‘లోధా’ కేసులో బీసీసీఐ రివ్యూ పిటిషన్
ముంబై: లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుప్రీం కోర్టుతోనే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. లోధా ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ జులై 18న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ‘సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 19 (ఎ) (సి) ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోంది. తీర్పు ఇచ్చే ముందు ఇద్దరు సభ్యులు వాస్తవాలను పరిగణలోకి తీసుకోలేదు’ అని ఈ పిటిషన్లో పేర్కొంది.
అన్నింటికి మించి తదుపరి విచారణనుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ను తప్పించాలని కూడా కోరింది. బోర్డుకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నారని, నిష్పాక్షిక విచారణ జరగడం లేదని తాము భావిస్తున్నామన్న బీసీసీఐ... ఐదుగురు సభ్యుల బెంచ్ ముందు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరింది. బీసీసీఐకి ఈ కేసులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ కట్జూ మార్గనిర్దేశనం చేస్తున్నారు.