2G Scam
-
అదనపు సోలిసిటర్ జనరల్ అమన్ లేఖి రాజీనామా
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అమన్ లేఖి, అదనపు సోలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం హడావిడిగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజ్జూకి పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అదనపు సోలిసిటర్ జనరల్ పదవి రాజీనామాకు గల కారణాల్ని ఆయన లేఖలో తెలియజేయలేదు. కేవలం రెండు లైన్ల సందేశంతో ఆయన లెటర్ సమర్పించడం విశేషం. ఆయన తిరిగి ప్రైవేట్ ప్రాక్టీస్ వైపే వెళ్లొచ్చని సన్నిహితులు చెప్తున్నారు. సుప్రీం కోర్టు అదనపు సోలిసిటర్ జనరల్గా లేఖి మార్చి, 2018లో నియమించబడ్డారు. జులై 1, 2020న ఆయన్ని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన పదవీకాలం 2023, జూన్ 30న ముగియాల్సి ఉంది. ఈలోపే ఆయన కారణం చెప్పుకుండా రాజీనామా చేయడం గమనార్హం. అమన్ లేఖి ఏఎస్జీ హోదాలో బోగ్గు కేటాయింపుల స్కామ్, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్లో హాజరయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఈయన భార్యే. -
వారికి అవినీతిపై మాట్లాడే అర్హత లేదు
చెన్నై: కాంగ్రెస్, డీఎంకేలకు అవినీతిపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వారి హయాంలోనే భారీ 2జీ కుంభకోణం చోటు చేసుకుందని గుర్తు చేశారు. తమిళనాడులో వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘోర పరాజయం పాలవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ శక్తుల విజయం తథ్యమన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శనివారం షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో వారసత్వ పార్టీలు అపజయం పాలయ్యాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికన్నా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించామన్నారు. ‘2013–14 బడ్జెట్లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం తమిళనాడుకు రూ. 16,155 కోట్లు కేటాయించగా.. మా తాజా బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించింది రూ. 32,850 కోట్లు’ అని వివరించారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సమర్ధ నాయకత్వంలో కోవిడ్–19పై దేశం గొప్పగా పోరాడుతోందన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా భారత్ కరోనాను సమర్ధంగా ఎదుర్కొందన్నారు. కరోనాపై పోరులో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావడమే అందుకు కారణమన్నారు. ఈ సందర్భంగా, చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ. 380 కోట్లతో నిర్మించిన ‘తెరవైకందిగై’ రిజర్వాయర్ను అమిత్ షా జాతికి అంకితం ఇచ్చారు. అలాగే, సుమారు రూ. 67 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే నేత పళని సామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తదితర నేతలు పాల్గొన్నారు. 2021 ఏప్రిల్– మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ– అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందని పళని సామి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చెన్నై విమానాశ్రయం నుంచి బస చేసిన హోటల్కు వెళ్లే దారిలో ప్రొటోకాల్ను పక్కనపెట్టి.. అమిత్ షా వాహనం దిగి, రోడ్డుపై నడుస్తూ అక్కడ గుమికూడిన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. సంబంధిత వీడియోను జతపర్చి.. ‘తమిళనాడులో ఉండటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. చెన్నై చూపిస్తున్న ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు’ అని షా ట్వీట్ చేశారు. సీఎం పళని సామి, డెప్యూటీ సీఎం పన్నీరుసెల్వం నాయకత్వంలో కరోనాపై పోరులో తమిళనాడు సమర్ధంగా వ్యవహరిస్తోందని ప్రశంసిం చారు, ఇక్కడ కోవిడ్–19 నుంచి కోలుకున్న వారు 97% ఉన్నారన్నారు. డీఎంకేపై విమర్శలు యూపీఏ పదేళ్ల పాలనలో డీఎంకే తమిళనాడుకు ఏం చేసిందో చెప్పాలని, అవసరమైతే దానిపై చర్చకు సిద్ధమని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి, కులం వంటి అంశాలపై ప్రధాని మోదీ యుద్ధం ప్రారంభించారని అన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చాలా రాష్ట్రాల్లో వంశపారంపర్య పార్టీలు ఓటమిపాలయ్యాయని ఇప్పుడు తమిళనాడు వంతు వచ్చిందని అన్నారు. -
రాజా, కనిమొళికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో వారిని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని కోరింది. మనీ ల్యాండరింగ్ కేసులోనూ వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్పై కూడా ఇలాంటి ఆదేశాలే జారీచేసింది. తదుపరి విచారణ జరిగే మే 25 లోగా స్పందనలు తెలపాలని వారికి సూచించింది. -
రాజా, కనిమొళికి నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో టెలికంశాఖ మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. 2జీ స్కాంలో రాజా, కనమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. సీబీఐ అభ్యర్థనపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఇప్పటివరకు నిందితులకు సంబంధించి ఈడీ, పీఎంఎల్ఏ అటాచ్ చేసిన ఆస్తుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. గత ఏడాది డిసెంబర్ 21న 2జీ కేసులో కనిమొళి, రాజాలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ.. వారిని నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడంపై టెలికం మాజీ మంత్రి ఏ రాజా స్పందించారు. సీబీఐ అప్పీలుకు వెళ్లడం సాధారణ పరిణామమేనని, ఇది తాము ఊహించిందేనని, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. -
2జీ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ : 2జీ కేసు నుంచి మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను నిర్ధోషులుగా వెల్లడించిన ప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రాజా, కనిమొళితో పాటు 17 మంది నిందితులకు ఈ కేసు నుంచి ప్రత్యేక న్యాయస్ధానం గత ఏడాది డిసెంబర్ 21న విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసు తీర్పును సోమవారం హైకోర్టులో ఈడీ సవాల్ చేయగా..తాజాగా సీబీఐ అప్పీల్ చేసింది. డీఎంకే నిర్వహిస్తున్న కళైంగర్ టీవీకి స్వాన్ టెలికాం ప్రమోటర్లు రూ 200 కోట్లు చెల్లించారని ఈడీ తన చార్జిషీట్లో ఆరోపించగా, 2జీ కేటాయింపుల్లో సర్కార్ ఖజానాకు రూ 30,984 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని ప్రత్యేక న్యాయస్ధాన న్యాయమూర్తి ఓపీ సైనీ పేర్కొంటూ నిందితులపై అభియోగాలను కొట్టివేశారు. -
‘2జీ’ జాప్యంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేసుల దర్యాప్తులో జాప్యాన్ని తప్పుపడుతూ సీబీఐ, ఈడీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2జీ, అందులో భాగమైన ఎయిర్సెల్–మాక్సిస్ ఒప్పందంలో అవకతవకలపై దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ముఖ్యమైన ఇలాంటి కేసుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘2జీ స్పెక్ట్రం, అనుబంధ కేసుల్లో దర్యాప్తు ముగించేందుకు ఎందుకింత జాప్యం జరుగుతోంది. 2010లో సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇంతవరకూ ఎందుకు విచారణ పూర్తి చేయలేదో చెప్పండి’ అని నిలదీసింది. కేసు దర్యాప్తు జాప్యం వెనుక ఏదైనా అదృశ్య శక్తి హస్తముందా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. ‘ ఈ కేసుతో సంబంధమున్న అందరిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరపండి. దర్యాప్తు తీరుపై అసంతృప్తిగా ఉన్నాం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘టెలికం మాజీ మంత్రి రాజాకి ప్రమేయమున్న 2జీ కేసులో నిందితుల్ని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అదేవిధంగా ఇతర అనుబంధ కేసుల్లో నిందితులపై ఆరోపణల్ని కూడా కొట్టివేశారు. కేవలం మలేసియా వ్యాపారవేత్త టీ ఆనంద కృష్ణన్కు ప్రమేయమున్న ఎయిర్సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తు మాత్రమే పెండింగ్లో ఉంది. అతను మలేసియాలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో అతన్ని భారత్కు రప్పించలేకపోయాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ... కేసు దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వాదిస్తూ.. ఎయిర్సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఇంతకముందే కోర్టు ఆదేశించిందని, అయితే కేసులోని ఒక నిందితుడి బెడ్రూంలో ఆ ఫైల్ ఉందని ఆరోపించారు. ఎయిర్సెల్–మాక్సిస్ కేసు నుంచి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్ పేర్లను ప్రత్యేక కోర్టు తప్పించినా.. ఒప్పందానికి ఎఫ్ఐపీబీ ఇచ్చిన అనుమతిపై మాత్రం సీబీఐ విచారణ కొనసాగుతోంది. -
‘ఆరు నెలల్లోగా ముగించండి’
సాక్షి, న్యూఢిల్లీ : 2జీ స్పెక్ర్టమ్ కేటాయింపుల కేసులు, ఇతర సంబంధిత కేసుల విచారణను ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సోమవారం దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను ఆదేశించింది. 2జీ కేసు సహా ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందం వంటి సంబంధిత కేసుల విచారణ పురోగతిని వివరిస్తూ రెండువారాల్లో స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. 2జీ స్పెక్ట్రమ్ వంటి సునిశిత కేసుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతూ ప్రజలకు ఆయా అంశాలపై సమాచారం వెళ్లకపోవడం సరైంది కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. 2014లో 2జీ స్పెక్ర్టమ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన సీనియర్ అడ్వకేట్ ఆనంద్ గ్రోవర్ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. గ్రోవర్ స్ధానంలో ఈ కేసుకు సంబంధించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నియామకంపై ప్రభుత్వం ప్రతిపాదనకు కోర్టు ఆమోదం తెలిపింది. -
కొండను తవ్వి ఎలుకను కూడా పట్టకపోతే ఎలా?
అవలోకనం భారత్లో నిఘా సంస్థలు ‘చేసింది కొంత కూసేది మాత్రం చాలా’ అనే రకంగా ఉంటున్నాయి. అరెస్టులు చేస్తారు, సంచలన వార్తలు వ్యాపింప చేస్తారు. మరిన్ని సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి నిందితులను మరికొన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానానికి విన్నవిస్తారు. భారీ స్థాయి కుంభకోణాలు ఇలాగే మరుగున పడుతుంటాయి. అంతా ముగిశాక కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేవని, సీబీఐ చేసిన నిర్ధారణలు అతిశయించాయని చెబుతూ కేసు కొట్టివేస్తుంది. 2జి స్కాంలో జరిగిన ప్రహసనం ఇదే మరి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్... నేరాలకు వ్యతిరేకంగా పనిచేసే మన అత్యున్నత సంస్థ. అమెరికాకు చెందిన ఎఫ్బీఐలాగా, సీబీఐ కూడా నిర్దిష్టమైన అంశాలను పరిష్కరించే లక్ష్యంతో ఏర్పడింది. కమ్యూనిజం పని పట్టేందుకు ఎఫ్బీఐని ప్రారంభించగా, అవినీతి నివారణకు సీబీఐని నెలకొల్పారు. కానీ, సీబీఐ వాస్తవానికి ఎంత సమర్థత కలిగి ఉంది? వార్తల్లో ప్రత్యేకంగా ఏదైనా నిలిచిన ప్రతిసారీ ‘కేసును సీబీఐకి అప్పగించాలి’ అనే డిమాండును మనం తరచుగా వింటూంటాం. దేశంలోని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు నివేదించే పోలీసు శాఖలా కాకుండా సీబీఐ ఒక కేంద్ర సంస్థగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది. నేడు ఎఫ్బీఐ ఉగ్రవాదంపై, మరెన్నో విషయాలపై పనిచేస్తోంది. సీబీఐ కూడా పలు విభిన్న నేరాలపై తలపడుతోంది. సీబీఐ ఎలాంటి కేసులపై పని చేయాలి? ఇది స్పష్టం కావడం లేదు. అది దేనిమీదైనా పని చేయవచ్చు. అది హత్య కావచ్చు, ఎందుకంటే టీవీ వార్తల్లో పెద్ద ఘటనగా నిలిచింది కాబట్టి (ఆరుషి కేసు లేదా షీనా హత్య ఘటన) సీబీఐ చేపడుతుంది. కుంభకోణాలకు (2జి స్కామ్, నీరవ్ మోదీ కుంభకోణం) సంబంధించిన వివిధ సమస్యలను అది చేపట్టవచ్చు. లేదా ప్రభుత్వ అవినీతిపై విచారణను కూడా అది చేపట్టవచ్చు. సీబీఐలో దాదాపు 6,000 మంది పనిచేస్తుంటారు. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి జాతి పొందుతున్నదేమిటి అని ప్రశ్నించుకుంటే ఉపయోగకరమైనది చాలా తక్కువే అని సమాధానం వస్తుంది. నేర నిర్ధారణలో సీబీఐ విజయాల శాతం 2005లో 65.6 శాతం, 2006లో 72.9 శాతం, 2007లో 67.7 శాతంగా ఉండగా 2009లో 64.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 2014లో సీబీఐ నేర నిర్ధారణ రేటు 69.02గా ఉండగా, 2015లో 65.1 శాతం, 2016లో 66.8 శాతంగా నమోదైనట్లు 2017లో కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించింది. కానీ ఈ శాతాలు, సంఖ్యలు పక్కతోవ పట్టిస్తున్నాయి. ‘కర్బింగ్ కరప్షన్ ఇన్ ఆసియన్ కంట్రీస్ : యాన్ ఇంపాజిబుల్ డ్రీమ్?’ అనే పుస్తకంలో రచయిత జాన్ ఎస్టి కీవాహ్.. సీబీఐ డేటా గురించి భారతీయ రచయిత ఎస్ఎస్ గిల్ రాసిన దాన్ని ఉల్లేఖించారు. ‘ఘోరమైన నేరాలకు సంబంధించి 30 కేసులు, చిన్నపాటి దొంగతనాలకు సంబంధించి 70 కేసులు ఉన్నప్పుడు.. దొంగతనం కేసుల్లో 60 శాతం మేరకు నేర నిర్ధారణ చేయగలిగినప్పుడు మొత్తం నేరాల్లో 60 శాతం నేరాలను నిర్ధారించినట్లు చెప్పుకోవడం వంచన మాత్రమే’. ఆయన ఉల్లేఖనలకు అర్థం ఏమిటి? అవినీతి ఆరోపణలపై సీబీఐ ఎయిమ్స్ సిబ్బందిని అరెస్టు చేసింది అనే శీర్షికతో మార్చి 8న ఒక రిపోర్టు వచ్చింది. పెండింగ్ బిల్లులను పరిష్కరించడానికి సివిల్ వర్క్స్ కాంట్రాక్టర్ నుంచి రూ. 19,500లు లంచం డిమాండు చేసి తీసుకుంటుండగా కె.డి. బిస్వాల్ అనే వ్యక్తిని పట్టుకున్నామన్నది ఆ వార్తా నివేదిక సారాంశం. బిస్వాల్ ఎయిమ్స్లో ఒక అసిస్టెంట్ ఇంజనీర్. సీబీఐ నిందితుడి నివాసం, కార్యాలయంలో కూడా శోధించిం దట. సీబీఐ నుంచి మనం ఆశించవలసింది ఇలాంటి పనులేనా? విజిలెన్స్ కమిషనర్ ఆర్. శ్రీ కుమార్ కథనం ప్రకారం పెద్ద పెద్ద నేరాలకు సంబంధించి సీబీఐ కేవలం 3.96 శాతం నేరాలను మాత్రమే నిర్ధారిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐలో మరొక సమస్య సంస్థాగత వంచన. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డీపీ కోహ్లీ 55 ఏళ్ల క్రితం తన టీమ్తో ఏం చెప్పారో చూద్దాం. ‘సమర్థత, సమగ్రత విషయంలో ప్రజలు మీనుంచి అత్యున్నత ప్రమాణాలను ఆశిస్తున్నారు. ఆ నమ్మకం మీరు కొనసాగించాలి. కఠిన శ్రమ, నిష్పాక్షికత, సమగ్రత అనేది సీబీఐ లక్ష్యం : మీ సమస్త కార్యాచరణను ఇదే మార్గనిర్దేశనం చేయాలి. సర్వ కాలాల్లో, సకల పరిస్థితుల్లోనూ మీరు విధి పట్ల విశ్వాసం అన్నిటికంటే ముందువరుసలో ఉంచాలి’. కానీ సీబీఐ ఈ అత్యున్నత ప్రమాణాలను అందుకోలేకపోయింది. నిజానికి, ఇది సమస్యలో భాగమే కానీ పరిష్కారంలో భాగం కాదు. ‘స్కామ్: ఫ్రమ్ హర్షద్ మెహతా టు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్’ అనే తమ పుస్తకంలో దేబాషిస్ బోస్, సుచేతా దలాల్ ఇలా రాశారు: ‘సత్వరం పరిశోధన పూర్తి చేసి నేరారోపణ పత్రాన్ని దాఖలు చేయడానికి బదులుగా సీబీఐ ప్రభుత్వ చేతిపనిముట్టుగా వ్యవహరిస్తూ, ప్రమోషన్ రాని కారణంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ కె. మాధవన్ రాజీనామా చేశారు, మాదక ద్రవ్యాల వ్యాపారంలో హర్షద్ మెహతా పెట్టుబడులు పెట్టాడు వంటి వార్తలను వండి వడ్డిస్తూ పోయింది. పైగా సంయుక్త పార్లమెంట్ కమిటీకి కీలక సమాచారం ఇవ్వకుండా పదే పదే తొక్కిపెడుతూ వచ్చింది. కుంభకోణాలకు పాల్పడిన వారి విదేశీ ఖాతాలపై దర్యాప్తు చేయాలని తానిచ్చిన సూచనను పెడచెవినపెట్టారంటూ మాధవన్ జేపీసీకి చెప్పడం నాటి సీబీఐని, దాని చీఫ్ని ఇబ్బందిపెట్టింది. ఆ తర్వాతే సీబీఐ 1993 ఫిబ్రవరి 14 ఆదివారం రాత్రి ప్రభుత్వ వార్తా సంస్థలైన దూరదర్శన్, పీటీఐ, యూఎన్ఐ వంటి వాటికి నివేదిస్తూ, హర్షద్ మెహతా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు ప్రకటించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దీనిపై స్విస్ అధికారులను సంప్రదించి, సీబీఐ చేసిన ప్రకటన వాస్తవం కాదని తేల్చేసింది. దీంతో సీబీఐ మళ్లీ మరొక ముతక ప్రయత్నం చేస్తూ హర్షద్ ఖాతాల్లో కొన్నింటిని అంతకుముందే స్తంభింపచేశామని, తర్వాత వాటిపై ఆంక్షలు ఎత్తివేశామని ప్రకటించింది. ఇది కూడా అబద్ధమేనని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. ఈరోజుకీ సీబీఐ పనివిధానం ఇలాగే కొనసాగుతోంది. భారత్లో చట్టాన్ని అమలు చేసే సంస్థలు– ‘చేసింది కొంత కూసింది మాత్రం చాలా’ అనే రకంగా ఉంటున్నాయి. అరెస్టులు చేస్తారు, సంచలన వార్తలు వ్యాపింప చేస్తారు. మరిన్ని సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి నిందితులను మరికొన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలని సీబీఐ న్యాయస్థానానికి విన్నవిస్తుంటుంది. భారీ స్థాయి కుంభకోణాలు ఇలాగే మరుగున పడుతుంటాయి.అంతా ముగిశాక కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేవని, సీబీఐ చేసిన నిర్ధారణలు అతిశయించాయని చెబుతూ కేసు కొట్టివేస్తుంది. 2జి స్కాంలో జరిగిన ప్రహసనం ఇదే మరి. పాఠకులు ఇప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. సీబీఏ కేసును ఛేదించిందంటూ ఈసారి కూడా వార్తాపత్రికలు, టీవీ చానల్స్ మోత మోగిస్తాయని వారు గుర్తుంచుకోవాలి మరి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
మళ్ళీ తెరపైకి 2జీ స్కాం
-
తెరపైకి మళ్లీ 2జీ స్కామ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కుంభకోణంగా పేరొందిన 2జీ కుంభకోణం అంశం మళ్లీ తెరపైకి వచ్చేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తీర్పుపై సుప్రీంకోర్టులో అభ్యర్థన పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు సీబీఐ, ఈడీలకు పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు కేసులో వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ ‘తుషార్ మెహతా’ పేరును స్పెషల్ పబ్లిస్ ప్రాసిక్యూటర్గా ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుతం ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న ఆనంద్ గ్రోవర్ను స్థానంలో మెహతా నియమితులయ్యారన్న మాట. ఈ మేరకు గురువారం ఓ గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం విడుదల చేసింది. ఫిబ్రవరి 19న సీబీఐ పిటిషన్ను దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా, సరైన సాక్ష్యాలు సీబీఐ సమర్పించకపోవటంతో 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళి(కరుణానిధి కూతురు)తో సహా 17 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం విదితమే. తీర్పు అనంతరం సీబీఐ, ఈడీ విభాగాలపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ తీర్పుతో సీబీఐ పరువును, ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. మెహతా సరైనోడు.. 2008లో గుజరాత్ ప్రభుత్వానికి అదనపు అడ్వొకేట్ జనరల్గా ఆయన పని చేశారు. ఆపై కేంద్రం ఆయన్ని 2014లో అదనపు సొలిసిటర్ జనరల్గా నియమించింది. కేసు ఎలాంటిదైనా సరే ముఖ్యమైన పాయింట్లతో ఆయన వాదనలు వినిపిస్తారనే పేరుంది. దీంతో 2జీ కేసులో వాదనలకు సమర్థుడిగా పేరున్న ఆయన సరైన వ్యక్తని కేంద్రం నిర్ణయించుకుంది. తుషార్ మెహతా (పాత చిత్రం) -
మాజీ కాగ్పై రాజా సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కాగ్ వినోద్ రాయ్ యూపీఏ ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు యత్నించాడంటూ రాజా ఆరోపించారు. శనివారం ‘2జీ సెగ అన్ఫోల్డ్స్’ అనే పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజా ఈ విమర్శలు చేశారు. ‘‘కొన్ని దుష్టశక్తులు యూపీఏ(2) ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు యత్నించాయి. అందుకోసం వినోద్ రాయ్ను కాంట్రాక్ట్ కిల్లర్లా నియమించుకున్నాయి. ఆయనను ఓ ఆయుధంగా వాడుకుని కక్ష్య సాధింపు చర్యలకు దిగాయి. ఉన్నత పదవిని అడ్డుపెట్టుకుని వినోద్ రాయ్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దేశాన్ని, ప్రజలను దారుణంగా మోసం చేశాడు’’ అంటూ రాజా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలపై రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఛానెళ్లు అదే పనిగా తనపై అసత్య ప్రచారాలను చేశాయని.. కానీ, సీబీఐ ముందు తానిచ్చిన వాంగ్మూలం గురించి మాత్రం అవి మాట వరుసకు కథనాలు ప్రసారాలు చెయ్యలేదని రాజా ఆక్షేపించారు. 2010లో వినోద్ రాయ్ కాగ్గా ఉన్న సమయంలోనే లక్షా 76వేల కోట్ల రూపాయల 2జీ స్కామ్ను వెలుగులోకి వచ్చింది. రాజా టెలికామ్ మంత్రిగా(2008) ఉన్న సమయంలో ఈ అవినీతి చోటు చేసుకుందని కాగ్ నివేదిక వెలువరించగా.. కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో చీటింగ్, పోర్జరీ, కుట్ర తదిర అభియోగాల కింద రాజాను 2011లో అరెస్టు చేశారు. ఏడాది జైలు తర్వాత బెయిలుపై ఆయన విడుదలయ్యారు. అయితే, సరైన సాక్ష్యాలు సీబీఐ సమర్పించకపోవటంతో 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళి(కరుణానిధి కూతురు)తో సహా 17 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ గత నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం విదితమే. -
మన్మోహన్ మౌనాన్ని ప్రశ్నించిన రాజా
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో అప్పటి టెలికం పాలసీని సమర్థించకుండా మాజీ ప్రధాని మన్మోహన్ ఉద్దేశపూర్వక మౌనం వహించడాన్ని టెలికం మాజీ మంత్రి ఏ.రాజా ప్రశ్నించారు. 2జీ కుంభకోణం వాస్తవాల పేరిట ఆయన రాసిన పుసక్తం ‘2జీ సాగా అన్పోల్డ్స్’లో పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు. కేసు విచారణ సమయంలో రాసిన ఈ పుసక్తంలో అప్పటి కాగ్ వినోద్ రాయ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఈ పుసక్తం విడుదల కావాల్సి ఉంది. స్పెక్ట్రం కేటాయింపులపై సీబీఐ దాడులకు సంబంధించి మన్మోహన్కు కూడా ఎలాంటి సమాచారం లేదని రాజా తెలిపారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం వినోద్ రాయ్తో రాజీపడి పనిచేసిందని, స్పెక్ట్రం కేటాయింపుల ఖాతాల తనిఖీ సందర్భంగా వేరే ఉద్దేశాలు పెట్టుకుని రాజ్యాంగ విధుల నిర్వహణలో రాయ్ అతిగా వ్యవహరించారని రాజా ఆరోపించారు. కొత్త వారికి లైసెన్స్లివ్వడం టెలికం లాబీలకు ఇష్టం లేదని తెలిపారు. -
'మన్మోహన్ జీ.. ఇప్పుడైనా నాకు అండగా ఉండండి'
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర టెలికం శాఖ మాజీ మంత్రి ఏ రాజా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు ఓ లేఖ రాశారు. ఇప్పటికైనా తనకు అండగా నిలవాలని ఆ లేఖలో కోరారు. 2 జీ స్పెక్ట్రం కేసులో రాజా, కనిమొళితోసహా 14 మంది నిర్దోషులుగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో నుంచి బయటపడిన తర్వాత ఒకప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ మంత్రి మండలిలో ఒకరైనా రాజా తొలిసారి ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖలో .. 'మీరు నాకు బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు ఎన్నో కారణాలు అడ్డుకుంటున్నాయని నాకు తెలుసు. ఈ రోజు నేను నిర్దోషిగా నిలబడ్డాను. ఈ విషయం మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఎప్పటికీ నమ్మదగినవాడినని, విశ్వసనీయుడినని మరోసారి గుర్తుచేసుకుంటున్నాను. 2 జీ కేసులో నిజమేమిటో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా గతంలో మాదిరిగా కాకుండా నాకు అండగా ముందుకొస్తారని అనుకుంటున్నాను. 2జీ కేసు యూపీఏ ప్రభుత్వాన్ని మూల్యం చెల్లించుకునేలా చేసింది. 15 నెలల జైలు జీవితంతోపాటు నా ఏడేళ్ల జీవితాన్ని తీసుకెళ్లింది' అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. -
2017 : సంచలన తీర్పులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచిన ఏడాది ఇది. ట్రిపుల్ తలాక్, ఆరుషి హత్య కేసు, వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు ఇలా పలు అంశాల్లో కోర్టులు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పులను వెలవరించాయి. ట్రిపుల్ తలాక్ ట్రిపుల్ తలాక్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ.. సుప్రీంకోర్టు ఈ ఏడాది చారిత్రాత్మక తీర్పును వెలవరించింది. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళల హక్కులను కాలరాసేలా ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించింది. వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు గోప్యత హక్కు అనేది ప్రజల ప్రాథమిక హక్కుగా సుప్రీం సంచలన తీర్పును వెలవరించింది. తొమ్మిదిమంది న్యాయమూర్తుల బెంచ్.. దీనిని ఏకగ్రీవంగా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని ప్రకటించింది. 2జీ కుంభకోణం యూపీఏ హయాంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రం స్కామ్పై పాటియాలా కోర్ట్ సంచలన తీర్పును ప్రకటించింది. 2జీ స్కామ్లో దోషులుగా ముద్రపడిన మాజీ టెలికాం మంత్రి ఏ రాజీ, డీఎంకే మాజీ ఎంపీ కనిమొళిలు నిర్దోషులుగా పాటియాలా కోర్టు ప్రకటించింది. మైనర్ భార్యతో..! మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది రేప్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు అనూహ్యమైన తీర్పును ప్రకటించింది. బాల్య వివాహాలను నిరోధించడానికి ఈ తీర్పు దోహదం చేస్తుందని నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. డేరాబాబా డేరా బాబాగా గుర్తింపు పొందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్పై పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలవరించింది. తీర్పు తరువాత పంచకుల కోర్టు బయట డేరా అనుచరులు విధ్వంసం సృష్టించారు. ఇద్దరు మహిళలపై అత్యాచారాలు చేశాడన్న అభియోగంపై డేరా బాబాను దోషిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. ఆరుషి హత్య కేసు సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్యకేసులో తల్లిదండ్రులు నూపర్, రాజేష్ తల్వార్లను అలహాబాద్ హైకోర్టును నిర్దోషులుగా ప్రకటించింది. 2013 నుంచి దాస్నా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దంపతులు కోర్టు తీర్పుతో ఈ ఏడాది బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. శశికళను వెంటాడిన ఆస్తుల కేసులు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళను ఆస్తుల కేసులు వెంటాడాయి. 2016లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అంతేకాక ఆస్తుల కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని సుప్రీంకోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో సీఎం ఆఫీస్కు వెళ్లాలని కలలుగన్న శశికళ.. బెంగళూరులోని పరప్పణ జైలుకు వెళ్లాల్సివచ్చింది. -
ఆ చర్యలంటే మోదీకి కూడా భయమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతమొద్దిస్తానంటూ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విస్తతంగా ప్రచారం చేశారు. అవినీతిపరులు ఎవరైనా సరే, ఆఖరికి తన పార్టీ వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ‘చేతనైతే చేయి లేదంటే చచ్చిపో’ అంటూ జాతిపిత మహాత్మాగాంధీ నినాదమిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 2022 వరకల్లా అవినీతి రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని భరోసా కూడా ఇచ్చారు. 2జీ స్పెక్ట్రమ్ లాంటి భారీ అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని, స్కామ్లకు బాధ్యులైన వారంతా శిక్షలు అనుభవించాల్సిందేనని మోదీ చెప్పారు.(సాక్షి ప్రత్యేకం) అవినీతికి వ్యతిరేకంగా నాడు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించడం వల్ల ఆయన నాయకత్వాన భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. మరి, ఈ మూడున్నర ఏళ్ల కాలంలో అవినీతి నిర్మూలనకు ఎలాంటి చర్యలు మోదీ ప్రభుత్వం తీసుకుంది? అవినీతిపరుల్లో ఎంత మందికి శిక్షలు పడ్డాయి? సరైన సాక్షాధారాలు లేవంటూ 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కేసును ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు ఎందుకు కొట్టివేయాల్సి వచ్చింది? అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డుకన్నా మోదీ ప్రభుత్వం రికార్డేమీ మెరుగ్గా లేదు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఈ మూడున్నర ఏళ్ల కాలంలో ఎన్నిచర్యలు తీసుకుందో తెలుసుకోవడానికి ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద పీఎంవో కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధానంగా మూడు ప్రశ్నలు వేశారు.(సాక్షి ప్రత్యేకం) దేశంలో దాదాపు ఐదువేల మంది ఐఏఎస్ అధికారులు ఉండగా, వారిలో వంద మందిపైనా అవినీతి ఆరోపణలు రాగా, వారిలో ఎంత మందిపై ఫిర్యాదులు నమోదు చేసుకున్నారని, ఎంత మందిపై విచారణ కొనసాగుతోంది, ఎంత మందికి శిక్షలు పడ్డాయన్నది మొదటి ప్రశ్న. ఐఏఎస్ల అవినీతి గురించి ప్రధాని కార్యాలయాన్ని అడగడానికి కారణం వారిని విచారించాలన్నా, శిక్ష విధించాలన్నా నిర్ణయం తీసుకోవాల్సిందీ ప్రధానియే కనుక. 12 మంది అవినీతి ఐఏఎస్ అధికారులపై చర్యకు ఉపక్రమించామని, విచారణ పూర్తయ్యేందుకు 12 ఏళ్లు పడుతుందని కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. 2012 నుంచి 2014 మధ్య, రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోగా బీజేపీ మూడున్నర ఏళ్ల కాలంలో 12 మందిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఐఏఎస్ అధికారులపై రెండు రకాలుగా విచారణ జరుగుతుంది. అవినీతి నిరోధక చట్టం కింద కోర్టులో విచారణ ఒకవైపు జరిగితే, డిపార్ట్మెంట్పరంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో మరోవైపు విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం సదరు అధికారి దోషిగా తేలితే ఆయనపై విజిలెన్స్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ నోడల్ మినిస్ట్రీకి నివేదికను పంపిస్తుంది.(సాక్షి ప్రత్యేకం) ఆ నోడల్ మినిస్ట్రీ కూడా తగిన చర్యలకు సిఫార్సు చేస్తుంది. అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారిని తక్షణమే పదవి నుంచి తొలగించాలా లేదా పదవి విరమణ చేయించాలా, పదవీ విరమణ తర్వాత వారికొచ్చే పింఛన్ సొమ్ములో కోత విధించాలా? తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ప్రధాన మంత్రిదే. రెండేళ్ల కాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చట్టం సూచిస్తున్నా ఈ ప్రక్రియ పూర్తచేయడానికి సంబంధిత ప్రభుత్వాలు ఏడెనిమిదేళ్లు తీసుకుంటున్నాయి. ఈలోగా ప్రభుత్వాలే మారిపోతున్నాయి. ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు తదితరుల అందరిపై వచ్చే అవినీతి ఆరోపణల కేసులను విచారించేందుకు వీలుగా లోక్పాల్ను ఇంతవరకు ఎందుకు ఎంపిక చేయలేదన్న సామాజిక కార్యకర్త ప్రశ్నకు మోదీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. లోక్పాల్, లోకాయుక్త చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లోనే తీసుకొచ్చింది. దాన్ని తక్షణమే అమలు చేయాలంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్లమెంట్ లోపల, వెలుపల పెద్ద ఎత్తున గొడవ చేయడంతో 2014, జనవరిలో యూపీఏ ప్రభుత్వం చట్టాన్ని నోటిఫై చేసింది. అదే ఏడాది మే నెలలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదట్లో లోక్పాల్ ఊసుకూడా ఎత్తలేదు.(సాక్షి ప్రత్యేకం) ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు లోక్పాల్ నియామకం గురించి ప్రశ్నించగా లోక్పాల్ను ఎంపికచేసే ప్యానల్లో ప్రతిపక్షం నాయకుడు తప్పనిసరిగా ఉండాలని, పార్లమెంట్లో ఎవరికి ఆ హోదా రాకపోవడంతో నియామక ప్రక్రియను చేపట్టలేకపోతున్నామని మోదీ ప్రభుత్వం సమర్థించుకుంది. చట్టం ప్రకారం లోక్సభలోని 545 సీట్లలో కనీసం పది శాతం సీట్లు లభిస్తేనే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. లోక్సభలో పాలకపక్షం తర్వాత ఏ పార్టీకి అధిక సీట్లు లభిస్తే అదే ప్రతిపక్షం అవుతుందని, అందుకు అనువుగా చట్టాన్ని ఎందుకు మార్చడం లేదని సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా విమర్శించడంతో 2014, డిసెంబర్ నెలలో చట్టం సవరణకు ప్రతిపాదన చేసింది. దాన్ని ఆ తర్వాత పార్లమెంట్ స్థాయీ సంఘానికి నివేదించింది. 2015, డిసెంబర్ నెలలో కొన్ని మార్పులతో ఆ నివేదికను కేంద్రానికి స్థాయీ సంఘం నివేదించింది. (సాక్షి ప్రత్యేకం)అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం పరిశీలనలోనే ఆ నివేదిక ఉందని సామాజిక కార్యకర్త ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ ప్రభుత్వానికైనా అవినీతిని నిర్మూలించడం పట్ల చిత్తశుద్ధి ఉంటే లోక్పాల్ నియామకం ఎప్పుడో జరిగేదని రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
నిర్దోషులుగా తేలిన తర్వాత తొలిసారి చెన్నైకి..
సాక్షి, చెన్నై: 2జీ స్పెక్ట్రం కేసులో నిర్దోషులుగా తేలిన కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శనివారం డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా 17 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో చెన్నైకి వచ్చిన కనిమొళి, రాజా ర్యాలీగా బయలుదేరి వెళ్లి కరుణానిధిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ స్టాలిన్, సీనియర్ నాయకులతో సహా వేలమంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యూపీఏ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా మొత్తం 17మంది మీద సీబీఐ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు సరైన ఆధారాలను సీబీఐ సమర్పించలేదంటూ.. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామి. గతకొంత కాలంగా డీఎంకేను 2జీ స్పెక్ట్రం కేసు వేధిస్తోంది. ఈ కేసులో రాజా సంవత్సరకాలం పాటు జైలులో గడపగా, కరుణానిధి కుమారై కనిమొళి ఏడునెలల పాటు జైలులో ఉన్నారు. ఈ కేసు కారణంగా కరుణానిధి గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు డీఎంకేకు అనుకూలంగా తీర్పు రావడంతో పార్టీ శ్రేణులు ఆనందంతో ఉన్నారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. కనిమొళి నిర్దోషిగా తేలడంతో ప్రత్యక్ష రాజకీయాలలో ఆమె చురుగా పాల్గొనే అవకాశముందని మద్దతుదారులు భావిస్తున్నారు. -
2జీ స్కామ్ తీర్పు: ఆర్బిట్రేషన్ల వరద?
2జి స్పెక్ట్రమ్ కేసులో మొత్తం 17 మంది నిందితులను ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఆర్బిట్రేషన్ల వరద పోటెత్తునుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెలికాం తప్పుడు విధానాలతో నష్టపోయినందుకుగాను ఆయా కంపెనీలు భారీ ఎత్తున నష్టపరిహారం కోరనున్నారని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా లూప్ టెలికాం, రష్యాకు చెందిన సిస్టెమా, టెలినార్ లాంటి ఆపరేటర్లు తమ వ్యూహాలను మార్చనున్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ విషయంలో దేశీయ ఆపరేటర్ వీడియోకాన్ నష్టాన్ని పూడ్చుకునే పనిలో వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు 2జీ స్కాంపై తాజా తీర్పుతో భారత టెలికాం రంగానికి చెందిన విదేశీ కంపెనీలకు ఇది తలుపులు తెరిచిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసిన 122 లైసెన్సుల రద్దు చేసిన సంస్థలు దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని, వీటిని పునఃప్రారంభించడానికి లేదా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరవచ్చని అశిష్ భాన్ అభిప్రాయపడ్డారు. సిస్టెమా, టెలినార్పై విచారణ జరపలేదు. ఒక వేళ వారు మారిషస్ ద్వారా పెట్టుబడి పెట్టినట్లయితే .. వారికిది మంచి అవకాశమని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు. అలాగే పటియాల హౌస్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేయాలన్న ఈడీ, సిబిఐ నిర్ణయం ప్రస్తుత పరిస్థితిని పెద్దగా మార్చలేదని చెప్పారు. ఈ కేసులో ఎటువంటి నేరారోపణ లేదని నిరూపించడానికి ప్రత్యేక సిబిఐ కోర్టుకు ఏడు సంవత్సరాలు పట్టింది. ప్రత్యేక సిబిఐ కోర్టు పరిశీలించిన సాక్షాధారాల్లో లొసుగులను హైకోర్టు గుర్తించకపోతే, హైకోర్టు జోక్యం సులభం కాదని బన్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే వీడియోకాన్ ప్రభుత్వాన్నిసవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలాంటి తప్పులేకుండానే తాము రూ.25 వేలకోట్లను నష్టపోయామని వాదిస్తోంది. తాజా తీర్పుతో ప్రభుత్వంనుంచి పరిహారాన్ని కోరేందుకు మరింత బలం చేకూరిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2015 లో టెలికాం ట్రిబ్యునల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసింది. రూ.10వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆదర్శ్’ కేసులో చవాన్కు ఊరట
ముంబై: 2జీ కేసులో తీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చిన మరుసటి రోజే ఆ పార్టీకి మరో కేసులోనూ ఊరట లభించింది. ఆదర్శ్ గృహ సముదాయం కుంభకోణం కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్పై విచారణ జరిపేందుకు ఆరాష్ట్ర గవర్నర్ ఇచ్చిన అనుమతిని కొట్టేస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. విచారణలో సాక్ష్యంగా నిలవదగ్గ ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమైందని, అందుకే ఉత్తర్వులను కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. గవర్నర్గా శంకర నారాయణ ఉండగానే చవాన్ను విచారించేందుకు సీబీఐ అప్పట్లో అనుమతి కోరగా ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత విద్యాసాగర్ గవర్నర్ అయ్యాక కేసులో తమకు కొన్ని కొత్త ఆధారాలు లభించాయని, చవాన్పై విచారణ జరిపేందుకు అనుమతించాలని సీబీఐ కోరడంతో ఆయన 2016లో ఆ మేరకు ఉత్తర్వులిచ్చారు. దీనిని చవాన్ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్ను కోర్టు విచారించింది. ‘కొత్త ఆధారాలు లభించాయని సీబీఐ చెప్పడంతో పాత గవర్నర్ నిర్ణయానికి భిన్నంగా చవాన్పై విచారణ జరిపేందుకు ప్రస్తుత గవర్నర్ అనుమతించారు. కానీ కోర్టుల్లో విచారణ సమయంలో సాక్ష్యంగా నిలవదగ్గ కొత్త ఆధారాలను సీబీఐ సమర్పించలేక పోయింది. కాబట్టి గవర్నర్ ఉత్తర్వులు చెల్లవు. వాటిని కొట్టేస్తున్నాం’ అని బెంచ్ స్పష్టం చేసింది. చవాన్పై ఆరోపణలివే దక్షిణ ముంబైలో రక్షణ శాఖ ఉద్యోగులకు, సైనికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ పథకం. ఆ స్థలంలో ముందుగా అనుకున్న దానికన్నా అదనంగా భవంతులు నిర్మించేందుకు చవాన్ అనుమతులిచ్చి అందుకు ప్రతిఫలంగా వాటిలో రెండు ఫ్లాట్లను తమ బంధువులకు బదలాయించారనేది ఆరోపణ. సైనికులకు, రక్షణ శాఖ ఉద్యోగులకు మాత్రమే నిర్మిస్తున్న ఈ సొసైటీలో 40 శాతం ఫ్లాట్లను సాధారణ పౌరులకు కూడా చవాన్ (అప్పటికి ఈయన రెవెన్యూ మంత్రి) అక్రమంగా కేటాయించారని ఆరోపణలున్నాయి. -
కేంద్రం మెడకు '2జీ'!
న్యూఢిల్లీ: తాజాగా 2జీ స్పెక్ట్రమ్ కేసు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం చిక్కుల్లో పడేటట్లు కనిపిస్తోంది. 2జీ కుంభకోణం కేసు అంతా ఊహాజనితమేనని, అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేనందున అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పునివ్వటం తెలిసిందే. దీంతో 2జీ కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొన్న వారితోపాటు, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా టెలికం లైసెన్స్లు కోల్పోయిన కంపెనీలు పరిహారం కోరుతూ న్యాయబాట పట్టే అవకాశాలు లేకపోలేదని న్యాయనిపుణులు అంటున్నారు. టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రిబ్యునల్కు (టీడీ శాట్) లేదా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. లూప్ టెలికం... 2జీ కేసులో వాదించిన న్యాయనిపుణుల అభిప్రాయాల ప్రకారం... లూప్ టెలికం కంపెనీ తాను దేశవ్యాప్త లైసెన్స్ కోసం చెల్లించిన రూ.1,658 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ 2012లోనే టీడీ శాట్ను ఆశ్రయించింది. 22 టెలికం సర్కిళ్లకూ కలిపి దేశవ్యాప్త లైసెన్స్ ఫీజు రూ.1,658 కోట్లుగా ఉంది. ఈ ఫీజుతోపాటు లైసెన్స్ రద్దు చేసిన దరిమిలా తమ ప్రతిష్టకు జరిగిన నష్టానికి గాను మరో రూ.1,000 కోట్లు కూడా ఇప్పించాలని లూప్ టెలికం డిమాండ్ చేసింది. ఈ వాదనను టీడీ శాట్ కొట్టేసింది. ‘మీపై నేరపూరిత విచారణ’ పెండింగ్లో ఉందని టీyీ శాట్ నాడు పేర్కొంది. నిర్ధోషులు అంటూ ఇప్పుడు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చినందున ఈ సంస్థ మరోసారి పరిహారం కోసం డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. టెలినార్, ఎతిసలాట్ కూడా... విదేశీ టెలికం సంస్థలైన టెలినార్, ఎతిసలాట్, లూప్ టెలికంలో ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థలు (ఇందులో కొన్ని గతంలో ఆర్బిట్రేషన్కు ప్రయత్నించాయి) కూడా పరిహారం కోరే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడికలకు లోబడి ఆర్బిట్రేషన్ మార్గాన్ని చాలా వరకు విదేశీ కంపెనీలు ఎంచుకునే అవకాశాలున్నాయని ఓ న్యాయవాది అభిప్రాయం తెలిపారు. టెలికం కార్యకలాపాల కోసం చేసిన పెట్టుబడులు, గడువు ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించలేకపోయినందున ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలతోపాటు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భారత్లో టెలికం వ్యాపారంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెలినార్ కూడా గతంలో కేంద్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. 1.4 బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని సింగపూర్తో మన దేశం చేసుకున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కింద కోరింది. రద్దయిన స్పెక్ట్రమ్ కోసం చేసిన చెల్లింపులను తిరిగి వెనక్కిచ్చేందుకు కేంద్రం అంగీకరించడంతో నోటీసును వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత టెలినార్ పలు సర్కిళ్లలో మళ్లీ లైసెన్స్లు దక్కించుకుంది. చివరికి తన వ్యాపారాన్ని భారతీ ఎయిర్టెల్కు అమ్మేసి వెళ్లిపోయిన టెలినార్ భారత్లో వ్యాపారం కారణంగా రూ.10,000 కోట్లను నష్టం కింద రద్దు చేసుకుంది. అలాగే, లూప్ టెలికంలో పెట్టుబడులు పెట్టిన ఖైతాన్ హోల్డింగ్స్ అయితే, 2జీ లైసెన్స్లను రద్దు చేసిన కారణంగా తమకు 2.5 బిలియన్ డాలర్లను నష్ట పరిహారం కింద చెల్లించాలని కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది. తుది తీర్పు అనంతరమే... ‘‘పరిహారం కోసం కేసుల నమోదుకు ఈ తీర్పు వీలు కల్పిస్తుంది. కాకపోతే, అదంతా తుది తీర్పు తర్వాతే వీలవుతుంది. ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. కనుక కంపెనీలు దేశంలో వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించొచ్చు’’ అని ఓ టెలికం కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. సుప్రీం తీర్పునకు భిన్నంగా... ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు 122 లైసెన్స్లను రద్దు చేసింది. అయితే, తాజాగా సీబీఐ కోర్టు తీర్పు, సుప్రీం తీర్పులోని అంశాలను ప్రతిఫలించడం లేదని మరి కొందరు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన లైసెన్స్ల కేటాయింపు అన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిష్పక్షపాతంగా ఉందని అద్వైతా లీగల్ సంస్థ పార్ట్నర్ అతుల్దువా అన్నారు. ప్రజలకు ధర్మకర్త అయిన ప్రభుత్వం సహజన వనరులను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదిక పేరుతో అసమంజసంగా పంపిణీ చేసిందని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. -
కాంగ్రెస్ పార్టీకి అచ్చేదిన్...
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించి నైతిక స్థైర్యాన్ని ఇనుమడింపచేసుకున్న కాంగ్రెస్ పార్టీకి రెండవ నైతిక విజయం ‘2జీ స్పెక్ట్రమ్’ స్కామ్ నుంచి విముక్తి పొందడం. ఈ స్కామ్ 2011లో దేశంలో, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు నాంది పలికింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇదే నినాదాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా అవినీతి అస్త్రాలను సంధించడం వల్ల ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి కేవలం 44 సీట్లకే పరిమితం అయింది. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతూ కాంగ్రెస్ పార్టీ కోలుకోని దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 2013లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిన రాహుల్ గాంధీ ముహూర్తం నాలుగేళ్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెలువడిన గుజరాత్ అసెంబ్లీ ఫలితాలను ఆయనకు, పార్టీకి ఊరటతోపాటు కొత్త స్ఫూర్తినిచ్చాయి. గతంలో 61 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ 77 సీట్లను సాధించి ఏకంగా 16 సీట్లను పెంచుకోగలిగింది. 16 సీట్లలో తృటిలో విజయాన్ని కోల్పోయి ఊరట పొందింది. ఇప్పుడు 2జీ స్కామ్ నుంచి విముక్తి పొందడం పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సవాలను నింపింది. కొత్త ఆశలను చిగురింప చేసింది. ‘లగ్తా హై హమారా అచ్చే దిన్ ఆరహీ హై’ 2జీ స్కామ్ తీర్పుపై స్పందిస్తూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా వ్యాఖ్యానించారు. 2జీ స్కామ్ను అతిపెద్ద అవినీతి భూతంలా చూపించి భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందిందని, ఇప్పుడు అదే వారికి బూమరాంగయిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ వ్యాఖ్యానించారు. -
అయ్యా.. ఇదిగో మీ కాళ్ల దగ్గర కోర్టు తీర్పు
సాక్షి, చెన్నై : హై ఫ్రోఫైల్ స్కాంగా అభివర్ణింపబడ్డ 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా, కనిమొళిని నిర్దోషులుగా తేల్చాక డీఎంకేలో నెలకొన్ని సంబరం అంతా ఇంతా కాదు. పార్టీ కార్యకర్తల కోలాహలంతో తమిళనాడులో నిన్న అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ ఏడేళ్లు తాము ఎంతో నరకం అనుభవించామని తీర్పు అనంతం ఆ ఇద్దరూ చెప్పటం చూశాం. ఇక రాజా అయితే తన భావోద్వేగాలను ఓ లేఖ రూపంలో డీఎంకే వ్యవస్థాపకుడు అయిన కరుణానిధికి తెలియజేశాడు. ‘‘విధేయతతో చరిత్రాత్మక తీర్పును మీ పాదాల వద్ద ఉంచుతున్నా.. మీరే నా సంరక్షకుడు’’ అని కరుణను ఉద్దేశించి రాజా అందులో పేర్కొన్నాడు. ‘‘ఆరోపణలు ఎదుర్కున్న సమయంలో మీరు నాకు ఇచ్చిన మనోధైర్యం అంతా ఇంతా కాదు. ఇంతకాలం అదే నన్ను కవచంలా రక్షిస్తూ వస్తోంది. మీ బదులు కోసం ఎదురు చూస్తున్నా’’ అంటూ లేఖలో తెలియజేశాడు. ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిందని.. కానీ, దానికి కొందరు అవినీతి మరకలను అంటించేశారని.. ఈ కుట్రలో కొందరు డీఎంకే నేతలు కూడా భాగస్వాములు అయ్యాయరని ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కాగా, సరైన సాక్ష్యాలు సీబీఐ సమర్పించకపోవటంతోనే తాము నిందితులను నిర్దోషులుగా విడిచిపెడుతున్నట్లు పటియాలా హౌజ్ కోర్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేసేందుకు సీబీఐ సిద్ధమైపోయింది. -
2జీ స్కామ్పై ప్రముఖుల వ్యాఖ్యలు
న్యాయం జరిగింది: కనిమొళి 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో న్యాయం గెలిచిందని నిర్దోషిగా బయటపడిన డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. గత ఆరేళ్లు తనకు చాలా కష్టంగా గడిచాయని, ఎంతో మనోవేదన మిగిల్చాయని పేర్కొన్నారు. ‘ఈరోజు కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇంతకాలం ఎంతో మనోవేదన అనుభవించా. ఏదో ఒకరోజు ఈ కష్టాల నుంచి బయటపడతానని అనుకున్నాను. కఠిన సమయంలో మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటా’ అని కోర్టు తీర్పు వెలువడిన అనంతరం కనిమొళి భావోద్వేగంగా మాట్లాడారు. కట్టుకథలని తేలింది: రాజా 2జీ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు కట్టుకథలేనని కోర్టు తీర్పుతో రుజువైందని అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా అన్నారు. జాతీయ టెలికాం విధానం, ట్రాయ్ సిఫార్సులకు అనుగుణంగానే స్పెక్ట్రం కేటాయింపు నిర్ణయాలు తీసుకున్నా మని చెప్పారు. ‘దేశ ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకునే ఆనాడు నిర్ణయాలు తీసుకున్నాం. టెలికాం రంగంలో పోటీ వాతావరణం తీసుకురావడం వల్ల కాల్ చార్జీలు దిగి వచ్చాయి. నా నిర్ణయాలపై, న్యాయ వ్యవస్థపై ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. అవే ఈ రోజు నిజమయ్యాయి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. గొప్ప పనులు చేసిన వారిని చరిత్రలో నేరగాళ్లుగా చూడటం కొత్తేమీ కాదు’ అని రాజా వ్యాఖ్యానించారు. క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ స్పెక్ట్రమ్ కుంభకోణంపై తీర్పు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ బీజేపీపై ఎదురుదాడికి దిగింది. ఎట్టకేలకు సత్యం గెలిచిందని, తమపై తప్పుడు ప్రచారం చేసిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించిన అప్పటి కాగ్ వినోద్రాయ్ని బాధ్యుణ్ని చేయాలని పేర్కొంది. తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేల్చిన కోర్టు తీర్పును గౌరవించాలని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం స్పందిస్తూ...యూపీఏ 2 ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ కుంభకోణంలో చిక్కుకున్నారన్న ఆరోపణలు నిజం కాదని నిరూపితమైందని అన్నారు. కోర్టు తీర్పుతో బీజేపీ సాధించిందేం లేదని, తన వాదనే నెగ్గిందని టెలికాం మాజీ మంత్రి కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆ కేటాయింపులు లోపభూయిష్టమే: కేంద్రం యూపీఏ హయాంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులు లోపభూయిష్టం, అవినీతిమయమని కేంద్రం పేర్కొంది. పరిమితంగా ఉన్న వనరులను వేలం వేయడమే ఉత్తమ మార్గమని, యూపీఏ ప్రభుత్వం ఆచరించిన ‘ముందొచ్చిన వారికి ప్రాధాన్యత’ విధానం సరైనది కాదని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ...స్పెక్ట్రం కేటాయింపులో యూపీఏ నిర్హేతుకంగా వ్యవహరించిందని, కొద్ది మందికే ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఈ కేసులో అవినీతి జరిగిందని నొక్కిచెప్పడానికి సుప్రీంకోర్టు గత ఆదేశాలను ఉటంకించిన జైట్లీ...విచారణ కోర్టు తీర్పును కాంగ్రెస్ గౌరవ సూచకంగా భావిస్తోందని ఎద్దేవా చేశారు. హైకోర్టుకెళ్తాం: సీబీఐ 2జీ కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేస్తామని సీబీఐ వెల్లడించింది. సాధారణంగా ఉన్నత న్యాయ స్థానాల్లో అప్పీల్కు వెళ్లే ముందు కోర్టు ఉత్తర్వులను క్షణ్నంగా అధ్యయనం చేసే సీబీఐ ఈసారి మాత్రం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. ‘ 2జీ కేసు తీర్పును ప్రాథమికంగా పరిశీలించాం. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను కోర్టు సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదు. ఈ విషయంలో న్యాయపరంగా దిద్దుబాటు చర్యలు చేపడతాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు. తీర్పును పరిశీలించిన తరువాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని ఈడీ కూడా చెప్పింది. క్లీన్చిట్ కాదు: బీజేపీ ఈ కేసులో నిందితులను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం కాంగ్రెస్కు క్లీన్చిట్ ఇచ్చినట్లు కాదని బీజేపీ పేర్కొంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం చార్జిషీటును ప్రభావితంచేయడం వల్లే వారు నిర్దోషులుగా బయటపడ్డారని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. ఏచూరీ లేఖతో వెలుగులోకి 2జీ కుంభకోణాన్ని బయటపెట్టింది ఎవరు? అని ప్రశ్నిస్తే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అనే ఎక్కువ మంది బదులిస్తారు. అయితే ఈ దీన్ని వెలికి తీయడంలో అసలు సూత్రధారి మాత్రం సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరీ. టెలికం లైసెన్సుల వేలంలో అక్రమాలు జరిగాయని నాటి ప్రధాని మన్మోహన్కు ఆయన రాసిన లేఖతో 2జీ వ్యవహారం వెలుగుచూసింది. ఆ లేఖకు మన్మోహన్ జవాబివ్వకపోయినా.. పరిశీలన కోసం టెలికం శాఖకు పంపారు. అప్పుడు యూపీఏ సర్కారుకు సీపీఎం వెలుపలి నుంచి మద్దతిస్తోంది. ఆ తర్వాత మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి కూడా 2జీ కేటాయింపులపై ఆరోపణలు చేస్తూ.. 2008 నవంబర్ నుంచి ప్రధానికి అనేక ఉత్తరాలు రాశారు. అనంతరం ఏచూరి కూడా మరో రెండు సార్లు 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని మన్మోహన్ సింగ్కు లేఖలు రాశారు. -
లైసెన్స్లు రద్దు... కంపెనీలు మాయం
సాక్షి, బిజినెస్ విభాగం 2జీ స్కామ్కు సాక్ష్యాలు లేవని రాజా, కనిమొళి తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది ప్రత్యేక కోర్టు. ఇదే వ్యవహారానికి సంధించి గతంలో సుప్రీంకోర్టు 122 లైసెన్సులను రద్దు చేసింది. ఆయా సర్కిళ్లలో కార్యకలాపాలు సాగిస్తున్న పలువురు టెలికామ్ ఆపరేటర్లు లైసెన్సులు కోల్పోయారు. కొందరైతే ఆ దెబ్బకు మూటాముల్లే సర్దుకుని వెళ్లిపోయారు కూడా!! ఇంకొందరు కొనసాగినా మనుగడ సాగించలేకపోయారు. అసలు ఎవరెవరికి లైసెన్సులు దక్కాయి? ఎవరెంత నష్టపోయారు? ఆ వివరాలేంటో చూద్దాం... 2008 నాటికి దేశంలో టెలికామ్ ఆపరేటర్ల సంఖ్య 18. ఇపుడేమో 11. తాజా విలీనాలు, కొనుగోళ్ల తరవాత చివరికి మిగిలినవి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయెన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మాత్రమే. 2008లో అప్పటి కేంద్ర టెలికం మంత్రి కొత్త 2జీ లైసెన్స్లకు బిడ్లను ఆహ్వానించారు. ‘మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు’ ప్రాతిపదికన 122 లైసెన్సులు జారీ చేస్తామంటూ ఈ బిడ్లు పిలిచారు. అయితే ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులో పలు నియమాలు ఉల్లంఘించారని, కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా లంచాలిచ్చాయనే ఆరోపణలొచ్చాయి. లైసెన్స్ పొందిన టెలికం సంస్థలివే.. యూనిటెక్ వైర్లెస్: 22 లైసెన్స్లు దేశీ రియల్టీ దిగ్గజం యూనిటెక్ లిమిటెడ్ 22 లైసెన్స్లు పొందింది. దీంతో నార్వేకు చెందిన టెలినార్... ఈ సంస్థలో 67.5 శాతం వాటా కొనుగోలు చేసి ఇండియాలోకి రంగప్రవేశం చేసింది. మొత్తంగా టెలినార్ గ్రూప్ రూ.6,100 కోట్లు ఈక్విటీ, రూ.8 వేల కోట్లు కార్పొరేట్ గ్యారంటీల రూపంలో పెట్టుబడి పెట్టింది. ► తైవాన్కు చెందిన లూప్ టెలికం 21 లైసెన్స్లు పొందింది. తరవాత దీన్ని ఖైతాన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ► వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్... డాటాకామ్ సొల్యూషన్స్ పేరిట 21 లైసెన్స్లు. ► స్వాన్ టెలికామ్కు 13 లైసెన్స్లు దక్కాయి. ఎమిరేట్స్కు చెందిన ఎటిసలాట్– దేశీ రియల్టీ సంస్థ డీబీ కార్ప్ జతకట్టి స్వాన్ను, మరో 2 లైసెన్స్లను తీసుకున్నాయి. ► సింగపూర్కు చెందిన ఎస్ టెల్ లిమిటెడ్కు 6 లైసెన్స్లు దక్కగా... దీన్లో వాటాలను బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ (బాటెల్కో) కొనుగోలు చేసింది. ► రష్యాకు చెందిన సిస్టెమా, ఇండియాకు చెందిన శ్యామ్ గ్రూప్ల సంయుక్త భాగస్వామ్య కంపెనీయే సిస్టెమా శ్యామ్. దీనికి 21 లైసెన్స్లు దక్కాయి. ► దేశంలో 3వ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా ఉన్న ఐడియా... తొలిదశలో 9, రెండో దశలో మరో 4 లైసెన్స్లు దక్కించుకుంది. ళీ టాటా 3 లైసెన్స్లు దక్కించుకుంది. ఎవరికెంత నష్టం? కస్టమర్లు: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్లలో 5 శాతం కస్టమర్లపై ఇది ప్రభావం చూపింది. మొత్తం 89.4 కోట్ల మంది యూజర్లలో 4.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు వారి టెలికం సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకోవాల్సి వచ్చింది. టెలికం రంగంలో పోటీ తగ్గడంతో స్థానికంగా ఉన్న టెలికం కంపెనీలు టారిఫ్ ధరలను కూడా పెంచేశాయి. విదేశాలతో పోలిస్తే సుమారు 30 శాతం ధరలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు: 2జీ స్కామ్ ప్రభావం 11 కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మరీ ముఖ్యంగా యూఏఈకి చెందిన ఎటిసలాట్, రష్యాకు చెందిన సిస్టెమా, నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్ సంస్థలకు 2జీ దెబ్బ గట్టిగానే తగిలింది. దీంతో విదేశీ టెలికం కంపెనీలకు మన దేశీయ టెలికం రంగంపై నమ్మకం పోయింది. ఇక్కడి టెలికం బిడ్లు, లైసెన్స్ జారీలో పారదర్శకత లేదన్న విషయం తేటతెల్లం కావటంతో ఆ తర్వాత జరిగిన టెలికం బిడ్లలో విదేశీ కంపెనీలేవీ పాల్గొనలేదు. ఇది ఒక రకంగా అప్పడు టెలికం మార్కెట్లో ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలకు కలిసొచ్చింది. టెలికం వెండర్స్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కూడా ప్రభావం చూపించింది. నోకియా, సిమెన్స్, ఎరిక్సన్, హువావే, విప్రో వంటి టెక్నాలజీ కంపెనీలపై ప్రభావం పడింది. టవర్ల నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి కోసం యూనినార్తో నోకియా, సిమెన్స్, ఎటిసలాట్తో టెక్ మహీంద్రా ఒప్పందం చేసుకున్నాయి. సుమారు 400 మిలియన్ డాలర్ల ఒప్పందాలు రద్దయ్యాయని అంచనా. బ్యాంకులు, టవర్ల నిర్వహణ కంపెనీలపై కూడా ప్రభావం చూపించింది. -
2జీ స్కాం
2007 నుంచి 2017 ► కేంద్ర టెలికాం మంత్రిగా 2007, మేలో ఏ.రాజా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టులో 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలంది. దీంతో 46 సంస్థలు 576 దరఖాస్తులు దాఖలుచేశాయి. లైసెన్స్ జారీ ప్రక్రియను నిష్పాక్షికంగా చేపట్టాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి రాజాకు నవంబర్లో లేఖ రాశారు. 2008, జనవరిలో ‘ముందు వచ్చినవారికి ముందుగా’ ప్రతిపాదికన టెలికాం శాఖ 122 కంపెనీలకు లైసెన్సులు జారీచేసింది. ► ఏడాది తర్వాత 2జీ కేటాయింపుల్లో అవకతవకలపై విచారణ జరపాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ సీబీఐని ఆదేశించింది. 2009, అక్టోబర్ 21న సీబీఐ గుర్తుతెలియని టెలికాం అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలపై కేసు పెట్టింది. ► టెలికాం లైసెన్సుల జారీలో రూ.70,000 కోట్ల కుంభకోణంపై పది రోజుల్లో స్పందించాలని కేంద్రం, రాజాకు సుప్రీం కోర్టు 2010, సెప్టెంబర్లో ఆదేశాలు జారీచేసింది. ► కేటాయింపుల విధానాల వల్ల ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని కాగ్ తెలిపింది. దీంతో రాజా నవంబర్ 14న తన పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది డిసెంబర్లో ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. రాజాతో పాటు అప్పటి టెలికాం కార్యదర్శి సిద్ధార్థ బెహురా, రాజాప్రైవేటు కార్యదర్శి రవీంద్ర కుమార్, స్వాన్ టెలికాం లిమిటెడ్ ప్రమోటర్ షహీద్ ఉస్మాన్ బల్వాలను 2011, ఫిబ్రవరి 2న సీబీఐ అరెస్ట్ చేసింది. ► 2011, ఏప్రిల్ 2న తొలి చార్జిషీట్లో రాజాతో పాటు రవీంద్రకుమార్, బెహురాలను ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొంది. రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఎండీ గౌతమ్ దోసీ, సీనియర్ వైస్ప్రెసిడెంట్ హరి నాయర్, ప్రెసిడెంట్ సురేంద్ర పిపారా, స్వాన్ టెలికాం ప్రమోటర్లు ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా, యూనిటెక్ లిమిటెడ్ ఎండీ సంజయ్ చంద్రల పేర్లనూ నిందితుల జాబితాలో చేర్చింది. వీరితో పాటు రిలయన్స్ టెలికాం లిమిటెడ్, స్వాన్ టెలికాం ప్రై.లిమిటెడ్, యూనిటెక్ వైర్లైస్ ప్రై.లిమిటెడ్ సంస్థల పేర్లను కూడా చార్జిషీట్లో చేర్చింది. ► అదే ఏడాది అక్టోబర్ సమర్పించిన రెండో చార్జిషీట్లో డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె కనిమొళితో పాటు మరో నలుగురి పేర్లను సీబీఐ చేర్చింది. 2జీ కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ సీబీఐ వేసిన రెండు కేసుల్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలుచేసిన మరో కేసును విచారణకు స్వీకరించారు. ► ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు రవి రుయా, అన్షుమన్ రుయా, లూప్ టెలికాం ప్రమోటర్లు కిరణ్ ఖైతాన్, ఆమె భర్త ఐపీ ఖైతాన్, ఎస్సార్ డైరెక్టర్ వికాస్ సరఫ్లతో పాటు లూప్ టెలికాం, లూప్ మొబైల్ ఇండియా, ఎస్సార్ టెలీ హోల్డింగ్ లిమిటెడ్ పేర్లను సీబీఐ మూడో చార్జిషీట్లో చేర్చింది. ► ఫిబ్రవరి 2న 9 కంపెనీలకు సంబంధించి 122 టెలికాం లైసెన్సుల్ని రద్దుచేసిన సుప్రీంకోర్టు. సహజ వనరుల్ని ముందు వచ్చినవారికి ముందుగా’ కేటాయించకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం, స్పెక్ట్రమ్ కేటాయింపు విధానం, తదితర అంశాలను కేంద్రం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లింది. ► 2012, మేలో ఈ కేసులో రివ్యూ పిటిషన్ను ఉపసంహరించుకున్న కేంద్రం. రాష్ట్రపతి నివేదనకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయం. మే 15న రాజాకు బెయిల్ మంజూరుచేసిన ప్రత్యేక న్యాయస్థానం. ► అన్ని వనరులకు వేలం తప్పనిసరి కాదనీ.. అన్ని సందర్భాల్లో అత్యధిక రెవిన్యూ సాధన వర్తించదని సుప్రీం కోర్టు సెప్టెంబర్ 27న వ్యాఖ్యానించింది. ► రాజకీయ నేతలు, కార్పొరేట్ పెద్దలతో లాబియిస్ట్ నీరా రాడియా మాట్లాడిన 5,800 ఆడియోటేపుల్ని, వాటి ప్రతులను 2013, జనవరి 8న ఐటీశాఖ సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు అందజేసింది. దీంతో వీటిని పరిశీలించేందుకు ఆరుగురు జడ్జీలతో ప్రత్యేక బెంచ్ను సుప్రీం ఏర్పాటుచేసింది. ► ఈ కేసుకు సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్కు, కేంద్ర మంత్రి చిదంబరానికి సెప్టెంబర్ 27న పార్లమెంటరీ కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. ► రాజాతో పాటు కనిమొళి, షాహీద్ బల్వా, వినోద్ గోయెంకా, బాలీవుడ్ దర్శకుడు కరీమ్ మొరానీ, తదితరులపై ఈ కుంభకోణంలో అక్రమ నగదు చెలామణి సంబంధించి 2014, ఏప్రిల్ 25న ఈడీ చార్జిషీట్ దాఖలుచేసింది. దీంతో పాటు డీఎంకే ఆధ్వర్యంలో నడిచే కలైంజర్ టీవీ చానెల్కు ఎస్టీపీల్ ప్రమోటర్లు రూ.200 కోట్ల మేర చెల్లించారంటూ కరుణానిధి భార్య దయాళు అమ్మాల్ పేరును ఈడీ చార్జిషీట్లో చేర్చింది. ► ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మంది నిందితులకు జడ్జి 225పేజీల ప్రశ్నావళిని అందజేశారు. 2017, ఏప్రిల్ 19న ప్రత్యేక న్యాయస్థానంలో ముగిసిన వాదనలు. ► డిసెంబర్ 21న ఏ.రాజా, కనిమొళిలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మందిని న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సంచలనాల సైనీ!
న్యూఢిల్లీ: 2జీ కేసు తీర్పు సందర్భంగా సీబీఐ న్యాయమూర్తి ఓం ప్రకాశ్ సైనీ కొన్ని కీలక, సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వాస్తవాలతో సీబీఐ చార్జిషీటు రూపొందించిందని, నిందితులపై ఆరోపణల్ని రుజువు చేయడంలో దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్టబద్ధ సాక్ష్యం కోసం ఏడేళ్ల సమయం ఎదురుచూశానని, అయితే తన ఎదురుచూపులు పూర్తిగా వ్యర్థమయ్యాయని పేర్కొంటూ సీబీఐ విచారణ తీరును ఆయన తప్పుపట్టారు. క్విడ్ ప్రొ కొ ఆరోపణలకు సీబీఐ ఎలాంటి సాక్ష్యాల్ని సమర్పించలేదని.. అందువల్ల రాజాపై ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏడేళ్లు వ్యర్థం.. గత ఏడేళ్లుగా ఈ కేసుకు సంబంధించి ఎవరైనా సరైన సాక్ష్యాన్ని తీసుకొస్తారేమోనని అన్ని పనిదినాల్లో, వేసవి సెలవుల్లో క్రమం తప్పకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కోర్టు గదిలో కూర్చున్నాను. అయితే నా ఎదురుచూపులు వ్యర్థమయ్యాయి. న్యాయబద్ధమైన ఒక్క సాక్ష్యాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయారు. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ వదంతులు, పుకార్లు, ఊహాగానాలతో కూడిన జన సామాన్య దృష్టితో ముందుకెళ్లారని అర్థమవుతోంది. న్యాయ విచారణలో అలాంటి వాటికి స్థానం లేదు. ఈ కేసులో కుట్రకు రాజా సూత్రధారి అనేందుకు రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేవు. రాజా తప్పుచేసినట్లు, కుట్ర లేదా అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఉత్సాహంగా మొదలుపెట్టి.. సీబీఐ ఈ కేసు విచారణను ఎంతో ఆవేశంగా, ఉత్సాహంతో మొదలుపెట్టింది. కేసు విచారణ కొనసాగుతున్న కొద్దీ ఎంతో జాగత్తగా, రక్షణాత్మక ధోరణితో వ్యవహరించడం వల్ల ... ఏం నిరూపించాలని ప్రాసిక్యూషన్ భావిస్తుందో తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది. తుది దశలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ), సీబీఐ ప్రాసిక్యూటర్లు ఎలాంటి సమన్వయం లేకుండా పనిచేశారు. కేసు విచారణ చివరికొచ్చేసరికి ప్రాసిక్యూషన్ ప్రమాణాలు పూర్తిగా దిగజారడంతో పాటు.. ఎలాంటి దశా దిశా లేకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా తయారైంది. సీబీఐ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనేక దరఖాస్తులు, వివరణలు సమర్పించినా.. విచారణ చివరి దశలో మాత్రం ఒక్క సీనియర్ అధికారి, ప్రాసిక్యూటర్ కూడా వాటిపై సంతకాలు చేసేందుకు మొగ్గు చూపలేదు. దరఖాస్తులపై సంతకాల గురించి నేను ప్రశ్నించినప్పుడు.. ఎస్పీపీ సంతకం చేస్తారని సీబీఐ ప్రాసిక్యూటర్ చెప్పగా.. ఎస్పీపీని అడిగితే సీబీఐ సిబ్బంది సంతకం చేస్తారని సమాధానమిచ్చారు. కోర్టుకు సమర్పించిన, చెప్పిన అంశాలపై బాధ్యత తీసుకునేందుకు విచారణాధికారులు గానీ ప్రాసిక్యూటర్లు గానీ సిద్ధంగా లేరని దీనిని బట్టి అర్థమవుతోంది. తుది వాదనల సమయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనల్ని లిఖితపూర్వకంగా సమర్పించలేదు. దానికి బదులుగా.. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు లిఖితపూర్వకంగా ఇస్తే తాను సమర్పిస్తానంటూ కోర్టుకు తెలిపారు. లిఖితపూర్వకంగా సమర్పించిన ప్రతులపై సంతకాలు చేసేందుకు కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధంగా లేకపోవడం అత్యంత బాధాకరం. ఎవరి సంతకం లేకపోతే కోర్టులో ఆ పత్రానికి ఉపయోగం ఏమిటి? ‘క్విడ్ ప్రొ కొ’కు ఎలాంటి ఆధారాలు లేవు ఏ రాజాను ప్రశ్నించే సమయంలో ప్రాసిక్యూషన్ మొదటిసారి ‘క్విడ్ ప్రొ కొ’ పదం వాడింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన మొత్తం ఆధారాల్లో.. రూ. 200 కోట్ల బదిలీని అక్రమ ప్రతిఫలంగా నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాన్ని పేర్కొనలేదు. అలాగే కలైంగర్ టీవీలో పెట్టుబడి పెట్టిన నాలుగు సంస్థలు.. ఆ పెట్టుబడిని సాధారణ వ్యాపార లావాదేవీలుగా నమ్మించేందుకు వాటి గుర్తింపును దాచిపెట్టాయన్న ఆరోపణకు సాక్ష్యం సమర్పించలేదు. రాజాను దోషిగా నిరూపించేందుకు అవసరమైన వ్యతిరేక సాక్ష్యం లేదని సీబీఐ చేసిన నిరుపయోగమైన క్రాస్ ఎగ్జామినేషన్తో అర్థమవుతోంది. అందువల్ల కలైంగర్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడులు పెట్టడంలో రాజా పాత్ర ఉందన్న ప్రాసిక్యూషన్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. అందుకు రాజాను తప్పుపట్టలేం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయంలోని సీనియర్ అధికారులు వాస్తవాల్ని మన్మోహన్కు తెలియకుండా కప్పిపుచ్చినందుకు రాజాను తప్పు పట్టలేం. రాజా లేఖలోని సంబంధిత, వివాదాస్పద అంశాల్ని మన్మోహన్కు తెలియకుండా పులక్ ఛటర్జీ దాచిపెట్టారు. అందువల్ల ప్రధానిని రాజా తప్పుదారి పట్టించారని లేక ఆయనకు తెలియకుండా వాస్తవాల్ని దాచిపెట్టారన్న ప్రాసిక్యూషన్ వాదనలో ఎలాంటి నిజం లేదు. నేర్పుగా ఈ కుంభకోణాన్ని అల్లారు కొందరు నేర్పుగా కొన్ని ఎంపికచేసుకున్న వాస్తవాలతో 2జీ కుంభకోణాన్ని అల్లారు. ఊహించని స్థాయిలో అవినీతి జరిగిందని అనుకునే స్థాయికి అంశాల్ని పెద్దది చేసి చూపించారు. ఈ కేసులో తప్పుడు వాస్తవాలతో అద్భుతంగా సీబీఐ చార్జిషీటును తయారుచేసింది. అయితే 2జీ కేసులో నిందితులపై ఆరోపణల్ని రుజువు చేయడంలో విఫలమైంది. టెలికం శాఖకు చెందిన కొందరు అధికారుల చర్యలు, నిర్లిప్తత వల్ల ఈ కేసులో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిఒక్కరూ భావించారు. వారి చర్యలు ఒక పెద్ద కుంభకోణం జరిగినట్లు ప్రజలు ఊహించేదిశగా ప్రేరేపించాయి. టెలికం శాఖ రికార్డుల ప్రకారం.. యూఏఎస్ఎల్(యూనిఫైడ్ యాక్సెస్ సర్వీస్ లైసెన్స్) కోసం దరఖాస్తుల పరిశీలన, లైసెన్స్ల కేటాయింపుల్లో కొందరు అధికారుల నిర్వాకం వల్ల ఆ శాఖలో ఎంత గందరగోళం ఉందో స్పష్టమైంది. అధికారిక బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, స్పష్టత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అంతే కాదు.. వారే స్వయంగా రూపొందించిన అధికారిక రికార్డులతో తమకు సంబంధం లేదని చెప్పి చంచల మనస్తత్వంతో, పిరికితనంగా వ్యవహరించారు. రికార్డుల్లో పేర్కొన్న దానికి భిన్నంగా తప్పును మరొకరిపై నెడుతూ వాంగ్మూలమిచ్చారు. సంచలనాల సైనీ! 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఎవరూ ఊహించని రీతిలో తీర్పు ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓంప్రకాశ్ సైనీ(58) 1980ల్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన ఆరేళ్లకు పరీక్ష రాసి మేజిస్ట్రేట్ అయ్యారు. హరియాణాకు చెందిన సైనీ ఢిల్లీ ప్రత్యేక పోటా జడ్జీగా ఎర్రకోట కాల్పుల కేసులో నిందితులకు మరణశిక్ష విధించి సంచలనం సృష్టించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ను దోషిగా తేలుస్తూ ఆయన విధించిన మరణశిక్షను తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఖరారుచేశాయి. పలు సున్నితమైన కేసుల్ని విచారించడంతో సైనీకి కేంద్రం 24 గంటలపాటు ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. టెలికాం స్పెక్ట్రమ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఢిల్లీ ప్రభుత్వం సైనీ నేతృత్వంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. 2జీ కేసుకు ముందు కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసును సైనీ విచారించారు. చివరికి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడీ సహాయకులు ఆరుగురిని దోషులుగా తేల్చి జైళ్లకు పంపారు. 2జీ కేసులో నిందితురాలైన డీఎంకే ఎంపీ, తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి కూమార్తె కనిమొళికి బెయిల్ ఇవ్వడానికి సైనీ నిరాకరించడం అనూహ్య పరిణామం. ఆమె మహిళ కాబట్టి బెయిల్ ఇవ్వాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఎందరినైనా ప్రభావితం చేయగల శక్తిమంతమైన నేత కావడంతో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. 2జీ కేసు విచారణ సందర్భంగా ఎంతటి పెద్ద వ్యాపారవేత్తలనూ వదలకుండా వారు కోర్టులో క్రమశిక్షణ పాటించేలా సైనీ వ్యవహరించి అందరి ప్రశంసలు పొందారు. మొబైల్ టెలికాం రంగంలో హేమాహేమీలైన ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిత్తల్, హచిసన్ మేక్స్ అధినేత అసీమ్ ఘోష్, స్టెర్లింగ్ సెల్యూలర్ చీఫ్ రవి రూయాలను తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి సైనీ కోర్టుకు రప్పించారు. ‘గత ఏడేళ్లుగా వేసవి సెలవులతో సహా అన్ని పనిదినాల్లో నేను ఉదయం పది నుంచి ఐదింటి వరకూ ఓపెన్ కోర్టులో కూర్చున్నా. ఎవరైనా చట్టపరంగా నిలబడే సాక్ష్యం ఏదైనా తీసుకొస్తారేమోనన్న నా ఎదురుచూపులు నిష్ఫలమయ్యాయి’అని సైనీ తన తీర్పులో చెప్పిన మాటలు ఆయన నిజాయితీకి మచ్చుతునకలు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్