
మద్యం షాపు తరలించవద్దని మహిళల ఆందోళన
కోయంబత్తూర్: మద్యం దుకాణాలను నివాసప్రాంతాల నుంచి తరలించాలని మహిళలు ఆందోళనలకు దిగటం సర్వసాధారణం. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఇందుకు విరుద్ధమైన ఘటన జరిగింది. గ్రామంలోని మద్యం దుకాణాన్ని రద్దు చేయాలనే అధికారుల నిర్ణయంపై తనీర్పండాల్ గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. దాదాపు 50 మంది మహిళలు గురువారం రాస్తారోకోకు దిగారు. గ్రామంలో ఆ దుకాణం లేకుంటే తమ భర్తలు దూరంగా ఉన్న మద్యం దుకాణానికి వెళతారని, అలా వెళ్లే సందర్భాల్లో ప్రమాదబారిన పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వారు ప్రమాదం బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే గ్రామంలోనే అది ఉండటం మంచిదని కోరారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాలను జనావాసాల నుంచి అధికారులు దూరంగా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఆందోళన జరగటం గమనార్హం.