
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2జీ కుంభకోణంలో ఢిల్లీ సీబీఐ కోర్టు సంచలన తీర్పున్నిచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. యూపీఏ సర్కారు ఏ తప్పూ చేయలేదనే విషయాన్ని ఈ తీర్పు చాటుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
అటు ఏ రాజా, కనిమొళి సన్నిహితులు కూడా ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనిమొళి సన్నిహితురాలు, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సులే 2జీ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. 'నా స్నేహితురాలైన కన్నీకి న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉంది' అంటూ ఆమె ఫొటో పెట్టి సులే ట్వీట్ చేశారు. ఇక, 2జీ తీర్పు అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. తన తప్పులేకపోయినా తనపై కేసు నమోదుచేశారని, కలైంజర్ టీవీలో తాను మైనారిటీ వాటాదారును మాత్రమేనని ఆమె అన్నారు. తీర్పు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో మాట్లాడానని, సత్యమే గెలిచిందని ఆయన అన్నారని చెప్పారు.
So happy for my friend kanni.. justice done🙏🏽🙏🏽🙏🏽😀 @KanimozhiDMK pic.twitter.com/NffxsIE1ww
— Supriya Sule (@supriya_sule) 21 December 2017