ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వద్దంటున్నప్పటికీ నగర పోలీసు శాఖ భద్రత విషయంలో ఎంతమాత్రం రాజీపడడం లేదు.
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వద్దంటున్నప్పటికీ నగర పోలీసు శాఖ భద్రత విషయంలో ఎంతమాత్రం రాజీపడడం లేదు. వీఐపీ సంస్కృతిని అంతం చేయడమే తమ ఉద్దేశమని, అందువల్ల భద్రత అవసరం లేదని, భగవంతుడే తనకు అండ అంటూ సీఎం పదేపదే పేర్కొంటున్నప్పటికీ నగర పోలీసు శాఖ భద్రత విషయంలో అప్రమత్తంగానే ఉంటోంది. భద్రత కల్పిస్తామని నగర పోలీసులు ఇప్పటికి రెండు పర్యాయాలు లేఖలు రాసినప్పటికీ సీఎం అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో ఆయనకు గుట్టుగానే భద్రత కల్పిస్తున్నారు.
స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, యూపీ పోలీసులు కలసి ముఖ్యమంత్రి భద్రతపై సంయుక్త సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ సమీక్ష నివేదికను నగర పోలీసు కమిషనర్ బస్సీ, లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోం మంత్రిత్వ శాఖలకు సమర్పించే అవకాశముంది. ఆ తరువాత ముఖ్యమంత్రికి ఎటువంటి భద్రత కల్పించాలనే అంశంపై నిర్ణయం తీసుకుం టారని అనధికార వర్గాలు చె బుతున్నాయి. విశ్వాస తీర్మానం సమయంలో బీజేపీ నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ ఆరోపించినట్లుగా ముఖ్యమంత్రికి తాము మూడంచెల భద్రతను కల్పించడం లేదని వారు తేల్చిచెప్పారు, సీఎం అరవింద్ నిరాకరించినప్పటికీ నగర పోలీసులు ఆయన భద్రతపై దృష్టి సారిస్తున్నారని, అయితే మూడంచెల భద్రత మాత్రం కల్పించడం లేదని వారు చెప్పారు.
కౌశాం బి ప్రాంతంలోని నివాసంలోగానీ లేదా ఢిల్లీ సచివాలయంలోగానీ, విధానసభలోగానీ భద్రతాపరంగా సీఎం అరవింద్కు ఎటువంటి ముప్పూ లేదని వార ంటున్నారు. జనతా దర్బార్ సమయంలో భారీ సంఖ్యలో తరలివస్తున్న సామాన్యులను నియంత్రించడానికి శతవిధాలా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ జనసభల్లో వారు కేజ్రీవాల్కు కూడా భద్రత సమకూరుస్తున్నారు. అయితే కౌశాంబీ లోని నివాసం నుంచి నగరానికి వచ్చే మార్గంలో ఆయనకు భద్రతకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు వెళతారనే విషయం ముందుగానే తెలుసుకుని భద్రత సమకూర్చాలని పోలీసులు యోచిస్తున్నారు.