ఢిల్లీలోని మెట్రో రైల్వే స్టేషన్ల పరిసరాలు బిచ్చగాళ్లతో నిండిపోతున్నాయి.
ఢిల్లీలోని మెట్రో రైల్వే స్టేషన్ల పరిసరాలు బిచ్చగాళ్లతో నిండిపోతున్నాయి. చాలావరకు మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి. నోయిడా సిటీ సెంటర్, సెక్టార్-18, ఝండేవలాన్, షాదిపూర్, చాందినీ చౌక్...ఇలా ఏ ఇలా స్టేషన్ల బయటచూసినా వీరే కనిపిస్తారు. స్టేషన్ నుంచి బయటకు వెళ్తుంటే కనిపించే దృశ్యాలన్నీ ఇవే. ఇదే విషయమై పశ్చిమ జనక్పురి-కర్కర్డుమాల మధ్య ప్రతిరోజూ రాకపోకలు సాగించే లూబా చోప్రా అనే విద్యార్థిని మాట్లాడుతూ ‘మెట్రో స్టేషన్లలోని మెట్ల వద్ద బిచ్చగాళ్లను చూడాల్సిరావడం చిరాకుగా అనిపిస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రతిరోజూ ఓ కొత్త బిచ్చగాడు కనిపిస్తాడు. మెట్రో రైల్వే స్టేషన్లు వారికి కొత్త ఆలయాలుగా మారాయి. ఇదొక వ్యాపారం. దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ తరహా నిర్లక్ష్య ధోరణి నోయిడా సిటీ సెంటర్ స్టేషన్లోనూ బాగా కనిపిస్తుంది. అక్కడ బిచ్చగాళ్ల సంఖ్య విపరీతంగా ఉండడంతో పాదచారులకు దారి దొరకని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే విషయమై ప్రసూన్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ ‘ఉదయం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే బిచ్చగాళ్లు దారికి అడ్డంగా ఉండడం వల్ల మంచే జరుగుతోంది. ఒకరిపై మరొకరు పడిపోయే పరిస్థితి తప్పిపోతోంది. ఈ రకంగా బిచ్చగాళ్ల వల్ల కొంతమేలే జరుగుతోంది’ అని అన్నాడు. అయితే వారు డబ్బు కోసం బాగా విసిగిస్తుంటారన్నాడు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే జేబు దొంగతనాలు పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదన్నాడు. ఈ సమస్యను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదంటూ విచారం వ్యక్తం చేశాడు.