
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి మైక్ హెస్సెన్ ఉన్నపళంగా తప్పుకున్నాడు. దాదాపు ఆరేళ్లుగా కివీస్ క్రికెట్కు సేవలందిస్తున్న హెస్సన్.. ఇంకా ఏడాదిపాటు కాంట్రాక్ట్ ఉండగానే కోచ్ పదవికి గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు కోచ్ పదవికి వీడ్కోలు చెబుతున్నట్లు హెస్సన్ గురువారం ప్రకటించాడు. కాగా, వచ్చే నెల చివరి వరకూ జట్టుతో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే కోచ్ పదవి నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు హెస్సెన్ తెలిపాడు.
ఆకస్మికంగా హెస్సెన్ తీసుకున్న నిర్ణయం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును కలవరపాటుకు గురిచేసింది. ఇంకా వన్డే వరల్డ్కప్కు ఏడాది మాత్రమే సమయం ఉన్న తరుణంలో హెస్సెన్ వైదొలగడం కివీస్కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. సుదీర్ఘ కాలంగా కివీస్ క్రికెట్ జట్టుతో పని చేస్తున్న హెస్సెన్ ఇలా షాకివ్వడం పట్ల న్యూజిలాండ్ క్రికెట్ పెద్దలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఇటీవల క్రికెట్ బోర్డులో పెద్దలతో చోటు చేసుకున్న విభేదాల కారణంగా హెస్సెన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.