
సాక్షి, తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అవకతవకలు జరిగాయని టీటీడీ తాజా నిర్ణయంతో బట్టబయలయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఎన్నడూ లేనివిధంగా స్వామివారి ఆలయంలోకి తొమ్మిది రోజులపాటు భక్తులను అనుమతించబోమని టీటీడీ ఎందుకు నిబంధనలు పెడుతోందని ఆమె ప్రశ్నించారు. టీటీడీ తీరుపై తిరుమల ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారని, టీటీడీ తాజా నిర్ణయం ఆయన ఆరోపణలకు బలం చేకూరుస్తోందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
పోటులో తవ్వకాలు జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోటులోని సంపదలు తవ్వితీశారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రమణదీక్షితులు టీటీడీ అధికారులపై చేసిన ఆరోపణలు నిజమేనని తాజా పరిణామాలతో అనిపిస్తోందని ఆమె అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ పాలకమాండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి టీటీడీ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయని రోజా పేర్కొన్నారు.