
రోహిత్ కొంచెం రిలాక్స్గా ఉంటాడని చాలా మంది అనుకుంటారని, కానీ అది తప్పని నిరూపించాడన్నాడు.
న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఎంతో విలువైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కొన్ని సందర్భాల్లో రోహిత్కు పరిస్థితులు అనుకూలించకపోవడమే అతడిని రాటుదేలేలా చేసిందన్నాడు. ముఖ్యంగా ప్రస్తుత భారత జట్టులో కీలక క్రికెటర్గా రోహిత్ ఉన్నాడంటే అతను కష్టించే తత్వమే కారణమన్నాడు. ప్రధానంగా 2011లో టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచినప్పుడు రోహిత్ రేసులో ఉన్నా జట్టులో తీసుకోలేకపోవడమే అతడిలో పట్టుదలను పెంచిందన్నాడు. రోహిత్ కొంచెం రిలాక్స్గా ఉంటాడని చాలా మంది అనుకుంటారని, కానీ అది తప్పని నిరూపించాడన్నాడు. 2012 నుంచి రోహిత్లో అసాధారణ ఆటగాడు బయటకొచ్చాడని, అందుకు కారణం అతని కష్టింతే తత్వం, పట్టుదలే కారణమన్నాడు. (మ్యాచ్ ఫీజులు చెల్లించండి మహాప్రభు!)
‘ఏ క్రికెటర్ అయినా ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పుడు రోహిత్తో పోల్చితే కొంచెం రిలాక్స్ గా ఉన్నట్లు కనబడతాడు. అప్పుడు అతను మరింత కష్టపడాలని చెబుతాం. ఇది వసీం జాఫర్కు కూడా వర్తిస్తుంది. జాఫర్ దేశవాళీ శకంలో ఎన్నో విలువైన పరుగులు చేశాడు. కానీ పరుగులు చేసే విషయంలో చాలా రిలాక్స్ కనిపిస్తాడు. బ్యాట్తో రాణించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అప్పుడు ఏమని అనుకుంటాం. అతను ఎందుకు హార్డ్ వర్క్ చేయడం లేదనే ఆలోచనే మనకు వస్తుంది. కానీ అతను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనే విషయం మనకు కనబడదు. ఇక్కడ రోహిత్కు గురించి కూడా చాలా మంది ఇలానే అభిప్రాయపడ్డారు. రోహిత్ ఎక్కువ కష్టించాలనే సూచించారు. కానీ రోహిత్లో పోరాటే తత్వం చాలా ఎక్కువ. అతను ఎప్పుడూ మనం మరింత కష్టపడాలని చెబుతూ ఉండేవాడు. జట్టు కోసం తొలి ప్రాధాన్యత ఇస్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతని ఘనతలు చూశాం. భారత జట్టులో రోహిత్ శర్మ కీలక ఆటగాడు కావడానికి అతని పట్టుదలే కారణం. ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్కప్లో అతనికి జట్టులో స్థానం కల్పించకపోవడమే మరింత శ్రమించేలా చేసింది’ అని ఇర్ఫాన్ స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టడ్ షోలో పేర్కొన్నాడు. 2013, 2015, 2017, 2019 సీజన్లలో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టైటిల్స్ సాధించి రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ('ఏం జరుగతుందోనని ప్రతిరోజు భయపడేవాడిని')