
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ఎల్పీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తనతో పాటు పార్టీ నేతలు కూడా ఎన్నో కష్టాలు పడ్డారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనతో పాటు ప్రయాణించారని, ఎవరికీ అన్యాయం చేయనని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఎవరినీ విస్మరించనని, అలాగే ఎవరినీ కూడా వదులుకోనని ఆయన అన్నారు. అందరం కలిసి ప్రజలకు సేవ చేద్దామని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
జగన్ లాంటి సీఎంను చూడలేదు: బొత్స
సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వైఎస్ జగన్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని అన్నారు. పదవుల్లో సామాజిక న్యాయం చేసిన ఘటన వైఎస్ జగన్దని, మాటలు చెప్పడం కాదని...చేతల్లో చూపిస్తున్నారన్నారు. సామాజిక వర్గాల వారీగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల ఓ దశలో తాను షాక్కు కూడా గురయ్యానన్నారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం కాబోతుందని బొత్స వ్యాఖ్యానించారు. కాగా మంత్రివర్గం కూర్పుపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత రానుంది.
చదవండి : ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం