
చైనా ఓపెన్ లో సైనా నెహ్వాల్ జోరు
పుజోహ్: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సైనా 21-16, 21-13 తేడాతో నొజోమి ఓకురా (జపాన్)పై గెలిచి సెమీస్ కు చేరింది. 42 నిమిషాల పాటు జరిగిన పోరులో సైనా పూర్తి ఆధిపత్యం సాధించింది. తొలి గేమ్ లో ఆదిలో 6-6 తో సమానంగా ఉన్న సమయంలో సైనా నెహ్వాల్ మరింత దూకుడుగా ఆడి 10-7 తో ముందంజ వేసింది. అదే ఊపును కడవరకూ కొనసాగించి ఆ సెట్ ను 21 నిమిషాల్లో కైవసం చేసుకుంది.
కాగా, రెండో సెట్ లో నొజోమి నుంచి సైనాకు ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. రెండో సెట్ లో సైనా 5-2 తో ముందంజలో ఉన్నప్పుడు నొజోమి అనవసర తప్పిదాలతో పాయింట్లను సమర్పించుకుంది. అటు తరువాత సైనా 13-5 తేడాతో స్పష్టమైన ఆధిక్యం సాధించి నొజోమిని ఒత్తిడిలోకి నెట్టింది. ఆపై నొజోమి పుంజుకున్నా సైనా దూకుడు ముందు తలవంచక తప్పలేదు.