
సాక్షి, అమరావతి : ప్రజల అఖండ మద్దతుతో అధికారంలోకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఓ పక్క పచ్చ పార్టీ నేతలు, మరోపక్క తోక పార్టీ జనసేన నేతలు పసలేని విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారు. గెలుపు కోసం ఎంతో కృషి చేసినా.. ఎందుకు ఓడిపోయామో తెలియదంటూ చంద్రబాబు, ఎన్నికల్లో అక్రమాల వల్లే వైఎస్సార్సీపీ గెలిచిందని పవన్ ఇటీవల అడ్డగోలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
‘యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయానో తెలియదంటాడు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్టనరేమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారు. మరి టీడీపీ గెలిచిన ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్ట్నర్ను ఎవరు గెలిపించారో? అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డారు..
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్కు చేస్తున్న హెచ్చరికల మాదిరిగానే చంద్రబాబు కూడా ఊరికే పేలుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు నాయుడి వార్నింగులు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్లానే ఉంటున్నాయని చురకలంటించారు. ‘మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని బాబుగారు గగ్గోలు పెడుతున్నాడు’అని ఎద్దేవా చేశారు. ‘ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ జతకట్టని పార్టీ, ఫ్రంటూ దేశంలో లేదు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గు లేని పచ్చ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేదే నారా చంద్రబాబు గారి ఫిలాసఫీ’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment