
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో జయలలితను కలుసుకునే అవకాశం కలిగి ఉంటే తాను ఎలా చంపబడుతున్నానో ఆమె తమకు చెప్పి ఉండేవారని తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మ కోలుకుంటోంది అంటూ శశికళకు భయపడి అందరం అబద్ధాలు చెప్పాం. దయచేసి క్షమించండి’ అని ప్రజలను వేడుకున్నారు. అన్నాదురై జయంతి సందర్భంగా మదురై పళంగానత్తంలో శుక్రవారం రాత్రి జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ... అనారోగ్యానికి గురైన జయలలితకు మందులు ఇవ్వకుండా ఆస్పత్రిలో పడవేశారని వెల్లడించారు. ‘‘ప్రజలారా నన్ను క్షమించండి.. చికిత్స సమయంలో జయలలిత ఇడ్లీ, చట్నీ తిన్నట్లుగా మేం చెప్పినదంతా అబద్ధం, పార్టీ రహస్యాలు బహిరంగ పరచకూడదనే ఉద్దేశంతో కలిసికట్టుగా అబద్ధాలు ఆడాం. కావాలంటే రాసిపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పేది నిజం’’ అని చెప్పారు.
శశికళకు భయపడి జయలలితకు చికిత్స విషయంలో అన్నీ అబద్ధాలాడమని తెలిపారు. జయలలిత ఉన్న రూంలోకి శశికళ, ఆమె కుటుంబీకులు మాత్రమే వెళ్లేవారని తెలిపారు. కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్షా, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్రావు, కాంగ్రెస్ ఉపా«ధ్యక్షులు రాహూల్గాంధీ, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆస్పత్రికి వచ్చినపుడు అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, శశికళ కుటుంబీకులను మాత్రమే కలుసుకున్నార, జయలలితను చూసేందుకు వారికి అవకాశం ఇవ్వకుండా ఇన్ఫెక్షన్ సాకు చూపి అడ్డుకున్నారని వెల్లడించారు. సాధారణ వార్డు బాయ్ కూడా జయలలితను చూశాడనీ, మంత్రులుగా తాము చూడలేకపోయామని ఆయన వాపోయారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని చెప్పారు. అయితే అపోలో ఆసుపత్రిలో జయలలితకు అందిన చికిత్స వీడియోను విచారణ కమిషన్ ముందు విడుదల చేస్తామని టీటీవీ దినకరన్ శనివారం చెన్నైలో తెలిపారు.