
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థల్లో 2కోట్ల మొక్కలు నాటాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా విద్యా, అటవీశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు, పాఠశాల్లో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులున్నారని, ఇందులో 25 లక్షల మంది విద్యార్థులకు 5 పండ్ల మొక్కల చొప్పున ఇచ్చి వారి ఇంటి ఆవరణలో నాటేలా ప్రోత్సహించాలన్నారు. దీంతో దాదాపు 1.25కోట్ల మొక్కలు నాటడం పూర్తవుతుందన్నారు.
అదే విధంగా యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న ఖాళీ స్థలాల్లో కోటి మొక్కలు నాటాలని చెప్పారు. దీంతో 2 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పూర్తవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, అటవీశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీకే ఝా, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ అదర్ సిన్హా పాల్గొన్నారు.