
టెస్టు సిరీస్లో భారత్ను నిలబెట్టాలనే కసి కోహ్లి ఆటలో కనబడింది. గత టెస్టులో తడబడినట్లు కాకుండా అతను ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసం కనబరిచాడు. క్రీజ్లోకి రాగానే వచ్చే ఒత్తిడిని దరి చేరనీయకుండా చక్కని షాట్లతో ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టాడు. పిచ్ నుంచి కూడా సహకారం లభిస్తుండటంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ను ఆధిగమించే అవకాశం భారత బ్యాట్స్మెన్ చేతిలో ఉంది. ఇప్పటికే తమకు లాభించే పిచ్ను తయారు చేయకపోవడంతో ప్రొటీస్ ఆత్మరక్షణలో పడినట్లుంది. చూస్తుంటే భారత్కు మేలుచేకూర్చేలా ఈ పిచ్ ఉందనిపిస్తుంది.
అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ ప్రొటీస్ బ్యాట్స్మెన్పై ప్రయోగించి ఫలితాలు సాధించాడు. అతనికి ఇషాంత్ శర్మ మంచి తోడ్పాటు అందించాడు. వారి ఇన్నింగ్స్ను ఆమ్లా రనౌట్ మలుపుతిప్పింది. హర్దిక్ పాండ్యా మెరుపు వేగంతో స్పందించి నేరుగా వికెట్లను గిరాటు వేశాడు. ఇది భారత్ పట్టుబిగించేందుకు దోహదం చేసిందనే చెప్పాలి. కానీ దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 300 పరుగుల్లోపే ఆలౌట్ చేయలేకపోవడం భారత శిబిరాన్ని కాస్త నిరాశపరిచింది. 335 పరుగులు తక్కువేం కాదు. ఇప్పటికైతే పిచ్ బ్యాటింగ్కు కలిసొచ్చేలా ఉంది. దీన్ని అనువుగా మలచుకొని భారత్ ఈ మ్యాచ్లో నిలిచేందుకు పోరాడాలి. ఈ నేపథ్యంలో మూడోరోజు భారత్కు కీలకం కానుంది.