![Dhoni Pulls Out of Windies Tour and Sabbatical to Serve His Paramilitary Regiment - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/20/MS-Dhoni.jpg.webp?itok=bCgw1LIp)
లెఫ్టినెంట్ కల్నల్ ఎంఎస్ ధోని
న్యూఢిల్లీ : ప్రపంచకప్ ముగిసింది. భారత్కప్ చేజారింది. చర్చంతా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని చుట్టూ తిరుగుతోంది. ధోని రిటైర్మెంట్ ఇస్తాడా? మరికొద్ది రోజులు కొనసాగుతాడా? ఆదివారం వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో ధోనికి చోటు దక్కుతుందా? లేక 15 మంది సభ్యుల్లో ఒకడిగా ఎంపికై తుది జట్టులో చోటు దక్కకుండా సలహాలు, సూచనలిచ్చేవరకు పరిమితం అవుతాడా? అని అనేక సందేహాలు జోరందుకున్నాయి. అయితే ధోని మాత్రం ప్రపంచకప్ అనంతరం రెండు నెలల వరకు క్రికెట్కు దూరంగా ఉంటానని బీసీసీఐకి ముందే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలలు ఆర్మీలో చేరి సేవలందిస్తానని లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని పేర్కొన్నట్లు ఓ సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపారు. పారాచూట్ రెజిమెంట్ విభాగంలో చేరి దేశసైనికుడిగా ధోని మరో రెడునెలలు సేవలందిస్తాడన్నారు.
‘ధోని తనకు తానుగా వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్లో చేరి సేవలందించనున్నాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. ప్రపంచకప్ ముందుకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దేశసైనికుడిగా రెండు నెలలు సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్కు తెలియజేశాం.’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ధోని గైర్హాజరితో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు చోటుదక్కనుండగా.. ప్రత్యామ్నాయంగా వృద్ధిమాన్ సాహా పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఇక విండీస్ పర్యటనకు భారత జట్టును ఆదివారం ప్రకటించనున్న విషయం తెలిసిందే.
ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పట్లో ధోనికి రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశమే లేదని అతని చిరకాల మిత్రుడు, వ్యాపార వ్యవహరాలు చూసే అరుణ్ పాండే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment