ప్రతి అడుగు రైతు కోసమే | Every step is for the farmer | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగు రైతు కోసమే

Published Wed, Jan 10 2018 2:45 AM | Last Updated on Wed, Jan 10 2018 2:45 AM

Every step is for the farmer - Sakshi

మంగళవారం సిద్దిపేటలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం వేసే ప్రతి అడుగు అన్నదాతల సంక్షేమం కోసమేనని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో కంది కొను గోలు కేంద్రం ప్రారంభించారు. దాతల సహకారంతో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. డీఎస్సీ ఉచిత కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్థులతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ, రైతు పండించిన ప్రతీ గింజకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.1,031 కోట్లతో 21 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశామని చెప్పారు. ఈసారి కందుల ఉత్పత్తి మరింత పెరిగిందనే ఆలోచనతో 106 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గత ఏడాదికన్నా క్వింటాకు రూ.400 అధికంగా పెట్టి అంటే రూ.5,450 మద్దతు ధరతో కొంటున్నామన్నారు. రైతులు 12 శాతం కన్నా తక్కువ తేమతో తేవా లని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. లాభసాటి వ్యవసాయం కోసం ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హరియాణా రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న ముభావంతు పథకం అమలు కోసం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ–నామ్‌ లైసెన్స్‌ విధానంతో లైసెన్స్‌ పొందిన కమీషన్‌ వ్యాపారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉత్పత్తులు కొనవచ్చన్నారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరుగుతోందని, ఫలితంగా రైతులకు లాభం కలుగుతుందన్నారు.  

కాలేజీలను కాపాడిన కాంట్రాక్టు లెక్చరర్లు 
ప్రభుత్వ విద్యావిధానంపై ప్రజలకు నమ్మకం పోయే దశకు చేరుకున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు జీవం పోసి కాపాడింది కాంట్రాక్టు లెక్చరర్లేనని హరీశ్‌రావు కొనియాడారు. ఎన్నికల హామీలో భాగంగా వారిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు కొందరు కుట్ర పన్ని కోర్టుల్లో కేసులు వేశారన్నారు. అయినా ముఖ్యమంత్రి కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్‌ పేతో వేతనాలు అందచేసేలా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు.  

అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం..
ఇల్లంతకుంట(మానకొండూర్‌): ‘నిర్వాసితులెవ రూ అధైర్యపడొద్దు.. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటాం.. అన్నివిధాలా న్యాయం చేస్తాం’ అని మంత్రి హరీశ్‌రావు అభయమిచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల– 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్‌ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. మంత్రిని అనంతగిరివాసులు కలసి తమ సమస్యలు విన్నవించారు. అనం తరం హరీశ్‌రావు గ్రామస్తులతో మాట్లాడారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లిస్తున్నామని, రిజర్వాయర్‌ నిర్మాణానికి అందరూ సహకరించాలన్నారు. 18 ఏళ్లు నిం డిన యువతకు ఇంటిస్థలం కేటాయిస్తామని, కుటుంబ ప్యాకేజీ రూ.12.50 లక్షలు చెల్లించి పునరావాసం కల్పిస్తామన్నారు. రిజర్వాయర్‌ లో చేపలు పట్టుకునేందుకు హక్కులు కల్పిస్తా మని చెప్పారు. ఇళ్ల కొలతలకు సహకరించాలని కోరారు. వీటన్నింటికీ అంగీకరిస్తే కలెక్టర్‌ పరి శీలించాక పక్షంరోజుల్లో పూర్తిస్థాయి పరిహారం చెలిస్తామన్నారు. నిర్వాసితులు కోరుకున్న చోటే పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని వివరించారు. సిరిసిల్ల, అనంతగిరి, ఇల్లంతకుంటలో పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు నిర్వాసితు లు సంసిద్ధతను వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్‌తో అన్ని విషయాలపై చర్చిస్తామని నిర్వాసితులు మంత్రితో చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement