
మహ్మద్ షమీ, హసీన్ జహాన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి పాకిస్తాన్ యువతి అలిషబాతో సంబంధమున్నట్లు ఆమె ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అతని భార్య హసీన్ జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా దక్షిణాఫ్రికా పర్యటనంతరం షమీ నేరుగా భారత్కు రాకుండా దుబాయ్లో అలిషబాను కలిసాడని జహాన్ మీడియాకు తెలిపారు. అయితే ఈ వివాదంలో కీలకంగా మారిన అలిషబా స్పందిస్తూ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.
చాంపియన్స్ ట్రోఫీ నుంచే పరిచయం
చాంపియన్స్ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ ఓడిన మ్యాచ్ నుంచే షమీ తెలుసని అలిషబా చెప్పారు. ఆ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో అతని ఫేస్బుక్ ఫ్రోఫైల్ వెతికి మెసెజ్ పంపించానన్నారు. షమీ అంటే తనకు ఎంతో అభిమానమని, అభిమానులందరికీ ఇష్టపడే క్రికెటర్ను కలవాలనే కోరిక ఉంటుందని, అలానే తాను షమీని కలిసానన్నారు. అతనికుండే లక్షల ఫాలోవర్స్లో తాను ఒకరినని, ఓ సాధారణ అభిమానిగానే అతనికి మెసెజ్ చేసినట్లు స్పష్టం చేశారు.
ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులం అయ్యామని, ఓ క్రికెటర్గా అతన్ని గౌరవిస్తానన్నారు. ఇక దక్షిణాఫ్రికా పర్యటననంతరం షమీని దుబాయ్లో కలిసింది వాస్తవేమనన్నారు. ఆ పర్యటన అనంతరం షమీ దుబాయ్ నుంచి భారత్కు వెళ్తున్నాడని అనుకోకుండా తెలిసిందని, ఆ సమయంలో తాను తన సోదరిల వద్దకు వెళ్తున్నానని తెలిపారు. తన సోదరిలు దుబాయ్లో నివసిస్తుండటంతో తరుచుగా అక్కడికి వెళ్తుంటానని దీనిలో భాగంగానే షమీని కలిసినట్లు అలిషబా చెప్పుకొచ్చారు.
ఇక షమీతో హోటల్లో గడిపారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ రోజు తాను నేరుగా తన సోదరి నివాసానికి వెళ్లానని, మరుసటి రోజు షమీ బాయ్తో ఆ హోటల్లో బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేశానన్నారు. షమీ బాయ్ వ్యక్తిగత జీవితం, ఫిక్సింగ్ ఒప్పందాల గురించి తనకు తెలియదన్నారు. అబద్దాలు కూడా చెప్పని వ్యక్తి, తన దేశానికి నమ్మక ద్రోహం ఎలా చేస్తాడని ఆమె ప్రశ్నించారు.