
రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోజా. చిత్రంలో జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు
రాజానగరం/ద్వారకా తిరుమల: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాలం చెల్లిన మాత్ర లాంటివాడని, అలాంటి రాజకీయ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్చెరువులో రాజానగరం నియోజకవర్గ సమన్వయకర్త జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ ‘మహిళా స్వరం’ బహిరంగ సభలో రోజా ప్రసంగించారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ సంగతే మర్చిపోయిన చంద్రబాబును మహిళలు క్షమించబోరని చెప్పారు. 2014 నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,200 కోట్లుండగా, చంద్రబాబు మాట తప్పడం వల్ల అవి నేటికి రూ.22,000 కోట్లకు పెరిగాయని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికలు రానుండడంతో మరోసారి మహిళలను మభ్యపెట్టేందుకు ‘పసుపు కుంకుమ’ పేరుతో సీఎం ‘ఎర’ వేస్తున్నారని ఆరోపించారు.
అన్న అనే పదానికే బాబు కళంకం
లోకంలో ఏ ముఖ్యమంత్రి కూడా పోస్టు డేటెడ్ చెక్కులు పంపిణీ చేయరని, అవి మారాలంటే తాను మరోసారి ముఖ్యమంత్రి కావాలనే విధంగా చంద్రబాబు మభ్యపెడుతున్నారని రోజా ఆరోపించారు. తల్లి అమ్మణ్ణమ్మ ఆస్తులు సొంత ఆడపడుచులకు సంక్రమించకుండా చంద్రబాబు మనవడు దేవాన్‡్ష పేరిట బదలాయించుకున్నారని, ఇటువంటి వ్యక్తి అన్న అనే పదానికే కళంకమని ధ్వజమెత్తారు. నిజమైన అన్న అంటే ఏమిటో వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూస్తే తెలుస్తుందన్నారు. ఆయన రాష్ట్రంలో ప్రజలందరి కోసం రూపొందించిన ‘నవ రత్నాలు’ పథకాల్లో ఏడు పథకాలను మహిళల అభ్యున్నితి కోసమే కేటాయించడం హర్షణీయమన్నారు. ప్రజల బాగు కోసం నిరంతరం పరితపించే జగనన్నను రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా రాష్ట్రప్రగతిలో ప్రతి మహిళ భాగస్వాములు కావాలని రోజా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన ఏడుగురు మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కొల్లి నిర్మలకుమారి, పిల్లంగోళ్ల శ్రీలక్షి, కాళీ మునికుమారి, నల్లమిల్లి కాంతమ్మ, షర్మిలారెడ్డి, ధనలక్ష్మి, పిల్లి నిర్మల, తానేటి వనిత, కె.రాజారమాదేవి, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నాయకులు జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, మార్గని భరత్, రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, సత్తి సూర్యనారాయణరెడ్డి, అనంత ఉదయ్భాస్కర్, కర్రి పాపారాయుడు పాల్గొన్నారు.
బాబును రాష్ట్రం నుంచి డీబార్ చేయాలి
సీఎం చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అయితే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్ కమింగ్ పొలిటీషియన్ అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచర్ల పంచాయతీలోని కమతంకుంటలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం తెలికిచర్లలో ’నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలనలో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఆలోచించే బుర్ర లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment