
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. మొదటి దశలో హెచ్ఎండీఏ పరిధిలో 59 పార్కులను.. అటవీశాఖ 15, హెచ్ఎండీఏ 17, జీహెచ్ఎంసీ 3, టీఎస్ఐఐసీ 11, ఫారెస్ట్ కార్పొరేషన్ 4, మెట్రో రైల్ 2, టూరిజం 7 పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
అర్బన్ ఫారెస్ట్ పార్కుల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన ఏర్పాటైన హైపవర్ కమిటీ మొదటి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. వివిధ విభాగాలకు కేటాయించిన పార్కుల అభివృద్ధి, వాటికి అవసరమైన ఆర్థిక వనరులపై ప్రధానంగా చర్చించారు. సీఎం ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల అటవీ ఉద్యానవనాలు నెలకొల్పుతున్నట్లు సీఎస్ తెలిపారు. స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని పార్కులు పూర్తి చేయాలని, పనులంతా పర్యావరణహితంగా జరగాలని ఆదేశించారు.