
రియల్ హీరో అవార్డును అందుకున్న వేళ రమేష్ బల్లద్
ప్రతి విజయం వెనుక ఓ కథ ఉంటుంది. విజయం వెనుక తపన కనిపిస్తుంది. అలాంటి కోవకు చెందినదే నిజ జీవితంలో జరిగింది. అక్షరం ముక్క రాని గొర్రెలకాపరి అపర విద్యావంతుడయ్యాడు. అతడే రమేష్ బల్లద్. రాయచూరు జిల్లాలో వెనుకబడిన దేవదుర్గ తాలూకాలో అక్షరాస్యత శాతంలో కూడా వెనుకబాటే. తాలూకాలోని కోతిగుడ్డ గ్రామానికి చెందిన రమేష్ బల్లద్ నేడు వేలాది మందివిద్యార్థులకు మార్గదర్శకునిగా మారాడనడంలో అతిశయోక్తి లేదు.
కర్ణాటక , రాయచూరు రూరల్: రమేష్ 16 ఏళ్ల వయస్సు వచ్చేవరకు పాఠశాల ముఖం చూడలేదు. అమ్మనాన్నలతో 9 మంది అన్నదమ్ములతో పెద్ద కుటుంబం. ఇతడు ఐదవవాడు. బర్రెలు మేపడం, వ్యవసాయం, కట్టెలు తేవడం, ఇల్లు, పోలం పనులు తప్ప ప్రపంచం గురించి ఏమీ తెలియని అమాయకుడు రమేష్. ఆయనకు బర్రెలే స్నేహితులు. తన తోటి పిల్లలు బడికి వెళుతుంటే తానూ చదువుకోవాలని ఆశపడేవాడు. బర్రెలను మేపుతూ అలాగే పాఠశాల వరకూ వెళ్లి కొంతసేపు బయట నిలబడి వచ్చేవాడు.అదే రమేష్ నేడు కన్నడ, ఇంగ్లీష్ బాషలలో సరళంగ విద్యార్థులకు బోధించే స్థాయికి ఎదిగాడు.
మలుపు తిప్పిన ఎంపిక
దేవదుర్గ తాలూకా కోతి గుడ్డలో తండ్రి తిమ్మప్ప, తల్లి బసవ్వలు కాగా, 2007లో గ్రామీణ యువత సబలీకరణ విషయంలో బెంగళూరు హెడ్ హెల్డ్ హై సంస్థ రాజేష్ భట్ల బృందం ఈ గ్రామంలో పర్యటించి రమేష్ను విద్యావంతున్ని చేయాలని ఎంచుకుంది. నువ్వు బెంగళూరుకు వెళ్తే ఇంటి, చేను పనులు ఎవరు చేస్తారని తల్లిదండ్రులు చింతించారు. తమ్ముడు హనుమంతు బల్లద్ అన్నకు అండగా నిలిచాడు. పశువులను అదిలించే కట్టెను తెచ్చి ఆ కట్టె ఎంత ఎత్తులో ఉందో అంతతెత్తుకు ఎదగాలని, వచ్చిన అవకాశాన్ని వదలరాదని బెంగళూరుకు సాగపంపాడు.
చదువులు నేర్చాడు
హెడ్ హెల్డ్ హై సంస్థగారు నెలల శిక్షణలో రమేష్ బల్లద్ అక్షరాలను అవపోశన పట్టాడు. ఆరునెలలు శిక్షణనివ్వాలని అనుకుంటే, నాలుగు నెలల్లోనే అవలీలగా ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నాడు. కంప్యూటర్లో కూడా నిమిషానికి 70 పదాలను కొట్టేంత స్పీడుకు వెళ్లాడు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పాఠాలు నేర్పే స్థాయికి చేరుకున్నాడు. ఏడాది పాటు ఇంటి ముఖం చూడలేదు. 2008లో సోదరుడి పెళ్లికి వచ్చిన రమేష్ను చూసిన తల్లి తండ్రులు, గ్రామçస్తులు ఎవరో బ్యాంక్ అధికారి వచ్చారని బావించి కూర్చోవడానికి కుర్చీ వేశారు. రమేష్ జేబులో నుంచి తన చిన్ననాటి ఫోటోను చూపించగానే అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.
విద్యార్థులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న రమేష్
గ్రామీణ బాలలకు శిక్షణ
కోతిగుడ్డ గ్రామ యవకులకు శిక్షణనివ్వడానికి కొప్పళ జిల్లా గంగావతి తాలూకా కనకగిరిలో రూరల్ బ్రిడ్జి అనే సంస్థను ప్రారంభించి పిల్లలకు ఉచితంగా కంప్యూటర్ నేర్పించి ఉద్యోగం కల్పించాలనే సదాశయంతో 2009లో బిపిఓను సృష్టించాడు. 120 మందికి అవకాశం కల్పించారు. తన కోసం జీవితాన్ని త్యాగం చేసిన తమ్ముడు హన్మంతును కూడా 2010 ఫిబ్రవరిలో విద్య, కంప్యూటర్ శిక్షణకు ఎంపిక చేశాడు. కొద్దిరోజులకే విధి వక్రించి ట్రాక్టర్ ప్రమాదంలో హన్మంతు మరణించాడు. మూడు నెలల పాటు రమేష్ తమ్ముని ఎడబాటునుంచి కోలుకోలేక పోయాడు. తన తమ్ముని ఆశను నేరవేర్చేందుకు అందరి పిల్లల్లో తమ్ముణ్ని చూసుకుంటూ వారికి శిక్షణనిస్తున్నారు. రమేష్ పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలు, నాయకత్వ లక్షణాలు, జీవన కౌశ్యలాభివృద్ధి వంటి అంశాలపై తరచూ ఉపన్యాసాలు ఇస్తుంటారు.
రియల్ హీరో అవార్డు
ఏడాదిలో స్వగ్రామంలో 165 రోజులు వ్యవసాయం, 150 రోజులు సమాజ సేవ, 100 రోజలు బిపిఓగా విధులు నిర్వíßస్తాడు. ఆయన సేవను గుర్తించిన సిఎన్ఎన్– ఐబియన్ మీడియాసంస్థ రియల్ హీరో అవార్డుతో సన్మానించడం విశేషం. ఒకప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంటే గుడ్లప్పగించి చూసే రమేష్ అదే విమానంలో ప్రయాణించాడు కూడా.
Comments
Please login to add a commentAdd a comment