
న్యూఢిల్లీ: క్లే కోర్టు సీజన్లోని తొలి మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో మోంటెకార్లో ఓపెన్లో భారత డబుల్స్ నంబర్వన్ రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. తన భాగస్వామి రోజర్ వాసెలిన్ (నెదర్లాండ్స్)తో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొనాకోలోని మోంటెకార్లోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–1, 7–5తో జెమీ సెరాటని (అమెరికా)–ఆండ్రియా సెప్పి (ఇటలీ) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జోడీ మూడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి ద్వయం సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో 10 సార్లు చాంపియన్, ప్రపంచ నంబర్వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో నాదల్ 6–1, 6–3తో బెడెన్ (స్లొవేనియా)పై అలవోకగా గెలిచాడు. తొమ్మిదో సీడ్, మాజీ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/2), 7–5తో బొర్నా కొరిచ్ (క్రొయేషియా)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment