సభకు వచ్చి.. వర్షంతో అష్టకష్టాలు
కోర్ క్యాపిటల్కు శంకుస్థాపన అంటూ లింగాయపాలెంలో ఆర్భాటంగా నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఆ తర్వాత అష్టకష్టాల పాలయ్యారు. సరిగ్గా సభ ముగిసే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షం కురిసింది. వర్షం కారణంగా ఆ ప్రాంతం మొత్తం బురదగా మారడంతో అక్కడకు వచ్చిన వాహనాలన్నీ బురదలో ఇరుక్కుపోయాయి. వాహనాలను తీయడానికి వీలు కాలేదు. ముఖ్యమంత్రి సభ ముగిసి, వీఐపీలు అందరూ అక్కడినుంచి వెళ్లగానే తాము తీసుకొచ్చిన జనాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు ఎక్కడికక్కడే వదిలేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థినులను అక్కడకు తరలించారు.
దాంతో ఇళ్లకు ఎలా వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో వేలాది మంది డ్వాక్రా మహిళలు అక్కడే చిక్కుకుపోయారు. వాళ్లను తిరిగి వాళ్ల స్వగ్రామాలకు చేర్చడానికి కనీసం అక్కడినుంచి బస్సులు కూడా ఏర్పాటుచేయకపోవడంతో.. నడిరోడ్డుపై మహిళలు నానా ఇబ్బందులు పడ్డారు. స్కూలు పిల్లలు, మహిళలు సమీపంలో ఉన్న చెట్ల వద్దకు వెళ్లి వాటికింద తలదాచుకున్నారు. ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కొంతమంది కన్నీరు మున్నీరయ్యారు. స్కూలు పిల్లల వరకు అయితే వర్షాన్ని ఆస్వాదించారు గానీ.. పెద్దవాళ్లు ఇబ్బందులు పడ్డారు. రాత్రి ఏడు గంటల సమయంలో కూడా చాలామంది మహిళలు అక్కడే చిక్కుకుపోయారు.