మి ఐ.ఏ.ఎస్ చదివి పేద వర్గాల కోసం పని చేయాలని నిశ్చయించుకుంది. -
అడవి చింత.. చారెడంత!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అరే.. చింతగింజలు ఏమిటి ఇంత భారీ సైజులో కనిపిస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇవి చింతగింజలు కాదు.. అచ్చం వాటిని పోలినట్లు ఉండే అడవిచింత గింజలు! మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో పెరిగే ఓ భారీ తీగ జాతి మొక్క నుంచి వీటిని సేకరిస్తారు. ఈ మొక్క కాండం చాలా పొడవుగా ఉంటుంది. దీని కాయలు సుమారు 4–5 అడుగుల వరకు పెరుగుతాయి. అచ్చం చింతకాయలను పోలి ఉండటంతో వీటిని ఆయా రాష్ట్రాల సరిహద్దులో ఉండే తెలుగువారు అడవిచింత గింజలుగా పిలుస్తున్నారు. ఈ గింజలను కరీంనగర్లోని పలు కూడళ్ల వద్ద ఛత్తీస్గఢ్కు చెందిన గిరిజనులు ఒక్కోటి సుమారు రూ. 30 వరకు విక్రయిస్తున్నారు. ఈ గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని... పచ్చకామెర్లు, పంటినొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించే గుణం వీటికి ఉందని చెబుతున్నారు. ఈ చింతగింజల నుంచి తీసిన నూనెను ఏదైనా గానుగ నూనెతో కలిపి కీళ్లనొప్పులకు మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. దట్టమైన అడవిలోనే పెరుగుతాయి ఈ అడవిచింత సీసాల్పనేసి కుటుంబపు మొక్క. దీని శాస్త్రీయ నామం ఎంటాడా పరిసేత. అధిక వర్షపాతంగల దట్టమైన అడవుల్లో పెరిగే ఔషధ మొక్క. ఈ తీగజాతి నుంచి గుత్తులు గుత్తులుగా చింతపండు ఆకారంలో వచ్చే పొడవైన కాయల నుంచి గింజలను గిరిజనులు సేకరిస్తారు. తెలంగాణలో ఇలాంటి తీగజాతులు ఎక్కడాలేవు. ఏపీలోని తలకోన, శేషాచలం అడవులు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు వాటికి అనుకూలం. – డాక్టర్ నరసింహమూర్తి, శాతవాహన యూనివర్సిటీ -
యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత..
భోపాల్: యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తి ఇంటిని రాష్ట్ర అధికారులు కూల్చి వేశారు. గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రభుత్వం స్బందించింది. వీడియోలో ఓ వ్యక్తి కింద కూర్చున్న గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి వెళ్లింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని ప్రవేశ్ శుక్లాగా గుర్తించి అరెస్టు చేశారు. #WATCH | Sidhi viral video | Accused Pravesh Shukla's illegal encroachment being bulldozed by the Administration. He was arrested last night.#MadhyaPradesh pic.twitter.com/kBMUuLtrjK — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 5, 2023 నిందితుని అరెస్టు చేసిన అనంతరం.. అక్రమంగా ఆక్రమించాడనే ఆరోపణలతో అధికారులు అతని ఇంటిని బుల్ డోజర్తో కూల్చివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. నిందితుడు పాల్పడిన ఘటన అమానవీయమని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఇలాంటివారికి సాధారణ శిక్ష సరిపోదని చెప్పారు. ఇదీ చదవండి: Delhi Court Firing: లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం -
భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా..గిరిజన మ్యూజియం
సాక్షి, అమరావతి: గిరిజన స్వాతంత్య్ర వీరుల చరిత్రను భావితరాలకు అందించి వారిలో స్ఫూర్తి నింపే మహోన్నత లక్ష్యంతో చేపట్టిన మ్యూజియం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రా కశ్మిర్గా పేరుగాంచిన లంబసింగికి సమీపంలో రూ.35 కోట్లతో ట్రైబల్ ఫ్రీడం ఫైటర్స్ మ్యూజియం పనులు ఇప్పటికే 62.25 శాతానికి పైగా పూర్తయ్యాయి. గిరిజన పోరాటం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చేలా కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే అరకు, కర్నులు జిల్లా శ్రీశైలం, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మ్యూజియంలున్నాయి. అల్లూరి సీతారామరాజుతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో గర్జించిన గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను నెలకొల్పనున్నారు. గిరిజన యోధుల చరిత్రను భావితరాలకు అందించేలా శిల్పాలు, ఫొటోలను ఏర్పాటు చేస్తారు. బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు. గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చుని వీక్షించేలా డిజిటల్ థియేటర్ను నిరి్మస్తున్నారు. ట్రైబల్ థీమ్ హట్తో కూడిన రెస్టారెంట్, ఓపెన్ థియేటర్, స్వాగత ప్లాజాలను నిర్మిస్తున్నారు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీని నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. 2021లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగిలో 21.67ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేగంగా నిర్మాణ పనులు నాలుగు విభాగాలుగా చేపట్టిన మ్యూజియం నిర్మాణాన్ని ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియంను మంజూరు చేసి రూ.15 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్లతో పాటు 21.67 ఎకరాల భూమిని కేటాయించడంతో మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. – రవీంద్రబాబు, మిషన్ డైరెక్టర్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ -
ఆది మహోత్సవ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
దళిత, గిరిజనులకు భారీ ‘నిధి’
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2023–24 బడ్జెట్లో దళిత, గిరిజనులకు ఏకంగా రూ. 51,983.09 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 36,750.48 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 15,232.61 కోట్ల చొప్పున నిధుల కేటాయింపులు చేసింది. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి ఎస్డీఎఫ్ కేటాయింపులు రూ. 4,632.72 కోట్లు పెరిగాయి. ఇందులో ఎస్సీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 2,182.73 కోట్లు పెరగగా... ఎస్టీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 1,819.99 కోట్లు పెరిగాయి. దళిత, గిరిజనులకు భారీ స్థాయిలో నిధులివ్వడంతో ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి ముందుకు సాగనుంది. దళితబంధుకు 17,700 కోట్లు.. తాజా బడ్జెట్లో దళితబంధు వాటా అగ్రభాగాన నిలిచింది. 2023–24 బడ్జెట్లో దళితబంధు పథకానికి ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా మిగతా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24 వార్షిక సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. -
ఇదో వెరైటీ సంప్రదాయం.. పండగ వస్తే అక్కడివాళ్లంతా గుమ్మడికాయలు తీసుకుని
ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): కొండల్లో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే గిరిజనులు దిగువ ప్రాంతాల్లో ఉంటున్న ఇతర కులాల (తెగల) వారితో నేస్తరికం (స్నేహం) చేస్తారు. సంక్రాంతి పండగతో పాటు దసరా, దీపావళి, ఉగాది వంటి పండగల సమయంలో గిరిజన సంప్రదాయ ప్రకారం నేస్తం ఇంటికి వెళతారు. గిరిజనులు పోడు పంటగా పండించే రకరకాల పంటలను కొద్దికొద్ది గా తీసుకుని నేస్తం ఇంటికి పయనమవుతారు. భోగీ రోజున ఉదయం నేస్తం ఇంటికి చేరుకుని సాయంత్రం వరకు ఉంటారు. ఆ సమయంలో గుమ్మడికాయ, కర్రపెండ్లం, అరటి కాయలు, అరటి పళ్లు, కందికాయలు, కందులు, అరటి ఆకులను ప్రేమగా అప్పగిస్తారు. తమ గిరిజన నేస్తానికి దిగువ ప్రాంతంలోని వారు రకరకాల వంటలతో కొసరి కొసరి సంతృప్తిగా భోజనం పెట్టి కొత్త దుస్తులు, బియ్యం, పప్పులు, పిండి వంటలు, దారి ఖర్చులకు కొంత మొత్తం డబ్బులు అందిస్తారు. ఇలా సంతృప్తి పొందిన గిరిజన నేస్తం కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తారు. చదవండి: సంక్రాంతి స్పెషల్.. అరిటాకంత ఆనందం! -
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్లో కొంతకాలం చేసి, మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
గిరిజన ప్రాంత అభివృద్ధి పై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ద : మంత్రి రోజా
-
సుప్రీంలో తేలాకే ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తాం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 10% బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరింది. కానీ ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్లో ఉంది. అందువల్ల అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు ఏ విషయమనేది తేలాక.. ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను ఆఘా మేఘాలపై జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే గత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా.. తెలంగాణ జారీ చేసిన రిజర్వేషన్ల పెంపు బిల్లు విషయమై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి: ఈడీ ఎదుట విచారణకు హజరైన మంత్రి తలసాని పీఏ అశోక్) -
పశువుల కాపరి పై దాడి చేసిన పులి..
-
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
కాళ్లమీద పడినా కర్కశంగా.. గొత్తికోయల దారుణ కృత్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చంద్రుగొండ: బెండాలపాడు అటవీ ప్రాంతంలో తమ ఆఫీసర్పై దాడి చేయొద్దని సహచర సిబ్బంది కాళ్లపై పడి మొక్కినా గొత్తి కోయలు కనికరించలేదు. వేటకొడవళ్లతో దాడి చేయడంతో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న ఎఫ్ఆర్ఓపై తులా వేటకొడవలితో దాడి చేస్తుండగా.. ‘మీ కాళ్లు మొక్కుతా, మా సార్ను ఏం చేయొద్దు.. మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం’అంటూ రామారావు వేడుకున్నారు. అయినా పట్టించుకోకుండా చేతిలోని పదునైన ఆయుధంతో శ్రీనివాసరావు మెడ, తల, గొంతుపై అదే పనిగా దాడి చేశాడు. మంగును వాచర్ రాములు నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆవేశంగా ఉన్న వారిద్దరినీ నిలువరించడం సాధ్యం కాక శ్రీనివాసరావును అక్కడే వదిలి రామారావు, రాములు తదితరులు ప్లాంటేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అటవీ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే వరకు సుమారు గంట పాటు ఎఫ్ఆర్ఓ రక్తపుమడుగులోనే ఉన్నారు. ఆ తర్వాత కారులో మధ్యాహ్నం 1:56 గంటల ప్రాంతంలో చంద్రుగొండ ప్రాథమిక ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జీపులో వెళ్లుంటే..: ఫారెస్ట్ ఆఫీసర్గా కేటాయించిన జీపులోనే శ్రీనివాసరావు ఎక్కువగా ఫీల్డ్ విజిట్కు వెళ్తుంటారు. కొత్తగూడెం నుంచి చంద్రుగొండకు తన కారులో వచ్చి అక్కడి నుంచి ఫారెస్ట్ జీపులో అడవిలోకి వెళ్లడం ఆయనకు అలవాటు. జీపులో తనతో పాటు సిబ్బందిని తీసుకెళ్లేవారు. కానీ, మంగళవారం ఆయన బైక్ మీద ఫీల్డ్ విజిట్కు వెళ్లడం, ఆయన వెంట ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఆయనపై పగ పెంచుకుని అదను కోసం చూస్తున్న గొత్తికోయలు తేలికగా దాడి చేయగలిగారని అటవీ సిబ్బంది చెబుతున్నారు. పచ్చదనమే ప్రాణంగా బతికారు పచ్చదనమే ప్రాణంగా బతికిన సిన్సియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు చివరకు ఆ పచ్చని చెట్ల మధ్యే ప్రాణాలు వదిలారు. అడవుల రక్షణే ఊపిరిగా జీవించిన ఆయన చివరకు విధి నిర్వహణలో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు సహజంగానే అడవులంటే ప్రేమ కలిగిన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా పోడు వ్యవసాయాన్ని అరికట్టడంతో పాటు అడవులు పెంచడంపై శ్రద్ధ చూపించేవారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి గోల్డ్ మెడల్ సైతం అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఆయన వ్యక్తిగతంగా మాత్రం చాలా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారని, అలాంటి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని తోటి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎఫ్ఆర్వో మృతి.. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం కేసీఆర్