
యశవంతపుర : సంచలనం సృష్టించిన నటులు, నిర్మాతలపై ఐటీ దాడుల వ్యవహారంలో ఇప్పుడు విచారణ మొదలైంది. శుక్రవారం రాకింగ్ స్టార్, కేజీఎఫ్ హీరో యశ్ తన తల్లి పుష్పతో కలిసి ఇక్కడి క్వీన్స్ రోడ్డులో ఉన్న ఆదాయ పన్ను శాఖ ముందుకు వచ్చారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన యశ్విలేకరులతో మాట్లాడుతూ... ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. తన ఆదాయ వనరులపై ఐటీ అధికారులు అడిగినట్లు తెలిపారు.
తన సంస్థలో పనిచేస్తున్న వారి గురించి ప్రశ్నించారని, తన ఆడిటర్ ఇంటిపై ఎలాంటి ఐటీ దాడి జరగలేదన్నారు. తనకు రూ. 40 కోట్ల రుణం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఖండించారు. కొందరు తనను వేధించటానికి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇకపై ఇలాంటివి సహించనన్నారు. కొన్ని చానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా యశ్ ఆడిటర్ బసవరాజ్ కార్యాలయంపై గురు వారం నిర్వహించిన ఐటీ దాడుల్లో అధికారులకు ఒక డెయిరీ లభ్యమైనట్లు తెలిసింది.