
ఓర్లాండో: కొంగొత్త టెక్నాలజీలనేవి మనుషులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా ఉండాలే తప్ప మానవత్వాన్ని మంటగలిపేవిగా ఉండకూడదని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఉత్పాదకత, సమర్ధతను మెరుగుపర్చుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ, ఈ క్రమంలో మానవతా విలువలు పతనం కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా సత్య ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉత్పాదకత పెంచుకునే పేరిట గతంలో ఎన్నడూ లేనంతగా డిజిటల్ జపం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరి జీవితం.. ప్రతి ఒక్క పరిశ్రమపై దీని ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు.