సాక్షి, చెన్నై : ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం ఫొటో తప్పని సరిగా ఉండాల్సిన అవసరం ఉందని డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తన తీర్పులో సవరణలు చేయాల్సి అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో రాజకీయ నేతల చిత్రాలను వినియోగించడాన్ని నియంత్రించే విధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్కు స్పందించిన సుప్రీంకోర్టు రాష్ర్టపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వంటి వారి ఫొటోలు మాత్రమే ఉండాలని సూచిస్తూ, కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
దీనిని ఆహ్వానించే వాళ్లూ, వ్యతిరేకించే వాళ్లూ బయలు దేరారు. ఆ దిశగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆ మార్గదర్శకాల్లో సవరణలు అవసరమని సూచించారు. అధికార పగ్గాలు చేపట్టే ఓ రాజకీయ పార్టీ ఎంపిక చేసే వ్యక్తిని ప్రధానిగా ఎంపిక చేయడం జరుగుతున్నదని సూచించారు. అలాగే, రాష్ట్రపతిని ఎన్నుకునేది కూడా ఆయా పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులేనని గుర్తు చేశారు. అయితే, ఆ ఇద్దరికి ప్రాధాన్యత కల్పించినప్పుడు ఆయా రాష్ట్రాల సీఎంల ఫొటోలను ఎందుకు వాడుకునేందుకు అవకాశం లేదని ప్రశ్నించారు.
ఇది ఆయా రాష్ట్రాల హక్కుల్ని కాలరాసే రీతిలో వ్యవహరించడమేనని పేర్కొన్నారు. సీఎంల ఫొటోలను తప్పించడం అన్నది కుదరని పనిగా పేర్కొన్నారు. ఇక, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆహ్వానించిన పీఎంకే అధినేత రాందాసు, మరికొన్ని మార్పులు చేర్పులు అవసరమని వివరించారు. అలాగే, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తక్షణం రాష్ట్రంలో అమలు చేయాలని డీఎండీకే అధినేత విజయకాంత్ డిమాండ్ చేశారు.
సీఎం ఫొటో తప్పనిసరి
Published Fri, May 15 2015 2:04 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement